Saturday, 15 November 2025
శ్రీ చిత్రగుప్త దేవస్థానము ,కందికల్ గేట్ ,హైదరాబాద్.
శ్రీ చిత్రగుప్త దేవస్థానము .
కందికల్ గేట్,రంగారెడ్డి జిల్లా, హైద్రాబాద్.
చిత్రగుప్తుని పేరు తెలియని వారుండరు.యమధర్మరాజు దగ్గర పాప పుణ్యాల లెక్కలు వ్రాసే మహనీయుడే ఈ చిత్రగుప్తుడు. ఈయనకు ఒక దేవస్థానం ఉందని వింటే ఆశ్చర్యపోవడం మన వంతు అవుతోంది. మరో విశేషం ఈ మహానుభావునికి ఆసియా మొత్తం మీద మూడు ఆలయాలు మాత్రమే ఉన్నాయి.ఒకటి కాంచీపురం,రెండు అయోథ్య,మూడవది మన భాగ్యనగరమైన హైదరాబాద్ లో రంగారెడ్డి జిల్లా కందికల్ గేట్ వద్ద ఉంది.
కాయస్ధుల కులదైవమైన ఈ చిత్రగుప్తుని ఆలయాన్ని నైజాం నవాబు వద్ద మంత్రి గా చేసిన రాజా కిషన్ ప్రసాద్ నిర్మించినట్లు స్థానికులు చెపుతున్నారు. ఈ చిత్రగుప్తుడు బ్రహ్మ మానసపుత్రుడు గా గరుడపురాణం చెపుతోంది. బ్రహ్మదేవుడు సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించిన తరువాత నరకలోకాధిపతిగా యమధర్మరాజు ను నియమించాడు కాని కాలం గడుస్తున్నకొద్ది పాపులు పెరిగి నరకలోకం లో పని ఒత్తిడి పెరిగింది.ఆ విషయాన్ని యమథర్మరాజు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి తనకు పని ఎక్కువయ్యిందని పాపుల రాక ఇబ్బడి ముబ్బడి గా పెరిగిందని , తనకు సహాయకుడు కావాలని మొఱపెట్టుకున్నాడు.
బ్రహ్మదేవుడు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు.
యమధర్మరాజు కు సహాయకుని సృజించడానికి ఉజ్జయినీ రాజ్యం లోని క్షిప్రానదీ తీరంలో వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. తత్ఫలితంగా మానసపుత్రుడు గా జన్మించిన చిత్రగుప్తుని యమథర్మరాజు కు సహాయకునిగా నియమించినట్లు గరుడపురాణం చెపుతోంది. జీవులను సృష్టించిన విథాత వారి మనస్సు లో కలిగే పాపపుణ్యాలకు సాక్ష్యం గా వారి లోనే ఒక జీవి ని సృష్ఠించాడని అతడే చిత్రగుప్తుడని గరుడపురాణ కథనం.
కాయస్థుల కులదైవంగా చిత్రగుప్తుడు పూజించ బడుతున్నాడు. మనం పైన చెప్పుకున్నట్లుగా అయోథ్యలోను ,కాంచీపురం లోను మరో రెండు చిత్రగుప్తుని ఆలయాలున్నాయి. అయోథ్య లోని ఆలయం లో ని చిత్రగుప్తుని శ్రీరామచంద్రుడు కూడ పూజచేసినట్లు పురాణాలు చెపుతున్నాయి. మనం చూస్తున్న హైదరాబాద్ కందికల్ గేటు వద్ద ఉన్న ఈ ఆలయం 18 వశతాబ్దం లో నిర్మించబడినట్లు స్థానికులు చెపుతున్నారు.
చిత్రగుప్తునకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరు ఇలావతి. ఈమె కు నలుగురు కుమారులు .రెండవభార్య పేరు దక్షిణావతి. ఈమె కు ఎనిమిది మంది కుమారులు. అంటే చిత్రగుప్తునకు పన్నెండు మంది కుమారులన్నమాట. గుడిలోని చిత్రగుప్తుని మూలవిరాట్టు పైన చిత్రంలో ఆ పన్నెండు మంది పిల్లలు కూడ ఉన్నారని అర్చకస్వామి చెపుతున్నారు.
ఈ చిత్రగుప్తుడు కేతుగ్రహానికి అదిష్టానదేవత కాబట్టి ఈయనకు ప్రీతికరమైన రోజు బుధవారం. ఇష్టమైన సంఖ్య ఏడు. ఈయన వాహనం తాబేలు . అందుకే ఈయన గర్భాలయానికి ఎదురుగా ముఖమండపంలో కూర్మమండపం ఉంటుంది . మండపం మద్యలో తాబేలు ఆకారం ప్రతిష్టించబడి ఉంటుంది.భక్తులు ప్రతి బుధవారం ఈ మండపం లోనే ఏడు మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకుంటారు . ఆలయం చుట్టు ఏడు ప్రదక్షిణాలు చేయాలనేది కూడ నియమం. రాహు ,కేతు దోషాలు ఉన్నవారు , అపమృత్యువు,అనపత్యత, దాంపత్యదోషాలతో బాధించబడేవారు ఈ ఆలయం లో ఏడు బుధవారాలు గుడి చుట్టు ఏడు ప్రదక్షిణా లు చేసి,ఏడు దీపాలు మండపం లో వెలిగించి మనసు లో కోరికలను చెప్పుకుంటే తీరతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడి కొచ్చే భక్తులు కూడ ఇదే మాటలు చెపుతున్నారు. ప్రతి బుదవారం బ్రాహ్మి ముహూర్తం నుంచి ఏడింటి లోపల మూడు మార్లు స్వామికి అభిషేకాలు జరుగుతాయి. దీపావళి వెళ్ళిన రెండవరోజు యమద్వితీయ అంటారు .ఆరోజు చిత్రగుప్తుని పుట్టినరోజు ను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.దసరా నవరాత్రులు కూడ గొప్పగా నిర్వహిస్తారని అర్చకులు చెపుతున్నారు.
అయితే చిత్రగుప్తుని ఆలయం ప్రాచీనమైందే కాని ఈ ప్రాంగణంలో కన్పించే మిగిలిన ఆలయాలు మాత్రం అర్వాచీనమైనవే. ఇదే ప్రాంగణం లో చిత్రగుప్తుని ఆలయానికి కుడి వైపు గా శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ఉంది. విదేశీయుల దారుణ మారణ కాండల యనంతరం ధైర్యం కూడకట్టుకొని ఈ మిగిలిన ఆలయనిర్మాణాలు కొనసాగినట్లు కన్పిస్తున్నాయి. మరొక విశేషం ఏమిటంటే ఈ ఆలయాల్లో విగ్రహాలన్నీ అన్ కూడ అతి చిన్నగా కుదమట్టంగా ఉంటాయి. చిత్రగుప్తుని .వారి దేవేరుల విగ్రహాలు చిన్నవిగా ఉండటం తో మిగిలిన దైవాలు కూడ అలాగే సర్దుకుపోయినట్లున్నారు. సీతారామచంద్రుల పాదాలవద్ద ఆంజనేయుడు కన్పించడు. ఎదురుగా ఉన్న చిన్న ఉపాలయం లో భక్తాంజనేయుడు కొలువు తీరాడు. ఒంటిమిట్ట కోదండరామాలయం లో కూడ ఇదే సంప్రదాయం కొనసాగిందని మనం ఇంతకుముందే చెప్పుకున్నాము. చూ.youtube/c/raviprasadmuttevi.
శ్రీసీతారామచంద్రస్వామి .
ఈ ఆలయానికి కుడివైపున ఉన్నది శివాలయం .దీనిలో శివపంచాయతనం కొలువు తీరి ఉంది .
శివపంచాయతనము.
సాయిబాబా మందిరము.
శివలింగం
ఈ ఉపాలయాలకు ఎడమవైపు కి కటకటాలను దాటి వెల్తే మొదటగా ఒక ఉపాలయం లో శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి దాని ప్రక్కనే మరొక ఆలయం లో అయ్యప్పస్వామి,
ఆయనకు ఎడమవైపు ఉపాలయంలో విఘ్నేశ్వరుడు కొలువు దీరి కన్పిస్తారు. వినాయకుడికి ఎదురుగా కొద్దిదూరం లో శివలింగం, నందీశ్వరుడు కూడ ఉన్నారు. ఈ ప్రాంగణం అంతా శివుని పరివారానికి కేటాయించినట్లు కన్పిస్తోంది.ఈ ప్రాంగణానికి కుడి ఎడమల నాగదేవతలు ప్రతిష్టించ బడ్డారు.
పుట్ట ,పాలముంత నాగదేవతలు
ఒకమూల నాగేంద్రస్వామి పుట్ట , నాగులచవితి కి భక్తులు పెట్టిన పాలముంత కూడ మనం చూడవచ్చు. ఆ ప్రక్కనే ఉన్న ఉపాలయంలో లలితాంబికా దేవి సుందరమైన రూపం దర్శనమిస్తుంది.
శ్రీ లలితాంబికా దేవి శ్రీ అభయాంజనేయస్వామి రావిచెట్టు,అరుగు
ఆలయమండపం దాటి బయటకొస్తే ఒక ప్రక్కగా అభయాంజనేయస్వామి ఎత్తైన 18 అడుగుల విగ్రహం కన్పిస్తుంది.ఆ పీఠము చెంతనే థ్యానాంజనేయుని కూడ దర్శించుకోవచ్చు.
కొంచెము ముందుకు వెళితే పెద్ద రావిచెట్టు దాని చుట్టు అరుగు దాని వివిధ ప్రతిమలు మనకు కన్ఫిస్తాయి.
దానికి ఎదురుగా భక్తాంజనేయస్వామి ఆలయం కన్పిస్తోంది. ఆ ప్రక్కనే కన్పిస్తున్నది ననగ్రహమండపం
ఈ ఆలయప్రాంగణం విశాలంగా కన్పిస్తోంది .ఈ ఆలయ ప్రాంగణంలోనే ఒకవైపు సరస్వతీవిద్యాపీఠం హైస్కూల్ ను కూడ మనం చూడవచ్చు.
Subscribe to:
Post Comments (Atom)











No comments:
Post a Comment