Sunday 2 September 2012

అంతా రామమయం

                         




                               అంతా రామమయం
                                     


                         శ్రీ రామ భక్తులకు లోకమంతా రామమయంగానే కన్పిస్తుందట.ఈ మధ్య  అటువంటి పరిస్ధితే నాకూ ఎదురైంది. రామాయణ సాహిత్యం మీద డాక్టరేట్ తీసుకున్నాననే విషయం తెలిసిన సన్నిహితులు, మిత్రులు వారికెక్కడ రామసంబంధమైన విషయం తెలిసినా నాతో పంచుకోవడం ఒక అలవాటైపోయింది.ఆ మథ్యన నా సహోద్యోగి ఒకరు ఒక బంగారు నాణాన్ని తీసుకొచ్చి నా ముందుంచాడు. దాన్ని చూసిన నాకు మాటలు కరువయ్యాయి. సుమారు పదిహేనుగ్రాముల బరువున్నబంగారునాణెమది.దానిపై ఒకవైపు శ్రీరామచంద్రుని పట్టాభిషేకదృశ్యము,రెండవవైపు విల్లంబులు థరించిన రామలక్ష్మణులు స్పష్టంగా ముద్రించబడున్నాయి. ఇదిగో  చిత్రం ఒకటిలో ఆ నాణెము ముందువెనుకలను మనం స్పష్టంగా దర్శించవచ్చు.
                              

                       విచిత్రమేమిటంటే అతను నాకు పూర్వవిద్యార్ధి కూడాను. తరువాత వేరే ఉద్యోగం రావడంతో ఈ తాత్కాలిక ఉద్యోగాన్ని వదిలేసి అతను వెళ్లిపోయాడు .ఇది జరిగి చాలాకాలమైంది. ఆనాడు ఆర్ట్ పేపరు మీద తీసిన ప్రింటు యిది. కాలగమనంలో మెరుపు తగ్గింది. తిరుపతి లో జరిగిన రామాయణ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో నా పేపర్ తో పాటు దీన్ని కూడా చర్చకు పెట్టడం జరిగింది.ఆ తరువాత కొంతకాలానికి కాన్ఫరెన్స నిర్వాహకులురామాయణ సమ్మేళనం ప్రత్యేక సంచికను ముద్రిస్తున్నామని,ఆప్రింటు ఒక దానిని పంపిస్తే ప్రత్యేక సంచికలో ముద్రిస్తామని   లేఖ వ్రాయడం దీని నకలు ఒక దానిని ఆరోజు నేను పంపించడం జరిగిపోయాయి . ఆనాడే యిదిఎంత విలువైన నాణెమో అర్ధమైంది.కాని  ఆ నాణాన్ని తను నాకు ఇవ్వడానికి కాదు గదా! అమ్మడానికి కూడ అతను సిద్దంగా లేడు. నా మీద ఉన్న అభిమానంతో అతను తీసుకొచ్చి చూపించాడే కానీ అమ్మే ఉద్దేశ్యం కూడా అతనికి లేదు. అది తన కుటుంబంలో తాతల నాటినుంచి వస్తోందని అతను చెప్పినప్పుడు నాకుఆశ్చర్యం వేసింది.ఎందుకంటే అతను కొంతకాలం  దుబాయ్ల్ లో పనిచేసి ఆరోగ్య కారణాల వలన వచ్చేశాడు.ఇప్పటికీ కుటుంబసభ్యులు కొందరు అక్కడే ఉన్నారని చెప్పినట్టు గుర్తు. వారి కుటుంబాల్లోనే ఇవి ఇంతగా భద్రపరచబడ్డాయంటే ఇంకా ఎంతమంది దగ్గర ఎన్ని రూపాల్లో చరిత్ర దాగి ఉందా !అనిపిస్తోంది. అందుకే ఈ చిన్నప్రయత్నంతో విజ్ఞుల ముందుకు దీన్ని పంపిస్తున్నాను.  


 

  
చిత్రము—1                   బంగారునాణెం



             వృత్తిరీత్యా,కుటుంబరీత్యా ఉన్నబాధ్యతలు,ఒత్తిడుల మూలంగా కొంతకాలం దీన్నిపక్కన పెట్టడం జరిగింది. కాని పులి మీద పుట్ర లాగా ఇంకొక నాణెం వచ్చి మీద పడింది. అదికూడ రాముడి పేరు చెప్పుకొనే వచ్చింది.దానికి కారణం నా పరిశోధనా వ్యాసమే నని చెప్పవచ్చు. నా పుస్తకం మీద ఉన్న రాముడి చిత్రాన్ని చూసిన మా కాలేజి అటెండరు రాముడికి నాకు ఉన్నసంబంధాన్ని గుర్తించాడేమో, ఒకరోజు సాయంత్రం డిపార్టుమెంటులో ఉన్న నన్ను బయటకు పిలిచి ఈ నాణాన్ని నా చేతిలో పెట్టాడు. ఈ నాణెం కూడ ఇంచుమించు పై నాణెమంత వెడల్పు లావు బరువు ఉన్నా ఇది వెండి నాణెం. రామలక్ష్మణుల వలే రంగులో భేదం తప్పపై నాణెం వలే ఒకే పోలికలున్నఆ నాణాన్ని చూడగానే నాకు ఆశ్చర్యం వేసింది. అతను చెప్పిన విషయం విని ఆశ్చర్యం పోవడం నా తోటివారి వంతయ్యింది. ఏది ఎవరికి దొరకాలో వారికే దొరుకుతుందనేది పెద్దలమాట .
                        
                 ఒక సెలవురోజున తను భద్రాద్రి వెళ్లాడట.గోదావరిలో స్నానంచేసి తడిబట్టను ఆరబట్టుకుంటూ ఇసుకలో అటు ఇటు తిరుగుతున్నాట్ట కాలితో ఇసుకను రేపు కుంటూ. ఇంతలో ఇసుకతోపాటు ఏదో లేచి అవతలపడింది. చూస్తే వెండినాణెం. దాని ప్రాచీనత, ప్రాధాన్యత అతనికి తెలియవు.వెండినాణెం అని మాత్రమే తెలుసు. తీసి జేబులో వేసుకున్నాడు. ఇదీ దాని చరిత్ర.
                           ఈవిధంగా ఆనాణెం  అతని దగ్గరికొచ్చి,తరువాత నాముందు ప్రత్యక్షమైంది. బంగారు నాణెంవలెనే ఇది కూడ సుమారు పదిహేను గ్రాముల బరువుంటుంది. ఒకవైపు సీతారామపట్టాభిషేకదృశ్యము ముద్రించబడివుంది.రెండోవైపు రామసేతు నిర్మాణ చేస్తున్న వానర సైన్యం కన్పిస్తుంది. వారి చేతుల్లో వివిధ ఆయుధాలు,పతాకలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. వారికి పై భాగంలో   శూన్యంలో   అంటే      ఆకాశంలో    राम सीतः అని స్పష్టంగా సంస్కృతంలో ముద్రించబడియుండటం మనం స్పష్టంగా గమనించవచ్చు. అంటే సేతునిర్మాణం చేస్తూ వానరసైన్యం సీతారాముల పేర్లను నినదిస్తున్నారని ముద్రాపకుల అభిప్రాయంగా మనం చెప్పకోవచ్చు. ఈనాడు మనకు మార్కెట్లోకి వచ్చిన పదిరూపాయల నాణానికన్నా ఒక్క వీసం పెద్దదిగా, పాతకాలపు మన వెండి రూపాయి అంత మందంగాను ఉందది.
                               బంగారు నాణెం లోని పట్టాభిషేక దృశ్యంలో సీతారాములతోపాటు ముగ్గురే కన్పిస్తుంటే వెండినాణెంలోని పట్టాభిషేకదృశ్యంలో నలుగురు కన్పిస్తున్నారు.



చిత్రం-2 లో దీన్ని చూడవచ్చు


                                   వెండినాణెం


           అయితే రెండు నాణాల్లోను హనుమంతుడు దాసాంజనేయుడై సింహాసనం చెంతనే దర్శనమిస్తున్నాడు.బంగారు నాణెంలో సింహాసనం చెంత కన్పించే ముగ్గురు కిరీటధారులుగా ఉండటం వలన లక్ష్మణభరతశతృఘ్నులుగా బావించవచ్చు. కాని వెండి నాణెంలో సింహాసనం వద్ద నలుగురు కన్పిస్తున్నారు.కొంచెం లోతుగా చూస్తే నాలుగోవ్యక్తికి తోక కన్పిస్తోంది.అంటే ఇక్కడ సుగ్రీవుడు కూడ సింహాసనం దగ్గర సోదరులతో సమానంగా గౌరవించబడ్డాడన్నమాట.
                    బంగారు నాణెం మీదున్న పట్టాభిషేకదృశ్యంలో సీతాదేవి రామునివలెనే సభకు అబిముఖంగా అభయహస్తధారిణియై ఉంటే వెండి నాణెం మీద మాత్రం రామచంద్రునివైపు తిరిగి ముకుళితహస్తాలతో నమస్కరిస్తున్నట్టు ముద్రించబడింది.
                               

 ఇక నాణాల రెండోవైపు పరిశీలిస్తే---చిత్రం---4 –గమనించవచ్చు.        

  


               బంగారు నాణెం వెనుకవైపు రామలక్ష్మణులు థనుర్బాణధారులై ఉండగా,వారి పైన గుండ్రంగా....ద్దమన జానక జవల హనుమతక.... ఇత్యాదిగా ప్రాకృతంలో(అనుకుంటా) వ్రాసిఉంది. వెండి నాణెంమీద రామసీతః అని సంస్కృతంలో వ్రాయబడింది. రెండింటిలోను సంవత్సరాలు 4 తోనే ప్రారంభమౌతున్నాయి.
            నాకున్న పరిమితజ్ఞానంతో,రామాయణం మీద,రాముని మీద ఉన్న భక్త్యభిమానాలతో ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఇంతకు ముందే ఇటువంటివి లభించి వుంటే,పరిశోధన జరిగివుంటే దయచేసి ఆ ఆకరువును తెలియజేయండి.జాతికి చరిత్రకు ఉపయోగపడే విషయంగా భావించి దీన్నిఅందిస్తున్నా.ఏ ఒక్కరికి ఇది ప్రయోజనం కల్గించినా నా ప్రయత్నం సఫలమైనట్లే భావిస్తాను.
                             
                        జయన్తి తే సుకృతినః రససిద్దాః కవీశ్వరాః  (9441056609)

****************************************************************