Friday 24 March 2017

నాల్గవ ప్రకరణం - పుణ్యక్షేత్రాల్లో చాగివారు




నాల్గవ ప్రకరణం


  పుణ్యక్షేత్రాల్లో            చాగివారు
                          

                     చాగి వారి పరిపాలనాపరిథి లో విలసిల్లి ఆనాటికే ప్రసిద్ధ తీర్థ స్థలాలు గా కీర్తించబడిన పుణ్యతీర్థాలు రెండు. ముక్త్యాల మొదటిది కాగా రెండవది వేదాద్రి.   ఈ ఆలయ ప్రాంగణాల్లో ఆనాటి చాగి వంశీయులు వేయించిన శాసనాల వలన ఈ  తీర్థక్షేత్రాల   ప్రాచీనత ను మనం  గమనించడానికి అవకాశం కలుగుతోంది. అంతేకాకుండా  ఆనాటి రాజులు స్వామివారికి చేసిన కైంకర్యాలను తెలుసుకోవడానికి కూడా అవకాశం ఏర్పడుతోంది. వీటిలో ముక్త్యాల శైవక్షేత్రం కాగా వేదాద్రి పంచనారసింహక్షేత్రం.   దీనినే నరసింహతీర్థమని  శాసనాల్లో  పేర్కొన్నారు. 
                 
                   ముక్త్యాల : -          పవిత్ర కృష్ణానది  ముక్త్యాల వద్ద కు వచ్చే సరికి ఉత్తర వాహిని గా మారుతుంది. అనంతరం  వేదాద్రి నారసింహుని సన్నిధానానికి చేరుతుంది. ఉత్తర వాహిని లో స్నానం చేయడం సకల పాపహరమని   భక్తుల నమ్మకం .ముక్త్యాల  లో కృష్ణానది ఉత్తర వాహిని యైన ఈ ప్రదేశం లోనే నదీగర్భం లో ఒక  శివాలయం కన్పిస్తుంది. చిత్రం 34.

   

                                                     -69-
  




                            చిత్రం లో  ఆ ఆలయం  ముఖమండపం   మాత్రమే మనకు కన్పిస్తోంది. ఇది నడి వేసవి లోని పరిస్థితి. క వరదలొచ్చే వర్షాకాలం లో అయితే ఆలయమే కన్పించదు. ఈ ఆలయం లోనిది స్పటికలింగం. సంవత్సరం లో అధిక కాలం  నీటిలోనే మునిగి ఉండే  ఈ మహాదేవునకు ఆరునెలలు దేవతాపూజ ,ఆరునెలలు మానవపూజ యని  ప్రాంతీయులు చెప్పుకుంటారు. ఈ మహాదేవునకు ఎదురుగా నందీశ్వరుడు కూడ  తన స్వామి తో పాటు నీటి లో మునిగి మోర ఎగబట్టి కన్పిస్తున్నాడు. ఒక నంది విగ్రహం ఖిలమై పోగా మరొక నంది ప్రతిష్టించారట. అందుకే మనకు నీటిలో మునిగిన రెండు నందులు కన్పిస్తున్నాయి. వర్షసాంద్రత  తగ్గి ,ప్రాజక్టుల నిర్మాణం జరిగిన ఈ కాలం లోనే ఈ విధం గా ముక్తేశ్వరుడు నీటిలో మునిగి ఉంటే అనాడు ఈ ఆలయం మూడువందల అరవై రోజులు నీటిలోనే ఉండేదేమో నంటే అతిశయోక్తి కాదు. ఈ ముక్తేశ్వరుని  బలిచక్రవర్తి  ప్రతిష్ఠంచి నట్లు గా స్థలపురాణం చెపుతోంది.
                  “పూర్వం బాణాసురుని తండ్రియైన బలిచక్రవర్తి  కైలాసవాసుడైన చంద్రశేఖరుని గూర్చి తపస్సు చేశాడు. ఆతని తపోజ్వాలలు ఎల్లలోకాలను దహించివేయ సాగాయి. దేవతలందరూ భయపడి,పరమేశ్వరుని చెంతకు చేరి రక్షించమని వేడుకున్నారు. కరుణాహృదయుడైన పశుపతి దేవతల కభయమిచ్చి ,వారి గృహాలకు సాగనంపాడు. అనంతరం తన భక్తుని భక్తి కి మెచ్చి బలిచక్రవర్తికి ప్రత్యక్షమయ్య్యాడు. బలిచక్రవర్తి వివిధ రీతులుగా పరమేశ్వరుని స్తుతించి , దేవా. నీవు కాశీక్షేత్రం లో విశ్వేశ్వరుడను పేరు తో వెలసి , సమస్త జీవజాలాన్ని కాపాడుతూ ముక్తిని ప్రసాదిస్తున్నావు. అదే విధం గా దక్షిణ కాశి గా పేరుపొందిన ఈ ముక్త్యాల క్షేత్రం లో ముక్తేశ్వరుడను పేర శక్తి తో గూడి భక్తులకు ముక్తిని ప్రసాదించమని ప్రార్థంచగా ,పరమేశ్వరుడంగీకరించి  ముక్తేశ్వరుడు గా ముక్త్యాల లో వెలిశాడు. నదీగర్భం లో స్వర్ణాలయం దని , దానిని విశ్వకర్మ సృష్టించాడని , ఈ ఆలయం లో స్పటిక లింగాన్ని బలిచక్రవర్తి  ప్రతిష్టించి  పూజించాడని  చెప్పబడుతోంది.

                                                           -70-
                  నదీగర్భం లోని ఈ ఆలయం గాక నదీతీరం లో  మరొక భవానీ ముక్తేశ్వరాలయం కన్పిస్తుంది. ఇది మహామండలేశ్వరులు శ్రీ చాగిపోతరాజుల నిర్మాణం. తన విజయరాజ్యము యెక్క ఆచంద్రతారార్క అభివృద్ధి కొఱకు , తన ప్రజల సుఖశాంతుల కొఱకు చాగి పోతరాజు వేయించిన దానశాసనం ఒకటి శ్రీ భవానీ ముక్తేశ్వర స్వామి వారి ఆలయం లో ధ్వజస్థంభానికి వెనుకగా నున్న నాగశిల పై కన్పిస్తుంది. ఈ శాసనం లో నరసింహవర్థన పోతరాజు  చేసిన అనేక పుణ్యకార్యాలు ప్రస్తావించబడ్డాయి.
                             



                          చాగిపోతరాజు  ముక్తేశ్వర  మహాదేవరకు ఆలయ  నిర్మాణాన్ని చేయించాడు. త్రిపురాంతక , కాశ్మీర మల్లేశ్వర ,విశ్వనాథ , చోడనారాయణ దేవరలకు కనక కలశాలను ఎత్తించాడు. సింహాచల నారసింహునకు   చాగి సముద్రమనే చెఱువును త్రవ్వించాడు. శ్రీశైలం లో మల్లిఖార్జునునకు ఎదురుగా నందికేశ్వరుని ప్రతిష్టించి ,దేవభోగముల కొఱకు  కంభం పాడు , ముచ్చింతాల , బోదపాడు  మొదలైన గ్రామాలను దానం చేశాడు. నతవాడి సీమ ను బెజవాడ నుండి పాలించిన రాజనీతిజ్ఞు డీయన. ( శాసనం -301/1924) ఈ శాసనం మీద తేదీలేదు. అంతేకాదు దీనిలో కొంతభాగం లభించక అసంపూర్తి గా ఉంది. నేలలో పాతివేయబడడం , అనంతర కాలం లో దేవాలయ ప్రాంగణం మెరకచేయబడటం , సిమెంటు ఫ్లోరింగు పనులు  వీటివలన కూడ శాసనం దెబ్బతింటోంది. చిత్రం 36.
             బలిచక్రవర్తి చేనిర్మించేయబడి , విశ్వకర్మ సృష్టి గా చెప్పబడుతున్నదేవాలయం నదీగర్భం లో డిపోయి ,సామాన్యుల కందుబాటులో లేదనే అభిప్రాయం తో  రెండవ పోతరాజు   ఈ ఆలయాన్ని నిర్మించి ఉండవచ్చు. ఈ తని కాలం క్రీ.శ 1230 ప్రాంతం గా చెప్పబడుతోంది.


                                             -71-
           

                     కుఱుకుర్రు స్వయంభూదేవర కు  దానం చేసిన నవాబు పేట శాసనం లో వీని ప్రస్తావన  కన్పడుతుంది. ఈ శాసన కాలం శా.శ.1152 (క్రీ.శ.1230.) చాగిపోతరాజు -2 బెజవాడ రాజధాని గా నతవాడి సీమ ను పాలించాడు.ముక్త్యాల ఆలయం లోని శాసనం వంటిదే విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి వారి ఆలయం లో కూడ కన్పిస్తోంది. విజయవాడ శాసనాలు  ప్రత్యేక విషయం గా పరిశీలనార్హాలు. కాబట్టి వాటినిక్కడ ప్రస్తావించలేదు. ముక్త్యాల లోని చెన్నకేశవాలయం అనంతర కాలం లో నిర్మాణమైంది.
                                          


                       శ్రీ ముక్తేశ్వర ఆలయ కళ్యాణమండప స్థంభం పై కన్పించే మరొక శాసనం.

                            చరిత్ర లోకి తొంగిచూస్తే ముక్త్యాల అతి ప్రాచీన చరిత్ర కల్గిన ప్రదేశం గా తెలుస్తోంది.  రెండువేల నాటి శాలివాహన సప్తశతి  లో ఈ ముక్త్యాల ప్రాంతాన్ని గూర్చిన గాథలున్నట్లు విమర్శకులు భావిస్తున్నారు. (బుద్దజయంతి మహోత్సవ సంచిక 13 వ పే.) బేతవోలు (జగ్గయ్యపేట) నుండి మక్త్యాల కు వెళ్లే మార్గం లో రోడ్డుకు డమవాపు కొండమీద బౌద్దస్తూపం కన్పిస్తుంది. అక్కడనుండు ముక్త్యాల చేరే వరకు రోడ్డు కిరువైపులా దట్టంగా మోదగు చెట్లు వ్యాపించి ఉండేవట. దీన్ని ఆధారం గా సూరన్న అనే కవి శాలివాహన సప్తశతి   లో ఒక గాథ ను సంథానించాడు. రోడ్డుకిరువైపులా రాలిన మోదుగు పూలు బౌద్దస్తూపానికి సాష్టాంగ నమస్కారం చేస్తున్న బౌద్దసన్యాసులతో  పోల్చి కవి కథ ను రచించాడు.
                                  
                                కీర మహి నచ్చ హేహింరే హయి
                                     ననుహపలాస కుసుమేహిం
                                    బుద్ద సృ చరణ వందన
                                     పడియేహివ భిక్షు సంఘేహిం


                                         -72-
                             

                                      జీబుగా నేలపై రాలె జిల్కముక్కు
                                  లట్లు పువ్వులు మోదుగు చెట్ల క్రింద
                                బుద్దపాదాంబుజములకు బుడమి వ్రాలి
                            వందనము చేయు భిక్షుక  వర్గమనగ  ! (బుద్దజయంతి  మహోత్సవ సంచిక-15 వ పే)     
                   

                    ఈ ప్రాంతానికి దగ్గరలోనే భోగాలపాడు అనే ప్రాచీన గ్రామం ఉంది. ప్రాచీనత కు నెలవైన ఈ ప్రదేశం  పరిసోధకులకు పని కల్పించింది. కవి పండిత విమర్శకులైన  శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు ఈ ప్రాంతం లో పర్యటించి , పరిశోధనలు నిర్వహించి ,ఎంతో విలువైన సమాచారాన్ని సేకరించారు.  ఆయన యనంతరం 1953 మార్చి 9 నుండి 15 వరకు  శ్రీ వేటూరి శంకరశాస్త్రి గారి పర్యవేక్షణ లో కొన్ని త్రవ్వకాలు  నిర్వహించబడ్డాయి. ఇవి పైపైన కొనసాగినవే కాని లోతుగా  జరగలేదు.  ఆర్ధిక వనరుల లేమి యే అందుకు కారణమని శ్రీ శంకరశాస్త్రి గారు స్వయం గా ప్రకటించారు. కొద్దిప్రయత్నం లోనే ఈ ప్రదేశం ఎంతో విలువైన సమాచారాన్ని చరిత్ర కందించింది.
                      ఈ త్రవ్వకాలలో అనేకమైన కుండలు ,కుండపెంకులు , శాసనపు రాళ్ళు ,ఎముకలు ,లోహపు బిళ్ళలు , రేకులు ,పూసలు , ఆభరణాలు ,గాజులు ,ఆటవస్తువులు , ఇటుకలు లభించాయి. వీటి మీద లిపిని బట్టి ఇవి ఇక్ష్యాకుల నాటివి గా  గుర్తించబడింది. శిథిలావశేషాలను ,నిర్మాణ విథానాన్ని విశ్లేషించగా ఇక్ష్యాకుల నాటి బౌద్దభిక్షువులు ఈ ప్రాంతం లో విహారాన్ని నిర్మించుకొని  బౌద్దధర్మప్రచారకులు గా ఉన్నట్లు భావించబడుతోంది. ఇక్ష్యాకు వంశానికి చెందిన మాతరీపుత్రశ్రీ వీరపురుషదత్త -2 మహారాజు కు చెందిన శాసనాలు

                       
                                       -73-


                           కొన్ని నాగార్జున కొండ ,జగ్గయ్యపేట శిథిలాల్లో లభించాయి. వానిలో ఈ  రాజవంశానికి చెందిన  స్త్రీ , పురుషుల పేర్లు సుమారు ముఫ్వరకు గుర్తించడం జరిగింది. వాసిష్టపుత్ర దాంతమూల , వీని కుమారుడు వాసిష్టపుత్ర ఇక్ష్యాకుల దాంతిమూల వీరిలో ముఖ్యులు. వేరు వేరు మతావలంబులై యజ్ఞయాగాదులు చేయువారైనప్పటికిని బౌద్దమతాభిమానులై బౌద్దస్దూపాలను నిర్మించినట్లు చరిత్రకారులు వ్రాస్తున్నారు. (బుద్దజయంతి సంచిక 19వ పే.)
                            ఈ విధమైన ప్రాచీనచరిత్ర గల్గిన ఈ పుణ్యనేల పై రెండవ పోతరాజు కృష్ణానదీ తీరం లో ముక్తేశ్వరుని ప్రతిష్టించి ,హిందూసంస్కృతిని ప్రోత్సహించాడు. దానశాసనాల్ని వ్రాయించి చరిత్రకెక్కాడు. శ్రీ భవానీ ముక్తేశ్వర స్వామి కి మాఘబహుళ చతుర్దశి మహాశివరాత్రి నాడు కళ్యాణోత్సవం జరుగుతుంది.కార్తీకమాసం లో విశేషపూజలుంటాయి. పర్వదినాల్లోను ,పుష్కరాల సమయం లోను భక్తులు ఇచ్చటి కృష్ణాఉత్తరవాహిని లో స్నానం చేసి  తరించడానికి దూరప్రాంతాల నుండి కూడ తరలివస్తారు. త్రేతాయుగం లో శ్రీరామచంద్రుడు  సీతమ్మ తో గూడి  ఈ ప్రాంతానికి వచ్చినప్పుడుస్వర్ణాలయం లోని ముక్తేశ్వరుని సేవించాడని ,ద్వాపర యుగం లో ధర్మరాజు  సోదర సమేతుడై ఈ మహాదేవరను పూజించినట్లు , కలియుగం లో విక్రమార్కాది మహారాజు లెందరో ఈ దేవుని దర్శించి తరించి నట్లు శ్రీ తాతంభట్టు గురుమూర్తి శాస్త్రి గారు కృష్ణామాహాత్మ్యము అనే గ్రంథం లో వ్రాసి ,ప్రచారం చేశారు.
                 అనంతర కాలం లో జమీందారీ యుగం లో వాసిరెడ్డి వారి  వంగడం లో ముక్త్యాల సంస్థానం   రూపు   దిద్దుకుంది. ఈ సంస్థానాన్ని చింతలపాటి బంటు అని కూడ వ్యవహరిస్తారు. ఈ ముక్త్యాల   సంస్థానం లోనే ఆర్ష రసాయన శాల అనే పేరు తో ఆయుర్వేదమందుల తయారీ విభాగం ఉండేది . దీని నిర్వహణ లో భాగం గానే వేటూరి శంకరశాస్త్రి    గార్కి  ఈ  సంస్థానం తో అనుబంధ మేర్పడింది.  జంటకవులలో ఒకరైన చెళ్ళపిళ్ల వేంకటశాస్త్రి గారు , కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు సందర్శించిన సంస్థానమిది.  
                                
                              రాబోయే భాగం   లో-
                                                పుణ్యక్షేత్రాల్లో చాగివారు నృసింహతీర్థం  (వేదాద్రి ).





**********************************************