Friday 21 September 2012

రామాయణము -- రమణీయకధనాలు –5 - అ హ ల్య-1


                 అ హ ల్య                  ప్రథమ భాగము

                          



   శ్రీ   బ్రహ్మ మానస  పుత్రిక యై మహర్షి, మంత్రద్రష్ట, న్యాయసూత్ర ప్రణేత, అక్షపాదుడు నైన గౌతమ మహర్షిని పరిణయ మాడి పంచకన్యలలో ప్రథమతాంబూలం అందుకుంటున్న పతివ్రతా శిరోమణి అహల్య.
       

    హలం నామేకహా వైరూప్యం హల్యం తత్ప్రభవం భవేత్
          యస్యా నవిద్యతే హల్యం తేనాహల్యేతి విశ్రుతా !!   {వా. ఉ.-30.29 ]

హల్య మనగా వైరూప్యం. అది లేనిది అహల్య. సర్వాంగసుందరి గా సృష్టికర్త చేతనే ప్రశంసించబడిన సౌందర్యం అహల్య ది. కాని- ఈమె పై చెలరేగినంత దుమారం సాహిత్యలో మరే పాత్ర మీద లేదంటే అతిశయోక్తి కాదు. వేదవాజ్ఞ్మయం నుండి దక్షిణాంథ్ర సాహిత్యం మీదుగా ఆధునిక సాహిత్యం వరకు అహల్య అనేక రూపాల్లో మనకు దర్శనమిస్తోంది. తైత్తిరీయారణ్యకంలో ఇంద్రుణ్ణి యాగానికి ఆహ్వానించే సందర్భంలో  ---
                    
                              ఇంద్రాగచ్ఛ హరివ ఆగచ్ఛమేథాతిథే :
                           మేషవృషణశ్వస్య మేనే గౌరావస్కంది న్నహల్యాయై జార                                                                                                                  
                           కౌశిక  బ్రాహ్మణ గౌతమ బ్రువాణ “  { కృ.య.తై.ఆరణ్యకం—2-70}
 గౌతమ- అహల్య- ఇంద్ర- కౌశిక  అనునవి రామాయణ పాత్రలు. శ్రీరామచంద్రుడు ఆ పాత్రలను పునీతం చేశాడు. పైమంత్రానికి విద్యారణ్యుల వారి భాష్యాన్ని పరిశీలిస్తే –-  హే ఇన్ద్ర పరమైశ్వర్యయుక్త : ఇహ 
కర్మణ్యాగచ్ఛ హరివ- హరినామక అశ్వౌ అస్య విద్యతే  ...  ...     ..... తస్మిన్నర్థే వృషణశ్వస్య మేనే
ఈరీతిగా వైదికపరంగా కొనసాగిన వ్యాఖ్యానంలో అహల్యాయై జార అన్న పదానికి—అహల్యా గౌతమస్య భార్యా తస్యా ఇంద్రే జార ఇతి పురాణే ప్రసిద్థం అని వదిలి వేయడం మనం గమనించవచ్చు.
                   
     శ్రీ కుమారిలభట్టు తన తంత్రవార్తికంలో వేదములందలి ఇంద్రాహల్యల ప్రస్తావన ను  వివరిస్తూ --  చంద్రుడే గౌతముడు. గో శబ్దమునకు ఉత్తమ కిరణములని యర్థము.

{ సర్వేపి రశ్మయ: గావ ఇత్యుచ్యంతే . చంద్రుని యొక్క భార్య యగు రాత్రియే అహల్య.
అహ: లీయతే యస్యాం సా అహల్య—పగలు దేనియందు ముగియునో అది అహల్య – అనగా రాత్రియే అహల్య. ఇంద్రుడనగా పరమైశ్వర్యసంపన్నుడగు సూర్యుడు అని అర్థము.
             
      కనుక ఇంద్రశబ్దవాచ్యుడగు సూర్యుడు ఉదయింపగానే అహల్య అనగా రాత్రి  నశించిపోతోంది. కావుననే ఇంద్రుడు అహల్యాయై జార --అని సంబోథించ బడుచున్నాడు. 
                      
        నిరుక్తంలో  ” అహల్యా యై జార అను శ్రుతివాక్యాన్ని  వ్యాఖ్యానిస్తూ—ఆదిత్యో2త్ర జార ఉచ్యతే రాత్రే ర్జరయితా “-- అనగా సూర్యుడే ఇంద్రుడు . రాత్రిని ఫోగొట్టుటచే అతడు అహల్యాయై జార అని సంబోధించబడుచున్నాడు.
        భట్ట భాస్కరులు అహల్యాజారుడనగా వాక్పరిణామకారకుడగు ఇంద్రుడని, గౌరావస్కంది....అన్న  మంత్రంలోని గౌర శబ్దమునకు ఆద్యంత గ్రహణం చేత  గౌతమ దార అని  వ్యాఖ్యానించారు.
          
     ఈ వివరణల్ని పరిశీలిస్తే   గౌతమ-అహల్య- ఇంద్ర శబ్దాలు వేదంలో ప్రతీకాత్మకంగా ప్రయోగించ బడ్డాయని తెలుస్తుంది . కాని – వేదాలకన్న భిన్నంగా రామాయణాది కావ్యాల్లో రమణీయేతివృత్తంగా అహల్య కథ రూపు దాల్చింది. రామాయణంలో అహల్యా వృత్తాంతం రెండు ప్రదేశాల్లో కన్పిస్తుంది. బాలకాండ లోని వృత్తాంతంలో అహల్య దోషిగా కన్పిస్తుంటే –ఉత్తరకాండ లోని వృత్తాంతం ఆ దోష పరిహారార్థం చెప్పబడినట్లు కన్పిస్తుంది.  బాలకాండ కథలో ఇంద్రుడు గౌతమమహర్షి వేషంలో వచ్చినట్లు తెలిసి కూడ అహల్య- ఇంద్రునిపై మక్కువతో ---
          
               ముని వేషం సహస్రాక్షం  విజ్ఞాయ రఘునందన
             మతిం చకార దుర్మేథా దేవరాజ కుతూహలాత్ !!  { వా.బాల.48-19}                                                                              

ఇంద్రునకు తనను తానుగా అర్పించుకున్నట్లు వ్రాయబడగా, ఉత్తరకాండలో ఆమె తెలియకపోవుటచే తన భర్త యే ననుకొని అతని కోరిక తీర్చినట్లు వ్రాయబడింది.
                   అజ్ఞానాత్ ధర్షితా విప్ర  త్వద్రూపేణ దివౌకసా                                                                                                        
           న కామకారాత్ విప్రర్షే ప్రసాదం కర్తు మర్హసి  వా-ఉ.కాం.30-44}
      
  --- అని ప్రార్థిస్తుంది అహల్య. బాలకాండ కథలో అహల్య పాపనిష్కృతిని పొందగా ఉత్తరకాండలో ఇంద్రుడు పాప పరిహారాన్ని పొందాడు. గౌతమ మహర్షి శాపాన్ని పొందిన ఇంద్రుడు ---- 
     

        కుర్వతా తపసో విఘ్నం గౌతమస్య మహాత్మన  :
       క్రోధ ముత్పాజ్య హి మయా సుర కార్య మిదం కృతం  {వా.ఉ .కాం.49-2}

సురకార్యాన్ని నిర్వహించ గలిగానన్న తృప్తితో దేవలోకానికి వెళ్లి పోతాడు. ఇది క్లుప్తంగా  అహల్యా వృత్తాంతం.
      
   రావణుడు సీతను అపహరించాడు. రాముడుద్థరించాడు. అక్కడ సీత ఏఅపచారం చేయలేదు. కాని రాముడాగ్రహించాడు. సీత అగ్నిప్రవేశం చేసింది. అగ్నిపునీతయైన సీత దీప్తామగ్నిశిఖామివ అన్నట్లు ప్రకాశించింది వాల్మీకంలో.
                  
      దేవకార్యం కోసం ఇంద్రుడు అహల్యను చేరాడు. గౌతముడు కోపించాడు -శపించాడు . రామచంద్రుడుద్థరించాడు. తపించిన అహల్య దీప్తామగ్నిశిఖామివ వలె ప్రజ్వరిల్లింది.    పునీతలైన  సీత- అహల్య లిద్దరికి ఒకే విశేషణం వాడటంలోని మహర్షి అంతర్యం అత్యంత నిగూఢము. అతి పవిత్రము కూడా.
               

   హల మనగా నాగలి .  సీత – నాగేటి చాలు. అనగా నాగలి చే ఏర్పడింది.
                             
   ఇది       అహల్య       మొదటి భాగము


***********************************************************