Tuesday 21 June 2016

శతకసౌరభాలు -9 కాసుల పురుషోత్తమ కవి- ఆంథ్రనాయక శతకము- 2

శతకసౌరభాలు -9


కాసుల పురుషోత్తమ కవి
                      శ్రీకాకుళ
    ఆంథ్రనాయక శతకము- 2


                                         

                                             ఆంథ్రమహావిష్ణుని దివ్యమంగళ రూపము




                                       

                                                వరమిచ్చినట్టి శంకరుని కెగ్గు దలంచు
                      భస్మాసురుని పేరుఁ బాపినావు ,

తనయిల్లుఁ గాచు నుగ్రుని బోరుటకుఁ బిల్చు
            బాణుచేతులు తెగఁ బఱికినావు ,

తొలుమిన్కు లజుని మ్రుచ్చిలి గొన్న సోమకుఁ
 జంపి విద్యలు ధాత కంపినావు,

బలిమి దైత్యులు సుధాకలశము న్గొన వారి
 వంచించి సురలకుఁ బంచినావు ,

 నిఖిల దైవత కార్యముల్‌ నిర్వహించు
నీకు నిజకార్యము భరంబె నిర్వహింప!
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ!
                          హత విమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ!             (8)
                                
                                       శ్రీ కాకుళాంథ్రదేవా !  తనకు వరమిచ్చినటువంటి శంకరునికే హాని తలబెట్ట యత్నించిన భస్మాసురుని  నాశనం చేశావు. తన ఇంటికే కాపలా ఉంచుకున్న శివుని పై యుద్ధానికి  పూనుకున్న బాణాసురుని   చేతులను  తెగ నరికిన వీరుడవు కదా నీవు. వేదాలను అపహరించిన సోమకాసురుని చంపి  వేదాలను తిరిగి బ్రహ్మదేవుని కప్పగించావు.  అమృత కలశాన్ని ఎత్తుకు పోదామని చూసిన రాక్షసులను మోసపుచ్చి, అమృతాన్ని దేవతలకు  పంచిన జగన్మోహినివి  నీవే కదా!   సమస్తమైన దైవ కార్యాలను నిర్వహించే నీకు నీ స్వంత పనులు చేసుకోవడం భారమా ఏమిటి స్వామీ ! చిత్ర విచిత్రమైన ప్రభావములు కలవాడా !   శతృమూకలను చెండాడి, మమ్మల్ని రక్షించు స్వామీ.!

   
                                            
                                                      అచట లేవని కదా యరచేతఁ జఱచెఁ గ్రు
                                      ద్ధత సభా స్తంభంబు దానవేంద్రుఁ

డచట లేవని కదా యస్త్ర రాజం బేసె
                                              గురుసుతుం డుత్తరోదరమునందు

నచట లే వని కదా యతి కోపి ననిచెఁ
                                                 బాండవు లున్నవనికిఁ గౌరవకులేంద్రుఁ

డచట లే వని కదా యాత్మీయసభను ద్రౌ
                           పది వల్వ లూడ్చె సర్పధ్వజుండు 

లేక యచ్చోటులను గల్గలేదె ముందు
కలవు కేవల మిచ్చోటఁ గల్గు టరుదె
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ!
                                              హత విమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ!                                        (9)
                                        

                                   ఆంథ్రదేవా! నీవు అక్కడ లేవని భావించి కదా   ఆనాడు ఆ దానవేంద్రుడైన హిరణ్య కశిపుడు కోపంతో స్థంభాన్ని బ్రద్దల కొట్టింది. నీవక్కడ లేవని కదా అశ్వత్థామ  ఆనాడు ఉత్తరాగర్భం పై పాశుపతాన్ని ప్రయోగించింది. నీవక్కడ లేవనే కదా  దుర్యోధనుడు దుర్వాసుని రెచ్చగొట్టి పాండవుల చెంతకు పంపించింది.దేవా? నీవక్కడ లేవనే కదా ఆనాడు నిండు సభ లో ద్రౌపదీవస్త్రాపహరణానికి పూనుకున్నాడు దుశ్శాసనుడు. స్వామీ! ఆయా సమయాల్లో నీవు అక్కడ లేకుండానే అక్కడ ప్రత్యక్షమయ్యావు కదా! మరి ఇక్కడ ఉండి కూడ నీవు ప్రత్యక్షమవడం లో విశేషమేముంది. కావున నీవు ప్రత్యక్షమై ఈ శతృమూకలను చెండాడి, నీవు లేవనే వారికి కనువిప్పు కల్గించి మమ్మల్ని రక్షించు ప్రభూ!

అంచితాఖండదీపారాధనలచేత
      దీపించు నెప్పుడు దేవళంబు ,
                                                          

                                                     అగరుసాంబ్రాణి ధూపార్పణంబులచేత                                              భవనం బ దెప్పుడుఁ బరిమళించు ,  

నతినృత్యగీత వాద్యస్వనంబులచేత
                            నెప్పుడుఁ గోవెల యెసక మెసఁగు

 నఖిలోపచార సమర్పణంబులచేత
 మెఱయు నెప్పుడుఁ దిరుమేను కళల ,

నిపు డొకించుక లోభిత్వ మెనసి నట్లు
దోఁచుచున్నాఁడ విట్టియద్భుతము గలదె
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్యభావ  !
                                              హత విమతజీవ  !శ్రీకాకుళాంధ్రదేవ!                                   ( 10)
                                     

   శ్రీకాకుళాంథ్రదేవా ! నీ ఆలయం ఎప్పుడు  అఖండ దీపారాధన తో విరాజిల్లుతుంది. స్వామీ ? ఎప్పుడు నీ ఆలయం అగరు సాంబ్రాణి ధూప పరిమళాలతో పరిమళిస్తుంది తండ్రీ ? నృత్య గీత వాద్య విశేష ధ్వనులతో  నీ ఆలయం  ఏనాడు కళకళ లాడుతుంది స్వామీ ? షోడశోపచార సమర్పణ తో పవిత్రమైన నీ రూపము ఏనాడు ప్రకాశిస్తుంది స్వామీ ? ఎన్నెన్నో భోగాలను అనుభవించిన నీవు ఇప్పుడేదో పిసినారి తనం  పోతున్నట్టు గా కన్పిస్తున్నావు. నిజం గా ఇది ఆశ్చర్యం కల్గించే విషయమే. ఈ నాటకాలు మాని పూర్వవైభవం తో కూడిన నీ దేవళం లో మాకు కనుల పండువు గా నీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించు  స్వామీ !                                   
                                        


                                             భక్తి జేసిన శిలాప్రతిమ మాత్రమె  కాని
                                                              హరి యిందు గలుగునా యనెడి వారు
                                     
                                                     స్వామి యిందుండిన సత్యంబు జూపక
               యుండునే యని పల్కుచుండువారు

బుద్దావతారంబు బూనినాడఖిలంబుఁ
                గని కననట్లుండు ననెడువారు

 దేవతామహిమంబు దెలియునో యేమేని
                            నడువనున్నదో యని నుడువు వారు

నీకు నిత్యోపచారముల్ లేకయున్న
లోకులిట్లాడుకొండ్రు పరాకిదేమి
 చిత్రచిత్రప్రభావ ! దాక్షిణ్యభావ!
హతవిమతజీవ ! శ్రీకాకుళాంథ్రదేవ !    11

                                
                              శ్రీకాకుళాంథ్రదేవా! ఈ లోకం లోని జనులందరూ కూడ నిత్యార్చనలు జరగవలసిన నీ ఆలయం లో అవి జరక్కపోవడం చూసి  నలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. భక్తి తో ఏర్పాటు చేసిన శిలా ప్రతిమ మాత్రమే కాని ఇందులో హరి ఎందుకుంటాడు అంటున్నారు కొందరు. దీనిలో నిజం గా దేవుడుంటే తన మహత్మ్యాన్ని చూపకుండా ఉంటారా అనే వారు కొందరు , స్వామి బుద్దావతారాన్ని దల్చాడు .లేకపోతే చూసీ చూడనట్లు ఎందుకుంటాడనే వారు కొందరు, దేవతామహిమ లు ఎవరికి తెలుసు .ముందు ముందు ఏమి జరుగపోతోందో ననే వారు కొందరు,  ఇట్లా ఎవరి కిష్టమొచ్చినట్లు వారు మాట్లాడు కుంటున్నారు. ఇంకా పరాకెందుకు ? నీ మహిమను చూపి , వారందరి అనుమానాలను పటాపంచలు చేయవయ్యా స్వామీ !


                                      ధర నూటయెనిమిది తిరుపతులందు శ్రీ
     కాకుళం బరయఁ బ్రఖ్యాతమేని,

యాంధ్రనాయకుఁడ వం చఖిలదేశంబుల
                        నిన్నుఁ గీర్తించుటే నిజమయేని

వైఖానసోక్తికి వంచన రాకుండ
                           నెరలు చూపినమాట నిజమయేని

వైకుంఠుఁడవు స్వయంవ్యక్తిగా మర్చావ
 తార మొందినమాట తథ్యమేని

 వివిధ పూజోత్సవములు నిర్విఘ్నములుగఁ
                                                     జేసికొనకున్న నీకుఁ బ్రసిద్ధి గలదె
                                                       చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ!
                                                        హత విమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ!        12
                       

                         ఆంథ్రదేవా ! ఈ భూమి మీద ఉన్న నూటయెనిమిది తిరుపతులలో శ్రీకాకుళము పరమపావనమైన దైతే,సమస్తదేశముల వారు ఆంథ్రనాయకుడవని నిన్ను కీర్తించడం నిజమే ఐతే , అర్చకస్వామి మాట అబద్దం కాకూడదని నీ తలపై శిరోజాలను చూపించిన మాట సత్యమైతే, వైకుంఠవాసుడవైన నీవు,   నీకు నీవు గా స్వయంవ్యక్తుడవై అర్చామూర్తి గా వెలసిన మాట నిజమైతే, వివిధ ఉత్సవాలను, నిత్యపూజలను  నిర్విఘ్నం గా నిర్వర్తించు కోలేకపోతే నీ ప్రసిద్ది కి భంగమేర్పడుతుంది కదా స్వామీ ! నీకీర్తికి భంగం కలగడం నీభక్తులమైన మాకు మాత్రం ఆనందమా స్వామీ ! నీ మహిమను ప్రదర్శించి నిత్యపూజలు యథావిధి గా జరిపించుకో స్వామీ !!
                              
                 స్వామి శిరోజాల వృత్తాంతం ఇంతకు ముందే ప్రస్తావన కొచ్చింది.   మళ్లీ     తెలుసుకోవాలనుకునేవారు divyakshetralu.blogspot.com ’ లోకి వెళ్లి,                                        శ్రీకాకుళాంథ్ర మహావిష్ణువు దర్శనమ్’   అనే వ్యాసాన్ని చూడండి.

                                     
                                       
                                       అనంతామాత్యుడు నిర్మించినట్లుగా చెపుతున్న
                                                     శ్రీకాకుళ రాజగోపురము





                                       మానితంబుగ గరుత్మద్ధ్వజారోహణం
బెప్పుడొనర్తువో చెప్పుమయ్య!

 గరిమతో నీ తిరుక్కల్యాణసంభ్రమం
బెప్పు డెప్పుడొ వేగ చెప్పు మయ్య

రమతో మహోన్నతరథ మెక్కి తిరువీథు
లెప్పు డేతెంతువో చెప్పు మయ్య!

ధరణి నభ్యాగతదాన ప్రజాబృంద
మెప్పుడు బలియునో చెప్పు మయ్య!

వత్సరోత్సవ వీక్షణవాంఛ జనుల
కెపుడు ఫలియించునో యానతీయు మయ్య!
చిత్ర చిత్ర ప్రభావ !దాక్షిణ్యభావ!
                                    హత విమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ!                  13

                      స్వామీ ! స్పష్టంగా చెప్పు. ఎప్పుడు  కళ్యాణోత్సవం లో భాగంగా  నిర్వహించే గరుడ పతాకను ధ్వజస్థంభానికి ఏరోజున ఎగురవేస్తావో చెప్పు. నీ తిరుక్కళ్యాణ మహోత్సవం ఎప్పుడో త్వరగా చెప్పవయ్యా. లక్ష్మీదేవి తో కలిసి  రథం మీద కూర్చొని తిరువీథుల్లో ఎప్పుడు ఊరేగుతావో స్పష్టత నియ్యవయ్యా. నాలుగు దిక్కుల నుండి నీ కొరకు తరలి వచ్చే భక్తుల సంఖ్య ఎప్పుడు వృద్ధి చెందుతుందో చెప్పవయ్యా స్వామీ. ప్రతి సంవత్సరము పెద్ద ఎత్తున జరిగే  నీతిరునాళ్లను చూడాలనే నీ భక్తుల కోరిక ఎప్పటికి తీరుతుందో  సెలవీయవయ్యా స్వామీ !

                      శ్రీకాకుళం తిరునాళ్ళు చాల గొప్పగా జరుతుందనడానికి క్రీడాభి రామం లోని  కొన్నిపద్యాలు ఉదాహరణలు గా లభిస్తున్నాయి. క్రీడాభిరామం 14 వ శతాబ్దం లోని గ్రంధం.
                                   
                                            దవన పున్నమఁ గాకుళాధ్యక్షుఁడైన
                                        తెలుఁగు రాయడు  దేవతాధీశ్వరుండు
                                          భువన హితముగ నుత్సవంబవధరింప
                                          నందుబోయితిమి పోయినట్టి యేఁడు.     క్రీడా. 204 ప
                                                   
                                        కారవేల్లమ తల్లికా కల్పవల్లి
                                      కడుపునిండారఁ గాంచిన కొడుకు గుఱ్ఱ ,
                                        జార చోర మహాధూర్త చక్రవర్తి
                                         దేవ వేశ్యాభుజంగుడు , తెలుగుభర్త.      205 ప

అంటాడు మంచనభట్టు.
            
                      ఈ ఆంథ్ర వల్లభుని చరిత్రనే  వల్లభాభ్యుదయమనే  పేరుతో చంపూ కావ్యం గా భట్లపెనుమర్తి కోదండరామకవి  రచించాడు. బ్రహ్మాండ పురాంణాతర్గత వృత్తాంతాన్ని  ఈ కావ్యం లో ప్రస్తావించాడు.
                       ఈ గ్రంధాన్ని అనుసరించి ఆంథ్రమహావిష్ణువు గంగా తీరం లోని అహిచ్ఛత్రపురం నుండి కృష్ణా తీరానికి వచ్చి నిశుంభుడనే రాక్షసుని సంహరించి , కాకుళ నగరాన్ని రాజథాని గా చేసుకొని చాలకాలం పరిపాలించాడు.ఆంథ్రవిష్ణువు మరణానంతరం ప్రజలు అతనిపై గల భక్తి కొలది అతని విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించసాగారు. కొంతకాలానికి ఈ నగరం , దానితో పాటు విగ్రహం కృష్ణానది వరదల్లో కొట్టుకుపోయాయి. కాలాంతరం లో ఈ వంశానికే చెందిన సుమతి అనే చక్రవర్తి నగరాన్ని పునర్నిర్మించి , విగ్రహాన్ని పున: ప్రతిష్ఠ గావించాడు. మరికొంతకాలానికి కృష్ణానది వరదల్లో మళ్ళీ విగ్రహం కొట్టుకు పోయింది.
                                
            కాలక్రమంలో కంచిపై దండయాత్రకు వెడుతున్న అనంతభూపాలుడు శ్రీకాకుళ ప్రాంతం లో విడిది చేసి, పుర ప్రాకార ఆలయాదుల్ని పునర్నిర్మాణం  కావించాడు. ఆంథ్రనాయకుని విగ్రహం కోసం వెతుకుతుంటే అది వామన శర్మ ఇంటిలోని కాకరపాదు లో లభించింది . దాన్ని అనంతభూపాలుడు పున: ప్రతిష్ఠించాడని కోదండరామకవి  పురాణోచిత కవితా శైలి లో వివరించాడు.  ( కాసుల పురుషోత్తమకవి శతకద్వయ సౌందర్యము . కె.గిరిజాలక్ష్మి,పేజి 58 )
                        
                 అందుకే పైన ఉటంకించిన క్రీడాభిరామ కావ్యం  లో కారవేల్లమ తల్లికా కల్పవల్లి కడుపార గాంచిన కొడుకు కుఱ్ఱ అన్నాడు   కవి వల్లభరాయలు.
                        

                                         తగునట్లు తిరుమేను తా నామతింపుచు
మిన్న పీతాంబరం బున్న దనుచుఁ

గమలతోఁ బుట్టిన కౌస్తుభం బది పోవఁ
దక్కు సొమ్మది నీకు తక్కె ననుచు

లలితరత్న ద్యుతి మొలచినట్లు కిరీట
ముత్తమాంగముఁ బాయ కున్న దనుచు

మండితమాణిక్యకుండలంబులు కర్ణ
యుగళితోఁ బుట్టిన ట్లున్న వనుచు

నిండుకొన్నావు గడియించు నేరుపరివె
ప్రావలువ బ్రారువాణముల్‌ బ్రాఁతి యేమి?
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ!
హత విమతజీవ !శ్రీకాకుళాంధ్రదేవ!   14

                                       శ్రీకాకుళాంథ్రదేవా! పవిత్రమైన నీ శరీరాన్ని అలంకరించిన పీతాంబరం అలాగే ఉందిలే అనుకొని, లక్ష్మీదేవి తో పాటు లభించిన కౌస్తుభం పోయినా మిగిలిన హారాలు ఉన్నాయిలే అనుకొని , రత్నకాంతులు వెదజల్లు కిరీటమొకటి తలను వదిలిపెట్టకుండా ఉందిలే అని, మణి మాణిక్యాలతో కూడిన కుండలములు నీ చెవులను  అంటిపెట్టుకొని ఉన్నాయి లే అనుకొని ఆనందిస్తున్నావు కాని  పాతకాలపు నగలు , పాతకాలపు బట్టలను ధరిస్తున్న నీకు  కొత్తవి సంపాదించగల నైపుణ్యం  లేదా ఏమిటి స్వామీ !
                                        
                                             వంచన గాదె దివ్యక్షేత్రపతులలో
మంత్రార్థకృత్యము ల్మాని యున్న?

నపకీర్తిగాదె లోకాలోకములయందు
వత్సరోత్సవములు వదలి యున్న?

నగుబాటు గాదె యన్యమతస్థజనులలో
నిజదాసకోటి మన్నింపకున్నఁ?

బరిపాటి గాదె యల్పజ్ఞానమతులలో
దేవతామహిమంబుఁ దెలుపకున్న?

నేఁటిదా నీ ప్రతిష్ఠ వర్ణించి చూడఁ
బాడి దప్పిన బలునిందపాలు గావె?
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ!
హత విమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ!    15
               
                               శ్రీకాకుళాంథ్రదేవా! నీ ఆలయం లో మంత్రబద్ధంగా జరిగే నిత్యపూజలు జరక్కపోతే మిగిలిన పుణ్యక్షేత్రాలలోని దైవముల ముందు నీకు అవమానం కాదా. ప్రతిసంవత్సరము జరిగే  నీ తిరునాళ్లు, బ్రహ్మోత్సవాల వంటివి సక్రమంగా నిర్వహించకపోతే అది జనుల దృష్టి లో చిన్నతనం కాదా? నీ భృత్యులను  నీవు మన్నించక పోతే  అది అన్యమతస్థులైన జనులలో నీ భక్తులకు తలవంపు కాదా.? అవసరమైనప్పుడు నీ మహిమను ప్రదర్శించక పోతే  అల్పజ్ఞాన మతులలో నీవు తేలికై పోయి నీకు అది అవమానం కాదా ? నీ పరువు ప్రతిష్ట లు  ఈనాటివా స్వామీ!  ఆచార వ్యవహారాలు గాడి తప్పితే పలు నిందలపాలు కాక తప్పదు గదా ప్రభూ!



తిరునాళ్ళతఱి వచ్చెఁ బరిపరివిధముల
నెలమి సామగ్రిఁ జేయింప వేమి?

సేవకు లందందు సేవింప భావింప
తిరువీథుల రథంబుఁ ద్రిప్పవేమి?

వృజిన మెల్లఁ దొలంగు నిజ మంచుఁ బ్రజ లెంచు
పరమప్రసాదంబుఁ బంచవేమి?

దివ్య దేశం బిది తీర్థంబు సార్థంబు
చక్రతీర్థము కృప సలుప వేమి?

హఠము గావించి నీ యన్వయంబు లెత్తి
కీర్తి నిందఁగ వర్ణించి గేలిపఱతు
చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ!
హత విమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ!  16

                             శ్రీకాకుళాంథ్రదేవా!   తిరునాళ్ల సమయం వచ్చేసింది. అందుకు వలసిన వివిధ సాధన సంపత్తి ని సిద్ధం చేయించవేమిటి. నీ భక్తులు నిన్ను ఆయా కూడలి ప్రదేశాల్లో సేవించడానికి,  ధ్యానించడానికి , అనువుగా  తిరువీధు ల్లో రధాన్ని తిప్పవేమి. మా పాపాలనన్నింటిని తొలగిస్తుందని భావించి మేము సేవించే  పరమ పవిత్రమైన నీ ప్రసాదాన్ని మా అందరికీ పంచిపెట్టవేమిపవిత్ర ప్రదేశమైన ఈ దివ్యదేశము నందున్న చక్రతీర్థమనే కోనేరు ను  పవిత్రీకరించు. ఈ పనులు నీవు చేయకపోతే  నేను నీ ముందు హఠం వేసుకొని కూర్చుని , నీ గొప్పతన మంతటిని నిందారూపం గా  ఎగతాళి చేస్తాను . సిద్ధంగా ఉండు ప్రభూ.  అంటూ సవాలు విసిరాడు కవి.

                కవి తాను వ్యాజస్తుతి శతకాన్ని ఎందుకు చెపుతున్నాడో   ఈ పద్యం లో స్పష్టీకరించాడు. అన్నీ నువ్వు చేసుకో  నువ్వుచేసుకో అంటున్నాడు కవి అదెలా సాథ్యమనేది కొందరికి కలిగే సందేహం. కాని స్వామి తాను చేసుకోవడము అంటే   ఆ పనులు చేసే పుణ్యాత్ముడిని ఎవరినో   ఆ సమయానికి అక్కడికి పంపిస్తాడు. అతని ద్వారా తన పనులను చక్కబెట్టుకుంటాడు. ఇది ఎన్నోసార్లు ఎంతోమంది  భక్తవరుల విషయం లో నిరూపించబడింది. అదే ఇక్కడా జరిగింది. ఈ విధంగా హఠమెత్తిన భక్తకవి ఆంథ్రవాఙ్మయం లో మరొకడు లేడు.
                            దేవుని గుట్టంతా రట్టు చేసిన కవి బట్టుతనం వ్యర్థం కాలేదు. ఆ ప్రాంతాన్ని పాలించే దేవరకోట జమీ పాలకులుఈతని కవిత చే ప్రబోధితులై పూజలు యథావిధి గా జరిపించసాగారు. ఆంథ్రనాయక శతకం శక్తి అటువంటిది.
                               అనంతామాత్యుడు అనే కవి భోజరాజీయం అనే కావ్యం లో తన తాతగారైన  ముమ్మడి తిక్కవిభుడు
                                                  నెమ్మి ప్రత్యక్ష పరమ పదమ్మనంగ
                                                   నొప్పు శ్రీకాకుళంబున కొడయడైన
                                                    ఆంథ్రవల్లభ హరిసేవ నలరుచుండు
          -- వాడని ప్రశంసించాడు.
                                                                             మూడవభాగం త్వరలో -------
*********************************************