Saturday 3 November 2012

రామాయణము-రమణీయకథనాలు-11 మంథర


                                   


                           మంథర
          







                            రామకథలో ఉన్నదేమిటి అడుగు అడుగున వెలుగు చీకటి అన్నారొక కవి. వెలుగు చీకటుల సయ్యాట ల్లో అయోధ్యా  రాజ్యలక్ష్మి  చెంగటి కొచ్చి మంథరా దుర్భోధల  పర్యవసానంగా, కైకేయీ కోరికలనే నెపంతో భరతుని చెంతకు చేరింది. ఇది రామకథలో ప్రధాన ఘట్టం.

                       ఆనాడు అయోథ్యా నగర మంతా  పచ్చ పచ్చని తోరణాలతోను రంగు రంగుల రంగవల్లుల తోను, మంగళ వాయిద్యాల తోను ఆనందోత్సాహాల మధ్య కేరింతలు కొడుతోంది. సౌధాగ్రం పై నుండి అయోథ్యా నగరం హడావుడిని  లోని చూచి ఆశ్ఛర్యపడింది మంథర. కారణం తెలుసుకొంది ఇక కార్యాచరణకు నడుం బిగించింది.రామ పట్టాభిషేకాన్ని భగ్నం చేసి, ఆ మహనీయుని అరణ్యాలకు పంపించడం ఆమె ముందున్న ప్రథాన కర్తవ్యం.

అసలు మంథర ఎవరు.?? మంథర ఈవిధంగా ప్రవర్తించడానికి కారణమేమిటి ? అన్నది ప్రశ్న.
         
    రామాయణంలో మంథర కైకేయి పుట్టింటినుండి తెచ్చుకున్న దాసీ వర్గంలోనిది.అందుకే వాల్మీకి జ్ఞాతిదాసీ యతోజాతా కైకేయ్యాస్తు సహోషితా  అన్నారు. {వా.2.7.1  }   
     
                           భారతంలో దుందుభి అనే గంధర్వాంగనే మంథర గా జన్మించిందని  “ puranic encyclopedia (p.603 )   చెపుతోంది.

                  సత్యోపాఖ్యాన రామాయణంలో మంథర  విరోచనుని పుత్రికగా చెప్పబడింది. దేవతలచే మోసగించబడి సంహరించబడిన తన తండ్రి ఋణం తీర్చుకోవడానికి , దేవతలపై యుద్ధంచేసి ఇంద్రుని వజ్రాయుధం చేత విగతజీవ యైంది. మరణిస్తూ తన మరణానికి ఇంద్రుని ప్రోత్సహించిన శ్రీమహావిష్ణువు నకు కష్టం కల్గించు దానను అనే కోరికతో మరణించి కేకయరాజు దాసీకి  కూతురు గా  జన్మించింది.  {ఆశ్చర్య.రా.2-60 ]

                   అగ్నిపురాణం లో రాముడు చిన్నప్పుడు మంథర యొక్క పాదాలను పట్టుకొని లాగి బాధించాడని , ఈ వైరమే రాముని వనవాసాన్ని మంథర ప్రోత్సహించడానికి కారణమైంది అని వ్రాయబడింది.

              అందుచే పూర్వ వైర వాసనయా పున: చింతయామాస రాఘవస్యాభిషేచనే  ఆశ్చర్యరామాయణ కర్త.           { ఆశ్చ. రా.2-73}      
                                                                                      
               అథ్యాత్మరామాయణం లో రాముడే కైకమ్మను ప్రార్ధించి అరణ్య వాసం విధింప చేసుకున్నాడని, మంథర నాలుకపైకి సరస్వతి ప్రవేశించి కైకమ్మను ప్రబోధించిందని వ్రాయబడింది .  ఆనంద రామాయణం లో కూడ రామాభిషేక విఘ్నార్ధ: మతస్వ     బ్రహ్మవాక్యత :“అంటూ దగ్గర దగ్గరగా అథ్యాత్మ రామాయణ వృత్తాంతమే ప్రస్తావించబడింది.


                      



                      కాని ఆధునికులలో కొందరు కవులకు మంథర గొప్ప విప్లవ రూపిణి గాను. గొప్ప రాజ్యతంత్రజ్ఞురాలిగా ను కన్పించింది  . కైకేయి కి, తద్వారా  రామచంద్రునకు ,లభించిన కీర్తికి   మంథర ఆలోచనలే  కారణమన్నంతగా  వీరి విశ్లేషణ  కొనసాగింది.
                   
         శ్రీ దుర్గానంద్  స్రవంతి మాసపత్రిక 1959 డిసెంబరు సంచికలో [పుట 50] “ మంథర అనే శీర్షిక తో   ఒక లఘుకావ్యాన్ని  వ్రాశారు.

           ఓ ప్రళయ యుగకారిణీ ! ఓసవిత్రీ!
            ఓ అరుణ రథ చోదకీ! ఓపురాణ
             సృష్టిరూపిణీ ! ఓపౌరుషేయవాణీ!
            ఓ అకాలఫలవతీ! ఓయుగ్రహేతీ!

            అంటూ సంబోధిస్తారు. వీరి దృష్టిలో మంథర ఒక మహావిప్లవానికి ప్రతీక. తరతరాల బానిస వృత్తి కొక తిరుగుబాటు.వంశపారంపర్య పరిపాలన కొక  అడ్డుకట్ట. మంథర ఒక మహోగ్ర ఝంఝ. .ఆనాడు పాతుకు పోయిన అనేక సనాతన దురాచారలను ఒక ఊపు ఊపి పునాదులతో పెకలించిన మహోగ్ర శక్తి మంథర.

                 ఒక మహాశిల్పి కి అందమైన శిలాఖండం కన్పిస్తే ఎలా ఊరుకోలేక పని కల్పించుకుంటాడో, అదేవిథంగా రాజ్యతంత్రజ్ఞ యైన మంథర సాకేత నగరాన్ని చదరంగపు పలక చేసుకొని మనుష్యుల మనస్సుల లోని దౌర్బల్యాన్నిఒక్కొక్క  బంటు గా వినియోగించుకుని ఆట కట్టించిన ప్రాజ్ఞ.

                       గంధపుకొండకు అగ్నిరాచి విడిచినట్లు కైకమ్మ వద్ద వరాల ప్రస్తావన తెచ్చింది మంథర. కైకను జ్ఞానవంతురాల్ని చేసింది. దీని వలన రాజమాత దాసిగా తనకు కలిగే లాభాని కంటే కైకమ్మకు వచ్చే కీర్తి  గొప్పదని భావించింది. 

                       ఇక్ష్వాకువంశానికి రావలసిన కీర్తిని, శ్రీ రామచంద్రునికి, తద్వారా కైకకు ప్రాప్తించవలసిన అజరామర యశస్సును  వారికే దక్కేటట్లు చేయడానికే  -- జ్ఞాతిదాసి గా మంథర ప్రయత్నించింది. సఫలీ కృత కార్య యైంది. తనలో ఎటువంటి స్వార్ధం లేకుడా కేవలం తాను సేవిస్తున్న వంశానికి భవ్యసేవ అందించాలనే ఆశయంతోనే మంథర ఆ పని చేసి రామచంద్రుణ్ణి అడవులకు పంపించగలిగింది.అందుకే ----


                 ఒకమహా కావ్యసంసృష్టి యొకతుఫాను
                  ఒక్క స్వాతి బిందు పతన మొక యుషస్సు
                   స్వార్ధ సంసిద్ధి  దడవియే జరుగు నొక్కో
                   లేదు మంథర నీ లోన లే దఘమ్ము.        34.వ.ప

              ఒకమహాకావ్య ఆవిర్భావం, ఒకస్వాతి బిందువు,ఒక ఉషస్సు. ఏ విధంగా స్వార్ధ రహితంగా సేవ చేస్తాయో అదేవిధంగా నిస్వార్ధసేవ చేసింది ఇక్ష్వాకువంశానికి మంథర. తన ప్రయత్నానికి ఆధారం కైక. ఉన్నవారిలొ మంచిది. మాయలేనిది. కొంచెంగా కోపమున్నా కొద్దిలో తగ్గిపోయేది ఆమెకే. అందులో ఆమె దశరధుని ముద్దులభార్య. ముఖ్యంగా తనరాణి. ఇన్ని అవకాశాలున్నాయి కాబట్టే  సేవాధర్మంతో  నిస్వార్దంగా మంథర తన పని పూర్తి చేసింది. లోకం చేత నిందించ బడినా కూడ  తన యజమానికి తాను సేవ చేశాననే తృప్తి మంథరకు మిగిలింది. సమస్త లోకానికి ఆయువు పట్టు యైన  రాముడు అయోథ్యలోనే ఉంటే ఎలా  అన్నఆలోచనే మంథర చేత  ఈ పని చేయించిందని  భావించారు కావ్య రచయిత        శ్రీ దుర్గానంద్.
                  
         అది రామాయణ కాలమైతే అందులో కైక ఉంటుంది. అచ్చట కైక ఉంటే ప్రక్కనే మంథర ఉంటుంది అన్నంత గా సమాజాన్ని ప్రభావితం చేశారు కైక మంథరలు.


*****************************************************************