Saturday 30 January 2016

Na inta nilachipo Govinda by Dr.Sobharaj.

శతకసౌరభాలు -8 జయ జయ శ్రీనివాస- శ్రీవల్లి -1

శతకసౌరభాలు -8
 జయ జయ శ్రీనివాస- శ్రీవల్లి -1
            




                        జయజయ శ్రీనివాస అనే పేరుతో  రచయిత్రి శ్రీవల్లి రచించిన తేటగీతి శతకం ఇది .ఈ శతకం లో తిరుమల వాసుని దివ్యదర్శనానికి తహతహలాడే జీవుని వేదన   తేటతేట తెలుగు పదాలతో ముగ్ధమనోహరంగా వర్ణించబడింది.  ఆ తిరుమల వాసుని దర్శనం భూలోకవాసులకు కల్గించే ఆనందాన్ని అక్షరాల్లో వర్ణించడం  పదివేల పడగల ఆ ఆదిశేషువు కు కూడ అసాధ్యమన్న విషయం జగద్వితమే. ఆ ఆనంద నిలయుని సురుచిర సుందర రూపాన్ని ఎంతసేపు దర్శించినా తనివి తీరని తపన కోట్లాది మంది భక్తులకు అనుభవైకవేద్యమే .
                
                     రచయిత్రి  ఆ ఏడుకొండలవాని  అనంతమయ తేజోరూపాన్ని దర్శించి  పొందిన ఆనందం ,   ఆ పద్మావతీ ధవుని స్నిగ్ధ దరహాస చంద్రికలు తనను  నిలువెల్లా తడివి పులకరింపచేస్తే ఆ పులకలు ఆమని మొలకలై, కవితలు గా వెలికివచ్చి , తనివి తీరని ఆనందంతోశతకరూపాన్ని పొందాయి.
     
                       రచయిత్రి పేరు  శ్రీవల్లి యని ముఖపత్రం(Title page) మీద   ప్రకటించబడింది. కాని అది చూడగానే ఇది అసలు పేరు కాదేమో నని , కలం పేరు( Pen name) అయ్యుంటుందని అనిపించింది.  అందుకు ఆధారంగా 108 వ పద్యం లో-  
                
                                                 అందుకో అనురాగ మరంద పూర్ణ
                                        మన్న పూర్ణేశ్వరీ హృదయాంబుజమ్ము
                                       వందరేకులు వలపులు చిందుచుండె
                                         స్నిగ్ధ దరహాస! జయ జయ శ్రీనివాస!
              
                           శతకాన్ని పూర్తి చేసిన ఆనందం అన్నపూర్ణేశ్వరి హృదయం నుండి శతదళ పద్మమై వలపులను చిందించింది.  ఆ ఆనందనిలయుని పై ఒక అచ్చ తెలుగు ఛందస్సు లో తెలుగు వారి హృదయాలకు చేరువుగా ఒక  శతకాన్ని  వ్రాసి, ఆ తిరుమలగిరి రాయని కి సమర్పించిన ధన్యజీవి రచయిత్రి.   ఆ ఏడుకొండలవానికి తన చిరుపొత్తాన్ని అంకిత మిస్తూ ఇలా అంటుంది.
                   
                                             అణువణువు కూడ నీకె సమర్పితమ్ము
అక్షరమక్షరమ్ము నీ కంకితమ్ము
ఏడుకొండలసామి గ్రహింపవేమి
    స్నిగ్ధదరహాస! జయజయశ్రీనివాస!

                         ఈ శతకాన్ని 1980 కృష్ణాపుష్కరాల  ప్రచురణ గా  తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రచురించింది.  ముఖపత్రం మీద 1981 అని ,  ముఖపత్రం   చివరిపేజి క్రింద 15-1 82 అని , రెండవపేజీ లో 1980 అని ఉంది. నేను మాత్రం ఈ పుస్తకాన్ని 21-9-92 న పుష్కరవేళ  విజయవాడ లో కొన్నాను. ఎందుకంటే పాఠకులకు పుస్తకానికి సంబంధించిన ముద్రణ సమాచారాన్ని అందించడానికి మాత్రమే ఈ ప్రస్తావన.
             
                               ఈ  శతకం స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!” అనే మకుటం తో తేటగీతి ఛందస్సు లో వ్రాయబడింది.  ఈ శతకం లో 108 పద్యాలున్నాయి .  శ్రీ తిరుమల తిరుపతి  దేవస్ధానం వారు శ్రీనివాస బాలభారతి క్రమంలో ఈ గ్రంధాన్ని 17 వ గ్రంధం గా అందించింది.  ఈ జయజయ శ్రీనివాస అలతి అలతి పదాలతో మధురభక్తి భావ గుంఫితమై పాఠక హృదయాలను రసవాహిని లో ఓలలాడిస్తుంది. ఈ శతకం లో  రచయిత్రి కొన్నియెడల మీరాబాయి మధురభక్తి, కొన్నియెడల రాధాదేవి ప్రణయ తత్వాన్ని, మరికొన్ని యెడల గోపభామల పారవశాన్ని , పలుతావుల అన్నమయ్య ఆరాథనాభావాన్ని బహుభంగుల  ప్రదర్శించి , ఒకే నర్తకి  బహురూపుల నర్తించి రక్తి కట్టించినట్లు శ్రీ శ్రీవల్లి తిరుమలవాసుని శ్రీచరణ మంజీరమై నర్తించి తరించింది.
                   
                            ఇటువంటి  రచనకు నాలుగు మాటలు వ్రాసే భాగ్యం  నాకు లభించడం ఆ తిరుమలవాసుని అనుగ్రహం గానే భావిస్తున్నాను.
                 
                                ఓం నమో వేంకటేశాయ.

శ్రీకరంబైన తిరుమల శిఖరి కరుణ
కాకరంబైన దివ్యమహస్సు దాల్చి
ఆర్తులను బ్రోచు కళ్యాణమూర్తి వీవు
స్నిగ్ధదరహాస! జయజయశ్రీనివాస!

                సర్వ శుభములను అందించెడి ఈ తిరుమల కొండపై కరుణాసముద్రుడవై నిలిచి ,దివ్యమైన మహత్వముతో ఆర్తులను ఆదుకొనెడి  చిరుదరహాస భాసా ! తిరుమలవాసా !  శ్రీనివాసా! జయము. జయము. నీకు జయమగు గాక !.

ఏడుకొండలపైన  నీరేడు జగము
లేడు గడ యంచు నమ్మి నిన్ వేడుకొనగ
నిండుకొలువున్న బంగారుకొండ వీవు
స్నిగ్ధదరహాస! జయజయశ్రీనివాస!

                            ఆపద మొక్కుల వాడా ! అడుగడుగు దండాల వాడా!  ఈ ఏడేడు లోకాలకు  రక్షకుడవు నీవే నని నమ్మి నిన్ను ప్రార్ధించగా ఏడుకొండలపైన నిండుగా కొలువున్న బంగారు కొండవు నీవు. సుమ సుందర దర హాసా ! తిరుమల వాసా ! నీకు జయము. జయము.


మోహ గాఢాంధ కార విమోచనములు
సురుచిరోదార చైతన్య సూచనములు
లోక బాంధవ నీ దివ్యలోచనములు
స్నిగ్ధదరహాస! జయజయశ్రీనివాస!

                   సుమధుర సుందర దరహాసా ! శ్రీ  శ్రీనివాసా ! నీ దివ్య నేత్రములు మోహమనే గాఢాంధకారాన్ని తొలగించి , కాంతిమయమైన చైతన్యాన్ని దర్శింపచేసి , సర్వలోకాలను తేజోమయం చేసేవి స్వామీ ! .


విశ్వ విశ్వంభరా పర్యవేక్షణములు
రచిత నిత్య జగత్త్రయ రక్షణములు
వేంకటేశ్వర భవదీయ వీక్షణములు
స్నిగ్ధదరహాస! జయజయశ్రీనివాస!
                        
                              శ్రీవేంకటేశ్వరా ! నీయొక్క చల్లని చూపులు సమస్తమైన విశ్వాన్ని అవలోకిస్తూ , ముల్లోకాలను సర్వ వేళలా సంరక్షిస్తూ ఉండేవి కదా స్వామీ !.

సరస రాకా సుధాకర స్వామి వీవు
నిండు గుండెల పండువెన్నెలను నేను
పొరలి ప్రవహింతు నీ శుభంకర కరాల
స్నిగ్ధదరహాస! జయజయశ్రీనివాస!
                      
                      శ్రీ శ్రీనివాసా ! నిండుపున్నమి చందమామవు నీవు.  నిండుగా గుండెలను పులకరింప జేసెడి పండువెన్నెలను నేను.  శుభంకరమైన నీ చేతులలోచేరి పులకించి ప్రవహిస్తాను ప్రభూ !.

              చిద్వలాసుడైన శ్రీనివాసుని చేతులలో లీలగా  వెన్నెల సోనగా వాలి సోలి పోవాలనే మధురమైన కోరిక రచయిత్రిది.                                         


                                       నిత్య పరిపూర్ణ రసపయోనిధి వి నీవు
లలిత లావణ్య శృంగార లహరి నేను
కలసి పోయెద నీ తరంగముల స్వామి
స్నిగ్ధదరహాస! జయజయశ్రీనివాస!
                      
                           ముగ్ధ మనోహర సుందర హాస భాసా ! శ్రీ శ్రీనివాసా ! నీవు నిత్య పరిపూర్ణ రసాంబుధివి. నేను లలిత లావణ్య శృంగార ప్రవాహమునై, నీ తరంగముల   ,కలసిపోయి నీలో లీనమై పోతాను స్వామీ !.                        
                       
                                   పతితపావన వేదసంహితవు నీవు
పరమ సుకుమార భాస్వర స్వరము నేను
నీ పదము లంటి చరియింపనిమ్ము నన్ను
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!
                    
                   శ్రీ ఏడుకొండల వేంకటేశ్వరా!  పరమ పవిత్రమైన వేదసంహితవు నీ వైతే నేను  వేదమును ప్రకాశింపచేసెడి పరమ సుకుమార స్వరాన్నై నీ పాదాల నాశ్రయించి తరించే భాగ్యాన్ని  నాకు ప్రసాదించు స్వామీ !.

 ముగ్ధమోహన గోపాలమూర్తి వీవు
కావి కెమ్మోవి పిల్లన గ్రోవి నేను
సృష్టి పులకింపగా ధ్వనించెదను నేను
స్నిగ్ధదరహాస! జయజయశ్రీనివాస!

               తిరుమలగిరి వాసా ! నీవు  ముగ్ధ మోహన సుకుమార సుందర మోహన రూపుడవైన గోపాలుడవు నీవు.  మధురమైన నీ ఎఱ్ఱని పెదవి పై రాగాలు పలికెడి వేణువు నేనై ఈ సృష్టి సర్వము పులకించేటట్లు  మధురంగా ధ్వనిస్తాను ప్రభూ !.
                తిరుమల వాసుని గూర్చి వచ్చిన గ్రంథాలు చిన్నవి, పెద్దవి కలిపి లక్షల్లో ఉండి ఉండవచ్చు. వానిలో తాను కూడ కలిసిపోయి ఆ కమలానాథుని  వర్ణించిన ఒక రచయిత్రి గా మిగిలిపోవాలని శ్రీ శ్రీవల్లి కోరిక. అందుకే ఆ మోహనరూపుని  పిల్లనగ్రోవిని తానై సృష్టి పులకించగా ధ్వనిస్తానని  కోరుకుంటోంది. ఈ జయజయశ్రీనివాస అనే పిల్లన గ్రోవి సృష్టించిన కవనమే మధుర నాదమే ఈ  సృష్టి ని పులకింప చేస్తుందని కవయిత్రి మాటల్లో ధ్వని.

 నిత్య సుందర సాహిత్య సత్య మీవు
విశ్వ మంగళ భావనావేశ మేను
అంకితమ్మౌదు నీదు ప్రేమాంకము నకు
    స్నిగ్ధదరహాస! జయజయశ్రీనివాస!   (15)
                   
                     శ్రీ పద్మావతీ మనోహరా ! సత్యము నిత్యము  సుందరము నైన సాహిత్యానివి నీవైతే  విశ్వ శుభంకరమైన భావావేశాన్ని నేనై   ప్రేమమయ మైన నీ అంకసీమ  ఒదిగిపోయి నన్ను నీకు అంకితం చేసుకొని నీలో లీనమై పోదును స్వామీ !

                              
                                 నిత్య కళ్యాణ సౌందర్య నిధివి నీవు
వికచ సురభిళ వకుళ మాలికను నేను
నీదు గళసీమ నన్ను రాణింప నిమ్ము
స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!
                  
                                శ్రీనివాసా ! నీవు నిత్యకళ్యాణ సౌందర్య రాశివి. నేను వికసించి పరిమళించెడి పొగడ పూల మాలికను. ఈ పొగడపూల మాల  నీ గళసీమ ను అలంకరించెడి  అదృష్టాన్ని  ప్రసాదించు ప్రభూ ! .


నిర్మలంబైన శబ్దసన్నిధివి నీవు
యోగ్యమైనట్టి భావసౌబాగ్య మేను
లోకమున చిల్కెదము రసశీకరములు
స్నిగ్ధదరహాస! జయజయశ్రీనివాస!
               శ్రీనివాసా !  నీవు శక్తి వంతమైన శబ్దానివి. నేను  అర్ధవంతమైన భావ సౌభాగ్యాన్ని. మనమిద్దరము ఏకమై ఈ లోకాన రసబిందువులను చిలకరిద్దాము.
                       కవికులతిలకుడైన మహాకవి కాళిదాసు  పార్వతీ పరమేశ్వరుల యోగాన్ని వాగర్ధాలతో ఉపమించిన వైనం  రసజ్ఞులకు  పరిచయ పూర్వమే. ఆ శ్లోకాన్ని ఒక్కసారి మననం చేసుకుందాం.

వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ :ప్రతిపత్తయే
     జగత: పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ !!
                           
                                     
                                    ముగ్ధ మోహన కారుణ్యమూర్తి వీవు
సరస మంజుల కరుణారసమ్ము నేను
కరగి ప్రవహింతు నీ వాలుగనుల యందు
      స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!    (18)
                        
                              శ్రీ వేంకటేశా !  ముగ్ధమోహన  కారుణ్య మూర్తివి నీవు .  సరస మంజుల కరుణ రసాన్ని నేను. కరుణరసమైన నేను కరిగి  కారుణ్య మూర్తి వై, భక్తులను కటాక్షించెడి  నీ వాలు కనుల  నుండి ప్రవహించెడి  భాగ్యాన్ని  నాకు ప్రసాదించు స్వామీ ! .


నీవు నటరాజు నేను నీ పావనాంఘ్రి
కాపురంబుండు సౌవర్ణ నూపురమును
పొంగి పులకింతు నీ నాట్య భంగిమముల
     స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస!    (20)
                  
                     సుందర దరహాసా ! శ్రీ శ్రీనివాసా ! నీకు జయము. నీవు  నటరాజమూర్తివైతే నేను నీ పవిత్ర పాదముల నంటిపెట్టుకొని ఉన్న  బంగారు మువ్వనై  , నీవు నర్తించెడి     వివిధమైన  నాట్యభంగిమల  పొంగి పులకించి పోతాను. నీ పాద మంజీరమై జీవించెడి అదృష్టాన్ని నాకు కల్గించు ప్రభూ!.

                                  ముగ్ధ సంగీత శృంగారమూర్తి వీవు
సరస సాహిత్య సౌందర్య సార మేను
 అల్లుకోనిమ్ము  నీ తనూవల్లి  నిండ
         స్నిగ్ధ దరహాస! జయజయ శ్రీనివాస! (21)
               
             తిరుమలగిరి వాసా ! మధుర మోహన సంగీత శృంగార రసైక మూర్తివి నీవు. సరస సాహిత్య సౌందర్య సారాన్ని నేను. సన్నని తీగ వంటి నీ సుందర మైన శరీరాన్నంతటిని నన్ను గాఢంగా  అల్లుకోనిమ్ము స్వామీ !  నీకు జయయ మగు గాక !
                                                                    
                                          
                                                                       రెండవ భాగం  త్వరలో-----

*******************************************


Tuesday 5 January 2016

శతకసౌరభాలు -7 శేషప్ప కవి - నరసింహశతకము .7


శతకసౌరభాలు -7

       శేషప్ప కవి  - నరసింహశతకము .7




హరి నీకు బర్యంకమైన శేషుడు చాల బవను బక్షించియు బ్రతుకుచుండు
ననువుగా నీకు వాహనమైన ఖగరాజు గొప్పపామును నోట గొఱుకుచుండు
యది గాక నీ భార్య యైన లక్ష్మీదేవి దినము పేరంటమ్ము దిరుగుచుండు
నిన్ను భక్తులు పిల్చి నిత్యపూజలు చేసి ప్రేమ పక్వాన్నముల్ బెట్టుచుండ్రు
స్వస్ధముగ నీకు గ్రాసము జరుగుచుండ గాసు నీ చేతి దొకటైన గాదు వ్యయము
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.
            

         శ్రీ ధర్మపురి లక్ష్మీనరసింహా !నీకు పాన్పు గా నున్న ఆది శేషువు గాలిని మేసి బతికేస్తున్నాడు. నీకు వాహనమైన గరుత్మంతుడు  పాములను తింటూ జీవిస్తున్నాడు. నీ ఇల్లాలైన లక్ష్మీదేవి రోజూ  పేరంటాలంటూ ఇంటింటికి తిరుగుతూ ఉంటుంది. ఇక నీ సంగతి చూస్తే నిత్యము నీ భక్తులు పిల్చి నిత్యపూజలు చేసి ప్రేమతో పంచభక్ష్య పర మాన్నాలను  వడ్డిస్తూ ఉంటారు.  నీ చేతిదొక్క పైసా అయినా ఖర్చు కాకుండా రోజులు ఇంత హాయిగా గడిచిపోతున్నాయిగా స్వామీ!

           తను  దిన గ్రాసానికి  అంటే రోజు గడవడానికి నానా బాధలు పడుతుంటే  నీవు మాత్రం హాయిగా పైసా ఖర్చులేకుండా బ్రతికేస్తున్నావని కవి భగవంతుని ఆక్షేపిస్తున్నాడు అంటే నా బతుకు ఇంత దరిద్రం చేసి నీవు మాత్రం సుఖంగా ఉన్నావా! నన్ను ఉద్ధరించు స్వామీ! అని వేడుకుంటున్నాడు.

పుండరీకాక్ష నా రెండు కన్నుల నిండ-నిన్ను జూసెడి భాగ్య మెన్నడయ్య
వాసిగా నా  మనోవాంఛ దీరెడునట్లు సొగసుగా నీరూపు జూపవయ్య
పాపకర్ముని కంట బడక పోవుద మంచుఁ-బరుషమైన బ్రతిజ్ఞ బట్టినావ
వసుధ లోఁ బతిత పావనుడ వీవంచు నేఁ బుణ్యవంతుల నోట బొగడవింటి
నేమిటికి విస్తరించె నీ కింత కీర్తి ద్రోహి నైనను నా కీవు దొరకరాదె
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.
                   
               శ్రీ ధర్మపుర నివాసా! లక్ష్మీనరసింహ !సహస్ర దళ కమలాలవంటి విశాలమైన నేత్రాలు కలిగిన మనోహర రూపా! కన్నుల నిండుగా నీ రూపాన్ని దర్శించగలిగిన భాగ్యము నా కెప్పుడు తండ్రీ! నలుగురికి నేను చెప్పుకోగలిగిన తీరులో  మనోజ్ఞమైన నీ రూపాన్ని నాకు చూపించు తండ్రీ! ఈ పాపాత్మునికి కన్పించ గూడదని కఠినమైన  ప్రతిజ్ఞ ఏమైనా  చేశావా తండ్రీ! కాని ఈ లోకం లో పతితపావనుడవు నీవే నని పుణ్యాత్ములు చెపుతుంటే నేను విని నిజమనుకున్నాను తండ్రీ! నీకీర్తి ఇంత గొప్పగా నలుచెఱగుల  వ్యాపించి ఉంటే దుర్మార్గుడనైన నాకు కూడ కన్పించ రాదా ప్రభూ!.

             నీలమేఘశ్యామ నీవె తండ్రివి మాకు-కమలవాసిని మమ్ము గన్నతల్లి
నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్-నీ కటాక్షము మా కనేకధనము
నీ కీర్తనల్ మాకు లోక ప్రపంచంబు- నీ సహాయము మాకు నిత్య సుఖము
నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్య- నీ పద ధ్యానంబు నిత్య జపము
తోయజాతాక్ష నీ పాద తులసిదళము-రోగముల కౌషధము బ్రహ్మవినుత
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.
         
                   శ్రీ ధర్మపుర నిలయా! నారసింహా!  నీలమేఘవర్ణుడా! నీవె మాకు దిక్కు. కమలాలయ యైన లక్ష్మీమాతయే మాకు తల్లి. నీ భక్తజనులంతా మాకు నిజమైన బంధువులు.  కరుణ తో నిండిన నీ చూపే మాకు అష్టైశ్వర్యాలు. నీ కీర్తనలే మాకు లోకము. నీ సహాయమే మాకు నిత్య సుఖము. నమో నారసింహాయయనెడి నీ నామ మంత్రమే మాకు నిష్కళంకమైన విద్య. నీ పాదములను జపించుట కంటే మించిన జపము వేఱొకటి లేదు. బ్రహ్మ, రుద్రాదుల చేత పొగడ బడిన నీ పాదముల చెంత ఉంచబడిన తులసి దళమే సకల రోగములను పోగొట్ట గల్గిన దివ్యౌషధము తండ్రీ!.



జందెమింపుగ వేసి సంధ్య వార్చిన నేమి- బ్రహ్మ మందక కాడు బ్రాహ్మణుండు
తిరుమణి శ్రీచూర్ణ గురు రేఖ లిడినను విష్ణునొందక కాడు వైష్ణవుండు
బూదిని నుదుటను బూసుకొనిన నేమి-శంభునొందక కాడు శైవజనుడు
కాషాయవస్త్రాలు గట్టి కప్పిననేమి-యాస పోవక కాడు యతి వరుండు
ఇట్టి లౌకికవేషాలు గట్టుకొనిన గురుని చెందక సన్ముక్తి దొరకబోదు
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.
              
            శ్రీ ధర్మపురనిలయా! మెరుస్తున్న జంధ్యాన్ని వేసుకొని , మూడు పూటలా సందెవార్చినంత మాత్రాన బ్రాహ్మణుడు కాడు. బ్రహ్మజ్ఞానము నందిన వాడే బ్రాహ్మణుడు. పెద్ద పెద్ద నామాలు ధరించి నంత మాత్రాన వైష్ణవుడు కాడు. విష్ణువు ను తెలుసుకున్న వానినే వైష్ణవుడంటారు.శంకరుని తెలిసికోకుండా ఒంటినిండా విభూతి  పూసుకున్నంత మాత్రాన శైవుడు కాజాలడు గదా.   అలాగే ఆశ లు వదిలి పెట్టని వాడు కాషాయాలు కట్టుకున్నా యతివరుడు కాలేడు కదా! కావున నరసింహ ప్రభూ! లౌకిక వేషాలు  ఎన్ని ధరించినా  గురువును ఆశ్రయించి బోధ పొందని యెడల ముక్తి లభించదని  ఎల్లరూ తెలుసుకోవాలి.

పలు రోగములకు నీ పాదతీర్ధమె కాని- వలపు మందులు నాకు వలదు వలదు
చెలిమి చేయుచు నీకు సేవచేసెద కాని నీ దాసకోటిలో నిలపవయ్య
గ్రహ భయంబునకు జక్రముఁ దలంచెదఁ గాని- ఘోర రక్షలు కట్ట గోరనయ్య
పాముకాటుకు నిన్ను భజన చేసెదఁ గాని దాని మంత్రము నేను దలపనయ్య
దొరికితివి నాకుఁ దండ్రి వైద్యుడవు నీవు-వేయికష్టాలు  వచ్చిన వెఱవనయ్య
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.
                     
                   శ్రీ నరసింహ ప్రభూ! సమస్త రోగములకు నీ  పాదతీర్ధమే కాని  ఇతర మందులు నాకు  ఏనాడూ వద్దు. నీతో సఖ్యభక్తి నెఱపి నీకు సేవ చేసుకుంటాను గాని నీ భక్తకోటిలో ఒకడి గా నన్ను కూడ  ఉండేటట్లు అనుగ్రహించు స్వామీ! భూత ప్రేత పిశాచాది గ్రహ బాధలు సంభవిస్తే సుదర్శన చక్రాన్ని తలుచుకుంటాను గాని తాయెత్తులు , రక్షరేకులు అంటూ ఆరాటపడను స్వామీ !  నన్ను పాము కాటు వేస్తే నీ నామ జపమే చేస్తాను గాని  పాము మంత్రం కోసం పాకులాడను స్వామీ ! స్వామీ !. నారసింహ ప్రభూ!. మెండైన వైద్యుడవు నీవు నాకు దొరికావు. .ఇంకపైన  ఎన్నికష్టాలు వచ్చినా నేను భయపడనయ్యా!.
                                            
                             ఈ పద్యం చదుతుంటే దొరికెను నాకు వేంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను అంటూ ఆనంద తాండవం చేసే  సంకీర్తనాచార్య అన్నమాచార్య మన ముందు ప్రత్యక్షమౌతాడు. భక్తవరుల తాదాత్య్మత కు, పారావశ్యానికి హద్దులు లేవు కదా.!

పంజరంబునఁ గాకి పట్టి యుంచిన లెస్స పలుకునే వింతైన జిలుక వలెను
గార్ధభంబును దెచ్చి కళ్ళెమింపుగ వేయఁ దిరుగునే  గుఱ్ఱంబు తీరుగాను
ఎనుపబోతును మావటీడు శిక్షించిన-నడచునే మదవారణంబు వలెను
పెద్దపిట్టను మేతఁబెట్టి పెంచినఁ గ్రొవ్వి సాగునే వేటాడు డేగ వలెను
కుజనులను దెచ్చి నీ సేవ కొఱకుఁ బెట్టి వాంఛతోఁ జేతురే భక్తవరుల వలెను
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.
                               

                      శ్రీ ధర్మపుర నివాసా! రత్నాభరణ భూషా! లక్ష్మీనరసింహా! నీ సేవకులు గా నియమించబడే వారు నీ భక్తులైతే మక్కువతో నీకు సేవ చేస్తారు గాని దుర్మార్గులను తెచ్చి నీ సేవకులు గా పెడితే వారు నీ భక్తుల వలే సేవ లందించలేరు. వారి లోని దుర్మార్గం, స్వార్ధప్రవృత్తి వారిని అవినీతి మార్గాలను పట్టిస్తుంది కదా! ఏ విధంగా నంటే కాకి ని పట్టుకొచ్చి పంజరం లో పెట్టినంత మాత్రాన అది చిలుక పలుకులు పలకలేదు . గాడిద ను పట్టుకొచ్చి అందం గా కళ్ళాన్ని తగిలించినా  అది గుఱ్ఱం వలే తిరగ లేదు కదా. ఎనుబోతు కు మావటి వాని చేత చక్కని శిక్షణ ఇప్పించినా కూడ అది మత్తగజం వలే నడవలేదు కదా. ఒక పెద్ద పిట్టను తెచ్చి పుష్టి గా మేపినా కూడ అది డేగ వలే వేటాడ గలుగు తుందా! లేదు కదా! అలాగే దుర్మార్గులను నీ ఆలయాలకు ధర్మకర్తలు గానో  , అధికారులు గానో నియమించినా వారు పూర్వపు టలవాట్ల ను మర్చిపోయి నీ భక్తులు గా నిన్ను సేవించుట అసంభవము.

నిగమాది శాస్త్రముల్ నేర్చిన ద్విజుడైన యజ్ఞకర్తగు సోమాయాజియైన
ధరణి లోపల ప్రభాత స్నాన పరుడైన- నిత్య సత్కర్మాది నిరతుడైన
నుపవాస నియమంబు నొందు సజ్జనుఁడైన గావి వస్త్రము గట్టు ఘనుడు నైన
దండి పోషక మహా దానపరుండైన సకల యాత్రలు సల్పు సరసుడైన
గర్వమునఁ గష్టపడి నిన్ను గానకున్న మోక్షసామ్రాజ్య మొందడు మోహనాంగ
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.
                          
                 శ్రీ ధర్మపుర నివాసా! మోహనరూపా! నరసింహా.వేదాధ్యయనం చేసిన బ్రాహ్మణుడైనా , యజ్ఞకర్తయైన సోమయాజియైనా , ప్రాత కాలం లో లేచి  స్నాన , సంధ్యావందనాదు లాచరించే శ్రోత్రీయుడైనా,  ఎల్లవేళలా సత్కర్మల నాచరించే ఉత్తముడైనా, ఉపవాస నియమములను పాటించు వ్రతుడైనా , కాషాయము ను ధరించు యతి యైనా, షోడశ మహాదానములను చేసిన దాతయైనా , సమస్త తీర్ధయాత్రలను సలుపు ఘనుడైనా గర్వం తో నిన్ను దర్శించకుండా ఉంటే మాత్రం ముక్తిని పొందలేడు. ఇది నిజము  .

పక్షివాహన నేను బ్రతికి నన్ని దినాలు కొండెగాండ్రను గూడి కుమతి నైతి
అన్నవస్త్రము లిచ్చి ఆదరింపుము నన్ను - కన్న తండ్రివి నీవె కమలనాభ
మరణమయ్యెడి నాడు మమతతో నీయొద్ద-బంట్ల దోలుము ముందు బ్రహ్మజనక
ఇనజ భటాళి ఈడిచి కొనిపోక- కరుణతో నాయొద్దఁ గావలుంచు
కొనకు నీ సన్నిధి కిఁ బిల్చుకొనియు నీకు-సేవకునిఁ జేసికొనవయ్య శేషశయన
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!
              
              ధర్మపుర నివాసా! గరుడవాహనా! నేను బ్రతికినన్ని రోజులు కొండెగాళ్లను చేరి దురాలోచనలతో దుర్మార్గుడనయితి. ఇప్పుడు అన్నవస్త్రముల నిచ్చి ఆదుకోవలసింది నీవే నాకు కన్నతండ్రివి కమలనాభా. నాకు మరణం సంభవించినప్పుడు యమభటులు లాక్కుపోకుండా నాపై దయఉంచి  నీ సేవకులను కాపాలా ఉంచి , చివరలో  నీ దగ్గరకు  పిలిపించుకొని నీ సేవకుడిగా చేసికొనవలసినది  శేషశయనా!.



అతిలోభులను భిక్షమడుగఁ బోవుట రోత తన ద్రవ్యమొకరింట దాచరోత
గుణహీనుడగు వాని కొలువుఁగొల్చుట రోత-యొరుల పంచలక్రింద నుంట రోత
భాగ్యవంతుని తోడఁ బంతమాడుట రోత గుఱిలేని బంధుల గూడ రోత
యాదాయములు లేక యప్పుఁ దీయుట రోత జారచోరుల గూడి చనుట రోత
యాది లక్ష్మీశ నీ బంటు నైతినయ్య యింక  నెడబాపు జన్మం బదెన్న రోత
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.

                    శ్రీ లక్ష్మీనరసింహా! పిసినారులను యాచించడం  అసహ్యం.మన డబ్బును ఒకరి దగ్గర దాచుకోవడం అసహ్యం. గుణ హీనుని వద్ద కొలువు చేయడం , పరాయి పంచన బ్రతకడం అసహ్యం. ధనవంతుని తో పంతమాడటం ,  మన మీద గౌరవం లేని బంధువులతో కలిసి తిరగడం అసహ్యమే.సంపాదన లేకుండా అప్పులు చేయడం, దొంగలు , వ్యభిచారుల తో  స్నేహం గా తిరగడం  కూడ అసహ్యకరమైన పనులే. హే లక్ష్మీనాథా! నేను నీ సేవకుడను. ఈ బతుకంటేనే అసహ్యమేస్తోంది. నన్ను కడతేర్చి కాపాడు తండ్రీ!




శేషప్ప యను కవి చెప్పిన పద్యముల్- చెవుల కానందమై చెలగు చుండు
నే మనుజుండైన నెలమి నీ శతకంబు - భక్తితో విన్న సత్ఫలము కలుగు
జెలగి  పద్యముల్ చేర్చి వ్రాసినవారు కమలాక్షు కరుణను గాంతురెపుడు
నింపుగా పుస్తకం బెపుడు పూజించిన దురిత జాలంబులు తొలగిపోవు
ఇద్ది పుణ్యకరంబని యెపుడు జనులు కష్టమనక పఠించినం గలుగు ముక్తి
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!-దుష్టసంహార! నరసింహ! దురితదూర!.(100)
                              
                      శ్రీ ధర్మపురి  నరసింహా ! హే లక్ష్మీనాథా! శేషప్ప అను పేరు కలిగిన ఈ కవి చెప్పిన పద్యములు చెవులకు ఆనందాన్ని  ఇస్తాయి. ఏ మానవుడైనా భక్తితో సంతోషంగా  ఈ శతకాన్ని విన్నట్లైతే మంచి ఫలితాలు ప్రాప్తిస్తాయి. ఈ పద్యాలను చూసి కుదురు గా మరల వ్రాసి నట్లైతే  వారికి ఆ కమలనాథుని అనుగ్రహం లభిస్తుంది. ఈ పుస్తకాన్ని ఎవరు ఎప్పుడు పూజించినా వారి పాపములు , బాధలు తొలగిపోతాయి. ప్రజలు ఈ కార్యము కష్టమనుకోకుండా  భావించి , పుణ్యకార్యం గా తలంచి ఈ పుస్తకాన్ని చదివినచో  ఆ ధర్మపుర నివాసుడైన లక్ష్మీనారాసింహుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడని   కవి ఆశంస.
                    

                       ఇది శేషప్ప కవి రచించిన నరసింహ శతకము నకు

                                  తేజస్వినీ వ్యాఖ్య సంపూర్ణము.
 *****************************************