Thursday 31 October 2013

శ్రీ భాగవత కల్పద్రుమ ఫలాలు - 3 నరకాసురవథ



                నరకాసుర వథ
                            (దీపావళి )
                      
                 


                   ఆంథ్ర మహాభాగవతం లో దశమస్కంథం ఉత్తరభాగం లో నందనందనుడైన శ్రీకృష్ణుడు పదహారువేలమంది  కన్యకామణులను వివాహమాడిన ఘట్టం లో నరకాసురవథ  ప్రస్తావనకు వస్తుంది.భూదేవి అపరావతారమే సత్యభామ యని భక్తుల విశ్వాసం. గోదాదేవి సత్యభామ అవతారమని వైష్ణవ సాంప్రదాయం చెపుతోంది. 
                  
                   శ్రీ రామావతారం లో విశ్వామిత్రుడే కృష్ణావతారం లో సత్యభామ గా జన్మించాడని జానపదులు  చెప్పుకుంటారు. అందుకే  శ్రీకృష్ణుడు సత్యభామ యొక్క వామపాద తాడనాన్ని కూడ సహించాడని చెపుతారు.
              
                      

                             శ్రీమద్రామాయణంలో యాగసంరక్షణకు తన వెంట రామలక్ష్మణులను తీసుకెళ్లే సమయంలో ఒక రాత్రి సరయూతీరం లో విశ్రమించారు. మరుసటి రోజు ప్రాత:కాల సమయం లో నిద్రాముద్రితుడైన బాలరామునికి  సుప్రభాతం  పలుకుతూ కౌసల్యా సుప్రజారామా!“నిద్రలేపాడు కదా.  ఆ సమయం లో పుంసాంమోహనురూపుడైన కౌసల్యాతనయుని ముగ్థమోహన సౌందర్యానికి ఆకృష్టుడై విశ్వామిత్రుడు శ్రీ  రామచంద్రుని   బిగికౌగిలిని  అడిగాడట. కాని శ్రీ రామచంద్రుడు తాను ఈ అవతారం లో ఏకపత్నీ వ్రతుడినని , కనుక కృష్ణావతారం లో మీ కోరిక తీరగలదని వరమిచ్చాడని, అందువలన విశ్వామిత్రుడే కృష్ణవతారం లో సత్యభామ గా జన్మించి,తరించాడని  జానపదులు,పౌరాణికులు చెపుతుండేవారు.   వీరికి ఆకరమైన ఆథారం ఎక్కడిదో తెలీదు. కథకు కాళ్లుండవు కదా !  
            
                   శ్రీ రామచంద్రుడికే గురువైన విశ్వామిత్రుడే సత్యభామ యైనప్పుడు యుద్ధానికి బయలుదేరిన శ్రీకృష్ణునితో   ఆమె కూడ వస్తానని బయలుదేరడం లో కాని, నరకాసురుని తో యుద్ధం చేయడం లో కాని ఆశ్చర్యం లేదు. ఈ ఘట్టం నాచనసోముని ఉత్తరహరివంశం లో అద్భుతమైన కవితా విన్యాసం తో ఆవిష్కరించబడింది.  ఆ విన్యాసానికి ముగ్థుడైన మహాకవి పోతన సోమన కవిత్వం పై నున్న  అభిమానం తో  అందులోని కొన్ని అందమైన పద్యాలను అనుకరించాడని విమర్శకుల భావన.
          
                     ఈనాడు మనం అస్సాం గా పిలుస్తున్న ప్రాంతమే ఆనాటి నరకుని ముఖ్యపట్టణమైన ప్రాగ్జ్యోతిషపురం గా చెప్పబడుతోంది.10 వ శతాబ్దానికి చెందినదిగా చెపుతున్న  ఉపపురాణమైన కాళికాపురాణం లో  నరకాసురుని ప్రస్తావన అధికంగా కన్పిస్తోంది. కామాఖ్యాదేవి వృత్తాంతం ఇందులో ప్రస్తావించబడింది. మహాభారత , రామాయణాల్లో సైతం ఇతని ప్రసక్తి వస్తోంది. మహాభారతం లో ఇతని కుమారుడు భగదత్తుడు  కౌరవుల పక్షాన కురుక్షేత్ర సంగ్రామం లో పాల్గొన్నాడు.  శతపథ బ్రాహ్మణం, హరివంశం, భాగవతం, విష్ణు పురాణాల్లో కూడ  భూదేవి, నరకాసురులకు శ్రీమహావిష్ణువు,  బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలు ప్రస్తావించబడ్డాయి.
              
                   నరకాసురుని ఆగడాలు, అత్యాచారాలు  పెచ్చు పెరిగి పోయాయి. అదితి కర్ణకుండలాలను అపహరించాడు. వరుణదేవుని ఛత్రాన్ని,దేవతల మణిపర్వతాన్నికూడ ఎత్తుకుపోయాడు. దేవేంద్రుడు వచ్చి శ్రీకృష్ణునికి మొర పెట్టుకున్నాడు.నరకుని పీడ ను త్వరగా వదిలించ వలసిందని    చేతులెత్తి ప్రార్థించాడు. ఆపన్నశరణ్యుడు, రాక్షసవిదారి అయిన మాథవుడు నరకాసుర సంహారానికి సమయ మాసన్నమైనదని నిర్ణయించి, యుద్ధసన్నద్ధుడై గరుడవాహనం పై నరకుని నగరమైన ప్రాగ్జ్యోతిషపురానికి బయలు దేరాడు.
              
                   ఇంతలో స్వామీ! మీరు యుద్ధరంగంలో రాక్షసమూకలను చీల్చి చెండాడుతుంటే నాకు చూడాలని కోరికగా ఉంది.ప్రాణేశ్వరా! నామాట మన్నించి నన్నుకూడ మీ వెంట తీసుకెళ్లండి.అక్కడ మీ ప్రతాపాన్ని కనులారా చూచి వచ్చి ఇక్కడ రాణులందరికీ  తెలియజేస్తాను అంటూ ప్రాథేయపడింది సత్యభామ.
                  
                     చిరునవ్వులను చిందించాడు శ్రీ కాంతుడు. చెలీ! రణరంగమంటే తుమ్మెదల ఝంకారాలు కావు.మదించిన ఏనుగుల ఘీంకారాలు. అక్కడ కన్పించేవి తామరవనం నుండి గాలికి ఎగిరివచ్చే పుప్పొడులు కావు.గుఱ్ఱపు డెక్కల చివరల నుండి లేచిన థూళి దుమారాలు. రాజహంసలతో కూడిన సరోవరాలు కావు. రాక్షససైన్య సమూహాలు. కలువలు కమలాలు అక్కడ కన్పడవు.అక్కడ  కన్పించేవి భయంకరమైన శత్రుశూలాలు.ఖడ్గాలు ఆయుధాలు. ఇటువంటి యుద్ధరంగానికి నీవెందుకు? నేను త్వరగా వచ్చేస్తా! నీవు రావద్దున్నాడు.
              
                   కాని సాత్రాజితి వినలేదు. మీ బాహువులనే కోట నాకు రక్ష గా ఉండగా  వారు రాక్షస సమూహాలైనా నన్నేం చేస్తారు. నేను కూడ మీతో వస్తాను అంటూ చేతులు జోడించి గోముగా ప్రార్థించింది.  అందుకు అంగీకరించి, సతీ సమేతంగా గరుడారూఢుడై నరకాసుర పట్టణానికి బయలుదేరాడు రుక్మిణీనాథుడు.
                 
                     మురాసురుడు ప్రాగ్జ్యోతిష పట్టణాన్ని తన భుజబలం తో  కాపాడుతున్నాడు. అటువంటి ప్రాగ్జ్యోతిష పట్టణం పై దాడి చేసి తన గదా ఘాతాలతో నగర ప్రాకారాలను పడగొట్టి రాక్షస సైన్యాన్ని భయభ్రాంతుల్నిచేస్తూ, ప్రళయకాల మేఘగర్జన వంటి  థ్వనితో తన పాంచజన్యాన్ని పూరించి, యుద్ధాన్ని ప్రకటించాడు శ్రీహరి. అప్పుడు జరిగిన మహాసంగ్రామం లో దేవేంద్రుని వజ్రాయుథం దెబ్బ కు శిఖరాలు తెగి కూలిన పర్వతం వలే మురారి చక్రాయుథం  దెబ్బ కు అయిదు తలలు  తెగి నేలకొరిగాడు మురాసురుడు.
                         
                               తన తండ్రి మరణవార్త విని  క్రోధోద్రిక్తులైన  మురాసురుని  కుమారులు ఏడుగురు తామ్రుడు,అంతరిక్షుడు,శ్రవణుడు, విభావసుడు, వసుడు, నభస్వంతుడు అరుణుడు అనువారు పీఠుడు అనే సైన్యాథిపతి నాయకత్వం లో ప్రళయ కాలమందలి పవనసప్తకం వలే ఒకేసారి శ్రీకృష్ణుని మీద దాడి చేశారు.
                           
                       రాక్షసులు ప్రయోగిస్తున్న  వివిథ ఆయుథ సమూహాలను   రాక్షసాంతకుడైన మురారి  తన ఆయుథ పరాక్రమం తో నేలకూలుస్తూ, తన బాణాలతో ఆ రాక్షసుల  కాళ్లు ,చేతులు, కంఠాలను నువ్వుగింజల వలె చిద్రుపలు, చిద్రుపలు గా చేసేశాడు.
                      
                    దారుణ మైన తన వారి మరణవార్త ను విన్న నరకాసురుడు రోషంతో శ్రీ హరిని నిందిస్తూ, తనను తాను స్తుతించుకుంటూ,యుద్ధానికి సిద్ధమై రత్న ఖచిత కుండలాలను, వివిధ ఆభరణాలను  అలంకరించు కొని  మత్త వేదండంబుల దండు వెంటరాగా గజారూఢుడై రణరంగానికి తరలి వచ్చాడు.
             
                 గరుడవాహనాన్ని అథిరోహించిన నీలమేఘశ్యాముడైన శ్రీకృష్ణుడు, వీపున అమ్ముల పొది దాల్చి, సత్యభామ కు సంగ్రామ రహస్యాలను బోథిస్తూ , చంద్రబింబం పై మెరుపుతీగ తో కూడిన మేఘం లా ప్రకాశించాడు. ఇంతలో యుద్ధానికి సిద్ధమై వస్తున్న నరకాసురుని చూచిన సత్యభామాదేవి ఇంక ఏమాత్రం ఆలస్యం చేయక, వెంటనే వాలుజడ ముడివేసి. చీరముడి బిగించింది. ఆభరణాలను చక్కచేసుకొని, పైట ను సరిచేసుకొంది. ముఖం కాంతితో ప్రకాశిస్తుంటే మురాంతకుని కంటే ఒక అడుగు ముందుకేసి నిలబడింది సాత్రాజితి.  సమరసన్నద్ధ యైన తన భామను చూచి, మురిసిపోయిన మురారి సరసం గా ఇలా అన్నాడు.
    
          లేమాఁ దనుజుల గెలవఁగ  లేమా నీవేలకడగి లేచితి విటురా
           లే మాను మానవేనిన్, లే మావిల్లందికొనుము లీలం గేలన్.
           
          అంటూనే శ్రీకృష్ణుడు విల్లును సత్యభామ కు అందించాడు. తన నాథుడు అందిచ్చిన విల్లును థరించి గొప్పతేజస్సు తో ,మహాప్రతాపం తో ప్రకాశించింది సాత్రాజితి.శత్రుసేనల గుండెలదిరేటట్లు, వారి యేనుగుల సమూహాలు భయము తో మూర్ఛిల్లేటట్లు ఒక్కసారిగా  అల్లెత్రాటిని మీటి యుద్ధానికి సిద్ధమైంది సత్యభామ.
    
                బంగారు కంకణాల సుమథుర  ధ్వనులు వింటినారి తో స్నేహం చేస్తుంటే , చెవికమ్మల లోని మణుల కాంతులు చెక్కిళ్ల పై ప్రతిఫలిస్తుండగా, క్రీగంటి చూపుల  ధవళ కాంతులు బాణ కాంతులను కప్పి వేస్తుంటే, బాణాలను ప్రయోగించడం వలన కలిగిన శబ్దం శత్రుసైన్యాల ఆర్త నాదాలను మింగివేస్తుంటే, వీరము, శృంగారము,భయము ,రౌద్రము, విస్మయాలు కలసి ఈ భామ గా రూపొందాయా అన్నట్లు , సత్యభామ బాణం  తొడగడం,ఎక్కుపెట్టడం , ప్రయోగించడం కూడ గుర్తించలేనంత వేగం గా యుద్ధం చేయసాగింది.

               పరుజూచున్  వరుఁజూచునొంప నలరింపన్ , రోషరాగోదయా
              విరతభ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్
              జరగన్, గన్నులఁగెంపు సొంపుఁ బరఁగం జండాస్త్ర సందోహమున్
              సరసాలోక సమూహమున్ నెఱపుచుం జంద్రాస్య హేలాగతిన్ .
  
                        వీర శృంగార రసాలు ఆకారం దాల్చినట్లు చంద్రానన యైన సత్యభామ  నరకాసురుని ,శ్రీకృష్ణుని చూస్తూ,రోష రాగాలను కనుబొమ ముడితో, మందహాసం తో  ప్రకటిస్తూ, సోగ కన్నులతో నాథుని చూస్తూ,  కోపపు కన్నులతో నరకుని తిరస్కరిస్తూ,  అతివిలాసంగా,అలవోక గా  యుద్ధం చేయసాగింది.
  
            అళినీలాలక చూడ నొప్పెసగెఁ  ప్రత్యాలీఢపాదంబుతో
           నలికస్వేద వికీర్ణకాలకలతో నాకర్ణికానీత స
           ల్లలిత జ్యానఖపుంఖ దీథితులతో లక్ష్యావలోకంబుతో
           వలయాకర ధనుర్విముక్త విశిఖవ్రాతా హతారాతియై.

                    
              ఎడమపాదాన్నికొద్దిగా ముందుకు జరిపి నేలకు దట్టించి ,కుడికాలును కొద్దిగా వంచి, చెమటకు తడిసి ముఖాన పడుతున్న ముంగురులతో , ఆకర్ణాంతము లాగబడిన అల్లెత్రాటిని పట్టుకున్న చేతివ్రేళ్ల గోళ్ల కాంతులతో, లక్ష్యాన్ని ఖచ్చితంగా భేదిస్తూ, వలయాకారం గా వంచబడిన ధనుస్సు నుండి వదిలి పెడుతున్న 
బాణపరంపరలకు శతృసమూహాలను బలిస్తూ, సింహగర్జనలు చేసింది సత్యభామ.

                                                                                
       
                         ఆ యుద్ధాన్ని చూసి  బొమ్మలపెళ్లిళ్లకే వెళ్లని  ఈ మగువ యుద్ధభూమికి ఎందుకొచ్చింది.? ఉయ్యాల ఎక్కడానికే భయపడే ముద్దరాలు గరుత్మంతుని ఎలా అధిరోహించింది? పెంపుడు చిలుకకు పద్యాలు చెప్పలేని ఈ వనిత అస్త్రవిద్యలను ఎప్పుడు నేర్చుకొంది? అనుకంటూ శ్రీకృష్ణుడు ఆశ్ఛర్యపోయాడు.

                           వింటినారి థ్వని మేఘగర్జన గా,దేవతలు చాతకపక్షులుగా,ధనుస్సు ఇంద్ర చాపం గా, శ్రీకృష్ణుడు మేఘం గా , తాను మెరుపుతీగ గా, బాణ సమూహమనే వర్షం తో, రాక్షసులనే దావాగ్నిని  చల్లార్చడానికి సత్యభామాదేవి సంగ్రామాన్ని తీవ్రతరం చేసింది. ఆ అందాన్ని చూడండి.
      
           రాకేందు బింబమై రవిబింబమై యొప్పు నీరజాతేక్షణ నెమ్మొగంబు
           కందర్పకేతువై  ఘనధూమకేతువై యలరు బూఁబోడి చేలాంచలంబు
           భావజు పరిధియై ప్రళయార్కు పరిధియై మెఱయు నాకృష్టమై మెలత చాప,
           మమృత ప్రవాహమై యనలసందోహమై తనరారు నింతి సందర్శనంబు
          
                 హర్షదాయియై మహారోషదాయియై ,పరగు ముద్దరాలి బాణవృష్టి
                 హరికి నరికి జూడ నందంద శృంగార , వీరరసము లోలి విస్తరిల్ల.
       
         సత్యభామ చేస్తున్న సంగ్రామ విహారాన్ని ఎంత వర్ణించినా మహాకవి కి  ఆ సుందరదృశ్యం ఇంకా మనోహరం గానే కన్పిస్తోంది.
  
                 సత్యభామ వదనారవిందం నందనందనునకు చంద్రబింబంగాను , నరకాసురునకు సూర్యబింబంగాను కన్పిస్తున్నాయి. ఆనారీమణి  చేలాంచలంమురారికి మన్మథుని జెండాగాను, సురారికి  థూమకేతువు గాను, ఎక్కుపెట్టిన థనుస్సు  సత్యాపతి కి మన్మథ పరివేషంగాను, నరకాసురునకు ప్రళయ భాను పరివేషం గాను, సత్యభామా సందర్శనం హరికి  అమృతమయం గాను, అరికి అనల సందోహం గాను , ఆమె కురిపిస్తున్న బాణవర్షం యశోదాపట్టికి ఆనందాన్ని,నరకాసురునికి కోపాన్ని కలిగిస్తుంటే శ్రీహరి లో శృంగారరసం , నరకాసురుని లో వీరరసం విస్తరిల్లే విథం గా సత్యభామ సమరాన్ని  సాగించి రాక్షససైన్యాన్ని కకావికలు గావించింది. రాక్షససైన్యం  నరకాసురుని చాటుకు పారిపోయింది.

                ఆమె యుద్ధ నైపుణ్యానికి ముగ్థుడైన శ్రీకృష్ణుడు కొమ్మా! మెచ్చితి నిచ్చెద కొమ్మాభరణములు నీవు గోరిన వెల్లన్ అనేశాడు. నీ విజయానికి మెచ్చాను.  నీవు ఎన్ని ఆభరణాలు కోరుకుంటే అన్ని ఆభరణాలు ఇచ్చేస్తాను అన్నాడట మురవిదారి.  ఆడవారికి  అందునా ఇల్లాలిని మెచ్చిఇచ్చే కానుకలలో ఆభరణాలకు మించినవి ఉండవని తెలిసిన వాడు కదా షోడశ సహస్రాంగనా వల్లభుడు.
  
                 తన సైన్యమంతా పలాయనం చిత్తగించడంతో కోపోద్రిక్తుడైన నరకాసురుడు శ్రీకృష్ణునికి ఎదురు వచ్చి, కృష్ణా ! మగవారి ఎదుట ఒక మగువ పౌరుషాన్ని ప్రదర్శిస్తుంటే యుద్ధం మానేసి మౌనం గా ఉండటం నీకు మగతనం కాదు. రాక్షసవీరులు మగలమగలు కాబట్టి మగువలతో యుద్ధం చేయరు అంటూ డంబాలు పల్కసాగాడు.నరకుని మాటలు వింటూనే సత్యభామ చేతినుండి విల్లందుకొని శతఘ్ని అనే దివ్యాస్త్రాన్ని ప్రయోగించి, రాక్షససైన్యాన్ని తుత్తునియలు చేశాడు శ్రీకృష్ణుడు. నరకుడు శక్తి అనే ఆయుధాన్ని గరుడుని పై ప్రయోగించి ,శ్రీకృష్ణుని పై శూలాన్ని ప్రయోగించబోయేటంతలో అలిగిన ద్వారకానాథుడు చక్రాయుథాన్ని ప్రయోగించి నరకుని శిరస్సును ఖండించాడు . ఆనందం తో దేవతలు పూలవాన కురిపించారు.
  
            తల్లీ! వరాహావతారం లో నేను విష్ణుమూర్తి ఇల్లాలినని చెప్పుకున్నావు. నిన్ను చూసైనా నాపై దయ చూపకుండా శ్రీహరి నా తల నరికాడు. అని భూదేవి కి చెప్పుకుంటు న్నట్లుగా నరకాసురుడు  యుద్ధరంగంలో భూమికొరిగాడు.
        

  
                                                 శ్రీ వరాహస్వామి    (ఉండవల్లి గుహలోని స్థంభ శిల్పం)
   
              అంత భూదేవి వాసుదేవుని సమీపించి పలురీతుల స్తుతించి, వివిథ కానుకలను సమర్పించి,ఓభక్తమందారా !  ఈ బాలుడు నరకాసురుని కుమారుడు. దిక్కు లేనివాడు. వీడు తండ్రి వలే కాదు.  నీ పాదాలనే ఆశ్రయించాడు.  అని ప్రార్థించగా భగవంతుడైన మాథవుడు నరకాసురుని కుమారుడైన భగదత్తుని కభయమిచ్చి, సర్వసంపదలను అనుగ్రహించాడు.
  
                కొన్ని గ్రంథాలలో సత్యభామే నరకాసురుని సంహరించినట్టు చెప్పబడింది. కాని మహాభాగవత పురాణం లో మాత్రం శ్రీకృష్ణుడే నరకాసురని సంహరించినట్లు వ్రాయబడింది.
               
      ప్రచారం లో ఉన్న ఒక  కథ ఆథారం గా  -- తల్లి చేతుల్లోనే మరణం పొందేటట్లు బ్రహ్మదేవుని నుండి వరం పొందాడు నరకుడు.ఈతని తల్లి భూదేవి. ఈమె  శ్రీమహావిష్ణువు చేత తాను అంగీకరించినప్పుడు మాత్రమే తన కుమారునికి మరణం సంభవించేటట్లు వరం పొందింది. ఆసురగర్వం తో నరకుడు ఇంద్రుని జయించి,అదితి కర్ణకుండలాలను అపహరించాడు.  వరుణుని ఛత్రాన్ని,మణి పర్వతాన్ని కూడ స్వంతం చేసుకున్నాడు.ఎందరో భామినులను చెఱ పట్టాడు.
  

                                        శ్రీ వరహస్వామి              (మహాబలిపురం)
            
                    తుదకు ఇంద్రాది దేవతల సంప్రార్థన తో శ్రీ మహావిష్ణువైన శ్రీకృష్ణుడు నరకుని పైకి యుద్ధానికి వెళ్ళాడు. ఘోర సంగ్రామం లో నరకుడు ప్రయోగించిన శక్తి ఆయుథం  శ్రీకృష్ణుని స్వల్పం గా గాయపరచగా ఆయన మూర్ఛపోయాడు. సత్యభామ యుద్ధానికి సిద్ధమైంది. చివరకు సత్యా,కృష్ణులు యుద్ధం లో నరకుని నేల కూల్చారు.  భూదేవి  శ్రీకృష్ణావతారం లో సత్యభామ గా జన్మించింది కాబట్టి నరకాసురుని, భూదేవి ఇద్దరి వరాలు  నెరవేర్చబడ్డాయి. నరకుని చేతబంథించబడిన 16,100 మంది యువతులకు సమాజం లో వారి గౌరవాన్ని కాపాడటానికి శ్రీకృష్ణుడు వారిని వివాహం చేసుకున్నాడు.

                   శ్రీకృష్ణుడు అదితి ఆభరణాలను ఆమెకు అందించడానికి ఇంద్రలోకానికి వెళ్లాడు. ఆనందించిన అదితి సత్యభామను చూసి నిత్యయౌవన, సౌందర్యాలతో విలసిల్లేట్టు వరాన్ని ఇచ్చింది.  ఆ సమయంలోనే పనిలో పనిగా నందనవనం లోకి వెళ్లిన సత్యాకృష్ణులు పారిజాతవృక్షాన్ని మెచ్చి,అడ్డం వచ్చిన ఇంద్రుణ్ణి ఓడించి, భూలోకానికి తెచ్చి సత్యాదేవి పెరటిచెట్టు గా  నాటేశారు.
     
             నరకాసురుడు మరణిస్తూ తన చివరి కోరికగా తాను మరణించిన రోజున భూలోకవాసులంతా రంగురంగుల దీపకాంతుల వెలుగులలో ఉత్సవం  జరుపుకోవాలని కోరాడట.  పారిజాతం భూమికి దిగి వచ్చిన 
రోజు, నరకాసురుని పీడ విరగడైన రోజు మనకు  పర్వదినం.  అదే నరక-చతుర్థశి తరువాత వచ్చే దీపావళి.








-------------------------------అందరికీ దీపావళి శుభాకాంక్షలతో----------------------------------

Wednesday 23 October 2013

శ్రీ భాగవత కల్పద్రుమ ఫలాలు -2 కుచేలోపాఖ్యానం



  శ్రీ భాగవత కల్పద్రుమ ఫలాలు 2
                        

                           కుచేలోపాఖ్యానం
                   
                  






                                  కుచేలోపాఖ్యానానికి భాగవత ఉపాఖ్యానాలలోనే ఒక ప్రత్యేకత  ఉంది.   దీని లోని ఇతివృత్తం తెలుగు వారి కుటుంబ జీవనానికి దగ్గరగా ఉండటమే  అందుకు ప్రథాన కారణం.  స్నేహబంథం ఎంత  పవిత్రము,ధృఢమైనదో  ఈ ఉపాఖ్యానం  చెపుతుంది. నారద భక్తి సూత్రాలు చెప్పిన నవవిధ భక్తి మార్గాలలో సఖ్యభక్తి కి నిలువెత్తు నిదర్శనం ఈ ఉపాఖ్యానం.అంతే కాకుండా భగవంతుడు తనను నమ్మిన భక్తుణ్ణి   ఏ విధంగా బ్రోచి,  ఆదరించి, అంకాన చేర్చుకుంటాడో తెలియ జెప్పే ఉపాఖ్యానం  ఇది. గురుదేవుల  ఆశీస్సులు  శిష్యకోటి కి ఎటువంటి అమృత ఫలాలను   అందిస్తాయో కూడ కుచేలోపాఖ్యానం లో మనం చూడవచ్చు.  
       
               కన్నబిడ్డల కోసం, వారి ఆకలిని తీర్చడం కోసం తల్లిదండ్రులు అభిమానాన్ని కూడ వదులుకొని అయినవారి చెంతకు  వెళ్లడానికి ఎంతగా సిద్ధమౌతారో ఈ ఉపాఖ్యానం  నిరూపిస్తుంది.
           
                   అన్నింటి కంటే దుస్సహ దరిద్రాన్ని అనుభవిస్తూ కూడ,  కడుపు కక్కూర్తికి, కాసుకి ఆశ పడి తన కావ్యాన్ని అమ్ముకోనని  రాచరికపు వ్యవస్థను తిరస్కరించి, కైటభ దైత్యమర్థనుని గాదిలి కోడలైన  భారతి యొక్క కాటుక కంటి వేడి కన్నీటిని కొనగోట మీటి ఓదార్చిన భాగ్యశాలి యైన  కవి పోతన జీవితం - కుచేలుని జీవితానికి దగ్గరగా ఉండేదనే భావన కూడ   ఈ ఉపాఖ్యానాన్ని తెలుగు వారికి దగ్గర చేసింది.
            
                       నా విషయానికి వస్తే ఈ ఉపాఖ్యానానికి ఒక ప్రత్యేకత ఉంది. హైస్కూలు చదువు పూర్తయి, వేసవి సెలవల్లో ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా జేజమ్మ గారు  (నాయనమ్మ అమ్మ గారు )  నాకు కాలేజీ పుస్తకాలకు  డబ్బులిచ్చే ఒప్పందం మీద  నాచేత చదివించుకున్న  పుస్తకాలలో మొల్ల రామాయణం తరువాత   మరువలేనిది  ఈ కుచేలోపాఖ్యానం .
         
      మా తాతగారు  ( అంటే జేజమ్మ గారి భర్త )  చతుర్వేదాథ్యాయి. మహాపండితుడు. ఆయన ఇల్లే  ఒక వేదపాఠశాల గా ,ఎప్పుడూ ఇంటినిండా శిష్యులతో కళకళ లాడుతుండేదట. అందుకని ఈవిడకు కూడ  శాస్త్ర , కావ్య అథ్యయన అవగాహన ఉండేది. శిష్యులు  వేదపనస చెప్పుకుంటుంటే వంటచేసుకుంటూనే  ఈవిడ  స్వరాలను  సరిచేసేదని చెప్పుకునేవారు. అయితే వయసు  పది ఎనిమిదులు దాటి, చూపు, ఓపిక తగ్గడం తో అటువంటి   ఆవిడకు చదివి వినిపించే అదృష్టం నాకు కలిగింది ఆనాడు.
                
            ఆనాడు నేను చెరకు రసం తీసే యంత్రాన్ననుకుంటే ఆవిడ ఇక్షురసాన్ని  ఆస్వాదించే అదృష్టశాలి గా నాకు ఇప్పుడు అనిపిస్తోంది. నాకు అక్షరాలు, వాక్యాలు చదవడం మాత్రమే  తెలుసు. అందులోని స్వారస్యాన్ని గ్రహించే  వయసు గాని,  అర్థంచేసుకోవాలనే తపన కాని నాలో ఉండేవి కావు. కాని నేను చదువుతున్నప్పుడు  ఆ భగవంతుని లీలలను వింటూ ఆవిడ పొందే తాదాత్మ్యత  ఆవిడ కళ్లల్లో స్పష్టంగా కనిపించేది. ఒక్కొక్కసారి ఆ  ఆనందాన్ని ఆపుకోలేక  నాకు అర్థం కాదని తెలిసి కూడ  ఆ విషయాన్ని నాకు వివరిస్తూ, ఆనందించేవారు. కాని ఆ రోజుల్లో ఆవిడ పొందిన ఆ ఆనందం ఇప్పుడర్థమౌతోంది. అంతేకాదు. తన భావాలను తెలుసుకోలేని ఒక బాలునితో  చెపు తున్నానని కూడ ఆవిడకు  తెలుసు.కాని ఆ భావాలు ఆపుకోలేనివి . అవి పంచుకుంటేనే ఆనందం.

                        ఎందుకంటే ఒకానొక సమయం లో మన మనసులో పెల్లుబికిన భావజాలాన్ని  పంచు కోగలిగిన  మనిషి లేనపుడు ఆ సమయం ఎంత ఘోరంగా ఉంటుందో ఆ స్థితిని  అనుభవించిన వారికి తెలుసు. ఆ అనుభవంతోనే మహాకవి భవభూతి అ రసికాయ   కవిత్వ నివేదనం శిరసి మా లిఖ మా లిఖ మా లిఖ  అన్నాడు.
         
                         కుచేలుడు శ్రీకృష్ణుని బాల్యసఖుడు. సహాథ్యాయి. అభిమాన ధనుడు. విజ్ఞాని. రాగద్వేష రహితుడు. శాంతుడు. ధర్మవత్సలుడు. జితేంద్రియుడు.బ్రహ్మజ్ఞాన సంపన్నుడు. తన గృహం లో దారిద్ర్యం తాండవిస్తున్నా ఎవరినీ యాచించకుండా ప్రాప్తమైన కాసునే పదివేల దీనారాలు గా భావించి  భార్యాబిడ్డలను పోషిస్తున్నమానధనుడు.
         
                        ఆతని ఇల్లాలు పరమ పతివ్రత.సద్వంశ సంజాత. తల్లిదండ్రులు జీవించేది, సంపాదించేది తమ బిడ్డల కోసమే గదా. అటువంటి బిడ్డలే  బక్కచిక్కి, ఎండిన పెదవులను నాలుకతో తడుపుకుంటూ, ఆకుగిన్నెలను పట్టుకొని, అమ్మా!  పట్టెడు అన్నం పెట్టమని  తన చెంతకు వచ్చి ప్రాథేయపడుతుంటే ఆమాటలకు చెవుల్లో శూలాలు  దించినట్లు బాధ పడేది ఆ ఇల్లాలు.
        
                          భర్త అభిమానవంతుడు,ఒకరిని యాచించడని తెలిసి కూడ  బిడ్డల ఆకలి బాధను చూడలేక  ప్రాణనాథుని చేరి, దారిద్య్రమనే ఈ పెనుచీకటి నుండి బయటపడే మార్గం చూడవలసిందని ప్రార్థించింది. శ్రీకృష్ణుడు మీ చిన్ననాటి స్నేహితుడు.  ఆయనను దర్శించిన యెడల హరికృపాకటాక్షమనే రవికాంతి తో ఈ దరిద్రమనే అంధకారాన్ని దాట గల మని కూడ సూచించింది.
      
                 వరదుడు,సాధు భక్తజన వత్సలుడు,  ఆర్తశరణ్యుడు, దయాసముద్రుడు లక్ష్మీనాథుడు అయిన మాథవుడు యాదవుల చేత సేవించబడుతూ ద్వారకలో ఉన్నాడు కదా!  మీరు వెళితే చాలు. మిమ్మల్ని చూడగానే ఆ మహానుభావుడు మనల్ని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే – కలలో కూడ తనను స్మరించని కష్టాత్ముడు కూడ విపత్కర పరిస్థితుల్లో ఒక్కసారి ఆ భక్తజనమందారుని పాదపద్మాలను మనసారా స్మరిస్తే చాలు .కరుణించి కటాక్షిస్తాడు. అవసరమైతే తనను తానే సమర్పించుకుంటాడు. అటువంటి మహనీయుడు నిరంతరం  భక్తి తో తనను సేవించే వారికి సమస్త సంపదలను ఇవ్వకుండా ఉంటాడా ?. సునిశ్చల భక్తిన్ భజియించువారి కిడడే సంపద్విశేషోన్నతుల్ ?  అంటుంది కుచేలుని ఇల్లాలు. ( 10-ఉ-971)
           
                             ఈ  నమ్మకము ,విశ్వాసమే పోతన్నను నడిపించింది. సత్కవుల్ హాలికులైన నేమి ?   గహనాంతర సీమల కందమూలగౌద్దాలికులైన నేమి? నిజదారసుతోదర పోషణార్థమై అనిప్రశ్నించింది.  ఇమ్మను జేశ్వ రాథముల అని కూళలు వంటి పాలకులను త్రోసి పుచ్చింది.
           
                    అందుకే  ఇల్లాలి సూచనతో తో కుచేలుడు శ్రీకృష్ణుని చెంతకు బయలుదేరాడు.  చెలికానికి కానుకగా  ఇల్లాలు తన శిథిలవస్త్రపు కొంగున  కట్టి ఇచ్చిన కొన్ని పృథుక తండులాలను తీసుకొని  గోవింద దర్శనోత్సాహియై ద్వారక మార్గం పట్టాడు. 
                            
              కాని కుచేలుని ఎదలో సందేహాల తుమ్మెదలు రొద చేస్తూనే ఉన్నాయి. ద్వారక లోకి ఎలా వెళ్లగలను. అంతపురం లోని శ్రీకృష్ణుని ఎలా దర్శించుకోగలను. ద్వార పాలకులు అడ్డగిస్తే , కటికిదరిద్రుడనైన నేను వారికి  ఏమి  బహుమతి ఇవ్వగలను . అయినా ఆ స్వామి అనుగ్రహమే కదా నాకు రక్ష! ఇలా అనుకుంటూనే ద్వారకకు చేరి, వీథులు దాటి స్వర్ణ మయ సౌథం లో సతీమణి తో సరసాలాడుతున్న మన్మథ మన్మథుడైన శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకోగలిగాడు కుచేలుడు.  మనకు కూడ ఆ  పరమాత్మ దివ్యరూప సందర్శనా భాగ్యాన్ని కల్గించి ధన్యుడయ్యాడు భక్తకవి పోతన.
              
                       గజేంద్రమోక్షం లో అల వైకుంఠ పురంబు లో నగరిలో ఆమూల సౌథంబు దాపల నున్న హరిని దర్శించి,మనకు దర్శింపచేసిన పోతన మహాకవి ద్వారకలో శ్రీకృష్ణుని ఇలా దర్శించాడు.
       
        ఇందీవరశ్యాము, వందిత సుత్రాముఁ, గరుణాలవాలు,భాసురకపోలుఁ
       గౌస్తుభాలంకారుఁ,గామితమందారు ,సురుచిరలావణ్యు ,సురశరణ్యు,
       హర్యక్షనిభమధ్యు, నఖిలలోకారాథ్యు,ఘనచక్రహస్తు ,జగత్ప్రశస్తు,
      ఖగకులాధిపయాను ,గౌశేయపరిధానుఁ బన్నగశయను ,నబ్జాతనయను,               
              మకరకుండల సద్బూషు ,మంజుభాషు ,నిరుపమాకారు , దుగ్దసాగరవిహారు ,
             భూరిగుణసాంద్రు ,యదుకులాంభోధి చంద్రు,విష్ణు, రోచిష్ణు జిష్ణు ,సహిష్ణు, గృష్ణు.

        


   
            రుక్మిణీనాథుని దివ్యమంగళ విగ్రహాన్నిమనసార దర్శించి, తనివి తీర వర్ణించాడు.(10-ఉ-979)
          
               అంత:పురం చెంతకు చేరిన ఆ కుచేలుని  చూచిన శ్రీకృష్ణుడు  తనపాన్పు పై నుండి లేచి    కుచేలునకు ఎదురెళ్లి సాదరంగా కౌగిలించుకొని, బంధుప్రేమ తో తోడ్కొని వచ్చి తన హంసతూలికా తల్పం మీద కూర్చోపెట్టుకున్నాడు.  బంగారుపాత్రలో నిండిన కస్తూరీ పరిమళ మిళితమైన సుగంధ జలాలతో  కుచేలుని పాదాలను,  కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకున్నాడు ఆ యోగీశ్వరేశ్వరుడు.
      
                    పచ్చకర్పూరం కస్తూరీ కలిపిన మంచిగంధాన్ని కుచేలుని శరీరానికి అలమి. అగరు థూపం వేసి,మార్గాయాసం పోయేటట్లు రుక్మిణీదేవి వీవన తో విసురుతుండగా, మణిమయ దీపాలతో మంగళ హారతులు సమర్పించి, పూలమాలను శిఖ లో తురిమి. కర్పూరతాంబూలాన్నిచ్చి, ధేనువు ను సమర్పించి, కుశలప్రశ్నలతో  స్వాగతించాడు కుచేలుణ్ణి  శ్రీకృష్ణుడు. అతని అదృష్టాన్ని చూచి రుక్మిణీదేవి యొక్క అంత:పుర కాంతలు ఆశ్చర్య పోయారట.
                  
          రమానాథుడు ప్రేమతో కుచేలుని చేతిని తన చేతిలోకి తీసుకొని,చిన్ననాటి గురుకుల వాసపు రోజులను గుర్తుచేసుకున్నాడు.  ఈ సందర్భం లో జగద్గురువైన శ్రీకృష్ణపరమాత్మ  గురువుల గొప్పదనాన్ని ఈ విధం గా  ప్రస్తావిస్తాడు.
   
 “ *(మన) గురువు అజ్ఞానమనే చీకటికి దీపం వంటివాడు. అనంతమైన బ్రహ్మానందానుభవం లో నిమగ్నమైన మనసు కలవాడు గురువు. సత్కర్మ పరాయణుడు. విప్ర శ్రేష్టుడు. పుణ్యాత్ముడు. పండిత వందనీయుడు.

* సకలవర్ణాశ్రమాల వారికి నేను విజ్ఞానప్రదుండనైన గురువునై ఉండికూడ గురుసేవ పరమధర్మమని లోకానికి తెలియ చెప్పడానికే నేను గురుసేవ చేశాను.
·                   
                           *  నేనే  బ్రాహ్మణులలో కెల్ల ముఖ్యుడనై సకలవర్ణాలకు,ఆశ్రమాలకు జ్ఞానప్రదాత నై ప్రకాశిస్తూ ఉంటాను.
·         ఆయా వర్ణాలకు చెందిన జ్ఞానులు సమస్తలోకాలకు గురువు నైన నా మాటలనే ఆలకించి, నా పాదపద్మాలను స్మరిస్తూ సంసార సాగరాన్ని తరిస్తారు.
·               
          * సకల భూతాత్మకుడనైన నేను తపో దాన యజ్ఞ దాన వ్రతాదుల వలన సంతోషించను. పరమభక్తి తో గురువులను పూజించేవారినే  నేను గౌరవిస్తానని ప్రకటిస్తాడు శ్రీకృష్ణుడు.            
       
          గురుకులం లో ఉండగా జరిగిన ఒకనాటి సంఘటనను గుర్తు చేసి, దాని వలన తాము పొందిన గురువుల ఆశీర్వచనాన్ని కూడ  కుచేలునితో కలసి పంచుకున్నాడు  మాథవుడు.   ఆ వృత్తాంత మిది.        
  
              గురుకులం లో ఉండగా ఒకరోజు గురుపత్ని ఆజ్ఞానుసారం శ్రీకృష్ణ కుచేలురిధ్దరూ కట్టెలు కోసం అడవికి వెళ్లారు.ఆ రోజు భయంకరమైన సుడిగాలితో జడివాన కురిసింది. వాననీటి తో ఎత్తుపల్లాలు సమానమై పోగా, దిక్కు తెలియక, దారి తప్పి, చలిగాలి కి వణికిపోతూ, ఒకరి చేతిని ఒకరు ఊతగా చేసుకొని ఆ స్నేహితులిద్దరూ రాత్రంతా అడవిలో తిరుగుతూనే గడిపారు.  క్రమంగా సూర్యోదయమైంది.

          తెలతెలవాఱెడి వేళం, గల గల మని పలికెఁ బక్షిగణ మెల్లెడలన్
       మిలమిలని ప్రొద్దుపొడుపున , ధళధళ మను మెఱుఁగు దిగ్వితానము నిండెన్.(1002)
       
           ఉదయ కాంతులు పరుచుకుంటున్న వేళ గురువు గారైన సాందీపని  కృష్ణ కుచేలులను వెతుకుతూ అరణ్యానికి వచ్చారు. చలిలో వణుకుతున్న వీరిని చూచి --
   
         “శిష్యులుగా మీ ఋణం మీరు తీర్చుకున్నారు .ఇక మీద మీకు అపారమైన ధన దార బహుపుత్ర సంపదలు, దీర్ఘాయురున్నతులూ, జయాభ్యుదయాలు  కలుగుతాయని ఆశీర్వదించారు గురుదేవులు. ( 10-ఉ-1004 )
         
       గురుదేవుల ఆశీస్సు ఫలించి,ధన దార సంపదలు శ్రీకృష్ణుని చేరగా, బహుపుత్ర లాభం మాత్రం కుచేలునికి ప్రాప్తించాయి. ఇప్పుడు లక్ష్మీనాథుని దర్శనం తో  దారిద్య్ర మోచనం జరిగి, గురువుల ఆశీర్వచనం కుచేలుని యెడల కూడ  నిజం కాబోతోంది.
               
           ఇంతసేపు శ్రీకృష్ణుని సేవలతో చేష్టలుడిగి ఉండిపోయిన కుచేలుడు నెమ్మదిగా తేరుకొని దామోదరా!  నీవు త్రిజగద్గురుడవు. నీకు గురువు అనే వారెవ రుంటారు . ఇదంతా నీలీలలే కాని వేరుకాదు గదయ్యా! అన్నాడు.
     
               శ్రీకృష్ణుడు కుచేలుని మాటల్లోని ఆంతర్యాన్ని   గ్రహించిన వాడై చిరునవ్వు తో నీవు ఇక్కడకు  వస్తూ నాకేమి బహుమానం తెచ్చావు. నా భక్తుడు భక్తి తో నాకు ఏమిచ్చినా నేను ఆనందం గా  స్వీకరిస్తాను. అన్నాడు.
  
   “ దళమైనఁ బుష్పమైనను, ఫలమైన సలిలమైనఁ బాయని భక్తిన్
   గొలిచిన జను లర్పించిన , నెలమిన్ రుచిరాన్నముగనె యేను భుజింతున్. (1010)

                  ఆ మాటలకు ఆనందిస్తూనే  కుచేలుడు సకలైశ్వర్యప్రదాత యైన లక్ష్మీనాథునకు తాను తెచ్చిన అటుకులను ఇవ్వడానికి ముఖం చెల్లక తలవంచుకొని మౌనంగా ఉండిపోయాడు.    కాని సర్వాంతర్యామి యైన   రమాథవుడు కుచేలుడు వచ్చిన కారణాన్ని  తెలుసుకొని, ఇతను పూర్వజన్మలో ఐశ్వర్యకాముడై  నన్ను సేవించలేదు. కాని ఇప్పడు భార్య మాట విని ఆమె సంతోషం కోసం నా వద్ద కు వచ్చాడు.ఇతనికి ఇంద్రాదులకు 
మించిన సంపద నిన్వాలని నిర్ణయించు కున్నాడు. దైవం తలచుకుంటే సంపదలకు కొదవా! అని కదా  సామెత.

                  కుచేలుని శిథిల వస్త్రపు కొంగున ముడివేసిన అటుకులను ఒక పిడికెడు తీసుకొని ఆరగించాడు శ్రీకృష్ణుడు.మరొక పిడికెడు తీసుకోబోతుంటే స్వామీ ! అతనికి సకల సంపదలను ఇవ్వడానికి మీరు తిన్న అటుకులే చాలు.” నని రుక్మిణీ దేవి స్వామిని  సున్నితంగా వారించింది.

                  కుచేలుడు  ఆ రాత్రి కి  ఇందిరారమణుని మందిరం లోనే  స్వర్గభోగానుభవంగా  భుజించి, నిద్రించి, వేకువ లోనే లేచి, కాలోచిత కార్యాలు ముగించుకొని,  శ్రీకృష్ణుడు కొంత దూరం సాగ నంపగా, నందనందనుని సందర్శనమనే మహదానందాన్ని మననం చేసుకుంటూ  తన నగరానికి బయలుదేరాడు.

                అచ్యుతుడు, అవ్యయుడు నైన  శ్రీకృష్ణుడు తనను ఇంతగా సత్కరించాడు గాని  ధనమేమీ ఇవ్వలేదు. దరిద్రుడు సంపన్నుడైతే తన్ను సేవించడని అనుకొని ఉంటాడు. లేకపోతే ఆశ్రిత జనరక్షకుడు నన్ను ఐశ్వర్యవంతుణ్ణి చేయకుండా ఉంటాడా?” అని వితర్కించుకుంటూనే తన నగరంలోని  తన ఇంటిముందుకు చేరుకున్నాడు కుచేలుడు.

                   అక్కడున్నలక్ష్మీనివాస సన్నిభమైన మహాసౌథాన్ని చూచి, ఆశ్చర్య పోతుండగానే, దేవకాంతల వంటి యువతుల ఎదురొచ్చి స్వాగతం పలికి, అంత:పురం లోకి తీసుకెళ్లారు.అచ్చట మానవరూపం ధరించిన మహాలక్ష్మి వలే  ఉన్న కుచేలుని ఇల్లాలు   వచ్చి, భర్త పాదాలకు నమస్కరించి, మనస్సులోనే కౌగిలించుకున్నదట.ఎంత గంభీరమైన సన్నివేశాన్నిఎంత సుందర సుకుమారం గా ఆవిష్కరించాడో మహాకవి చూడండి.

                      ఆనాటి నుండి ఆ సతీపతులిద్దరు మాథవుని అనుగ్రహం తో ప్రాప్తించిన ఆ అనంత ఐశ్వర్యానికి ఎంతో ఆనందించి,  ఆనాటి నుండి హరి నామస్మరణ మరువకుండా జీవించసాగారు.

                         భక్తి కలిగిన ఉత్తములు సమర్పించినది కొంచెమైనా భగవంతుడు దానిని కోటానుకోట్లుగా భావించి స్వీకరించి, భక్తులను అనుగ్రహిస్తాడనటానికి నా వృత్తాంతమే ఉదాహరణ అనుకున్నాడు కుచేలుడు.  ఆనాటి నుండి  రాగద్వేషాదుల కతీతుడై, నిర్వికారుడై,  సమస్త క్రియలను అనంతుని యందు సమర్పణ చేస్తూ, జీవయాత్ర సాగించి తుదకు పుణ్య లోకాలను చేరుకున్నాడు కుచేలుడు.

    ఈ వృత్తాంతం విన్నవారికి ఇహ పరసుఖాలు, హరిభక్తి,  అజరామరమైన కీర్తి  ప్రాప్తించుగాక !                 
       యని  శుకమహర్షి  దివ్యవచనం.

    “కారుణ్యసాగరుండైన గోవిందుని చరణారవిందంబులయందుల భక్తి  ప్రతి భవంబునఁ గలుగుంగాక ! యని  కుచేలుని సంప్రార్థన.