Saturday 16 June 2012

రామాయణము -రమణీయకధనాలు -2 -స్వయంప్రభ


                                                     

                           స్వయంప్రభ       

                            

                                  
                  శ్రీ  రామకధ తెలిసిన చాలామందికి కూడ వెంటనే గుర్తుకు రాని  పాత్ర స్వయంప్రభ.  కాని రామ కధాగమనానికి అవసరమైన విశిష్ట పాత్రల్లొ స్వయంప్రభ కూడ ఒకటి. అసలు రామాయణంలోని  పాత్రల్ని విమర్శక దృష్టితో పరిశీలిస్తే రెండువిధాలుగా విభజించవచ్చు.
   1.రామునితో చరించే పాత్రలు         2. రాముని కొఱకు జీవించే పాత్రలు.    
మరొకరీతిగా విశ్లేషిస్తే       1.విశిష్ట పాత్రలు.               2. విశేష పాత్రలు

     ఇంకొక పద్దతిలో రామునితో -            1.ప్రత్యక్ష సంబంధం కలవి.          2.పరోక్ష సంబంధం కలవి
స్వయంప్రభ రామకధతో పరోక్ష సంబంధంగల పాత్ర.
 శ్రీరామచంద్రుని సేవలో జీవితాన్ని పండించుకొన్న యోగిని.           
స్వయంప్రభ. సీతాన్వేషణలో రాత్రింబగళ్ళు శ్రమించి అలసిపోయి ఆకలిదప్పులతో పీడించబడుతూ ఆశ్రయం కోరిన వానరసేనను, ఆదుకొని వారికి  అతిధి సత్కారాలందించి, తిరిగి రామకార్యసాధనకు వలసిన జవసత్త్వాలను వారి కందించి రామసేవకులకు సేవచేసి,పరోక్షంగా రామసేవను చేసుకొని తరించిన దివ్యప్రభ ఈ స్వయంప్రభ.
  మహాభాగాం   తాపసీం ధర్మచారిణీం        తాపసీం ధర్మచారిణీం
           ------ జ్వలంతీమివ తేజసా     -అని స్వయంప్రభ ను పరిచయం చేస్తాడు మహాకవి వాల్మీకి.  ఆమె నివసించే వనాన్ని-"వనముత్తమం ,--“- కాంచనంవనం  ----మహద్దరణ్యం- మహావనే–“ వనందుర్గం అని సైతం వర్ణించి ఆమెను స్వయంగా కాంతివంతమైన పాత్రను చేశాడు ఆదికవి. "తాపసీ ధర్మచారిణీ అనే విశేషణం ఆమెకు పెక్కుసార్లు వాడబడింది.
              తమకు మేలుచేసిన ఆ తపస్వినికి తమ వల్ల కలిగే ప్రయోజనం ఏమైనా ఉంటే ఆజ్ఞాపించ వలసిందని ఆంజనేయుడు  ప్రార్ధించినపుడు స్వయంప్రభ –-“  చరంత్యా మమ ధర్మేణ న కార్యమిహ కేనచిత్.(ధర్మమార్గంలో చరించే నాకు తరుల వల్ల కలిగే పని ఏముంటుంది) అంటుంది. అంటే సన్మార్గంలో నడిచేవారికి ఇంకెవరితోనూ చేయించుకొనే పని ఏమీ ఉండదు అనే ఆత్మవిశ్వాసం ఆమెది. ధర్మచారిణీ అన్న పదంలోనే వాల్మీకి మనోభావం స్పష్టం. వన్నె తరగని ముఖవర్చస్సు ,వాడని శరీరము, దుర్నిరీక్ష్యమైన తేజస్సు స్వయంప్రభ వి. జ్వలంతీమివ తేజసా అన్నవాల్మీకి పల్కులలోని అంతరార్దమిదే.
                           ఆంజనేయుని అభ్యర్ధనతో ప్రసన్నురాలైన స్వయంప్రభ, హేమా విశ్వకర్మల వృత్తాంతంతో ముడివడిన తన గాధను ప్రస్తావిస్తుంది.    స తు వర్షాణి సహస్రాణి తప స్తప్త్వా మహావనే “–బ్రహ్మ అనుగ్రహంతో శిల్ప శాస్త్రజ్ఞానాన్ని పొంది, అపురూపమైన  కాంచనభవనాన్న నిర్మించాడు మయుడు. హేమతో ఇష్టోపభోగాల ననుభవిస్తూ ఎక్కువకాలం భూలోకంలోనే నివసించసాగాడు. మయుని సుఖాన్ని చూసి కన్నుకుట్టిన దేవేంద్రుడు వజ్రాయుధంతో మయుని సంహరించగా, ఒంటరియైన హేమ ఈ వనాన్ని స్వయంప్రభ కిచ్చి తాను వెళ్లిపోయింది. ఆనాటి నుంచి తాను తపోదీక్షలో ఉంటూ వనాన్ని రక్షిస్తున్నానని చెపుతుంది.                

              స్వయంప్రభ  ఆంజనేయునితో. ఇదం రక్షామి భవనం హేమయా వానరోత్తమ. దుహితా మేరుసావర్ణే  రహం తస్యా స్వయంప్రభా (ఆనాటి నుండి హేమకు సంబంధించినదిగానే ఈవనాన్ని కాపాడుతున్నాను. మేరుసావర్ణి కుమార్తె యైన నన్ను స్వయంప్రభ అంటారు). వానరోత్తమ అని సంబోధించిన స్వయంప్రభ తో ఆంజనేయుడు రామకార్యాన్ని ప్రస్తావించి,సమయం గడిచిపోవడంవలన తమ ప్రాణాలకు ముప్పువాటిల్లుతుందని, రామకార్యం భగ్నమౌతుందని, అందువలన తమకు మార్గనిర్ధేశం చేయవలసిందని ప్రార్ధిస్తాడు.
                      కాని ఈ బిలములో ప్రవేశించిన వారు తిరిగి ప్రాణాలతో బయట పడటం అసాధ్యమని , కాని తన తప:ప్రభావం చేత  రామకార్యార్ధం వారినందరిని బయటకు పంపిస్తానని హామీ యిచ్చి వానరసేననంతటిని ఎవరికివారు తమచేతులతో కళ్లు మూసుకోవలసిందిగా ఆజ్ఞాపిస్తుంది స్వయంప్రభ. నిమీలయతి చక్షూంషి సర్వే వానర పుంగవా: ”-ఆవిధంగా వానరశ్రేష్టులందరూ తమ చేతులతో కళ్లను మూసుకోని తల్లిగర్భంనుండి బయటకొచ్చిన పిల్లలవలే ఆ ఋక్షబిలం నుండి బయటపడి  తిరిగి సీతాన్వేషణ మనే బృహత్కార్యానికి సిద్ధపడి రామసేవకు పునరంకితమయ్యారు. ప్రయాణంలో దారితప్పి, ప్రాణాపాయస్ధితిలో ఉన్న వానరసేనకు తిరిగి జవసత్త్వాలను ప్రసాదించి వారికి మార్గనిర్ధేశం చేసి, ఆవిధంగా పరోక్షంగా రామసేవలో పునీతురాలైన మహాయోగిని స్వయంప్రభ. 
                ఆలోచిస్తే రామాయణంలో ఆదికవి తన పాత్రలకు పెట్టిన ప్రతిపేరు సార్ధకమే. ఈ విషయాన్ని ప్రత్యేక వ్యాసంలో ప్రస్తావించుకొందాం. ఆవిధంగానే  ఇక్కడ స్వయంప్రభ కూడ అన్వర్ధనామధేయ.తనకు తానుగా స్వయంప్రకాశమానయైన జ్ఞానయోగిని ఆమె. ఈ వృత్తాంతాన్ని వాల్మీకి రామాయణం కిష్కింధకాండలో చూడవచ్చు.
                   ఘట్టాన్ని కేనోపనిషత్తు లోని అంశాలతో పోల్చి విశ్లేషించిన విమర్శకులున్నారు .       స్వయంప్రభ గాధ చదివేటప్పుడు కేనోపనిషత్తు గుర్తుకొస్తుంది. ఆమె గుహ నుండి వానరులు వెలువడాలంటే కళ్లు మూసుకోమనడం పదాలకు ప్రతిధ్వని. యదేతత్ విద్యుతో వ్యద్యుత్తదా ఇతీన్యమీనిషదా-- కంటిలో మెరుపువలే క్షణకాలంలో మెరిసిన మెరుపు కన్పించి అది అదృశ్యమైంది.
                స్వయంప్రభ వృత్తాంతం కేవలం అపార్ధివతత్త్వ కధనంగానే కాక ఈ  మయా మయ విశ్వంలో మీమాంసాశాస్త్రంగా, యోగశాస్త్రపాఠ్యాంశంగా, సాహిత్యంలో ఒక కళాఖండంగా భావించాలి. అన్న ప్రముఖ విమర్శకులు ఇలపావులూరి వారి పల్కులు అక్షరసత్యాలు.
                 రామచంద్రుని దర్శనం ప్రత్యక్షంగా పొందలేకపోయినా రామసేవకులకు సేవచేసి, రామసేవాభాగ్యాన్ని పొందిన ధన్య చరిత, జ్ఞానయోగిని స్వయంప్రభ.ధర్మమార్గంలో జీవించేవారికి ఏ ఇతరుల సహకారము అవసరం లేదని నిరూపించిన పాత్ర స్వయంప్రభ. చరంత్యా మమ ధర్మేణ నకార్యమిహ కేనచిత్ –“అన్న పలుకులు స్వయంప్రభ వే కాదు, ధర్మాన్నే నమ్ముకొని  అరణ్యమధ్యం లో ఆశ్రమవాసియై జీవిస్తున్న  వాల్మీకి మహర్షి వే నని భావించవచ్చు.
     ఆథారాలు  :--
1.            1 శ్రీమద్వాల్మీకి రామాయణం కిష్కింధ 50,51                                2.రామాయణం లో స్త్రీ పాత్రలు .పు.85
.           ******************************************                                      _____  *****______