Thursday 21 March 2013

భద్రగిరిపై వెలసిన రాముడు రామచంద్రుడా ? రామనారాయణుడా?


      భద్రగిరి పై వెలసిన రాముడు
                           
                      రామచంద్రుడా?   రామనారాయణుడా ?
                                      
                      భద్రగిరి పై సీతా లక్ష్మణ సమేతుడై వెలసిన శ్రీ రామచంద్రమూర్తి తన అస్తిత్వాన్ని నిరూపించు కోవాల్సిన అవసరం ఏర్పడిందా అనే సందేహం  భక్తులకు కలుగు తోంది. ఎందుకంటే ఈ మధ్య ఒక తెలుగు టీ.వీ ఛానల్లో  ఈ ఫై శీర్షికతో  ఒక చర్చ జరిగింది . దానిలో మాట్లాడిన పండిత ప్రకాండులు తమతమ అభిప్రాయాలను ప్రకటించారు. సంతోషమే.
                ఇంతకీ సారాంశ మేమిటంటే  ఈ రాముడు దశరథ నందనుడు, సీతామనోభిరాముడు, రావణ సంహారుడు, భక్తజన మందారుడు, రామాయణ కథానాయకుడు నైన అయోథ్యారాముడు కాదట.! భద్రుని కోరిక మేరకు వైకుంఠము నుండి దిగి వచ్చిన చతుర్భుజుడైన రామ నారాయణుడట.!  అందుకే శ్రీ రామనారాయణ వరాయ అని సంకల్పం చెపుతున్నారట. సరే. !”చక్రి సర్వోపగతుండన్నాడు కదా ప్రహ్లాదుడు. కాబట్టి రామచంద్రుడైనా, రామ నారాయణు డైనా ఒకటే అనుకుందాము. కాని ఆ మాట ఒప్పుకోవాల్సింది మనం కాదు. ఆనాటి శబరి ఒప్పుకోవాలి.ఎన్నో బాధలు పడి, చెరసాలలో శిక్షలననుభవించి, శ్రీ రామునకు ఆలయాన్నికట్టించి, ఆభరణాలను చేయించిన భక్త శిఖామణి భక్తరామదాసుఅంగీకరించాలి.
                భండన బీముడు,ఆర్తజనబాంధవుడు, ఉజ్వలబాణతూణకోదండ కళాప్రచండుడునైన తారకరాముణ్ణే రామభక్తులు కొలుస్తున్నారు. సేవిస్తున్నారు. ప్రార్థిస్తున్నారు.తరిస్తున్నారు.
              
                  పండితరక్షకుడు, అఖిల పాప విమోచనుడు,అబ్జసంభవాఖండల పూజితుడు, దశకంఠ విలుంఠన చండ కాండ కోదండ కళాప్రవీణుడైన మహావీరుడు మన శ్రీరాముడు. ఘోరపాతకవిరాముడు,సద్గుణకల్పవల్లి కారాముడు, షడ్వికారజయ రాముడు, సాధుజనావనవ్రతో ద్దాముడు, అవనిజ కన్నుదోయి వెలిగెడి సోముడు మన  సీతానాథుడు.  ఆయన  సత్య,ధర్మ పరాక్రమాన్ని జాతి యావత్తూ కథలుగా చెప్పుకుంటోంది.శ్రీ రాముని వంటి భర్త, శ్రీ కృష్ణుని వంటి సోదరుడు కావాలని ఫ్రతి కన్నెపిల్ల కోరుకుంటుంది. శ్రీ రాముని సంచారమే ఆయన పాత్రకు వన్నెతెచ్చింది  కాని పేరు కాదు కదా.!
                                 ప్రపంచం మొత్తం మీద శ్రీరామనవమి రోజున శ్రీ సీతారామ కళ్యాణం చేసే మహద్భాగ్యం మన తెలుగు గడ్డ కే దక్కిందని ఎక్కడో చదివినట్లు గుర్తు. భద్రాద్రి రాముని కళ్యాణోత్సవాలు తెలుగువారి ఆస్తి. అటువంటి పవిత్ర ఆలయం లో ఇటువంటి వివాదాన్ని తీసుకురావడం జాతి మొత్తానికే నష్టాన్ని కలిగించవచ్చు . ఆంథ్రుల ఆరాథ్యదైవం  శ్రీ సీతారాముని గూర్చి ఇటువంటి చర్చ రావడం  ఒక తెలుగువాడి గా జీర్ణించుకోలేక ఈ రెండు మాటలు వ్రాస్తున్నాను.   రామాయణ కథానాయకుడే శబరికి కన్పించిన శ్రీ రామచంద్రుడు.ఆయనే కంచర్ల గోపన్న ను భక్త రామదాసుని చేసి, ఆయన  చేతగుడి కట్టించుకున్నాడు.  ఆయనే తమ్ముడితో   కలిసి తానీషా కు ప్రత్యక్షమై రామదాసుని ఋణ విముక్తుని, బంధవిముక్తుని చేశాడు. 
       


                              ఈ రామునకే ప్రపంచమంతా జేజేలు కొడుతూ,నివాళు లర్పిస్తొంది.  ఆయనే భద్రగిరిపై ఉన్నాడని పూజిస్తోంది. అంతేకాని  భద్రగిరి పై వెలసిన రాముడు వేరని, ఇతడు భద్రుని కోరిక మేరకు వెలిశాడని,  ఇతను రామనారాయణుడని,-- ఇటువంటి మాటలు చెప్పి ,రామభక్తుల గుండెలను గాయం చేయవద్దని, విశ్వాసాలను దెబ్బతీయవద్దని పండితోత్తములను  చేతులెత్తి వేడుకుంటోంది ముందుగా తెలుగు జాతి. ఆ తరువాత భారతజాతి. మనకున్న అనర్ఘరత్నం భద్రాద్రి పుణ్యక్షేత్రం . దాని పవిత్రతను, ప్రాచీనతను కాపాడవలసిన బాథ్యత ప్రతి ఒక్కరిది అనుకుంటున్నా!
    
              దురితలతా లవిత్రుడు,ఖరదూషణ కానన వీతిహోత్రుడు, భూభరణ కళా విచిత్రుడు, భవబంధ విమోచన సూత్రుడు, చారు విస్ఫుర దరవింద నేత్రుడు, ఘనపుణ్య చరిత్రుడు , సీతామనోభిరాముడై  - భద్రగిరి పై వెలసిన  దశరథరాముడే తమ  రాముడని భక్తుల విశ్వాసం. రామదాసు వేడుకొన్నది కూడ ఈ  దయాశరథి యైన దాశరథి నే కదా! దాశరథి ని కరుణాపయోనిథి  గా దర్శించిన  మహద్భాగ్యం మన రామదాసు ది.
                ఎంత వేడిన నీకు  సుంతైన దయ రాదు
                 పంతము సేయగ నే నెంత వాడను తండ్రి
             అంటూ వేడుకుంటున్న ఆ పరమ భక్తుని  ఆక్రందన  ఇప్పటకీ మన చెవుల్లో మార్మోగుతూనే ఉంది. అందుకనే మన రాముడు భద్రాద్రి శ్రీ రామచంద్రుడే కాని  వైకుంఠం నుండి  దిగి వచ్చిన శ్రీ రామనారాయణుఢు కాదు.  శ్రీ రామచంద్రుడు  శ్రీ రామనారాణుడైతే--- కొంతకాలానికి శ్రీ వేంకటేశ్వరుడు శ్రీ వేంకట నారాయణుడై పోయే ప్రమాదముందేమో నని భక్తులు భయపడుతున్నారు. సంకల్పం లో మాత్రమే ఛెపుతున్నామంటారేమో   కాని అది మాత్రం ఎందుకు అనేది సామాన్యుని ప్రశ్న. ?   
                   ఈవిధంగా నైన మరొక్కసారి శ్రీరామ నామస్మరణ చేసుకొనే మహద్భాగ్యాన్ని  కల్గించిన ప్రతి  ఒక్కరికి కృతజ్ఞతా పూర్వక వందనాలు.


******************************************************************************************