Sunday 24 June 2012

కూనిరాగాలు


ఎద పొంగిన భావఝరులు
గుండెలోన సుళ్ళు తిరిగి
అక్షరాల    వెల్లువలై
పెదవులపై రవళిస్తే  కూనిరాగం ****!

ఆకాశంలో హరివిల్లు విరిస్తే
వాకిట్లో వడగళ్లు కురిస్తే
చిన్నారుల కన్నుల్లో సంతోషం మెరిస్తే
మనసు పాడుతుందొక ఆనందమయరాగం****!

పసిపాపల చిరునవ్వులు
పైరు పచ్చని పంటపొలాలు
పడుచుజంటల తీపి ఊసులు
కావ్యకల్పనకు పరిపోషకాలు ****!

అమ్మానాన్నల ఆప్యాయత
ఆలుబిడ్డల అనురాగం
పరిపూర్ణంగా పొందిన పురుషుడు
ఆలాపిస్తాడు  మోహనరాగం ****!


కూ  కూ అనే స్వరమే

కోయిల గానమై
పంచమస్వరంగా పరిఢవిల్లి 
ప్రసిద్ధమైందిగా కూనిరాగమై ****!

క్రౌంచిరోదనతో కదిలిన హృదయం
ఆలాపించింది మానిషాద శ్లోకం
ఆదికవి అందించిన అనుష్టుప్ ఛందం
కావ్యజగతికే యది భూపాలం ****!

విశ్వనాధ వంటి కవి
బాపిరాజు వంటి కథకుడు
శేషేంద్ర వంటి విమర్శకుడు
లభించడం తెలుగుజాతి సుకృతం ****!

మొల్ల రచించిన రామాయణం
పోతన అందించిన భాగవతం
వేమన చెప్పిన పద్యాలు
లేని ఇంట్లో మరి ఉన్నదేమిటి ****!

Wednesday 20 June 2012

ఆ రోజుల్లో


                  ఆ రోజుల్లో వేసవికాలం ఎంత బాగుండేది. వయసు మీద కొచ్చాక ఎండలంటే భయమేస్తోంది కాని ఆరోజుల్లో వేసవి బాగుండేది. మాది కృష్ణాజిల్లా కురుమద్దాలి. అవును.విజయవాడ బందరు మార్గంలో రోడ్డుమీద కన్పించే ఊరే. రోడ్డుప్రక్కనే రెండు దేవాలయాలు వాటి మీద రంగులువేసిన పెద్దపెద్దబొమ్మలు ఆ దారిన వెళ్లిన వారందరికి గుర్తే . అదే మాఊరు. తాతగారు స్వాతంత్య్రసమరయోధులు.నాన్నగారు ఇంటికి పెద్దకొడుకు కావడం వల్ల తాతగారింట్లోనే కలిసుండేవాళ్లం.బాబాయి కుటుంబం వేరే ఊళ్లో ఉండేది.ఐదుగురు మేనత్తలు పెళ్లిళ్లై వాళ్ల వాళ్ల ఊళ్ళల్లోఉండేవారు.
                                         వేసవి సెలవలు వచ్చాయంటే బాబాయిగారి పిల్లలు, అత్తయ్యగారి పిల్లలు తాతగారింటికి వచ్చేవాళ్ళు. ఇంకేముంది.పిల్లలందరం కలిస్తే ముఫైఐదు నలభైమందిఅయ్యేవాళ్ళం. నిజం. ఉదయం పిల్లల చద్దన్నం కోసం అడ్డెడుగిన్నె దించేవాళ్ళు.ఆ రోజుల్లో ఇంట్లో పెద్దవాళ్లే కాఫీలు తాగేవారు.టిఫిన్ కల్చర్ అప్పటికింకా రాలేదు. తొమ్మిది గంటలకల్లా చద్దన్నాలు తినేసి పక్కనున్న గుళ్ళొకో ,పంచాయతీపార్కులోకో దూకేసేవాళ్లం పిల్లలందరం.మాతోపాటు ఎదురింటివాళ్ల  పిల్లలు,పక్కింటివాళ్ల పిల్లలు కలిస్తే మరోపదిమంది .అంటే యాభైమంది . ఎవరికొచ్చిన, నచ్చిన ఆటలు వాళ్ళు ఆడుకొనేవాళ్ళు. ఇంటిప్రక్కన విశాలమైన గుడి ఆవరణ, రోడ్డుదాటితే పంచాయతీ పార్కు,దాని ప్రక్కనే చెఱువు ,దాని ఒడ్డున తూర్పుగా గవర్నమెంటు బడి ,ఉత్తరంగా తాళ్ళతోపు,ఇవన్నీ మా ఆటస్దలాలే.
                               మధ్యాహ్నం బోజనాలవగానే పెద్దవాళ్ళందరూ ఎండలకి ఆపసోపాలు పడుతూ తాటాకు విసనకర్రల్నినీళ్లల్లో ముంచుకొని విసురుకొంటూ పడుకుంటే పిల్లలందరం గుళ్లోకి జారుకొని నెమ్మదిగా రోడ్డెక్కెసేవాళ్లం. కొందరు గడవాసం భుజానేసుకొని ఈతకాయలు, దొరికితే సీమతుమ్మకాయల కోసం బయలుదేరితే, మరికొంతమంది కొత్తఆవకాయ పచ్చడిని బాదంఆకులో చుట్టి జేబులో పెట్టుకొని.ముంజికాయలకోసం పొలంగట్లు పట్టేవాళ్లం.   ముంజికాయలు తింటూ ఆవకాయ నంజుకుంటే కడుపులోనెప్పి రాదని తోటివాళ్ళు చెపుతుండేవాళ్లు. ఆవకాయ కారం నిక్కరు జేబునిండాకారి మరకలవడం,ఇంట్లోవాళ్లు తిట్టడం అవన్నీ వేరేసంగతి. ఈతకాయగెలల్ని తెచ్చి పశువులపాక ప్రక్కనే గుంటతీసి పాతిపెడితే,మగ్గి,తెల్లారేసరికి పండేవి. ఆ ఎచ్చి పచ్చి కాయల్నిఅందరం పంచుకొని తినడం గొప్ప ఘనకార్యంలా భావించేవాళ్లం. సాయంత్రం చల్లబడే సమయానికి ఎండగట్టిన చెరువులోకి తామరగింజలకోసం జట్లుజట్లుగా బయలుదేరేవాళ్లం. చెఱువులోని తామరపూలు ముదిరి ఎండి తామరడిప్పల్లోంచి గింజలు పడిపోయేవి. చెఱువు ఎండిపోయినప్పడు ఆ నల్లమట్టిలోంచి తామరగింజల్నిఏరుకొచ్చి కొట్టుకొని తినడం ఒకఆటగాఉండేది.ఎవరు ఎక్కువ గింజలు ఏరితే వాళ్లు గొప్పగా ఫీలయేవాళ్లం.ఇంటికొచ్చి బావిదగ్గర బక్కెట్లకొద్దీ చల్లని స్నానాలు. స్నానాలు అయ్యే సరికి అన్నాలు సిద్ధం. ఎక్కడ. పురిగట్టుమీద.అదొక అందమైన దృశ్యం.మసకవెన్నెల్లో,సంధ్యాదీపపు కాంతుల్లో పురిగట్టుమీద పిల్లలందరూ గుండ్రంగా కూర్చుంటే మధ్యలో అత్తయ్య కూర్చొని అందరికీ అడిగి అడిగి వడ్డిస్తూంటే కబుర్లు చెప్పుకుంటూ మసకవెలుతుర్లో అన్నాలు తినడం తలుచుకుంటే గొప్ప అనుభూతి. ఈరోజుల్లో moon light dinner అంటారేమో దాన్ని. వడ్లు పురి కట్టడానికి సిమెంటుతో చేసే చప్టాని పురిగట్టు అంటారు.     
                               ఆరోజుల్లో కుటుంబం అంటే తల్లిదండ్రులు ఏడెనిమిదిమందిపిల్లలు ఉండేవారు.ఉమ్మడికుటుంబవ్యవస్ధ పోయి కుటుంబనియంత్రణ పెరిగిన ఈకాలంలో ఇవన్నీ ఎక్కడ కన్పడతాయి కధల్లో తప్పితే.ఏదో నష్టపోతోందన్పిస్తోంది ఈతరం. ఇంట్లోఉన్నఒక్కపిల్లాడికి ఆడుకోవడానికి చెల్లినో,తమ్ముణ్ణో ఇవ్వడానికే లెక్కలు చూసుకుంటున్న దంపతులున్న కాలమిది.
                               అన్నాలు అయిపోగానే మళ్లీ ఆటల్లోకే. ఆడపిల్లలు దాగుడుమూతలు,వెన్నెలకుప్పలు ఆడుకుంటుంటే,మగపిల్లలు పక్కనే ఉన్నపార్కులే కోతికొమ్మచ్చులాడేవాళ్లం. వెన్నెలవెలుగులో కోతికొమ్మచ్చులు. రాత్రి తొమ్మిది పదింటిదాక ఆడి,అలిసి, అప్పుడు ఆ ప్రక్కనే ఉన్నచాకలి చెఱువులో ఒళ్లు, కాళ్లు కడుక్కొని వచ్చి, గుళ్లో మండపంలో పెట్టుకున్న పక్కబట్టలు తీసి దుప్పటి మడతకూడ విప్పకుండా పరచి పడుకంటే  సూరీడు బారెడు పైకొచ్చి చురుక్కు మనిపిస్తుంటే, ఉలిక్కిపడి లేచి కూర్చునేవాళ్లం .కొద్దితేడాతో వేసవి సెలవలన్నీ ఇలాగేగడిచిపోయేవి.కోతి కొమ్మచ్చిలాడే సమయంలో ఎక్కడో కొమ్మల్లోఉన్నతేనెపట్టు కదిలి తేనెటీగలు దాడి చేయడం,రాత్రిపూట చెఱువులో దిగేటప్పుడు కనపడక  బురదకొయ్యమీదో, బావురుకప్ప మీదో కాలేస్తే అది నెత్తురొచ్చ్చేటట్లు గీరి నీళ్లల్లోకి జారిపోతే,పాము కరిచింది చచ్పిపోతానేమోనని తెల్లవార్లు భయం భయంగా పడుకోవడం తలుచుకుంటుంటే ఇప్పుడు నవ్వువస్తుంది . విచిత్రమేమిటంటే అంతమందిఉన్నాకొట్టుకోవడాలు,పోట్టాడుకోవడాలు ఉండేవికావు.అందుకే పెద్దవాళ్లుకూడా ఆడుకుంటారులే అని వదిలేసేవాళ్లు .అప్పుడప్పుడు పిల్లలమధ్య కీచులాటలొస్తే  అలిగి దూరంగాపోయి, మళ్లీ కాసేపటికొచ్చి జట్టులో కలిసిపోయేవాళ్లు కాని కక్షలకు,కోపతాపాలకు తావుండేదేకాదు. అందుకే భాల్యమెంత మధురం అనిపిస్తుంది ఆరోజుల్ని తలుచుకుంటే.
          ------

Saturday 16 June 2012

రామాయణము -రమణీయకధనాలు -2 -స్వయంప్రభ


                                                     

                           స్వయంప్రభ       

                            

                                  
                  శ్రీ  రామకధ తెలిసిన చాలామందికి కూడ వెంటనే గుర్తుకు రాని  పాత్ర స్వయంప్రభ.  కాని రామ కధాగమనానికి అవసరమైన విశిష్ట పాత్రల్లొ స్వయంప్రభ కూడ ఒకటి. అసలు రామాయణంలోని  పాత్రల్ని విమర్శక దృష్టితో పరిశీలిస్తే రెండువిధాలుగా విభజించవచ్చు.
   1.రామునితో చరించే పాత్రలు         2. రాముని కొఱకు జీవించే పాత్రలు.    
మరొకరీతిగా విశ్లేషిస్తే       1.విశిష్ట పాత్రలు.               2. విశేష పాత్రలు

     ఇంకొక పద్దతిలో రామునితో -            1.ప్రత్యక్ష సంబంధం కలవి.          2.పరోక్ష సంబంధం కలవి
స్వయంప్రభ రామకధతో పరోక్ష సంబంధంగల పాత్ర.
 శ్రీరామచంద్రుని సేవలో జీవితాన్ని పండించుకొన్న యోగిని.           
స్వయంప్రభ. సీతాన్వేషణలో రాత్రింబగళ్ళు శ్రమించి అలసిపోయి ఆకలిదప్పులతో పీడించబడుతూ ఆశ్రయం కోరిన వానరసేనను, ఆదుకొని వారికి  అతిధి సత్కారాలందించి, తిరిగి రామకార్యసాధనకు వలసిన జవసత్త్వాలను వారి కందించి రామసేవకులకు సేవచేసి,పరోక్షంగా రామసేవను చేసుకొని తరించిన దివ్యప్రభ ఈ స్వయంప్రభ.
  మహాభాగాం   తాపసీం ధర్మచారిణీం        తాపసీం ధర్మచారిణీం
           ------ జ్వలంతీమివ తేజసా     -అని స్వయంప్రభ ను పరిచయం చేస్తాడు మహాకవి వాల్మీకి.  ఆమె నివసించే వనాన్ని-"వనముత్తమం ,--“- కాంచనంవనం  ----మహద్దరణ్యం- మహావనే–“ వనందుర్గం అని సైతం వర్ణించి ఆమెను స్వయంగా కాంతివంతమైన పాత్రను చేశాడు ఆదికవి. "తాపసీ ధర్మచారిణీ అనే విశేషణం ఆమెకు పెక్కుసార్లు వాడబడింది.
              తమకు మేలుచేసిన ఆ తపస్వినికి తమ వల్ల కలిగే ప్రయోజనం ఏమైనా ఉంటే ఆజ్ఞాపించ వలసిందని ఆంజనేయుడు  ప్రార్ధించినపుడు స్వయంప్రభ –-“  చరంత్యా మమ ధర్మేణ న కార్యమిహ కేనచిత్.(ధర్మమార్గంలో చరించే నాకు తరుల వల్ల కలిగే పని ఏముంటుంది) అంటుంది. అంటే సన్మార్గంలో నడిచేవారికి ఇంకెవరితోనూ చేయించుకొనే పని ఏమీ ఉండదు అనే ఆత్మవిశ్వాసం ఆమెది. ధర్మచారిణీ అన్న పదంలోనే వాల్మీకి మనోభావం స్పష్టం. వన్నె తరగని ముఖవర్చస్సు ,వాడని శరీరము, దుర్నిరీక్ష్యమైన తేజస్సు స్వయంప్రభ వి. జ్వలంతీమివ తేజసా అన్నవాల్మీకి పల్కులలోని అంతరార్దమిదే.
                           ఆంజనేయుని అభ్యర్ధనతో ప్రసన్నురాలైన స్వయంప్రభ, హేమా విశ్వకర్మల వృత్తాంతంతో ముడివడిన తన గాధను ప్రస్తావిస్తుంది.    స తు వర్షాణి సహస్రాణి తప స్తప్త్వా మహావనే “–బ్రహ్మ అనుగ్రహంతో శిల్ప శాస్త్రజ్ఞానాన్ని పొంది, అపురూపమైన  కాంచనభవనాన్న నిర్మించాడు మయుడు. హేమతో ఇష్టోపభోగాల ననుభవిస్తూ ఎక్కువకాలం భూలోకంలోనే నివసించసాగాడు. మయుని సుఖాన్ని చూసి కన్నుకుట్టిన దేవేంద్రుడు వజ్రాయుధంతో మయుని సంహరించగా, ఒంటరియైన హేమ ఈ వనాన్ని స్వయంప్రభ కిచ్చి తాను వెళ్లిపోయింది. ఆనాటి నుంచి తాను తపోదీక్షలో ఉంటూ వనాన్ని రక్షిస్తున్నానని చెపుతుంది.                

              స్వయంప్రభ  ఆంజనేయునితో. ఇదం రక్షామి భవనం హేమయా వానరోత్తమ. దుహితా మేరుసావర్ణే  రహం తస్యా స్వయంప్రభా (ఆనాటి నుండి హేమకు సంబంధించినదిగానే ఈవనాన్ని కాపాడుతున్నాను. మేరుసావర్ణి కుమార్తె యైన నన్ను స్వయంప్రభ అంటారు). వానరోత్తమ అని సంబోధించిన స్వయంప్రభ తో ఆంజనేయుడు రామకార్యాన్ని ప్రస్తావించి,సమయం గడిచిపోవడంవలన తమ ప్రాణాలకు ముప్పువాటిల్లుతుందని, రామకార్యం భగ్నమౌతుందని, అందువలన తమకు మార్గనిర్ధేశం చేయవలసిందని ప్రార్ధిస్తాడు.
                      కాని ఈ బిలములో ప్రవేశించిన వారు తిరిగి ప్రాణాలతో బయట పడటం అసాధ్యమని , కాని తన తప:ప్రభావం చేత  రామకార్యార్ధం వారినందరిని బయటకు పంపిస్తానని హామీ యిచ్చి వానరసేననంతటిని ఎవరికివారు తమచేతులతో కళ్లు మూసుకోవలసిందిగా ఆజ్ఞాపిస్తుంది స్వయంప్రభ. నిమీలయతి చక్షూంషి సర్వే వానర పుంగవా: ”-ఆవిధంగా వానరశ్రేష్టులందరూ తమ చేతులతో కళ్లను మూసుకోని తల్లిగర్భంనుండి బయటకొచ్చిన పిల్లలవలే ఆ ఋక్షబిలం నుండి బయటపడి  తిరిగి సీతాన్వేషణ మనే బృహత్కార్యానికి సిద్ధపడి రామసేవకు పునరంకితమయ్యారు. ప్రయాణంలో దారితప్పి, ప్రాణాపాయస్ధితిలో ఉన్న వానరసేనకు తిరిగి జవసత్త్వాలను ప్రసాదించి వారికి మార్గనిర్ధేశం చేసి, ఆవిధంగా పరోక్షంగా రామసేవలో పునీతురాలైన మహాయోగిని స్వయంప్రభ. 
                ఆలోచిస్తే రామాయణంలో ఆదికవి తన పాత్రలకు పెట్టిన ప్రతిపేరు సార్ధకమే. ఈ విషయాన్ని ప్రత్యేక వ్యాసంలో ప్రస్తావించుకొందాం. ఆవిధంగానే  ఇక్కడ స్వయంప్రభ కూడ అన్వర్ధనామధేయ.తనకు తానుగా స్వయంప్రకాశమానయైన జ్ఞానయోగిని ఆమె. ఈ వృత్తాంతాన్ని వాల్మీకి రామాయణం కిష్కింధకాండలో చూడవచ్చు.
                   ఘట్టాన్ని కేనోపనిషత్తు లోని అంశాలతో పోల్చి విశ్లేషించిన విమర్శకులున్నారు .       స్వయంప్రభ గాధ చదివేటప్పుడు కేనోపనిషత్తు గుర్తుకొస్తుంది. ఆమె గుహ నుండి వానరులు వెలువడాలంటే కళ్లు మూసుకోమనడం పదాలకు ప్రతిధ్వని. యదేతత్ విద్యుతో వ్యద్యుత్తదా ఇతీన్యమీనిషదా-- కంటిలో మెరుపువలే క్షణకాలంలో మెరిసిన మెరుపు కన్పించి అది అదృశ్యమైంది.
                స్వయంప్రభ వృత్తాంతం కేవలం అపార్ధివతత్త్వ కధనంగానే కాక ఈ  మయా మయ విశ్వంలో మీమాంసాశాస్త్రంగా, యోగశాస్త్రపాఠ్యాంశంగా, సాహిత్యంలో ఒక కళాఖండంగా భావించాలి. అన్న ప్రముఖ విమర్శకులు ఇలపావులూరి వారి పల్కులు అక్షరసత్యాలు.
                 రామచంద్రుని దర్శనం ప్రత్యక్షంగా పొందలేకపోయినా రామసేవకులకు సేవచేసి, రామసేవాభాగ్యాన్ని పొందిన ధన్య చరిత, జ్ఞానయోగిని స్వయంప్రభ.ధర్మమార్గంలో జీవించేవారికి ఏ ఇతరుల సహకారము అవసరం లేదని నిరూపించిన పాత్ర స్వయంప్రభ. చరంత్యా మమ ధర్మేణ నకార్యమిహ కేనచిత్ –“అన్న పలుకులు స్వయంప్రభ వే కాదు, ధర్మాన్నే నమ్ముకొని  అరణ్యమధ్యం లో ఆశ్రమవాసియై జీవిస్తున్న  వాల్మీకి మహర్షి వే నని భావించవచ్చు.
     ఆథారాలు  :--
1.            1 శ్రీమద్వాల్మీకి రామాయణం కిష్కింధ 50,51                                2.రామాయణం లో స్త్రీ పాత్రలు .పు.85
.           ******************************************                                      _____  *****______

Sunday 10 June 2012

రామాయణము – రమణీయ కధనాలు - 1 -శ్రవణుడు

                        


                       మునికుమార వృత్తాంతము -శ్రవణుడు


           వాల్మీకి రామాయణంలో శ్రీరాముని  ప్రాదుర్భావానికి ముందే దశరధుని జీవితంలో సంభవించిన విచిత్ర విషాద సంఘటన –మునికుమారవృత్తాంతము. రాముడు వనవాసానికి వెళ్లిన తర్వాత దశరధుడే ఈ వృత్తాంతాన్ని కౌసల్యకు చెప్పుకుంటాడు.

                అరవైవేలసంవత్సరాలు రాజ్యపరిపాలన చేసి సమస్త భోగాలను అనుభవిస్తూ కూడా పుత్రసంతానము లేక నిస్సారమైన జీవితంలోకి వేట ను ఆహ్వానించి,ఆ వ్యసనానికి బానిసయై రాత్రి పగలు తేడా లేకుండా గడపసాగాడు అయోధ్యానాధుడు.
                                              ఒకనాటి సాయంత్రపు వేళ సరయూనదీతీరంలో శబ్దవేధి విద్యను సాధన చేస్తున్న దశరధుఢు -- తల్లిదండ్రుల కోసం మంచినీళ్లు తీసుకెళ్లడానికి వచ్చి నీళ్లు ముంచుకుంటున్న మునికుమారుణ్ణి గజ భ్రాంతి తో తన బాణానికి బలి చేశాడు. బిడ్డను కోల్పోయిన ముని మరణావసాన సమయంలో—దశరధుడు తనకు కల్గించిన పుత్ర శోకానికి విలపించి-కోపించి--,
                     ‘’ఏవం త్వం పుత్ర శోకేన రాజ న్కాలం కరిష్యతి ‘’
-అని శపించి సపత్నీయుతంగా మరణించి స్వర్గప్రాప్తి పొందాడు. పుత్రసంతానం కోసం పరితపిస్తున్న దశరధునకు ఆ శాపం వరంగా విన్పించి ఆనందించాడా రోజున. కాని రాముడు అడవికి వెళ్లిన తర్వాత ఆ శాపం లోని చరమాంశ దశరధుని ప్రాణాలను బలితీసుకొంది. ఆంటే రామ వనవాసానికి కైక వరాలు ప్రధానకారణంగా కన్పిస్తున్నా-మునిశాపమే ఇచ్చట ప్రబలమైంది.
               వాల్మీకి ఆ మునిబాలకుని తాపసుడని, తపోధనుడని సంబోధించాడే కాని నామకరణం చేయలేదు. అంతేకాక తాను బ్రాహ్మణుడను కాదని ,శూద్రస్త్రీ యందు వైశ్యునకు పుట్టినవాడనని ,అందువల్ల దశరధునకు బ్రహ్మహత్యాపాతకం తగలదని చెప్పుకున్నాడు వాల్మీకి రామాయణంలో మునిబాలకుడు దశరధునితో.
                            ఈ మునికుమారవృత్తాంతం ఇతర గ్రంధాలలో వేరువేరు పేర్లతో కన్పిస్తోంది అగ్నిపురాణంలో చూస్తే యఙ్ణదత్తుడనే పేరున ఈకధ కన్పిస్తోంది. శ్రీమద్రామాయణం పశ్చిమోత్తర శాఖీయపాఠం ‘”లోను,రంగనాధ రామాయణంలోను అదేఫేరున ప్రస్తావించబడింది. తులసీదాసు తన రామచరితమానస్ లో సరవన అని మునిబాలకుని కధను ప్రస్తావించాడు. ఇది శ్రమణ శబ్దానికి వికృతి. హిందీ శబ్దసాగర్  బౌద్ధమత సంప్రదాయంలో నుండి శ్రమణ కధ వచ్చి మనలో కలిసి ఉండవచ్చని భావించింది.
                                          ఇండో-ఆంగ్లికన్ రచయిత్రి తోరోదత్తు సింధు అనే పేరున ఈ పితృభక్తుని కధను ప్రకటించింది. జాతిపిత మహాత్మాగాంధీ శ్రవణపితృభక్తి నాటకం చేత తో స్ఫూర్తిని పొందినట్లు ఆత్మకధ లో వ్రాసుకున్నారు.
“The book and the picture left an indelible impression on my mind. Here is an example for  you  to copy’ ”I said  to   myself  the  agonized comment of the parents over  sravana’s  death is still Fresh in my memory .’శ్రవణశ్రావణ  శబ్ధాలు సమానార్దకాలుగా ప్రయోగించబడ్డాయి.
                                      ఈ విధంగా రామాయణంలో నామమాత్రంగా కన్పించిన మునికుమారుని వృత్తాంతం అనంతర కాలంలో చిగురులు తొడిగి అద్భుతేతివృత్తమై ఎందరో మహాపురుషులకు ఆదర్శప్రాయమైంది.’ Sindhu ‘ deals with the eternal theme of parental love’”అన్నారు విమర్శకులు. ‘’పితృభక్తి కి ప్రతీకగా శ్రవణుని పేరు చెప్పుకోవడం లోకంలో అలవాటుగా మారింది. కావడిలో  తల్లిదండ్రులను మోస్తూ తీర్ధయాత్రలు చేయించే పితృభక్తి పరాయణుడుగా  శ్రవణుడు చదువరులకు ప్రత్యక్షమౌతాడు. కాని ఇది వాల్మీకి సృష్టి కాదు. శ్రావణ పితృభక్తి,” “ శ్రావణచరిత్ర “ “,శ్రావణము వంటి  కావ్యాలు వ్రాసిన ఆధునిక కవుల ప్రయత్నఫలితమే.  
                                    శ్రమణ శబ్దమే శ్రవణ గా రూపాంతరం చెందిందని , శ్రమణ వృత్తిలో జీవించే మునికుమారుని వృత్తమే శ్రావణచరిత్ర గా మారిందని – కొందరు భావిస్తే, దశరధుడు వేటకై వెళ్లింది-వర్షాకాలం -అనగా శ్రావణమాసం. ఈ శ్రావణ నామానికి, ఆ శ్రావణమాసం ఏ  మాత్రమైనా దోహదము చేసినదేమో నని అర్ధోక్తిలో వదిలేశారు శ్రీమాన్ రాళ్లపల్లి వారు.
                       వినికిడి అనగా శ్రవణ ప్రధానమైన అస్త్రవిద్యతో-అనగా శబ్దవేధి తో కొట్టబడిన మునికుమారుని కరుణామయగాధ శ్రావణమై,ఆ మునికుమారుని పేరు శ్రవణుడుగా-. శ్రావణుడుగా-మారిందని భావించవచ్చు. ఏమైనా శ్రావణుని చరిత్ర  పితృభక్తి కి ప్రతీకగా లోకంలో నిలిచిపోయింది.
ఆధారాలు
1.శ్రీమద్వాల్మీకి రామాయణం           
 2.Puranic  Encyclopedia
3.The Selected Works of Mahatma Gandhi – Vol-1                                
4.Toru Dutt- A.N.Dwivedi