Saturday 3 May 2014

శతకసౌరభాలు - 1 దాశరథీ శతకము - 3

శతకసౌరభాలు – 1
          కంచర్లగోపన్న   దాశరథీ శతకము -3



            

             పండితరక్షకుం డఖిలపాపవిమోచను డబ్జసంబవా
             ఖండలపూజితుండు దశకంఠ విలుంఠన చండకాండ కో
             దండ కళాప్రవీణు డను తావక కీర్తివధూటి కిత్తుఁబూ
             దండయుఁ గాకఁ నాకవిత దాశరథీ! కరుణాపయోనిధీ!
                   
      ఓ రామా  ! పండితులనుకాపాడువాడు , సమస్త పాపములను  వదిలించువాడు , బ్రహ్మేంద్రాదుల చేత పూజించబడువాడు ,రావణుని పరిమార్చగల్గిన భయంకరమైన  కోదండవిద్య లో నేర్పరి యైన వాడు అనెడి తమ యొక్క కీర్తికాంతకు నేను నా కవిత్వమనెడి పూలమాలను సమర్పించుచున్నాను.

            అజునకుఁ దండ్రివయ్యు సనకాదులకుం బరతత్త్వమయ్యు ,స            
           ద్విజమునికోటికెల్లఁ గులదేవతవయ్యు దినేశవంశ భూ
           భుజులకు మేటివయ్యుఁ బరిపూర్ణుడవై వెలుగొందు పక్షి రా
           డ్ఢ్వజ  మిముఁ బ్రస్తుతించెదను దాశరథీ ! కరుణాపయోనిధీ !

             శ్రీ దాశరథీ  ! నీవు బ్రహ్మదేవునకు తండ్రివి.సనకాది మహర్షులకు పరబ్రహ్మమూర్తివి. ముని ద్విజ శ్రేష్ఠులకు ఇలవేల్పువు వయ్యు సూర్యవంశపు రాజులలో మేటివయ్యు  పరిపూర్ణుడవై ప్రకాశించెడి గరుడ ధ్వజుడవని  కీర్తించుచున్నాను.

   శ్రీ రమ సీతగాఁగ నిజసేవకబృందము వీరవైష్ణవా
         చార జనంబు గాఁగ విరజానది గౌతమి గా,వికుంఠ ము
         న్నారయ భద్ర శైల శిఖరాగ్రము గాఁగ , వసించు చేతనో
         ద్ధారకుఁడైన విష్ణువవు దాశరథీ! కరుణాపయోనిధీ !      

                   శ్రీరామచంద్రా ! కరుణాసముద్రా !  శ్రీమహాలక్ష్మీదేవియే  సీతాదేవి. నీసేవకబృందమే వీరవైష్ణవాచార్య సమూహము. విరజానదియే గోదావరి.  శ్రీ వైకుంఠమే భద్రశైలశిఖరము. కాగా భూలోకమునందలి జీవుల నుద్దరించుటకు ఆవిర్భవించిన శ్రీ మహావిష్ణవవు నీవు.

              కంటి నదీతటంబుఁ బొడగంటిని భద్రనగాధివాసమున్
        గంటి నిలాతనూజ ,నురుకార్మక మార్గణ శంఖచక్రముల్
       గంటిని ,మిమ్ము లక్ష్మణుని గంటి , గృతార్ధుడనైతి , నో జగ
       త్కంటక దైత్యనిర్ధళన !  దాశరథీ! కరుణాపయోనిధీ!      

                   శ్రీరామా ! గోదావరీ తీరమును ,భద్రగిరి యందలి తమ నివాసమును , శ్రీ  సీతాదేవి ని , మీయొక్క విల్లు ,బాణమును ,శంఖ చక్రములను , మిమ్ము ,లక్ష్మ ణుని చూచి ధన్యుడనైతిని .లోకములను బాధించు రాక్షసులను సంహరించిన ప్రభూ !

           హలికునకున్ హలాగ్రమున నర్ధముసేకురుభంగి , దప్పి చే
           నలమట నొందు వానికి సురాపగ లో జలమబ్బినట్లు , దు
            ర్మలిన మనోవికారినగు మర్త్యు నను  దయ జూచి నీపయిన్
           దలపు ఘటిల్లఁ జేసితివి దాశరథీ ! కరుణాపయోనిధీ !      

            శ్రీరామా ! దయాసముద్రా !  పొలము దున్నుకొను వానికి నాగలి కొనను  ధనము లభించనట్లు , దప్పిక తో పీడించబడేవాడికి గంగాజలం లభించినట్లు ,దుర్మార్గుడనైన నాపై దయచూపి నీయెడల భక్తిని కల్గచేశావు .

            కొంజక తర్కవాదమను గుద్దలి చేఁ బరతత్త్వ భూస్ధలిన్
            రంజిలఁ ద్రవ్వి కన్గొనిన రామనిధానము నేడు భక్తి సి
            ద్ధాంజనమందు హస్తగతమయ్యె బళీ యనగా మదీయ హృ
             త్కంజమునన్ వసింపుమిక  దాశరథీ! కరుణాపయోనిధీ !      

                      శ్రీరామచంద్రా ! కారణవాదమనెడి గుద్దలి చే వేదాంతమనెడి నేలను త్రవ్వగా భక్తియనెడి సిద్ధాంజనము వలన శ్రీరామ యనెడి నిధి లభించినది .ఎంత సంతోషము .ఇక  నాహృదయమనెడి కమలము నందు ఎల్లప్పుడు నివసింపుము స్వామీ !

               రాముడు ఘోరపాతక విరాముడు , సద్గుణకల్పవల్లికా
               రాముడు , షడ్వికారజయరాముడు ,సాధుజనావనవ్రతో
                                                   ద్దాముడు రాముడే పరమదైవము మాకని మీ యడుంగు
                                                    దామరలే భజించెదము దాశరథీ! కరుణాపయోనిధీ !   
                        శ్రీరామా  ! భయంకరమైన పాపములను తొలగించువాడు , సద్గుణముల ప్రోవు కామక్రోధాది అరి
షడ్వర్గములను జయించు లీల కలవాడు సజ్జన రక్షణయే వ్రతము గా గలవాడు నైన శ్రీరామచంద్రుడే మా కులదైవమని ప్రకటించి నీ పదపద్మములను సేవించెదము .

                                              చెక్కెరమాని చేదు దినజాలిన కైవడి మానవాధముల్
                                              పెక్కులు బక్క దైవముల వేమఱు గొల్చెద రట్లకాదయా !
                                            మ్రొక్కిన నీకు మ్రొక్కవలె మోక్షమొసంగిన నీవె యీవలెన్
             దక్కినమాట లేమిటికి ? దాశరథీ! కరుణాపయోనిధీ !             


                 శ్రీరామా  ! భయంకరమైన పాపములను తొలగించువాడు , సద్గుణముల ప్రోవు , కామక్రోధాది అరి

              శ్రీ రామచంద్రా !చెక్కెరను మాని చేదు వస్తువును  తిన్నట్లు గా  కొందఱు తెలివి లేని వారు నిన్ను మాని చిల్లర దేవతలను సేవింతురు. అది తప్పు కదా. సేవిస్తే నిన్నే సేవించాలి . మోక్షమిస్తే నీవే వ్వాలి. తరమైన మాటలు ఎందులకు దేవా !.       
                      ఈ పద్యం లో శ్రీ రామదాసు  శ్రీ రామసేవాప్రాశస్త్యం తో పాటు కులదైవం పై భక్తునకుండే అనిర్వచనీయమైన నమ్మకాన్ని ,విశ్వాసాన్ని ప్రకటించాడు. ఉంటే నీవే.  లేకపోతే లేదు . నీవే తప్ప నిత: పరంబెరుగనన్నదే భక్తుని ఆర్తి. అదే భక్తుని నమ్మకం. ఆ  నమ్మకానికే భగవంతుడు బందీ అవుతాడు.  భక్తపరాధీనుడౌతున్నాడు.

               రా కలుషంబులెల్ల బయలంబడఁ ద్రోసిన మా కవాటమై
           ఢీకొని ప్రోచు , నిక్కమని థీయుతులెన్నం దదీయవర్ణముల్
           గైకొని భక్తిచే నుడువ గానరు గాక ! విపత్పరంపరల్
           దాకొను నే జగజ్జనుల దాశరథీ ! కరుణాపయోనిధీ. !      
          
                             శ్రీరామా ! రా అనెడి  అక్షరము మనలోని పాపములన్నింటినీ  నోటినుండి బయటకు పడత్రోయగా మా అనే అక్షరం కవాటమై  ఢీకొని మరల వానిని లోనికి రాకుండా నిరోధిస్తుందని పండితులు చెప్పిన మాటను ఈ మానవులు  అంగీకరించి రామనామ స్మరణ చేయరు. అట్లు చేసినచో కష్టములు కలుగవు కదా.!
                                                                  చదువుతూ ఉండండి. మరికొన్ని అందిస్తా.




*********************************************************************************