Sunday 10 June 2012

రామాయణము – రమణీయ కధనాలు - 1 -శ్రవణుడు

                        


                       మునికుమార వృత్తాంతము -శ్రవణుడు


           వాల్మీకి రామాయణంలో శ్రీరాముని  ప్రాదుర్భావానికి ముందే దశరధుని జీవితంలో సంభవించిన విచిత్ర విషాద సంఘటన –మునికుమారవృత్తాంతము. రాముడు వనవాసానికి వెళ్లిన తర్వాత దశరధుడే ఈ వృత్తాంతాన్ని కౌసల్యకు చెప్పుకుంటాడు.

                అరవైవేలసంవత్సరాలు రాజ్యపరిపాలన చేసి సమస్త భోగాలను అనుభవిస్తూ కూడా పుత్రసంతానము లేక నిస్సారమైన జీవితంలోకి వేట ను ఆహ్వానించి,ఆ వ్యసనానికి బానిసయై రాత్రి పగలు తేడా లేకుండా గడపసాగాడు అయోధ్యానాధుడు.
                                              ఒకనాటి సాయంత్రపు వేళ సరయూనదీతీరంలో శబ్దవేధి విద్యను సాధన చేస్తున్న దశరధుఢు -- తల్లిదండ్రుల కోసం మంచినీళ్లు తీసుకెళ్లడానికి వచ్చి నీళ్లు ముంచుకుంటున్న మునికుమారుణ్ణి గజ భ్రాంతి తో తన బాణానికి బలి చేశాడు. బిడ్డను కోల్పోయిన ముని మరణావసాన సమయంలో—దశరధుడు తనకు కల్గించిన పుత్ర శోకానికి విలపించి-కోపించి--,
                     ‘’ఏవం త్వం పుత్ర శోకేన రాజ న్కాలం కరిష్యతి ‘’
-అని శపించి సపత్నీయుతంగా మరణించి స్వర్గప్రాప్తి పొందాడు. పుత్రసంతానం కోసం పరితపిస్తున్న దశరధునకు ఆ శాపం వరంగా విన్పించి ఆనందించాడా రోజున. కాని రాముడు అడవికి వెళ్లిన తర్వాత ఆ శాపం లోని చరమాంశ దశరధుని ప్రాణాలను బలితీసుకొంది. ఆంటే రామ వనవాసానికి కైక వరాలు ప్రధానకారణంగా కన్పిస్తున్నా-మునిశాపమే ఇచ్చట ప్రబలమైంది.
               వాల్మీకి ఆ మునిబాలకుని తాపసుడని, తపోధనుడని సంబోధించాడే కాని నామకరణం చేయలేదు. అంతేకాక తాను బ్రాహ్మణుడను కాదని ,శూద్రస్త్రీ యందు వైశ్యునకు పుట్టినవాడనని ,అందువల్ల దశరధునకు బ్రహ్మహత్యాపాతకం తగలదని చెప్పుకున్నాడు వాల్మీకి రామాయణంలో మునిబాలకుడు దశరధునితో.
                            ఈ మునికుమారవృత్తాంతం ఇతర గ్రంధాలలో వేరువేరు పేర్లతో కన్పిస్తోంది అగ్నిపురాణంలో చూస్తే యఙ్ణదత్తుడనే పేరున ఈకధ కన్పిస్తోంది. శ్రీమద్రామాయణం పశ్చిమోత్తర శాఖీయపాఠం ‘”లోను,రంగనాధ రామాయణంలోను అదేఫేరున ప్రస్తావించబడింది. తులసీదాసు తన రామచరితమానస్ లో సరవన అని మునిబాలకుని కధను ప్రస్తావించాడు. ఇది శ్రమణ శబ్దానికి వికృతి. హిందీ శబ్దసాగర్  బౌద్ధమత సంప్రదాయంలో నుండి శ్రమణ కధ వచ్చి మనలో కలిసి ఉండవచ్చని భావించింది.
                                          ఇండో-ఆంగ్లికన్ రచయిత్రి తోరోదత్తు సింధు అనే పేరున ఈ పితృభక్తుని కధను ప్రకటించింది. జాతిపిత మహాత్మాగాంధీ శ్రవణపితృభక్తి నాటకం చేత తో స్ఫూర్తిని పొందినట్లు ఆత్మకధ లో వ్రాసుకున్నారు.
“The book and the picture left an indelible impression on my mind. Here is an example for  you  to copy’ ”I said  to   myself  the  agonized comment of the parents over  sravana’s  death is still Fresh in my memory .’శ్రవణశ్రావణ  శబ్ధాలు సమానార్దకాలుగా ప్రయోగించబడ్డాయి.
                                      ఈ విధంగా రామాయణంలో నామమాత్రంగా కన్పించిన మునికుమారుని వృత్తాంతం అనంతర కాలంలో చిగురులు తొడిగి అద్భుతేతివృత్తమై ఎందరో మహాపురుషులకు ఆదర్శప్రాయమైంది.’ Sindhu ‘ deals with the eternal theme of parental love’”అన్నారు విమర్శకులు. ‘’పితృభక్తి కి ప్రతీకగా శ్రవణుని పేరు చెప్పుకోవడం లోకంలో అలవాటుగా మారింది. కావడిలో  తల్లిదండ్రులను మోస్తూ తీర్ధయాత్రలు చేయించే పితృభక్తి పరాయణుడుగా  శ్రవణుడు చదువరులకు ప్రత్యక్షమౌతాడు. కాని ఇది వాల్మీకి సృష్టి కాదు. శ్రావణ పితృభక్తి,” “ శ్రావణచరిత్ర “ “,శ్రావణము వంటి  కావ్యాలు వ్రాసిన ఆధునిక కవుల ప్రయత్నఫలితమే.  
                                    శ్రమణ శబ్దమే శ్రవణ గా రూపాంతరం చెందిందని , శ్రమణ వృత్తిలో జీవించే మునికుమారుని వృత్తమే శ్రావణచరిత్ర గా మారిందని – కొందరు భావిస్తే, దశరధుడు వేటకై వెళ్లింది-వర్షాకాలం -అనగా శ్రావణమాసం. ఈ శ్రావణ నామానికి, ఆ శ్రావణమాసం ఏ  మాత్రమైనా దోహదము చేసినదేమో నని అర్ధోక్తిలో వదిలేశారు శ్రీమాన్ రాళ్లపల్లి వారు.
                       వినికిడి అనగా శ్రవణ ప్రధానమైన అస్త్రవిద్యతో-అనగా శబ్దవేధి తో కొట్టబడిన మునికుమారుని కరుణామయగాధ శ్రావణమై,ఆ మునికుమారుని పేరు శ్రవణుడుగా-. శ్రావణుడుగా-మారిందని భావించవచ్చు. ఏమైనా శ్రావణుని చరిత్ర  పితృభక్తి కి ప్రతీకగా లోకంలో నిలిచిపోయింది.
ఆధారాలు
1.శ్రీమద్వాల్మీకి రామాయణం           
 2.Puranic  Encyclopedia
3.The Selected Works of Mahatma Gandhi – Vol-1                                
4.Toru Dutt- A.N.Dwivedi