Saturday 24 May 2014

శతక సౌరభాలు - 2 ధూర్జటి - కాళహస్తీశ్వరశతకము- 2


        
శతక సౌరభాలు - 2        
                                                ధూర్జటి   శ్రీ కాళహస్తీశ్వర శతకము - 2
     

     



       వీడెం బబ్బినయప్పుడున్ ; దమనుతుల్ విన్నప్పుడుం ; బొట్టలో
       గూడున్నప్పుడు ; శ్రీ విలాసములు పైకొన్నప్పుడుం ; గాయకుల్
       పాడంగా వినునప్పుడున్ ; చెలగు దంభ ప్రాయు నిశ్రాణనన్
       క్రీడాసక్తుల నేమి చెప్పవలెనో ? శ్రీ  కాళహస్తీశ్వరా !
      

                  శ్రీ శంకరా  !  తన పెద్ధరికాన్ని గౌరవించి తాంబూలమిచ్చి నప్పుడు,  తనను గూర్చిన పొగడ్తలు విన్నప్పుడు ,  లోటు లేకుండా కడుపారా  కూడు లభించినప్పుడు , సంపదలు మెండుగా సమకూరి నప్పుడు , కవులు , గాయకులు  తన కీర్తిని గానము చేస్తుండగా విన్నప్పుడు , యవ్వన మదము చేత దానము చేయుట యందు  , సంసార సుఖము లందు  ఆసక్తులై సంచరించు  ఈ మనుషులను  ఏమనాలి . అనగా అశాశ్వతమైన విషయాలను గూర్చి ఆసక్తులై పరమేశ్వరుని ధ్యానింప కున్నారని విచారమును ప్రకటించు చున్నాడు కవి .

       నిను సేవింపగ నాపదల్పొడమనీ ,  నిత్యోత్సవంబబ్బ నీ ,
       జనమాత్రుండననీ , మహాత్ముడననీ , సంసారమోహంబు పై
       కొననీ , జ్ఞానము గల్గనీ గ్రహగతుల్ కుందింపనీ , మేలు వ
       చ్చిన రానీ యవి నాకు భూషణములే ;  శ్రీ  కాళహస్తీశ్వరా !

                 శ్రీ కాళహస్తీశ్వరా ! నిన్ను సేవించు సమయం లో నాకు కష్టములు వచ్చినా  రానిమ్ము, వేడుకలు జరిగిన జరగనిమ్ము . సమాజము నన్ను సామాన్యుని గా చూచినా , మహాత్ముని గా పొగడినా , సంసార మోహము లో మునిగిపోయినా ,  దివ్యజ్ఞానము సంభవించినా , గ్రహగతులు తప్పినా , మేలు చేకూరినా అన్నీ  నాకు ఆభరణములే శివా !

      ఏ వేదంబు పఠించె లూత , భుజగం బే శాస్త్రముల్సూచె దా
      నే విద్యాభ్యసనం బొనర్చె గరి , చెంచే మంత్ర మూహించె , బో
     ధావిర్భావ నిధానముల్ చదువులయ్యా ? కావు , మీ పాద సం
     సేవాసక్తియే కాక జంతుతతికిన్ శ్రీ  కాళహస్తీశ్వరా !

                                                     ఓ ఈశ్వరా  ! జ్ఞాన సముపార్జనకు ప్రాణులకు విద్య అవసరం లేదు. నీ పాదసేవయే సమస్తజ్ఞానమును కల్గించును . ఎట్లనగా నిన్ను సేవించిన సాలెపురుగు ఏ వేదాధ్యయనము చేసి,జ్ఞానమును సముపార్జించినది . నిన్ను సేవించిన సర్పము ఏ శాస్త్రమును చదివినది . నిను పూజించిన ఏనుగు   ఏ విద్య నభ్యసించినది .  బోయవాడైన తిన్నడు  ఏ మంత్రమును చదివి   నిన్ను సేవించి ముక్తి పొందినాడు .  కావున నీ పాదములను సేవించాలనే కుతూహలమే సమస్త జ్ఞానమును కల్గించును ప్రభూ  !

            కాయల్గాచె వధూ నఖాగ్రములచేఁ గాయంబు ,  వక్షోజముల్
            రాయన్ ఱాపఢె ఱొమ్ము ,  మన్మధ విహార క్లేశ విభ్రాంతి చే
            బ్రాయం బాయెను , బట్ట గట్టెఁ దల , చెప్పన్ రోఁత  సంసారమేఁ
            చేయంజాల విరక్తుఁ జేయగదవే ! శ్రీ  కాళహస్తీశ్వరా !

                భక్తవశంకరా  ! శంకరా !  చెప్పడానికే  రోత పుట్టించెడి ఈ సంసారమును  చేయజాలను . నన్ను విరక్తుని చేయవలసినది . ఎందుకంటే   వారకాంతల గోరు గిచ్చుళ్లతో  ఒళ్ళంతా కాయలు కాసింది . వారి వక్షోజాల రాపిడికి  నా ఱొమ్మంతా రాయిగా మారి పోయింది . మన్మధ క్రీడా క్లేశములతో వయసై పోయింది . తల బట్ట కట్టింది .  ఈ రోత సంసారము నుండి  విముక్తి కల్గించు శంకరా !

     నిన్నే రూపముగా భజింతు మది లో  నీరూపు మోకాలో స్త్రీ
     చన్నో కుంచమో , మేక పెంటియొ యీ సందేహముల్మాన్పి నా
     కన్నార న్భవదీయ మూర్తి సగుణాకారంబు గా జూపవే
     చిన్నీరేజ విహార మత్తమధుపా ! శ్రీ  కాళహస్తీశ్వరా !

         స్వామీ ! చిత్స్వరూపుడా  ! నీ నిజరూప దర్శనమును నాకు ప్రసాదించుము, నీ రూపము మోకాలో.  (దసరయ్య కధ బసవ పురాణము )  స్త్రీ వక్షమో (సుందర  నయనారు కధ బసవపురాణము - ఆచంటేశ్వరుడు ) ధాన్యమును కొలిచెడి కుంచము రూపమో. ( బల్లేశు మల్లయ్య కధ బసవపురాణము కుంచేశ్వరుడు )లేక  మేకపెంటికా (కాటకోటయ కధ )  ఈ సందేహాలన్నింటినీ మాన్పి , నీయొక్క సగుణ రూప దర్శనమును  నాకు ఇవ్వవలసినది .

                  బసవపురాణము మొదలైన శైవ వాజ్ఞ్మయ మందలి కధలను కవి ఈ పద్యం లో ప్రస్తావించాడు.    
      
       నిను నా వాకిట గావుమంటినో ? మరున్నీలాలక భ్రాంతి గుం
       టెన పొమ్మంటినొ ? యెంగిలిచ్చి తిను తింటే గాని కాదంటినో ?
       నిను నెమ్మిం దగ విశ్వసించు సుజనానీకంబు రక్షింప చే
       సిన నా విన్నపమేల గైకొనవయా ? శ్రీ  కాళహస్తీశ్వరా !

                           శంకరా ! నిన్నేమన్నా నేను బాణాసురుని వలే నా యింటికి కాపలా కాయమన్నానా  ?  సుందరమూర్తి నయనారు వలే దేవతా స్త్రీలకోసం  రాయబారం వెళ్లమన్నానా ? తిన్నని వలే ఎంగిలి పెట్టి , తినమని బలవంతం చేశానా ? లేదుకదా  ! నిన్ను నమ్మిన భక్తులను  రక్షింపమని వేడుకున్నాను . నా ప్రార్దనను ఎందుకు మన్నించవు స్వామీ !
      
       ఱాలన్ రువ్వగ చేతులాడవు , కుమారా ! రమ్ము రమ్మంచు నే
       చాలన్ చంపగ , నేత్రముల్దివియగా శక్తండ నేగాను , నా
       శీలంబేమని  చెప్పనున్నదిక నీ చిత్తంబు , నాభాగ్యమో
       శ్రీ లక్ష్మీపతి సేవితాంఘ్రి యుగళా ! శ్రీ  కాళహస్తీశ్వరా !

                       శ్రీ లక్ష్మీ నాథుని చేత సేవించబడు పదపద్మములు గలవాడా  ! శంకరా  ! నాకు శాక్యతొండని వలే రాళ్ళతో  నిను కొట్టుటకు చేతులు రావు . సిరియాళుని వలే కుమారా ! రా ! రమ్మని కొడుకుని  ప్రేమగా పిలిచి ,  చంపి నీకు వండి పెట్ట లేను ( బసవ పురాణము ).  కన్నప్ప వలే  కళ్ళు తీసి ఇచ్చుటకు శక్తిలేదు . ఇక నా నడవడిక ఎటువంటిదని నీ మనస్సు అనుకుంటోందో అంత మాత్రమే నన్ను అనుగ్రహించు స్వామీ  !

      రాజుల్మత్తులు , వారి సేవ నరక ప్రాయంబు , వారిచ్చు నం
      భోజాక్ష్ చతురంత యాన తురగీ  భూషాదు లాత్మవ్యధా
      బీజంబుల్ , తదపేక్ష చాలు , పరితృప్తిం బొందితిన్ , జ్ఞాన ల
     క్ష్మీ జాగ్రత్పరిణామ మిమ్ము దయతో శ్రీ  కాళహస్తీశ్వరా !

                స్వామీ  !  రాజులు మదాంధులు. వారిని సేవించుట  నరక తుల్యము . వారు బహూకరించు  స్త్రీలు  , పల్లకీలు ,గుఱ్ఱములు , ఆభరణాదులు , మానసికంగా వేదనను కల్గిస్తాయి. వాటి మీద ఆరాటం ఇక చాలు . సంతృప్తి పొందాను .  దయతో  నాకు మోక్షమును పొందు జ్ఞానమును ప్రసాదించ వలసినది ప్రభూ !

                నీ రూపంబు దలంపగా తుదమొదల్నేగాన నీవైనచో
                రారా రమ్మని యంచు చెప్పవు వృధా రంభంబు లింకేటికిన్
                నీరన్ముంపుము పాలముంపు మిక నిన్నే నమ్మినాడం జుమీ
                శ్రీ రామార్చిత పాదపద్మ యుగళా శ్రీ  కాళహస్తీశ్వరా !
   
                    శ్రీ రామునిచే అర్చించబడిన పాదపద్మములు గలవాడా  ! శంకరా !  నీ రూపము యొక్క ఆద్యంతములను ఊహించుటకు కూడ నాకు సాధ్యము కాదు .  నీవేమో నన్ను రమ్మని పిలువవు.. నిన్ను దర్శించుటకు చేసిన  నాప్రయత్నము లన్నియు వృధాప్రయత్నములే అగుచున్నవి. స్వామీ ! నిన్నే నమ్ముకున్నాను. పాలముంచినా నీట ముంచినా నీదే భారము తండ్రీ !
                     
       నీకున్ మాంసము వాంఛయేని  కరవా నీచేత లేడుండ గా
       జోకైనట్టి కుఠారముండ ననలజ్యోతుండ నీరుండ గా   
       పాకంబొప్పఘటించ చేతిపునుకన్ భక్షింప కా బోయచేఁ
       జేకొంటెంగిలి మాంసమిట్లు తగునా శ్రీ  కాళహస్తీశ్వరా ! (20 )
   
                    శంకరా ! వీకు మాంసము తినాలనే కోరిక కలిగితే చేతిలో జింక ఉన్నది . ఒక చేతిలో వాడియైన గొడ్డలి ఉంది .మరొక చేతిలో అగ్ని , వేరొక చేతిలో  నీరు , వంటచేసుకోవడానికి మరొక చేతి లో భిక్షాపాత్ర   ఇవన్నీ ఉన్నాయి కదా . చక్కగా మాంసమును వండుకొని భుజించక ఆ బోయవాని  ఎంగిలి మాంసాన్ని ఎందుకు తిన్నావు స్వామీ !
                                                          


                                                           -------------                మూడవ భాగం  త్వరలో




   **************************************************************
                  

             
     




No comments: