Friday 30 May 2014

శతకసౌరభాలు -2 ధూర్జటి శ్రీ కాళహస్తీశ్వర శతకము -5


శతక  సౌరభాలు -2
                                                 ధూర్జటి   శ్రీ కాళహస్తీశ్వర శతకము  - 5




భవదు:ఖంబులు రాజకీటకములనే బ్రార్ధించినన్ బాయునే
భవదంఘ్రి స్తుతి చేతగాక , విలసద్బాలక్షుధా క్లేశ దు
ష్ట విధుల్మానునె చూడ మేక చంటం దల్లి కారుణ్య దృ
ష్టి విశేషంబుల నిచ్చు చంటి వలె శ్రీ కాళహస్తీశ్వరా !
                    

                శ్రీ కాళహస్తీశ్వరా  ! జనన మరణాది సంసార దు:ఖములు నీ పాదపాద్మములను సేవించుట చేత కాక రాజులనే కీటకములను సేవించుటచే సేవించుట వలన పోవునా . ఎట్లనగా  ఎదుగుచున్న శిశువు యొక్క ఆకలి బాధ  కరుణామృత హృదయముతో కన్నతల్లి ఇచ్చెడి  చనుబాల తో తీరును కాని   మేక మెడక్రింద చన్నుల వలన తీరదు కదా !

 పవి పుష్బంబగు, నగ్ని మంచగు ,నకూపారంబు భూమీస్ధలం
 బవు ,శత్రుం డతిమిత్రుడౌ, విషము దివ్యాహారమౌ నెన్నగా
 నవనీ మండలి లోపలన్ శివశివే త్యాభాషణోల్లాసికిన్
 శివ నీ నామము సర్వ వశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వరా !

    
                   ఓ శంకరా  !    ఈ భూమి మీద   అత్యంతమహిమ కల్గిన శివ శివ అనెడి నీ నామస్మరణము చేయువానికి   వజ్రాయుధము పూలమాలగాను , అగ్ని గుండము మంచుకొండగను , సముద్రము భూ ప్రదేశముగను , శత్రువు అతి మిత్రుడు గను , కాలకూట విషము దివ్యాహారము గను  మారిపోవును . ఆలోచింప గా నీ నామము సర్వ వశ్యకరమనుటలో సందేహమే లేదు. 

లేవో  కానల కందమూలఫలముల్ లేవో గుహల్తోయముల్
లేవో యేరుల పల్లవాస్తరణముల్ లేవో సదా యాత్మ లో
లేవో  నీవు విరక్తులన్మనుప జాలిం బొంది , భూపాలురన్
సేవల్సేయగ బోదురేలొకో జనులు ? శ్రీ కాళహస్తీశ్వరా !

                   ఈశ్వరా  ! అడవులలో తినుటకు కందమూల ఫలాలు , నివసించ డానికి గుహలు ,సెలయేర్ల   యందు నీరు , పత్రి మున్నగు పూజాద్రవ్యాలు , చిగురాకుల శయ్యలు లభించుచున్నవి కదా .  విరక్తులైన వారిని ఆదరించి కాపాడటానికి నీవు ఉన్నావు కదా . మరి ఈ మూర్ఖపు ప్రజలు   ఎందుకు రాజులను ఆశ్రయిస్తారో తెలియడం లేదు . 
             
మును  నేఁ బుట్టిన పుట్టులెన్ని గలవో మోహంబు చే నందు చే
సిన కర్మంబుల ప్రోవులెన్ని గలవో చింతించినం గాని , యీ
జననం బేయని యున్నవాడ నిదియే చాలింపవే నిన్ను గొ
ల్చిన పుణ్యంబునకుం గృపారతుడవై శ్రీ కాళహస్తీశ్వరా !

                      ఓ శంకరా  ! నేను ఇంతకు ముందు ఎన్ని జన్మలెత్తానో , ఆ జన్మల్లో అజ్ఞానం తో ఎన్ని పాపాలు చేశానో  తెలియదు . ఇప్పుడున్న ఈ జన్మయే చివరిదని భావిస్తున్నాను . నిన్ను సేవించిన పుణ్యానికి  నన్ను కరుణించి   ఈ జన్మ నే  చివరి జన్మ గా చేసి నన్ను రక్షించవలసినది ప్రభూ. !   

తనువెందాక ధరిత్రి నుండు నను నందాక న్మహా రోగ దీ
పన దు:ఖాదుల బొందకుండ ననుకంపాదృష్టి వీక్షించి యా
వెనుక న్నీపదపద్మము ల్దలచుచు న్విశ్వ ప్రపంచంబుఁ బా
సిన చిత్తంబున నుండ జేయ గదవే ! శ్రీ కాళహస్తీశ్వరా !

                ఓ ఈశ్వరా  ! ఈ భూమి మీద నేనెంత కాలం బ్రతికుంటానో అంతకాలం మహారోగాల మూలం గా   కలిగే దుఖాలు లేకుండా  దయతో చూసి , ఆపై ఇహలోక విషయాలను వదలి వేసి , నీ పాదపద్మములను సేవించే భాగ్యాన్ని కల్గించు స్వామీ  !

జలకంబుల్ రసముల్ ప్రసూననములు వాచాబంధముల్ వాద్యము
ల్కల శబ్దధ్వను లంచితాంబరమలంకారంబు దీప్తు ల్మెఱుం
గులు నైవేద్యము , మాధురీ మహిమ గా గొల్తు న్నినున్ భక్తి రం
జిల దివ్యార్చన గూర్చి  నేర్చిన క్రియన్ శ్రీ కాళహస్తీశ్వరా !

          శంకరా  ! నేను  నిన్ను   నా   కవిత్వముచే పూజించెదను . కవిత్వమునందలి  రసములే అభిషేక జలం గా ,  వాక్కులే  పూజా పుష్పాలు గా , అనుభూతి ప్రకటితమైన ధ్వనులే  శంఖాది మంగళ వాద్యాలు గా , సుప్రకాశమైన ఆకాశమే ఆభరణం గా , కావ్య గుణములే దీపాలు గా , కావ్యమందలి మాధుర్యమే మహర్నివేదన గా  దివ్యార్చన  గురించి  నేను నేర్చిన రీతిలో భక్తి తో నిన్ను పూజిస్తాను ప్రభూ.  !
                           
ఏ లీల న్నుతియింపవచ్చు నుపమోత్ర్పేక్షాధ్వని వ్యంగ్య శ
బ్దాలంకార విశేష భాషల కలభ్యంబైన నీ రూపముం
చాలుంజాలుఁ గవిత్వమున్నిలుచునే నిత్యంబు వర్ణించుచో ?
ఛీ ! లజ్జింపరు గాక మాదృశ కవుల్ ! శ్రీ కాళహస్తీశ్వరా !

                       శ్రీ కాళహస్తీశ్వరా   !  నీ రూపాన్ని వర్ణించడానికి  ఉపమ ,ఉత్ప్రేక్ష  ,ధ్వని , వ్యంగ్యము , శబ్ధ , అర్దాలంకారాలు ,  విశేష వ్యాకరణాదులకు కూడ అసాధ్యము . మరి ఎలా నిన్ను వర్ణించగలను . అసలు నీ సత్యరూపాన్ని వర్ణించాలంటే  కవిత్వం  నిలబడుతుందా  ? నిలబడదు . కాని మా వంటి కవులు సిగ్గు లేకుండా నిన్ను వర్ణించాలని చూస్తున్నారు . సిగ్గుచేటు. ఛీ  ! ఛీ !.

పాలుం బువ్వయు బెట్టెదన్ గుడువరా పాపన్న ,రాయన్న లే
లే లెమ్మన్న నరంటి పండ్లు గొని తే , లేకున్ననే నొల్ల నం
టే , లాలింపరె తల్లిదండ్రులపుడట్లే తెచ్చి వాత్సల్య ల
క్ష్మీ లీలా వచనంబులం గుడుపరా !  శ్రీ కాళహస్తీశ్వరా !

                       ఈశ్వరా  !  తల్లిదండ్రులు తమ బిడ్డకు   పాలబువ్వ పెడతాను తినరా ! నాయనా  !  రా రా బాబూ  !  అని బుజ్జగిస్తుంటే ఆ పిల్లవాడు   నాకు అరటి పండ్లు  కావాలి తెచ్చిన గాని తిననని మారాం చేస్తే  , ఆ బిడ్డకు అరటి పండ్లు తెచ్చి తినిపింతురు కదా  !  అట్లే నీవు నాకు ప్రేమ తో నిండిన ముద్దు మాటలతో   అన్నము తినిపించవలసినది స్వామీ !

                     ఈ పద్యం లో కవియొక్క  ఆత్మ నివేదన తుది దశకు చేరింది. కన్నబిడ్డ లా తనను ఓదార్చి , దగ్గరకు తీసుకొని  అన్నం తినపించమని తన దైవాన్ని  కోరుకుంటున్నాడు .

కలలంచు న్శకునంబులంచు గ్రహయోగంబంచు సాముద్రికం
బు లటంచుం దెవులంచు ,దిష్టియనుచు న్భూతంబులంచు న్విషా
దు లటంచు న్నిమిషార్ధ జీవనములందుం బ్రీతి పుట్టించి నా
సిలుగుల్ ప్రాణుల కెన్ని చేసితివయా ! శ్రీ కాళహస్తీశ్వరా !        

                   ఈశ్వరా !  రెప్పపాటు లో మరణించే  ఈ జీవుల యొక్క  జీవితాల లో మమకారాన్ని పుట్టించి ,  కలలనీ , శకునాలనీ ,  గ్రహా యోగ సాముద్రికాలనీ , రోగాలు ,  దిష్టులు భూతాలనీ , విషప్రయోగాలనీ  ఎన్ని ఆపదలను సృష్టించావు  స్వామీ  !

తలమీద కుసుమ ప్రసాద మలిక స్ధానంబు పై భూతియున్
గళ సీమంబున దండనాసిక తుదన్గంధ ప్రసారంబు ,లో
పల నైవేద్యంబు జేర్చు నే మనుజుడా భక్తుండు నీ కెప్పుడున్
జెలికాడై  విహరించు రౌప్యగిరి పై ; శ్రీ కాళహస్తీశ్వరా !      

                ఈశ్వరా !  ఏ పురుషుడు నిత్యము నీ నిర్మాల్యమును తలపై ధరించుచూ , నుదుటి పై విభూతిని ,  మెడలో  రుద్రాక్షలను  ధరించి , నీ పూజాపుష్పాల నిర్మాల్యాన్ని ఆఘ్రాణిస్తూ , నీ నైవేద్యం తో కడుపు నింపుకుంటాడో  ఆ భక్తుడు  ఎల్లవేళలా నీకు చెలికాడై ,  వెండికొండ మీద  విహరించ గలుగుతాడు .

ఆలుంబిడ్డలు మిత్రులున్ హితులు నిష్టార్థంబు లీ నేర్తురే
వేళన్వారి భజింప జాలిపడకావిర్భూత మోదంబునన్
కాలం బెల్ల సుఖంబు నీకు , నిక భక్తశ్రేణి రక్షింపకే
శ్రీ లెవ్వారికి కూడబెట్టెదవయా ? శ్రీ కాళహస్తీశ్వరా !      

                                శ్రీ కాళహస్తీశ్వరా !  భార్యాబిడ్డలు ,మిత్రులు , అనువారు ఎల్లవేళల వారి  స్తోత్రము చేసినను కోరిన కోరికలు తీర్చలేరు కదా ! నీవు  ఎల్లవేళలా ఆనందమయుడవై మా వంటి వారిపై జాలి చూపకున్నావు .  నీ భక్తులను కాపాడకుండా  సంపదలు ఎవ్వరికోసం కూడబెడుతున్నావు స్వామీ.!

గతి నీవంచు భజించు వార లపవర్గం బొందగానేల సం
తతముం గూటికినై చరింప వినలేదా  ? “ యాయురన్నం ప్రయ
చ్ఛతి “  యంచు  న్మొఱవెట్టగా శ్రుతులు సంసారాంధ కారాభి దూ
షిత దుర్మార్గులు గాన గానబడవో ?  శ్రీ కాళహస్తీశ్వరా !     ( 60 )  

                         శ్రీ శంకరా  !  నీవే దిక్కని సేవించిన వారు మోక్షాన్ని పొందుచుండగా , ఎల్లప్పుడూ కూటికై పాకులాడుచూ , సంసారమనే మోహంలో పడి కొట్టుకుపోయే వారు    ఆయుష్షు ఉన్నవారికే అన్నం లభిస్తుందని శ్రుతులు చెప్పిన మాట వినలేదా ?  లేక వారికి వినబడదా  ?


                             చదువుతూ ... ఉండండి  . మరికొన్ని అందిస్తాను  మరి .......





*********************************************************************************

Tuesday 27 May 2014

శతకసౌరభాలు - 2 ధూర్డటి శ్రీ కాళహస్తిీశ్వర శతకము - 4



శతక  సౌరభాలు  -2
                
                           ధూర్జటి   శ్రీ కాళహస్తీశ్వర శతకము - 4

    


     మదమాతంగములందలంబులు హరుల్మాణిక్యముల్పల్లకుల్
     ముదితల్ చిత్రదుకూలముల్పరిమళంబుల్మోక్ష మీ జాలునే
     మదిలో వీని నపేక్ష చేసి నృపధామ ద్వారదేశంబు గాం
     దినంబుల్  వృథ పుత్తు రజ్ఞు లకటా శ్రీ కాళహస్తీశ్వరా !
           

                   శంకరా ! ఏనుగుల ,గుఱ్ఱాలు , పల్లకీలు , రత్న మాణిక్యాలు ,పట్టువస్త్రాలు ,  స్త్రీలు అలంకారాలు మోక్షము నీయలేవు .  అజ్ఞానులు వీటినే కోరి  రాజద్వారాల వద్ద రోజుల కొద్దీ పడిగాపులు పడి వృథా గా కాలాన్ని వ్యర్దం చేసుకుంటారు . ఎంత అవివేకులు  వారు .
 
    రోసీ రోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్
    పాసీ పాయదు పుత్రమిత్ర ధన సంపద్ర్భాంతి , వాంఛా లతల్
    కోసీ కోయదు నా మనంబకట ,నీకున్ బ్రీతి సత్ర్కియల్
    చేసీ చేయదు  దీని త్రుళ్ళణచవే  ! శ్రీ కాళహస్తీశ్వరా !
           
                  శ్రీ కాళహస్తీశ్వరా  ! నా మనస్సు యౌవ్వన సుకాలను అసహ్యించుకుంటూనే అనుభవిస్తూ ఉంటుంది. పుత్ర మిత్ర ధన సంపద్భ్రాంతి  వదిలేసినట్లే ఉంటుంది కాని వదలలేదు . కోరికలనే తీగలను  తెంచి వేస్తుందే కాని పూర్తిగా కోసి పారవేయలేకపోతోంది . నామనస్సు నీకు ప్రీతి కల్గించే సత్కార్యాలను చేస్తన్నటేలే టుంది కాని చేయదు . కావున దీని పొగరును అణచి నీ మార్గానికి తెచ్చుకొమ్ము  తండ్రీ  !
      
        ఎన్నేళ్ళుండుదు నేమి గందునిక నే నెవ్వారి రక్షించెదన్
     నిన్నే నిష్ట భజించెద న్నిరుపమోన్నిద్ర ప్రమోదంబు నా
     కెన్నండబ్బెడు  నెంతకాలమిక నేనిట్లున్న నన్నియ్యెడం
     జిన్నంబుచ్చక నన్ను నేలుకొనవే శ్రీ కాళహస్తీశ్వరా !
                  
      శ్రీశంకరా !.నేనింకా ఎన్నేళ్లు బ్రతుకుతాను  ? బతికి చూడవలసిన దేముంది  ? నేనింకా ఎవ్వరిని కాపాడాలి  ? ఎటువంటి నిష్ట తో నిన్ను పూజించ గలను  ? సుషుప్త జాగ్రదవస్ధ ల్లో కూడ నీ స్మరణ నాకు ఎప్పుడు లభిస్తుందో ? ఇంకా ఎన్నాళు నేనిలా అశక్తుడు గా ఉండిపోవాలి  ? నన్ను నీవు చిన్నబుచ్చక త్వరగా నీచెంతకు చేర్చుకో స్వామీ !

                      భక్తి శతక రచన లోని ప్రధానాంశము ఆత్మ నివేదనము . కవి తన ఆవేదనను రోదనను మనసు చించి తన దైవం ముందు ఆరపోస్తాడు.  అప్పుడే కవి కి ఆత్మ తృప్తి కలుగి  ,మనసు తేలిక పడుతుంది .

    చావం కాలము చేరువౌటెరిగియుం చాలింపగా లేక ,త
    న్నే వైద్యుండు చికిత్సఁబ్రోవగలడో ,ఏ మందు రక్షించునో ,
    ఏ వేల్పుల్ కృపజూతురో యనుచు నిన్నింతైన చింతిప డా
    జీవశ్రాద్ధము చేసికొన్న యతియున్ ; శ్రీ కాళహస్తీశ్వరా !
  
         శ్రీ కాళహస్తీశ్వరా ! మానవుడు చావుకాలము దాపురించినదని తెలిసి కూడ , బ్రతుకు పై ఆశను చంపుకోలేక , తనను ఏ వైద్యుడు కాపాడతాడా ఏమందు ర7స్తుందా , ఏ దేవుడు తన ప్రాణాలను నిలబెడతాడా అని ఆలోచిస్తాడే కాని గయ వంటి ప్రదేశాల్లో జీవశ్రాద్ధము పెట్టుకున్న సన్యాసి కూడ ఆ సమయం లో నిన్ను గూర్చి కొంచెము కూడ ప్రార్ధంచడు కదా  !

   దినముం జిత్తములో సువర్ణ ముఖరీతీర ప్రదే శామ్ర కా
   నన , మధ్యోపలవేది కాగ్రమున నానందంబునం పంకజా
   సన నిష్ట న్నినుఁ జూడఁ గన్న నదివో సౌఖ్యంబు లక్ష్మీవిలా
  సిన  మాయానటనల్ సుఖంబులగునే ? శ్రీ కాళహస్తీశ్వరా !

                   ఈశ్వరా !   ప్రతి రోజు సువర్ణ ముఖీనదీ తీర మందున్న మామిడి తోట  మధ్యలో నున్న బండరాతి పై  ఆనందంగా   పద్మాసనం లో కూర్చొని నిన్ను చూడగల్గినదే సౌఖ్యము. కాని చంచలమైన సంపదలచే లభించు ఆనందములు సుఖము నీయవు కదా !
 
  ఆలంచు న్మెడగట్టి , దానికి నపత్యశ్రేణిఁ గల్పించి , త
  ద్బాలవ్రాతమునిచ్చి పుచ్చుకొను సంబంధంబు గావించి ,యా
  మాలార్కంబున బాంధవంబనెడి ప్రేమం గొందరం ద్రిప్పగా
  సీలన్సీల నమర్చినట్లొ సగితో : శ్రీ కాళహస్తీశ్వరా !

                         ఈశ్వరా  !  భార్య అనే ఒక దాన్ని మెడకు కట్టి , దానికి పిల్లలు అనే వాళ్ళను కల్పించి , వారికి పిల్లలను  వారికి  అల్లుళ్ళూ ,కోడళ్లూ   ఇచ్చి పుచ్చుకునే సంబంధాలను కల్పించి ,  ఒక దండ వలే బంధుత్వమనే ఒక మోహబంధం లో ఈ జీవిని బంధించి చోద్యము చూస్తున్నావు గా స్వామీ ! 

 తనువే నిత్యముగా నొనర్పుమది లే దా చచ్చి , జన్మింపకుం
 డు నుపాయంబు ఘటింపు , మా గతులరెంట న్నేర్పులేకున్న లే
 దని నాకిప్పుడె చెప్పు చేయగల కార్యంబున్న సంసేవ జే
  సి నినుం గాంచెదఁ గాక కాలముననో ; శ్రీ కాళహస్తీశ్వరా !

                  శంకరా ! ఈ శరీరానికి  మరమం లేకుండా చెయ్యి. లేదా మరణించిన తరువాత  తిరిగి పుట్టకుండా ఏదైనా సులువైన ఉపాయం ఏర్పాటుచెయ్. ఆ రెండు చేతకాకపోతే నాకు ఇప్పుడే చెప్పు. నా ప్రయత్నాలేవో  నేను  చేసుకొని , ఏవో పాట్లు పడి , మరణానంతరం లో నీ చెంతకు  చేరుకుంటాను .

పదునాల్గేలె మహాయుగంబు లొక భూపాలుండు ,చెల్లించె న
య్యుదయాస్తాచల సంధి నొకడా యుష్మంతుడై , వీరియ
భ్యుదయం బెవ్వరు చెప్పగా వినరొ అల్పుల్మత్తులై యేల చ
చ్చెదరొ రాజులమంచు నొక్క టకటా ! శ్రీ కాళహస్తీశ్వరా !

       శ్రీ కాళహస్తీశ్వరా . ! ఒక రాజు పధ్నాలుగు వేల మహాయుగములు పరిపాలించాడు. ఒక ప్రభువు  ఆయుష్మంతుడై ఉదయాస్తమయ పర్వతముల మధ్య భాగాన్ని అనేక సంవత్సరాలు పాలించాడు . ఇటువంటి వారి చరిత్రలు  విని కూడ  నేడు అల్పబుద్ధి గల రాజులు  తమ స్ధాయిని మరచిపోయి తాము కూడ రాజుల మని విర్రవీగుచూ మరణిస్తున్నారు. ఎంత విచిత్రము .

రాజన్నంతనె బోవునా గృపయు ధర్మంబాభిజాత్యంబు వి
ద్యాజాతక్షమ ,సత్యభాషణము ,విదన్మిత్ర సంరక్షయున్,
సౌజన్యంబు ,కృతంబెరుగుటయు , విశ్వాసంబు గాకున్న దు
ర్బీజ శ్రేష్టులుగా గతంబు గలదే ? శ్రీ కాళహస్తీశ్వరా !

                         ఈశ్వరా  ! ఒక వ్యక్తి రాజైనంత మాత్రముననే అంతకు ముందు అతని లో ఉన్న దయ , ధర్మగుణము , సత్కులీనత , విద్య , క్షమ , సత్యవాక్యము , పండితులను గౌరవించుట , స్నేహితులను రక్షించుట , చేసిన మేలును గుర్తుంచు కొనుట , విశ్వాసము కల్గియుండుట  మొదలగు మంచి లక్షణములు  నశించిపొవును . లేకపోతే రాజులు ఇంత నీచులుగా మారిపోవడానికి కారణం వేరే లేదు.
                
అమరస్రీల రమించినన్జెడదు మోహంబింతయు న్ర్బహ్మప
ట్టము సిద్ధించిన నాసదీరదు ,నిరూఢ క్రోధమున్ సర్వలో
కముల న్ర్మింగిన మానదిందుగల సౌఖ్యంబొల్ల , నీ సేవ చే
సి మహాపాతక వారాశి గడుతున్ ; శ్రీ కా ళహస్తీశ్వరా !     
       
                    ఈశ్వరా  ! ఈ మానవులకు  దేవతాస్త్రీలను అనుభవించినను కోరిక  తీరదు. బ్రహ్మ పదవి లభించినను ఆశ తీరదు . సమస్త లోకములను మ్రింగివేసినను అకారణ కోపము చల్లారదు . అందువలన ఈ సుఖభోగములు నాకు అక్కరలేదు .  నీ సేవచేసి ఈ మహపాతక మనే సముద్రాన్ని దాటాలని కోరుకుంటున్నాను స్వామీ  !

  చను వారింగని ఏడ్చువారు జముడా ! సత్యంబు గా వత్తుమే
మనుమానంబిక లేదు నమ్ముమని తా రావేళ నా రేవునన్
మునుగం బోవుచు బాసజేయుట సుమీ ముమ్మాటికిం జూడగా
చెనటుల్గానరు దీని భావమిదివో  ! శ్రీ కాళహస్తీశ్వరా !    ( 42 )

           శంకరా ! మరణించిన వారిని గూర్చి ఏడ్చేవారు   ఓ యమధర్మ రాజా . ! మేముకూడ తప్పనిసరిగా మరణించి వీని వెనుకే వచ్చెదము . ఎటువంటి సందేహము లేదు అని వారు  శవ సంస్కారవేళ యందు ఆ రేవు నందు  స్నానములు చేయుచు చేయు  వాగ్దానములే . కాని  ఇది తెలివితక్కువ వారు తెలుసుకోలేక    భ్రాంతి లో ఉన్నారు  స్వామీ !

                                                  చదువుతూ .. ఉండండి . మరికొన్ని అందిస్తాను .





*********************************************************************************





.

Monday 26 May 2014

శతక సౌరభాలు - 2 ధూర్జటి కాళహస్తీశ్వర శతకము - 3


శతక సౌరభాలు  - 2
           
                             ధూర్జటి  శ్రీ కాళహస్తీశ్వర శతకము  - 3

         


           రాజై దుష్కృతి చెందె చందురుడు , రారాజై కుబేరుండు దృ
           గ్రాజీవంబున గాంచె దు:ఖము , కురుక్ష్మాపాలుడా మాటనే
           యాజిం గూలె సమస్త రాజబంధువులతో ,నా రాజ శబ్దంబు ఛీ
           ఛీ జన్మాంతరమందు నొల్లను జుమీ ! శ్రీ కాళహస్తీశ్వరా !
           
                ఈశ్వరా !రాజైన చంద్రుడు కళంకితుడైనాడు .రారాజైన కుబేరుడు ధనాధిపతి అయ్యు , కుడి నేత్రమును కోల్పోయి , పింగాక్షుడు గా మిగిలిపోయాడు. ( పార్వతీదేవి హరుని   అర్ధాంగి యై ఆయన తొడపై అందంగా కూర్చొని ఉండటాన్ని చూచిన కుబేరుడు ఆమె అదృష్టానికి  ఈర్ష్యాళువై , అసూయ తో  ఆమెను కుడి కంటి తో చూశాడట. అందువలన  కుబేరుని కుడికన్ను నీరుకారి పోయి , అనంతర కాలం లో పింగాక్షుడైనాడని పురాణ గాథ ) .  రాజరాజు గా పేరొందిన దుర్యోధనుడు  ,చివరకు యుద్ధము లో  సమస్త బంధు మిత్రులతో కలసి  నేలకూలాడు . అందువలన ఓ శంకరా .ఈ రాజ శబ్దమును  నేను జన్మాంతరమందు నైనను అంగీకరించను  సుమా !

        రాజర్ధాతురుడైనచో నెచట  ధర్మంబుండు  ? నే రీతి నా
        నాజాతి క్రియలేర్పడున్ ? సుఖము మాన్యశ్రేణి కెట్లబ్బు  ? రూ
        పాజీవాళి కి నేది దిక్కు ? ధృతి నీభక్తుల్ భవత్పాద నీ
        రేజంబుల్ భజియింతురే తెరగునన్ ? శ్రీ కాళహస్తీశ్వరా !
    
                శ్రీ కాళహస్తీశ్వరా  ! రాజు ధనదాహం గలవాడైనచో ఇంకా రాజ్యం లో ధర్మం ఎలా  నిలబడుతుంది . ఏ విధంగా వర్ణాశ్రమ ధర్మాలు  కొనసాగుతాయి . గౌరవ మర్యాదలతో జీవించే వారు ఏ విధంగా  సుఖంగా ఉండగలరు .  వార కాంతలకు   ఎవరు ఆధారమౌతారు . ధైర్యం తో నీ భక్తులు  ఏ విధంగా నిన్న్ను సేవించగలుగుతారు ప్రభూ !
         
                 తరగల్ పిప్పలపత్రముల్ మెఱుగుటద్దంబుల్ మరుద్దీపముల్
                 కరికర్ణాంతము లెండమావులతతుల్ ఖద్యోత కీటప్రభల్
                 సురవీధీ లిఖితాక్షరంబు లసువుల్  జ్యోత్స్నా పయ:పిండముల్
                 సిరులందేల మదాంధు లౌదురొ జనుల్ ; శ్రీ కాళహస్తీశ్వరా !

                             ఈశ్వరా  !  ఈ ప్రాణాలు  నీటి కెరటాలు , రావి ఆకులు ,  మెరిసే అద్దాలు , గాలిలో పెట్టిన దీపాలు , ఏనుగు చెవుల చివరి వలే  చంచలాలు  , ఎండమావుల సమూహాలు , మిణుగురు పురుగు కాంతులు , ఆకాశం లో వ్రాసిన వ్రాతలు , వెన్నెల లోని  పాల కాంతిను ప్రోగు చేసినట్లు అశాశ్వతాలు.  కాని ఈ జనులు ఈ విషయాన్ని లెక్కచేయక సిరి సంపదలచే మదాంధులై ప్రవర్తించుచున్నారు .   ఎంత ఆశ్చర్యము !

           నిన్నున్నమ్మిన రీతి నమ్మ నొరులన్ , నీకన్న నాకెన్న లే
           రన్నల్దమ్ములు , తల్లిదండ్రులు  గురుండాపత్సహాయుండు , నా
           యన్నా  యెన్నడు నన్ను సంసృతి విషాదాంబోధి  దాటించి య
           చ్ఛిన్నానంద సుఖాబ్ది దేల్చెదొ కదే ! శ్రీ కాళహస్తీశ్వరా ! 
              
                             శంకరా ! నేను నిన్ను నమ్మినట్లు గా ఇతరులను ఎవ్వరినీ నమ్మను . నీకన్న నాకు తల్లిదండ్రులు , అన్నదమ్ములు , గురుడు , స్నేహితుడు  అనే వారు ఎవ్వరూ లేరు .  ఓ స్వామీ  ! నన్ను ఈ సంసార మనే దుఖ సముద్రాన్ని  దాటించి  శాశ్వతానందమయమైన సుఖ సముద్రము లో నన్ను  ఎన్నడు ఓలలాడిస్తావో కదా స్వామీ !

          నీ పంచబడి యుండగా గలిగిన న్భిక్షాన్నమే చాలు ని
          క్షేపం బబ్బిన రాజకీటకముల నే సేవింపగా నోప ,నా
          శాపాశంబుల జుట్టి త్రిప్పకుము సంసారార్ధమై ,బంటు గా
          చేపట్టం దయగల్గెనేని మదిలో  శ్రీ కాళహస్తీశ్వరా !
         
               ఈశ్వరా  !  నామీద దయచూపి  నన్ను నీ సేవకుడి గా  స్వీకరించు . నీ పంచ లో చోటు దొరికితే నాకు భిక్షాన్నమైనా చాలు . నిధి నిక్షేపాలిచ్చినా  హీనులైన రాజులను సేవించలేను .  సంసారం కొఱకు ఆశాపాశాలతో నన్ను త్రిప్పక  నీ బంటు గా  నన్ను స్వీకరింపుము .

         నీ పేరున్ భవదంఘ్రి తీర్ధము భవ న్నిష్ట్యూత తాంబూలమున్
         నీ పళ్లెంబు ప్రసాదమున్ గొని కదా  నే బిడ్డడైన వాడ న
         న్నీ పాటిం కరుణింపు మోప నిక నే నెవ్వారికిం బిడ్డగాన్
         చేపట్టందగు పట్టి మానదగదో ? శ్రీ కాళహస్తీశ్వరా !
         
                 పరమేశ్వరా  ! నీ పేరును స్మరిస్తూ , నీ పాదోదకమును స్వీకరిస్తూ , నీచే ఎంగిలి చేయబడిన  నీ పళ్ళెం లోని ప్రసాదాన్ని , తాంబూలాన్ని స్వీకరిస్తూ నేను నీ బిడ్డగానే పెరిగాను నేను ఇంకా ఎవ్వరికీ బిడ్డగా ఉండలేను .  చేపట్టి  తిరిగి వదిలివేయడం ధర్మం కాదు .  నన్ను నీ బిడ్డగా దగ్గరకు తీసుకోవలసింది స్వామీ !
        
         అమ్మా ! యయ్య యటంచు నెవ్వరిని నేనన్న న్శివా నిన్ను
         సుమ్మీ!   నీ మది తల్లి దండ్రులటంచు న్జూడగా బోకు నా
         కిమ్మైఁ  దల్లియుఁ దండ్రియున్ గురుడు నీవే కాగ సంసారపుం
         జిమ్మంజీకటి గప్పకుండ గనుమా ! శ్రీ కాళహస్తీశ్వరా !

                   ఓ శివా  ! నేను అమ్మా , అయ్య అని ఎవరినైనా పిలిచినను అది నిన్నే సుమీ . నీవు కాక నాకు తల్లి దండ్రులెవరున్నారు . నాకు తల్లి  ,తండ్రి , గురువు నీవే కాబట్టి  నన్ను ఈ సంసారమనే  కారు చీకటి కమ్మకుండా నీవే కాపాడవలసింది  స్వామీ !
       
         కొడుకుల్ పుట్టరటంచు నేడ్తు రవివేకుల్ జీవనభ్రాంతులై
         కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ , వారిచే నే గతుల్
         వడసెన్ ? పుత్రులు లేని యా శుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్
         చెడునే మోక్షపదం బపుత్రకునకున్ ? శ్రీ కాళహస్తీశ్వరా !

                 ఓ శంకరా !.ఈ లోకంలో కొందరు అవివేకులు బ్రతుకు మీద ఆశతో కొడుకులు పుట్టలేదని  విచారిస్తుంటారు . దృతరాష్ట్రునకు వందమంది కొడుకులు పుట్టలేదా  ?  వారి వలన అతనికి ఎటువంటి సద్గతులు కల్గినవి ?  పుత్రులు లేని శుకమహర్షి కి ఏ దుర్గతులు కల్గినవి ? కావున పుత్రులు లేని వారికి మోక్షము లభంచదనుట అవివేకము కదా !
                
          గ్రహదోషంబులు  దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్ర
          త్యహమున్ బేర్కొను  నుత్తమోత్తముల బాధంబెట్టగ నోపునే
          దహనుం గప్పగజాలునే శలభ సంతానంబు ;  నీ సేవ చే
          సి హతక్లేశులు గారు గాక మనుజుల్ ; శ్రీ కాళహస్తీశ్వరా !
  
                           శ్రీ కాళహస్తీశ్వరా గ్రహదోషము వలన కలిగెడి దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామమును ఎల్లప్పుడు జపించెడి  ఉత్తములైన నీ  భక్తబృందమును  బాధపెట్టలేవు కదా . ఎట్లనగా ముడతల గుంపు  అగ్ని హోత్రుని ఆర్పలేవుకదా . అదే విధంగా నిను సేవించెడి మానవులను కష్టములు దరి చేరవు కదా  ప్రభూ !
                                   శ్రీ కాళహస్తి లో నిర్వహించే రాహు కేతు పూజలకు ఈ విశ్వాసమే ప్రేరణ యై ఉండవచ్చు.

      అడుగం బోనిక నన్యమార్గ రతులం  బ్రాణావనోత్సాహినై ,
      యడుగంబోయిన బోదు నీదు పద పద్మారాధక శ్రేణియు
      న్నెడకు నిన్ను భజింపగా గనియు  నాకేలా పరాపేక్ష కో
      రెడి దింకేమి భవత్ర్పసాదమె తగున్ ! శ్రీ కాళహస్తీశ్వరా !   ( 30 )

                                శ్రీకాళహస్తీశ్వరా !  .ప్రభూ  !  నేను  ప్రాణ రక్షణ కోసం నిన్ను కాకుండా ఇతరులను సేవించువారిని  యాచించను .  అంతగా యాచించవలసివచ్చిన నీ భక్తులను మాత్రమే అర్థించెదను .  అయినా నిన్ను సేవించెడి నాకు ఇతర వాంఛలు ఏముంటాయి ?. నీ అనుగ్రహ ప్రసాదం తప్పితే నాకు ఇంకేమి  అక్కరలేదు స్వామీ !

                                     .చదువు తూ .. ఉండండి .  మరికొన్ని అందిస్తాను.



*********************************************************************************