Friday 26 October 2012

రామాయణము-రమణీయకథనాలు-9 విశ్వనాథ వారి మాండవి


                              కవిసామ్రాట్ విశ్వనాథ వారి  మాండవి { వాసంతిక}

                మాండవి  భరత రాజేంద్రుని ఇల్లాలు. అయోధ్యానగర సార్వభౌముని  ధర్మపత్ని గా వాల్మీకిమహర్షి చేతనే కాదు అనంతర కాలికులు ఎవ్వరి చేతను దర్శించబడని సౌందర్యం ఈమెది. కుశధ్వజుని కొమార్తె గా, భరతుని పాణిని గ్రహించి , అయోధ్యా నగర రాజప్రాసాదంలోకి  అడుగుపెట్టింది. మిథిలానగరం నుండి వచ్చి  దేవతాపూజాదికాలు పూర్తిచేసుకొని అంతపురం లో అడుగు పెట్టిన ఈమె తిరిగి కనబడదు వాల్మీకంలో.
              
          మాండవి పాంచ జన్యశక్తి గా మార్కండేయ పురాణంలో చెప్పబడింది. వాసన్తిక అను కన్యతో శ్రీమహాలక్ష్మి ప్రస్తావన పరంగా....
                               అయం మమపతి శ్ర్శీమాన్ శేషేణ చ  దరేణ చ
                               సుదర్శనేన సాకేత గృహే దశరథస్య చ
                                           ****************************
             
                                      శక్తి స్తు పాంచజన్యస్య మాండవీ తి ప్రకీర్తితా            మార్కం.పు. ఉత్త. 1వ.అ

                          అని పాంచజన్యశక్తి యే   మాండవి గా  చెప్పబడింది. కవిసామ్రాట్  విశ్వనాథ సత్యనారాయణ గారు మాండవి ని  ఉత్తమ కావ్య నాయికగా  దర్శించారు. ఈ లఘుకావ్యం వాసంతిక అనేపేరుతో కృష్ణాపత్రిక  స్వర్ణసంక్రాతి   సంచిక లో ప్రచురితమైంది. మృదుమధుర వ్యంగ్యవైఖరీ ఫ్రాభవం తో  కావ్య ప్రయోజనాన్ని  అలవోకగా సాథించారు మహాకవి   విశ్వనాథ.

                     తెల్లవారితే శ్రీ రామచంద్రుని పట్టాబిషేకం. భరతుడు  మాండవీ సిత సౌథమండలి కి బయలు దేరి   వెళ్లాడు. రంగవల్లికలు దిద్దబడిన వితర్ధిక మీద కోమలి కోసం ఎదురు చూస్తూ  కూర్చున్నాడు. ఇల్లాలు వచ్చింది. అసంస్కృత శిరోజాలతో కాషాయాంబరధారణియై వచ్చి కేలుమోడ్చి నిల్చిన ఇల్లాలిని చూచిన భరతుని ఎదలో  వేదనాజలథులు పొంగులు వారాయి.

                                  యింతి గనుగొంచు భరతుని హృదయ పద్మ
                                  కేసరంబులు విడజారె భాసురములు

                             అన్న మాటలు మహాకవి విశ్వనాథ వి.  ఎంతోకాలం  తర్వాత  ధర్మపత్ని మాండవీ మందిరానికి వచ్చిన భరతునకు ఆమెయొక్క ఆహార్యాన్ని  చూసేసరికే   మనసు లోని ఉత్సాహం ఆవిరై పోయింది. అందుకే భరతుని హృదయమనెడి పద్మమునందలి కేసరములు భాసురాలను వదిలి వేశాయి అన్నారు విశ్వనాథ. యోగిని గా నిలబడిన ఇల్లాలిని ఏదోవిధంగా పల్కరించి మాటల్లోకి దించాలన్నది రామానుజుని ఆలోచన. చెంతనే వాసంతిక  “{  మొల్లవంటి పూలతీగ} కన్పించింది. అది నాటి చాలాకాలమైంది. కానిఇంతవరకు మొగ్గ తొడగలేదు.  భార్యకు ఆ తీగ పై గల అభిమానాన్ని ఆధారం చేసుకొని సంభాషణలోనికి దిగుతాడు భరతుడు. ఇదిచూలెంతయు గాదా- అన్నపల్కులు  భరతునివి. ఆమాటలు విన్న మాండవి నెమ్మదిగా ఇలాఅంది.

                         నే నింటి లోన నెక్కడో
                          పూని మహావ్రతము,బూమొక్కలకున్
                           దానెవరు నీరువోసిరి
                           చాన యదుపు తోటమాలి శ్రద్ధయు గలదే

                        భార్ర్య్డ్య మాటలకు ఆశ్చర్యపోయాడు". ఈ మహావ్రతము ఎవరికోసమన్నా"డు భరతుడు. భర్తయొల్లని సతి ఇంతకంటె ఏంచేయగలదు. చెడిపోయిన గృహసంస్కృతులకై తానీవ్రతాన్ని అవలంబించాను కాని ఆ దైవానికి  మాత్రం అనుగ్రహం కలుగలేదు.

                                    నా భర్త యొక్కడున్నా డన్నగారితో
                                     బాటు జటాధారి పట్టణమున
                                    నతని భార్యను నేన, యపకీర్తి పాలైన
                                    యత్తగారును సుఖమఱిన నేను
                                     కుమలి పోవుచు నాదుకొంచుంటి మొక రొక
                                     రీమాత్ర వాసంతి యొదిగెనేని
                                     ఆ యత్తగారు దయాక్షీరపాదోధి
                                       శ్రీమతి యాయమ చేతి చలవ.


                       మాండవి మాటల్లో భర్త తో చెప్పలేని , చెప్పాలనుకున్న ఎన్నో భావాలు సుళ్లు తిరిగాయి . కళ్లముందు కమ్ముకొన్న  మంచుపొరలు తొలగిపోయాయి భరతునికి. శ్రీరామ కీర్తి పతాకాభిరామ యష్టి మూర్తియైన  మాతృ మూర్తి కన్నులముందు కన్పట్టింది భరతునికి. వాసంతి ఈ మాత్రం నిలిచిందంటే దానికి కారణం...... దయా క్షీరపాదోధి”   యైన అత్తగారి చలువ అన్న మాండవి మాటల్లో విన్పించిన ధ్వని భరతుని లోని విజ్ఞతను మేల్కొలిపింది. వెంటనే రక్షోరాట్పరోక్షారి  సత్పదముల్ ఝారి క్షమింప వేడెదన యీవాసంతియున్ విచ్చునే కద తానప్పటికంచు లేచాడు. చేసిన తప్పు తెలుసుకున్నాడు కాబట్టి వెంటనే దిద్దుకొవాలనే తపన భరతునిది.  ఎంతోకాలంగా మదిలో గూడుకట్టుకొన్న వేదన తీరే రోజు ఆసన్నమైంది. ఇన్నేళ్లుగా కన్నతల్లికి దూరంగా ఉంటూ, ఆమెను నిందిస్తూ  ఆమె ప్రవర్తనను  దూషించాడు.


                       కాని తన కన్నతల్లి కైకేయి పై తాను పెంచుకున్న ఏహ్యభావం తప్పని , ఆమె యే  శ్రీ రామ చంద్రుని  కీర్తి పతాకకు  ఆధారపు కొయ్య వంటిదని, ఆవిడ దయా క్షీర పాదోధి అని , రావణసంహారము, ఇంత రాక్షససంహారం జరగటానికి  ఫరోక్షంగా కైకయే కారణమనే విషయం  మాండవి మాటల్లో ధ్వనించింది భరతునికి.  ఆమె రక్షోరాట్పరోక్షారి. అంటే  కైకేయి  రాక్షసరాజైన రావణునకు పరోక్షశత్రువట. ఎంత అద్భుతమైన  ఫ్రయోగమో మహాకవిది.  మరొక్కసారి ఆ మహనీయుని  కవితా సరస్వతి కి వేవేల వందనాలు.

                  ఒక్క సారిగా  భరతుని లో తల్లి కైకయి పై నున్నకోప. వ్యతిరేక, ఏహ్య భావాల స్థానంలో  గౌరవము , ప్రేమ , అంతకు మించి   ఆమెకు బిడ్డయై నందుకు  తొలిసారిగా గర్వము చోటుచేసుకున్నాయి. వేగంగా  కైకేయీ భవనానికి చేరుకున్నాడు భరతుడు.. తనపాపాన్ని ప్రక్షాళన చేసుకోని కాంతిచంద్రుడై మరలి మాండవీ మందిరానికి వచ్చాడు.

                         ఆ సాయంతటి కైకేయీ పద సపర్యా ధుర్యు డై వచ్చుచున్     
                        వాసంతీ లత చిన్నిపూవిదులు శోభం గాంచె  రామానుజుం
                        సీమంత మధూళికా రచిత నూత్నారుణ్య కాశ్మీర రే
                        ఖా సంపన్నిధి మాండవీ ముఖ  లసత్కంజాత సంజాతమున్.


          మాండవీ ముఖవినిర్గత దరహాస చంద్రికలు భరత రాజేంద్రునిపై ప్రతిఫలించి, పులకించాయి. వాసంతిక   చిరునవ్వు చిందించింది.


               మాండవి భరతుని లో కరడుగట్టిన మాతృవైముఖ్యాన్ని కరిగించి వేసింది. శ్రీరాముని కీర్తి పతాకకు ఆధారపు కొయ్య గా కైకమ్మను నినదించిందిమాండవి. ఉపదేశికయై కావ్యంలో  తన పాత్రను శాశ్వతీకరించుకొంది   కాంత గా మాండవి. ఇది విశ్వ నాథవారి అపూర్వ సృష్ఠి. కాంతా సమ్మితమైన కావ్యంలో    కావ్య ప్రయోజనాలలో ఒకటైన ఉపదేశాన్ని నాయకునకు  నాయిక చేత నే  ధ్వన్యాత్మకంగా ఇప్పించి, కావ్యానికి , కావ్యనాయికకు కూడ ఉన్నత గౌరవాన్ని  కల్పించిన  మహాస్రష్ట  శ్రమద్రామాయణ కల్పవృక్ష సృష్టికర్తలు . 
  

  ********   కాలోహ్యయం నిరవధీ     విపులాచ పృధ్వీ******************