Friday 30 May 2014

శతకసౌరభాలు -2 ధూర్జటి శ్రీ కాళహస్తీశ్వర శతకము -5


శతక  సౌరభాలు -2
                                                 ధూర్జటి   శ్రీ కాళహస్తీశ్వర శతకము  - 5




భవదు:ఖంబులు రాజకీటకములనే బ్రార్ధించినన్ బాయునే
భవదంఘ్రి స్తుతి చేతగాక , విలసద్బాలక్షుధా క్లేశ దు
ష్ట విధుల్మానునె చూడ మేక చంటం దల్లి కారుణ్య దృ
ష్టి విశేషంబుల నిచ్చు చంటి వలె శ్రీ కాళహస్తీశ్వరా !
                    

                శ్రీ కాళహస్తీశ్వరా  ! జనన మరణాది సంసార దు:ఖములు నీ పాదపాద్మములను సేవించుట చేత కాక రాజులనే కీటకములను సేవించుటచే సేవించుట వలన పోవునా . ఎట్లనగా  ఎదుగుచున్న శిశువు యొక్క ఆకలి బాధ  కరుణామృత హృదయముతో కన్నతల్లి ఇచ్చెడి  చనుబాల తో తీరును కాని   మేక మెడక్రింద చన్నుల వలన తీరదు కదా !

 పవి పుష్బంబగు, నగ్ని మంచగు ,నకూపారంబు భూమీస్ధలం
 బవు ,శత్రుం డతిమిత్రుడౌ, విషము దివ్యాహారమౌ నెన్నగా
 నవనీ మండలి లోపలన్ శివశివే త్యాభాషణోల్లాసికిన్
 శివ నీ నామము సర్వ వశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వరా !

    
                   ఓ శంకరా  !    ఈ భూమి మీద   అత్యంతమహిమ కల్గిన శివ శివ అనెడి నీ నామస్మరణము చేయువానికి   వజ్రాయుధము పూలమాలగాను , అగ్ని గుండము మంచుకొండగను , సముద్రము భూ ప్రదేశముగను , శత్రువు అతి మిత్రుడు గను , కాలకూట విషము దివ్యాహారము గను  మారిపోవును . ఆలోచింప గా నీ నామము సర్వ వశ్యకరమనుటలో సందేహమే లేదు. 

లేవో  కానల కందమూలఫలముల్ లేవో గుహల్తోయముల్
లేవో యేరుల పల్లవాస్తరణముల్ లేవో సదా యాత్మ లో
లేవో  నీవు విరక్తులన్మనుప జాలిం బొంది , భూపాలురన్
సేవల్సేయగ బోదురేలొకో జనులు ? శ్రీ కాళహస్తీశ్వరా !

                   ఈశ్వరా  ! అడవులలో తినుటకు కందమూల ఫలాలు , నివసించ డానికి గుహలు ,సెలయేర్ల   యందు నీరు , పత్రి మున్నగు పూజాద్రవ్యాలు , చిగురాకుల శయ్యలు లభించుచున్నవి కదా .  విరక్తులైన వారిని ఆదరించి కాపాడటానికి నీవు ఉన్నావు కదా . మరి ఈ మూర్ఖపు ప్రజలు   ఎందుకు రాజులను ఆశ్రయిస్తారో తెలియడం లేదు . 
             
మును  నేఁ బుట్టిన పుట్టులెన్ని గలవో మోహంబు చే నందు చే
సిన కర్మంబుల ప్రోవులెన్ని గలవో చింతించినం గాని , యీ
జననం బేయని యున్నవాడ నిదియే చాలింపవే నిన్ను గొ
ల్చిన పుణ్యంబునకుం గృపారతుడవై శ్రీ కాళహస్తీశ్వరా !

                      ఓ శంకరా  ! నేను ఇంతకు ముందు ఎన్ని జన్మలెత్తానో , ఆ జన్మల్లో అజ్ఞానం తో ఎన్ని పాపాలు చేశానో  తెలియదు . ఇప్పుడున్న ఈ జన్మయే చివరిదని భావిస్తున్నాను . నిన్ను సేవించిన పుణ్యానికి  నన్ను కరుణించి   ఈ జన్మ నే  చివరి జన్మ గా చేసి నన్ను రక్షించవలసినది ప్రభూ. !   

తనువెందాక ధరిత్రి నుండు నను నందాక న్మహా రోగ దీ
పన దు:ఖాదుల బొందకుండ ననుకంపాదృష్టి వీక్షించి యా
వెనుక న్నీపదపద్మము ల్దలచుచు న్విశ్వ ప్రపంచంబుఁ బా
సిన చిత్తంబున నుండ జేయ గదవే ! శ్రీ కాళహస్తీశ్వరా !

                ఓ ఈశ్వరా  ! ఈ భూమి మీద నేనెంత కాలం బ్రతికుంటానో అంతకాలం మహారోగాల మూలం గా   కలిగే దుఖాలు లేకుండా  దయతో చూసి , ఆపై ఇహలోక విషయాలను వదలి వేసి , నీ పాదపద్మములను సేవించే భాగ్యాన్ని కల్గించు స్వామీ  !

జలకంబుల్ రసముల్ ప్రసూననములు వాచాబంధముల్ వాద్యము
ల్కల శబ్దధ్వను లంచితాంబరమలంకారంబు దీప్తు ల్మెఱుం
గులు నైవేద్యము , మాధురీ మహిమ గా గొల్తు న్నినున్ భక్తి రం
జిల దివ్యార్చన గూర్చి  నేర్చిన క్రియన్ శ్రీ కాళహస్తీశ్వరా !

          శంకరా  ! నేను  నిన్ను   నా   కవిత్వముచే పూజించెదను . కవిత్వమునందలి  రసములే అభిషేక జలం గా ,  వాక్కులే  పూజా పుష్పాలు గా , అనుభూతి ప్రకటితమైన ధ్వనులే  శంఖాది మంగళ వాద్యాలు గా , సుప్రకాశమైన ఆకాశమే ఆభరణం గా , కావ్య గుణములే దీపాలు గా , కావ్యమందలి మాధుర్యమే మహర్నివేదన గా  దివ్యార్చన  గురించి  నేను నేర్చిన రీతిలో భక్తి తో నిన్ను పూజిస్తాను ప్రభూ.  !
                           
ఏ లీల న్నుతియింపవచ్చు నుపమోత్ర్పేక్షాధ్వని వ్యంగ్య శ
బ్దాలంకార విశేష భాషల కలభ్యంబైన నీ రూపముం
చాలుంజాలుఁ గవిత్వమున్నిలుచునే నిత్యంబు వర్ణించుచో ?
ఛీ ! లజ్జింపరు గాక మాదృశ కవుల్ ! శ్రీ కాళహస్తీశ్వరా !

                       శ్రీ కాళహస్తీశ్వరా   !  నీ రూపాన్ని వర్ణించడానికి  ఉపమ ,ఉత్ప్రేక్ష  ,ధ్వని , వ్యంగ్యము , శబ్ధ , అర్దాలంకారాలు ,  విశేష వ్యాకరణాదులకు కూడ అసాధ్యము . మరి ఎలా నిన్ను వర్ణించగలను . అసలు నీ సత్యరూపాన్ని వర్ణించాలంటే  కవిత్వం  నిలబడుతుందా  ? నిలబడదు . కాని మా వంటి కవులు సిగ్గు లేకుండా నిన్ను వర్ణించాలని చూస్తున్నారు . సిగ్గుచేటు. ఛీ  ! ఛీ !.

పాలుం బువ్వయు బెట్టెదన్ గుడువరా పాపన్న ,రాయన్న లే
లే లెమ్మన్న నరంటి పండ్లు గొని తే , లేకున్ననే నొల్ల నం
టే , లాలింపరె తల్లిదండ్రులపుడట్లే తెచ్చి వాత్సల్య ల
క్ష్మీ లీలా వచనంబులం గుడుపరా !  శ్రీ కాళహస్తీశ్వరా !

                       ఈశ్వరా  !  తల్లిదండ్రులు తమ బిడ్డకు   పాలబువ్వ పెడతాను తినరా ! నాయనా  !  రా రా బాబూ  !  అని బుజ్జగిస్తుంటే ఆ పిల్లవాడు   నాకు అరటి పండ్లు  కావాలి తెచ్చిన గాని తిననని మారాం చేస్తే  , ఆ బిడ్డకు అరటి పండ్లు తెచ్చి తినిపింతురు కదా  !  అట్లే నీవు నాకు ప్రేమ తో నిండిన ముద్దు మాటలతో   అన్నము తినిపించవలసినది స్వామీ !

                     ఈ పద్యం లో కవియొక్క  ఆత్మ నివేదన తుది దశకు చేరింది. కన్నబిడ్డ లా తనను ఓదార్చి , దగ్గరకు తీసుకొని  అన్నం తినపించమని తన దైవాన్ని  కోరుకుంటున్నాడు .

కలలంచు న్శకునంబులంచు గ్రహయోగంబంచు సాముద్రికం
బు లటంచుం దెవులంచు ,దిష్టియనుచు న్భూతంబులంచు న్విషా
దు లటంచు న్నిమిషార్ధ జీవనములందుం బ్రీతి పుట్టించి నా
సిలుగుల్ ప్రాణుల కెన్ని చేసితివయా ! శ్రీ కాళహస్తీశ్వరా !        

                   ఈశ్వరా !  రెప్పపాటు లో మరణించే  ఈ జీవుల యొక్క  జీవితాల లో మమకారాన్ని పుట్టించి ,  కలలనీ , శకునాలనీ ,  గ్రహా యోగ సాముద్రికాలనీ , రోగాలు ,  దిష్టులు భూతాలనీ , విషప్రయోగాలనీ  ఎన్ని ఆపదలను సృష్టించావు  స్వామీ  !

తలమీద కుసుమ ప్రసాద మలిక స్ధానంబు పై భూతియున్
గళ సీమంబున దండనాసిక తుదన్గంధ ప్రసారంబు ,లో
పల నైవేద్యంబు జేర్చు నే మనుజుడా భక్తుండు నీ కెప్పుడున్
జెలికాడై  విహరించు రౌప్యగిరి పై ; శ్రీ కాళహస్తీశ్వరా !      

                ఈశ్వరా !  ఏ పురుషుడు నిత్యము నీ నిర్మాల్యమును తలపై ధరించుచూ , నుదుటి పై విభూతిని ,  మెడలో  రుద్రాక్షలను  ధరించి , నీ పూజాపుష్పాల నిర్మాల్యాన్ని ఆఘ్రాణిస్తూ , నీ నైవేద్యం తో కడుపు నింపుకుంటాడో  ఆ భక్తుడు  ఎల్లవేళలా నీకు చెలికాడై ,  వెండికొండ మీద  విహరించ గలుగుతాడు .

ఆలుంబిడ్డలు మిత్రులున్ హితులు నిష్టార్థంబు లీ నేర్తురే
వేళన్వారి భజింప జాలిపడకావిర్భూత మోదంబునన్
కాలం బెల్ల సుఖంబు నీకు , నిక భక్తశ్రేణి రక్షింపకే
శ్రీ లెవ్వారికి కూడబెట్టెదవయా ? శ్రీ కాళహస్తీశ్వరా !      

                                శ్రీ కాళహస్తీశ్వరా !  భార్యాబిడ్డలు ,మిత్రులు , అనువారు ఎల్లవేళల వారి  స్తోత్రము చేసినను కోరిన కోరికలు తీర్చలేరు కదా ! నీవు  ఎల్లవేళలా ఆనందమయుడవై మా వంటి వారిపై జాలి చూపకున్నావు .  నీ భక్తులను కాపాడకుండా  సంపదలు ఎవ్వరికోసం కూడబెడుతున్నావు స్వామీ.!

గతి నీవంచు భజించు వార లపవర్గం బొందగానేల సం
తతముం గూటికినై చరింప వినలేదా  ? “ యాయురన్నం ప్రయ
చ్ఛతి “  యంచు  న్మొఱవెట్టగా శ్రుతులు సంసారాంధ కారాభి దూ
షిత దుర్మార్గులు గాన గానబడవో ?  శ్రీ కాళహస్తీశ్వరా !     ( 60 )  

                         శ్రీ శంకరా  !  నీవే దిక్కని సేవించిన వారు మోక్షాన్ని పొందుచుండగా , ఎల్లప్పుడూ కూటికై పాకులాడుచూ , సంసారమనే మోహంలో పడి కొట్టుకుపోయే వారు    ఆయుష్షు ఉన్నవారికే అన్నం లభిస్తుందని శ్రుతులు చెప్పిన మాట వినలేదా ?  లేక వారికి వినబడదా  ?


                             చదువుతూ ... ఉండండి  . మరికొన్ని అందిస్తాను  మరి .......





*********************************************************************************