Thursday 3 April 2014

శ్రీ భాగవత కల్పద్రుమ ఫలాలు - 9 గజేంద్ర మోక్షము

     


 శ్రీ భాగవత కల్పద్రుమ ఫలాలు – 9
                        

                     గజేంద్రమోక్షము
                   
             


                    భగవంతుని నమ్మిన వారి కెన్నడు కూడ నాశము లేదని చెప్పడమే భాగవతం యొక్క పరమార్ధం  “    నన్ను మఱువని వారిని నేను ఏనాడు మరువను.  నన్ను మఱచిన యెడలన్ మఱతును. ఈ సంగతి తెలుసుకొని ఇతరులను వేడకుండా   నన్నే  నమ్మి ప్రార్థించిన వారిని నేను తప్పక ఆదుకుంటాను.  యెఱిఁగి మొఱఁగక మఱవక మొఱ యిడిర యేని వారిని  కాపాడతానంటాడు పరమాత్మ.తనను మర్చిపోయిన వారిని తాను మర్చిపోతానని, తనను నమ్ముకున్న వారిని తాను ఆదుకుంటానని స్పష్టంగా చెప్పాడు శ్రీమహాలక్ష్మి తో శ్రీమహావిష్ణువు ఈ గజేంద్రమోక్షఘట్టం లో. (8-130).   " నీవే తప్పనిత: పరంబెరుగన " నే  ఆత్మసమర్పణ భక్తునిలో కలిగినప్పుడే భగవత్సాక్షాత్కారం జరిగేది.అదే విషయాన్ని గజేంద్రమోక్ష ఘట్టం మనకు సవివరంగా విశదీకరిస్తుంది .  
                
                

    అంతేకాదు.భక్తుడు కర్మపరతంత్రుడై నిత్యకృత్యాలను నిర్వహించుకుంటూనే విష్ణువు ను సేవించగలగాలి.  ఈ నియమాలను పాటిస్తే మెల్లగా పాపాలన్నీ నశించిపోతాయి. ప్రబలమైన విష్ణుభక్తి ఎప్పుడు నాశనము కాదు. ప్రబలమైన విష్ణుభక్తి సెడదు (8-126). అంతకంతకు అభివృద్ధి చెందుతుంది. దైవబలం లేనందువల్లనే గుణ రహితులైన దుర్జనులకు ఏనుగులు ,గుఱ్ఱాలు , సంపదలు ,  ఆలుబిడ్డలు నశించిపోతారు.  గుణవంతులైన వారు చెడకుండా జీవిస్తారు. వారిలో విష్ణుభక్తి యందు ఆసక్తి పెరుగుతుంది..  అందుకే చెడని పదార్ధములు విష్ణుసేవానిరతుల్. అన్నాడు పోతన.
                
                    
                      ఆంధ్ర మహాభాగవతం అష్టమస్కంధం లో మనకు గజేంద్ర మోక్ష ఘట్టం దర్శనమిస్తుంది. ఈ వృత్తాంతం ఒకనాట తెలుగునాట పరిపాటి గా వినిపించిన పరమ భక్తిమయ కావ్యం. ఐదవ తరగతి తోనే విద్యాభ్యాసం అయిపోయే ఆనాటి రోజుల్లో  ఆంధ్రదేశం లో తల్లిదండ్రులు తమ పిల్లలకు  తెచ్చి ఇచ్చి చదివించే పుస్తకాల్లో ఒకటి  ఈ గజేంద్ర మోక్షం.   డెబై,ఎనభై సంవత్సరాలకు పూర్వమే పాఠశాలల్లో ఉదయం పూట ప్రార్ధన చేయించేటప్పుడు ఎవ్వని చే జనించు జగమెవ్వనిలోపల అనే పద్యాన్ని చెప్పించేవాళ్లు. అది  నాటి సమాజం మీద  ఆంధ్ర మహాభాగవత ప్రభావానికి నిదర్శనం.  ఏభైయ్యారు సంవత్సరాలక్రితం నాచేత ఆ పద్యాన్ని చదివింపచేసిన శ్రీ పాపారావు మేష్టారు నాకు ఇప్పటికీ గుర్తున్నారు.
          


                    పాలసముద్రం లో త్రికూటమనే  ఒక పర్వతం ఉంది. దానికి బంగారం, వెండి, ఇనుము తో నిండిన మూడు శిఖరాలున్నాయి. అది పదివేల ఆమడల పొడవు, అంతే వెడల్పు , ఎత్తు కలిగి ఉంది. ఆ పర్వత సమీపం లోని అడవుల్లో కొన్ని మదపుటేనుగుల సమూహాలున్నాయి. అవి గుంపులు గుంఫులు గా సంచరిస్తూ పచ్చని పచ్చిక బయళ్లను వాసన చూసి,కాళ్లతో మట్టగిస్తూ, పండ్ల చెట్లను రాసుకుంటూ, కొమ్మలను విరుస్తూ, చిన్నచిన్న జంతువులను బెదరిస్తూ విహరించసాగాయి. అలా తిరుగుతున్న ఏనుగుల  గుంపులో ఒక గజేంద్రుడు  తన ఆడ ఏనుగులతో చెర్లాడుతూ  గుంపు నుండి వెనకపడ్డాడు. దైవవశం చేత తెలివి కోల్పోయి, దారితప్పి, ఆడ ఏనుగులతో కలిసి వేరుమార్గాన ప్రయాణించసాగాడు. దప్పిక తో అలసిపోయిన ఆడ ఏనుగులు వెన్నంటి రాగా, ఆయాసం తో అలసి పోయి, ప్రయాణించి, ప్రయాణించి, ఒక మడుగు చెంతకు చేరుకున్నాడు గజేంద్రుడు.
        
                    పది లక్షల కోట్ల ఆడ ఏనుగులకు అథినాధుడైన ఆ గజేంద్రుడు ఆ సరస్సులో అత్యంత విలాసం గా, విహరించసాగాడు. అదే  సమయం లో ఆ మడుగు లో ఉన్న ఒక మొసలి రాహువు సూర్యుణ్ణి పట్టు కున్నట్టుగా ఆ గజేంద్రుని ముందు రెండు కాళ్లను ఒడిసి పట్టుకొని నీటి లోపలికి లాగసాగింది. కాని ఆ గజేంద్రుడు ఏమాత్రం భయపడలేదు.తన దంతాల మొనలతో బలంగా ఆ మొసలి చిప్పల క్రిందిభాగాలు  కదిలిపోయేటట్లుగా పొడిచింది. ఆ మొసలి పట్టు తప్పింది. అది ఏనుగు కాళ్లు వదిలి దానితోకను తన కోరలతో కొరికింది. ఈ విధం గా ఆ కరి, మకరుల పోరాటం వెయ్యేండ్లు భయంకరం గా, అతిభయంకరం గా జరిగింది.  అతల కుతల లోకాల్లోని వారంతా   ఆ కరి మకరుల పోరాటాన్ని చూసి ఆశ్చర్యపోయారు.
  
     కరిఁ దిగుచు మకరి సరసికిఁ గరి దరికిని మకరిఁ దిగుచు గరకరి బెరయన్
       గరికి మకరి మకరికిఁ కరి భర మనుచును నతల కుతల భటు లరుదుపడన్  ( 8 – 54).

          ఆ పోరాటాన్ని చూసిన వారు ఒకసారి  ఏనుగు కంటే మొసలి బలమైనదని , మరోసారి  మొసలి కంటే ఏనుగు బలమైందని అనుకోసాగారట. క్రమక్రమంగా గజరాజు బలం క్షీణించసాగింది. స్ధానబలం తో మొసలి విజృభించసాగింది. అంతా బాగున్నప్పుడు తన అంతవాడు లేడని విఱ్ఱవీగే జీవికి కష్టాలు కమ్ముకోగానే దేవుడు గుర్తుకొస్తాడు. "కలడు కలండనెడు వాడు కలడో లేడో "అనే సందేహము వస్తుంది.  ఉంటే నన్నేందుకు ఆదుకోవడం లేదనే ఉక్రోషము వస్తుంది.చివరకు "నీవే తప్ప నిత:పరంబెరుగననే "ఆత్మ సమర్పణదశ కు వస్తుంది.  ఈ వివిధ దశలన్నీ తను తప్ప వేరేదీ లేదని భావించే ఒక అహంభావి,  సర్వాంతర్యామి యైన భగవంతుని అస్తిత్వాన్ని అంగీకరించే దశకు చేరటాన్ని మనకు  ఈ వృత్తాతం నిరూపిస్తుంది.

            ఎవ్వనిచే జనించు జగ ; మెవ్వని లోపల నుండు లీనమై ;
           యెవ్వని యందు డిందు ; పరమేశ్వరు డెవ్వడు ; మూలకారణం
           బెవ్వ ; డనాదిమధ్యలయుడెవ్వడు ; సర్వము దానయైన వా
            డెవ్వడు ; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్. ( 8 -73 )

                         జీవితం  లో పోరాడటానికి  తన శక్తి చాలనప్పుడు తనకంటే మించిన శక్తి ఒకటి ఉందని, అదే తనను కాపాడగలదనే ఆశ , ఆలోచన  జీవిలో కలగడానికి కూడ పూర్వజన్మ వాసనా బలం ఉండాలి . లేకపోతే బాధల్లో నలిగిపోతూ కూడ భగవంతుణ్ణి  మరచిపోయి వేడుకోలేని నిర్భాగ్యులు ఈ లోకం లో ఎంతమంది లేరు. అందుకే గజరాజు కు పూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తి వలన సరైన సమయం లో సరైన నిర్ణయం తీసుకునేటట్లు భగవత్ప్రేరణ  కలిగింది. అందుకే  భగవత్ప్రార్ధన కు పూనుకున్నాడని మనం గమనించాలి.                

                             ఈ లోకం ఎవ్వని వలన పుడుతోందో , ఎవ్వని లో ఉంటోందో , ఎవ్వని లో నశిస్తోందో , ఎవడు పరమాత్ముడో , ఎవడు ఈ సమస్త విశ్వానికి మూలకారకుడో ,  ఎవ్వడు అన్నీ తానై ఉంటాడో  అటువంటి ఈశ్వరుణ్ణి  నేను శరణు వేడుతున్నాను అంటాడు గజేంద్రుడు. అంటే ఆ సర్వాంతర్యామి ఎవరో తెలియని అజ్ఞానం లోనే జీవి కొట్టుమిట్టాడుతున్నాడన్న మాట. ఇది తొలి దశ.

         లోకంబులు లోకేశులు , లోకస్థులుఁ దెగిన తుది నలోకం బగు పెం
        జీకటి  కవ్వల నెవ్వండే కాకృతి వెలుగు నతని నే సేవింతున్ . ( 8-75 )

              లోకాలు , లోకాలను ఏలే వారు , ఈ లోకాల్లో ఉండే వారు అందరూ నశించిన తరువాత కూడ ఆ కారు చీకట్లకు అవతల  అఖండమైన దివ్యరూపం తో  ప్రకాశించే ఆ భగవంతుని  నేను భావించి సేవిస్తున్నాను . ముక్తసంగులైన మునులు ,భగవంతుని చూడాలని కోరుకునే వారు,  అందరి మేలు ను కోరుకునే వారు , సాధు చిత్తులు , సాటిలేని వ్రతాలు  ఆచరించే వారు , ఎవరి పాదాలను సేవించి తరిస్తున్నారో ఆ దేవ దేవుడే నాకు రక్ష యగు గాక .భగవంతునికి పుట్టుక , పాపము , ఆకారము , కర్మ ,పేరు ,  గుణములు ఉండవు.  అతడు ఈ లోకాలను సృష్టించి ,నశింపచేయడం కోసం తన మాయ తో ఇవన్నీధరిస్తాడు . ఆత్మకాంతి లో ప్రకాశించే వాడు. ఆత్మకు మూలమైన వాడు , ఊహలకూ , మాటలకూ అందని వాడు , పరిశుద్ధుడు , శాంతస్వరూపుడు, మోక్షాధిపతి , ఆనందానికి మూలభూతుడు, అయిన ఆ ఈశ్వరుని నేను ప్రార్ధిస్తున్నాను. భగవంతుడు ఒక్కడే . అతడు బహురూపుడు. కాని అన్నీ అతడే. అన్నింటిలోను అతడే కన్పిస్తాడు.  ఈ పద్యం లో ఏకేశ్వరోపాసన ప్రతిబింబిస్తోందని విజ్ఞులు భావిస్తున్నారు.

                  కలడందురు దీనులయెడఁ గలడందురు పరమయోగి గణముల పాలం
                  గల డందు రన్ని దిశలను , గలడు కలం డనెడు వాడు కలడో లేడో. (8 – 86 )

             దేవుడు ఉన్నాడంటారు. ఆర్తులను ఆదుకుంటాడంటారు.  ఉత్తములైన యోగుల చెంత ఉంటాడంటారు. అన్నిదిక్కులలోను ఉన్నాడు , ఉన్నాడు ,  అనే ఆ దేవుడు అసలు ఉన్నాడా ? లేడా ?అనే విచికిత్స కు వచ్చాడు గజేంద్రుడు .ఇది రెండో దశ. అంటే తన లోని అహం కారం పూర్తిగా తొలగలేదు. అందు మూలం గా పెల్లుబికిన అహం భావం లోని తురీయాంశమే  ఈ విచికిత్సకు  కారణం.భగవంతుడు ఉంటే ఎందుకు రాడు  ? అనేది విచికిత్స. అంటే పూర్తిగా భగవంతుని అస్తిత్వాన్ని అంగీకరించలేని మన స్థితి ఇక్కడ మనకు  కన్పిస్తుంది.  ‘ సంశయాత్మా వినశ్యతి అంటుంది భగవద్గీత. భక్తుని లో రావలసిన పరివర్తన ఇది కాదు. అన్యథా శరణం నాస్తి , త్వమేవ శరణం మమ అనే దశకు చేరుకోవడానికి ఇంకా సమయం పడుతుందన్న మాట. అందుకే  -

               కలుగడే నాపాలి  కలిమి సందేహింప  కలిమి లేములు లేక కలుగు వాడు ,
               నాకడ్డ పడరాడె  నలి నసాధువులచే బడిన సాధుల కడ్డపడెడు వాడు ,
                .....................................................................................
             లీలతో నా మొఱాలింప డే మొఱగుల మొఱలెరుంగుచుఁ దన్ను మొఱగువాడు ( 8 – 87 )

                       ఆ భగవంతుడు దీనజనుల మొఱలను  వింటూ తన్ను తానే మరచిపోయేవాడట. అందుకే ‘ ‘ ‘ ‘  వినడే , చూడడే , తలపడే వేగరాడే   అంటూ మొత్తుకున్నాడు గజేంద్రుడు.

              విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వవేద్యు విశ్వు నవిశ్వున్
              శాశ్వతు  నజు బ్రహ్మ ప్రభు ,నీశ్వరునిం బరమపురుషు నే భజియింతున్. ( 8- 88 )

                       ఈ విధం గా పరి పరి విధాల ప్రార్ధించిన గజేంద్రుడు తుదకు  మనస్సులో ఈశ్వర సన్నిధానాన్ని కల్పించుకున్న వాడై – ఇలా ప్రార్ధించాడు.

                   లావొక్కింతయు లేదు ; ధైర్యము విలోలం బయ్యె ; బ్రాణంబులున్
                   ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్చె; దనువున్ డస్సెన్ ; శ్రమం బయ్యెడిన్
                   నీవే తప్ప నిత: పరం బెరుగ; మన్నింపం దగున్ దీనునిన్
                   రావే యీశ్వర ! కావే వరద; సంరక్షింపు భద్రాత్మకా ! ( 8- 90 )

              ఈ పద్యం లో  కన్పించే లావు అన్న పదానికి శక్తి, బలము అనే అర్థాలు చెపుతాము. కాని ఇక్కడ  ‘లావు ఒక్కింత కూడ లేదు అనడం లో అంతరార్థం  ‘నాలోని అహం కొంచెం కూడ మిగలలేదు . అంతా నశించిపోయింది.   ఇక నీవే దిక్కు అని వేడుకోవడమే.  ఎప్పుడైతే అహంకారం  నశించిందో   శరణాగతత్వబుద్ధి సంప్రాప్తిస్తుంది. అందుకే నీవే తప్ప నిత: పరంబెరుగ ..రావే యీశ్వర  కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా ! అన్న ఆర్తి పతాకస్థాయిని చేరుకుంది. జీవుని వేదన  రోదన గా రూపు దాల్చింది.

            వినుదట జీవుల మాటలు చనుదట చనరాని చోట్ల శరణార్థుల కో
               యను దట పిలిచిన సర్వము గనుదట సందేహమయ్యెఁ గరుణావార్థీ ! (8 – 91 )

                         భగవత్తత్వం బోధ పడింది. ఓ దయా సముద్రుడా !   జీవుల పిలుపులు వింటావట. పోరాని చోట్లకైనా పోతావట. శరణు వేడిన వారు పిలిస్తే వెంటనే ఓ  అని పలుకుతావట.  సమస్తమూ తెలిసినవాడవట. కాని ఇప్పుడు ఇదంతా సందేహం గా ఉంది అంటాడు  గజేంద్రుడు. అవును. ఎంత చెప్పినా  తన వరకు వస్తే కాని అసలు వేదన తెలియదని కదా సామెత. అందుకే  అట ,అట అంటూనే సందేహమయ్యె అనేశాడు గజరాజు.ఇన్ని గాయాలకు చికిత్స చేశాను గాని నా గాయమంత నొప్పి ఎవరికీ లేదన్నాడట ఒక వైద్యుడు. అందుకే –

          ఓ కమలాప్త ! యో వరద ! యో ప్రతిపక్ష విపక్ష దూర ! కు
         య్యో! కవియోగివంద్య సుగుణోత్తమ ! యో శరణాగతామరా
         నోకహ ! యోమునీశ్వర మనోహర ! యో విమలప్రభావ ! రా
         వే ! కరుణింపవే !  తలపవే ! శరణార్థిని నన్ను  గావవే !  ( 8 – 92 )

                     భగవంతుడు కరుణావార్థి (కరుణా సముద్రుడు ) శరణాగతామరానోకహ ( శరణాగతుల పాలిట కల్పవృక్షం వంటివాడు ) .   అటువంటి భగవానుడు ఇంతగా వేడుతున్న భక్తుణ్ణి కాపాడకుండా ఉండగలడా. ఇంతవరకు ఎక్కడా జరగలేదు. ఆ గజేంద్రుడు  ఆర్తరక్షకుడైన ఆ కమలామనోహరుని ఠావులు తప్పిన ప్రాణాలతో , అలసిన శరీరంతో   అర్థిస్తూ ఉండగానే ఆ మకరి   కరి   ప్రార్థనకు విఘాతం కలిగించాలన్నట్టుగా గజేంద్రుని తీవ్రంగా గాయపరచి , కోపం గా నీటిలోకి లాగింది.  అప్పుడు  గజరాజు చేసిన ఆర్తనాదమే కుయ్యో. అది రోదన తో చేసిన ఆక్రందన. ఆదుకునే వాడు వస్తాడనే విశ్వాసం తో ఆయన ఇంకా తొందరగా రావాలనే ఆశతో చేసిన ఆక్రందన అది. అందుకే పోరాని చోట్లకైనా పోతావట అంటూ దేవదేవుని సర్వవ్యాపకత్వాన్ని గుర్తుచేసుకొని ధైర్యం తెచ్చుకున్నాడు గజేంద్రుడు.

                          ఆ లక్ష్మీనాథుడు అరక్షిత రక్షకుడు. అంటే రక్షణ లేని వారిని రక్షించే ప్రభువు ఆయన. అటువంటి ఈశ్వరుడు వచ్చి తనను కాపాడతాడని భారం మొత్తం భగవంతుని పై వేసి ఆకాశం వైపు  నిక్కి నిక్కి  చూస్తూ  నిట్టూర్పులు విడుస్తూ,  ఆకాశానికి  చెవులప్పగించి చూస్తోందట ఆశగా గజేంద్రుడు. ఏశబ్దం విన్నా  తనను కాపాడ్డానికి భగవంతుడే వచ్చాడనుకునే స్థితికి వెళ్ళిపోయింది గజరాజు. ఇప్పుడు గజేంద్రుడు భక్తియుతుడు. అందుకే భగవంతుడు దిగి వస్తున్నాడు.

                               బ్రహ్మాది దేవతలందరూ గజేంద్రుని ఆక్రందనలు విని కూడ వారికి విశ్వవ్యాపకత్వం లేకపోవడం మూలంగా గజరాజు కు సాయపడలేక చేతలుడిగి ఉండిపోయారట. విశ్వమయుడు , విభుడు , విజయశీలి అయిన  శ్రీమహావిష్ణువు గజేంద్రుని కాపాడటానికి నిశ్చయించుకొని దిగి వస్తున్నాడు.

                  అల వైకుంఠ  పురంబు లో నగరి లో నా మూల సౌధంబు దా
                 పల మందార వనాంతరామృత సర ప్రాతేందు కాంతోప లో
                 త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
                 హ్వల నాగేంద్రమ పాహి పాహి యన కుయ్యాలించి సంరంభియై ( 8 -95 )

                        ఈ పద్యం రాని తెలుగు వాడు ఆనాడు ఉండేవాడు కాదంటే అతిశయోక్తిలేదు. అంత అందమైన , అతిశయమైన పద్యం ఇది. అతిశయమని ఎందుకన్నానంటే భక్తుని కుయ్యాలించి  ఆదుకోవడానికి బయలుదేరాడు లక్ష్మీపతి. ఎక్కడనుండి. వైకుంఠంనుండి. వైకుంఠం ఎక్కడుంది. అక్కడెక్కడో ఉంది.  అనిచెపుతారు. అందుకే అక్కడెక్కడో ఉన్న వైకుంఠాన్ని మన మనోనేత్రం  ముందుకు తీసుకురావడానికి మహాకవి చేసిన ప్రయత్నం  పద్యం లోని మొదటి రెండు అక్షరాల్లో   గొప్ప గా కుదురుకుంది అల అని.  ‘ అల అంటే ఎక్కడో ............. . అంటే అన్ని ఊర్థ్వలోకాలకు ఆ పైన  అల ... అక్కడెక్కడో అల్లంత దూరం లో  జీవుని మాటకు ,చూపు కు , కేక కు, చివరకు ఆక్రందనకు , ఆర్తనాదానికి కూడ  అందనంత  దూరం లో ఉన్నది ఆ  వైకుంఠం. ఆ వైకుంఠ పురం  లో శ్రీ లక్ష్మీనారాయణుల అంతపురం. ఆ అంతపురం లో  ఆ .....    మూల సౌధానికి సమీపం లో  కల్పవృక్షవనం. ఆ వనం లో ఒక అమృతసరస్సు. దాని చెంత చంద్రకాంత శిలానిర్మితమైన  ఒక అందమైన తిన్నె . దానిపై కలువపూల పానుపు. ఆ పాన్పు మీద శ్రీమన్నారాయణుడు  కలుముల జవరాలు , తన ఇల్లాలు , అయిన శ్రీ లక్ష్మీదేవి తో వినోదిస్తున్నాడు . అంతదూరం లో ఉన్నవైకుంఠం లో  ,  ఇల్లాలి తో వినోదం లో ఉండగా ఆ సమయం లో ఆ ఇందిరారమణునకు  గజేంద్రుని ఆర్తనాదం విన్పించింది. కారణం ఆయన ఆపన్నప్రసన్నుడు. అనాథ జన రక్షకుడు. భక్తపాలన కళా సంరంభకుడు కదా.   కో అని పిలిస్తేఅని పలికే దైవం కదా ఆ ఆది నారాయణుడు. . అందుకే  వెంటనే బయలుదేరాడు.  ఈ విశేష మంతా అల అనే పదం ద్వారా దర్శింపచేశాడు భక్తకవి పోతన.

                    ఈ పద్యం లోని అమృతసరస్సు వలన ఈ పద్యానికే అమృతత్వం ప్రాప్తించింది.  పోతన భాగవత రచనా  సమయం లో  ఈ పద్యాన్ని  శ్రీ మహావిష్ణువే  స్వయం గా వచ్చి పూర్తిచేసి వెళ్లాడని తెలుగునాట కథలు గా చెప్పుకుంటున్నారంటే ఈ పద్యం లోని మాధుర్యం  తెలుగు వారి గుండెలను ఎంతగా  పులకింపచేసిందో మనం  ఊహించవచ్చు. ఈ సందర్భం లో  భక్తకవి పోతన ను గూర్చి తెలుగునాట  వాడుక లో ఉన్న కొన్ని కథలను  ఇదే బ్లాగు లో   పలికెడిది భాగవతమట.... అనే వ్యాసం లో చెప్పుకున్నాము. వీలైతే చూడవచ్చు.

                             భక్తజనరక్షణార్థం భగవంతుడు ఎంత  వేగిర పడతాడో  మనకు ఈ ఘట్టం నిరూపిస్తుంది. భక్తపరాధీనుడైన భగవానుని లీలలు కొల్లలు గా మన సాహిత్యం లో మనకు కన్పిస్తాయి. కుంటెన పంప పోయితివో అంటూ  కాళహస్తీశ్వరుని  భక్తపరాధీనతను నిలదీసిన మహాకవి ధూర్జటి ని తెలుగు వారు మర్చిపోలేరు కదా.

                సిరికిం చెప్పడు శంఖ చక్రయుగముం జేదోయి సంధింపఁ డే
                పరివారంబు ను జీరఁ డభ్రగపతిం బన్నింపఁ డాకర్ణికాం
                తర ధమ్మిల్లముఁ జక్కనొత్తడు వివాదప్రోత్థిత శ్రీకుచో
                పరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై ( 8 -96 )

              గజరాజు  ప్రాణాలను కాపాడాలనే ఆతృతలో ఉన్న  శ్రీమహావిష్ణువు  ఇల్లాలైన లక్ష్మీదేవికి కూడ చెప్పకుండా బయలుదేరాడు.శంఖ చక్రాది ఆయుధాలను తీసుకోలేదు. సేవకాజనాన్ని ఎవరినీ పులవకుండా , గరుత్మంతుని  ప్రయాణానికి సిద్ధం చేయమని  ఆజ్ఞాపించకుండా, చెవుల క్రింది వరకు జారిపోయిన సిగముడి ని కూడ సవరించుకోకుండానే బయలుదేరాడు అనాథ జన రక్షకుడు ఆ శ్రీమన్నారాయణుడు. ఇవన్నీ మరచిపోయినా ఫర్వాలేదు. ప్రణయ కోపం తో  అలిగి వెళ్లిపోతున్న శ్రీ రమారమణి పైటచెంగును పట్టుకున్న వాడై, తొందరలో ఆ లక్ష్మీదేవి  పైటను  కూడ వదిలి పెట్టకుండా  అలాగే ఆతృత గా భక్తజన పాలన కళా సంరంభుడై బయలుదేరాడట  నారాయణుడు. కాదు లక్ష్మీనారాయణుడై బయలుదేరాడు సమస్త జంతు హృదయారవింద సదన సంస్థితుడైన   ఆ వైకుంఠనాథుడు.

             తన వెంటన్ సిరి , లచ్చివెంట నవరోధవ్రాతమున్ , దాని వె
             న్కను బక్షీంద్రుడు , వాని పొంతను  ధను: కౌమోదకీ శంఖ చ
             క్ర నికాయంబును , నారదుండు , ధ్వజనీకాంతుండు రా వచ్చి రొ
             య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాలమున్ . (8 -98 )        

                ఆకాశమార్గం లో శ్రీమహా విష్ణువు , ఆయన  చేతి లో పైటచెంగు ఉండిపోవడం తో ఆయనతో సమానం గా నడవలేక నడుస్తూ శ్రీ మహాలక్ష్మి , అయ్యవారు , అమ్మవారు  ఎక్కడికో వెళుతున్నారని వారిని అనుసరించిన అంత పుర కాంతలు , వారి వెనుక గరుత్మంతుడు , అతని సరసనే ధనుస్సు ,విల్లు ,శంఖ చక్రాదులు ,వాని వెంట నారదుడు , ఆ తరువాత సర్వసైన్యాధిపతి విష్వక్సేనుడు ఇలా ఒకరి వెంట ఒకరు రాచ నగరు నుండి బయటకు రాగానే చూసిన  ఆ వైకుంఠపుర వాసులు  ఏదో జరిగిపోతోందని ఒక్కరొక్కరుగా బయలుదేరి చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ శ్రీమహావిష్ణువు వెంట రాసాగారట.

                                     శ్రీ మహావిష్ణువు తో సమానం గా నడవలేక, పైట చెంగు ఆయన చేతిలో ఉండటం తో ఆగలేక  తడబడుతూ నడుస్తోంది శ్రీ మహాలక్ష్మీ.

     అడిగెద నని కడువడిఁ జను , నడిగినఁ దను మగుడ నుడువఁ డని నడ యుడుగున్
     వెడవెడ చిడిచిడి ముడి తడబడ , నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్ .(8 -103 )

                       ప్రభువు ఎక్కడికి వెడుతున్నారో చెప్పడంలేదు.  ఎవరైన అనాథ స్త్రీల జనాలాపాలు విన్నాడా ? అమరావతి పై రాక్షసులు ఏమైనా దాడి చేశారా ? వంటి సందేహాలతో   మనోనాథుడైన శ్రీ మహావిష్ణువు  ను ఎక్కడికి ఎందుకు  వెళుతున్నారో ?  అడుగుదామని  గబగబ రెండడుగు లు ముందుకు వేసేదట శ్రీ మహాలక్ష్మి. అడిగితే ఆ తొందరలో సమాధానం చెప్పడేమో నని  సంశయించి ఆ ప్రయత్నాన్ని మానుకునేది.  అడుగులు వేస్తూ, ఆగిపోతూ తడబడుతూ నడుస్తున్న తన ఇల్లాలిని కూడ పట్టించుకోకుండా, నమస్కారాలను సమర్పిస్తూ సేవించుకుంటున్న గగనచరులైన దేవతల మ్రొక్కులను కూడ మన్నించక ,  మనోవేగం తో  కరి మకరులు పోరాడుతున్న సరోవర సమీపానికి చేరుకున్న శ్రీమహావిష్ణువు ఆ మొసలిని చంపడానికి తన చక్రాన్ని ప్రయోగించాడు.

               కరుణాసింధుడు శౌరి వారిచరమున్ ఖండింపగాఁ బంపె స
               త్వరితా కంపిత భూమిచక్రము మహోద్యద్విస్ఫులింగచ్ఛటా
               పరిభూతాంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండభాండచ్ఛటాం
              తరనిర్వక్రముఁ బాలితాఖిల సుధాంధశ్చక్రమున్ జక్రమున్ .  (8 -109 ) 

                   భూమండలాన్ని కంపింపచేసే వేగం తో  ,సమస్తలోకాలను కాంతిమయం చేస్తూ, ఆ చక్రం మొసలి శిరస్సును ఖండించింది. గజేంద్రుడు సంసార బంధాలనుండి విడివడిన విరక్తుని వలే , చీకటిని వదిలిన చంద్రుని లాగ మొసలి పట్టు విడిపించుకొని, ఉత్సాహం గా కాళ్లు విదిలించి , భగవంతుని దయవలన బ్రతికి తన ఆడ ఏనుగులను చేరుకున్నాడు. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. భగవంతుని నమ్మిన భక్తుడు  ఆదుకోబడి, చేదుకోబడ్డాడు.

                            ఇంతకీ   అసలు ఈ  కరి మకరులు ఎవరు అనేది ప్రశ్న. హూహూ అనే గంధర్వుడు దేవలముని శాపం వలన మొసలి రూపాన్నిపొందాడు. స్వామి అనుగ్రహం తో  శాప విముక్తుడై, తిరిగి గంధర్వలోకాన్ని చేరుకున్నాడు.    

             మొసలి తో పోరాడిన గజరాజు పూర్వజన్మ లో ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు. విష్ణుభక్తులలో శ్రేష్ఠుడైన ఈ మహారాజు ద్రవిడదేశాన్ని పాలించేవాడు.ఈ విష్ణుభక్తుడు ఒక పర్వతం మీద మౌనవ్రతం లో ఉంటూ విశేషపూజలతో భగవంతుని సేవించేవాడు. ఒకరోజున  ఇంద్రద్యుమ్నుడు  ఏకాగ్రచిత్తం తో విష్ణువును ధ్యానిస్తూ ఉండగా , ఆ ప్రాంతానికి అగస్త్యుడు రావడం తటస్థించింది. తనను చూసి కూడ , పల్కరించకుండా , కనీసం  కూర్చున్న చోటు నుండి లేవకుండా  ఉన్న ఇంద్రద్యుమ్నుని చూసి  ఆగ్రహించాడు అగస్త్యుడు. అజ్ఞానం తో కూడిన ఏనుగు గా పుట్టమని ఇంద్రద్యుమ్నుని  శపించాడు. అతడే  ఈ గజేంద్రుడు. అతని సేవకులందరు  అతని అనుచరులు గా , అనుయాయులు గా   జన్మించారు.  ఇంద్రద్యుమ్నుడు ఏనుగు గా పుట్టినప్పటికీ  విష్ణుభక్తి వలన  మాత్రమే మోక్షాన్ని పొందాడు. ప్రబలమైన విష్ణుభక్తి ఎన్నిజన్మలకైన  చెడదు అన్నది  విష్ణుభక్తుల విశ్వాసము.
     
          ఓం నమో భగవతే వాసుదేవాయ     ఓం నమో నారాయణాయ



*************************************************************************

No comments: