Monday 13 January 2014

శ్రీ భాగవత కల్పద్రుమ ఫలాలు- 7 నారదుడు చెప్పిన ఆశ్రమ ధర్మాలు


 శ్రీ భాగవత  కల్పద్రుమ  ఫలాలు - 7
                     
                        నారదుడు చెప్పిన ఆశ్రమధర్మాలు
            
               



  పూర్వం బదరికావనం లో నారాయణుని వలన విన్న సనాతన ధర్మాన్ని నారదుడు ధర్మరాజు కు వివరించాడు.  ఆంధ్ర మహా భాగవతం ఏడవస్కంధం లో ఈ భాగాన్ని చూడవచ్చు.  ప్రజలందరకు ముఖ్యం గా ఉండవలసిన  లక్షణాలు ముచ్చటగా ముప్పది .
                 
               
                          సత్యం ,సంతోషం , సమదృష్టి ,సదసద్వివేకం, శౌచం , క్షమ , దయ, మార్దవం , మనోనిగ్రహం , మహాజనసేవ , మితభాషిత్వం , ఇంద్రియజయం , బ్రహ్మచర్యం , ప్రతిప్రాణి లోను పరమాత్మ ను చూచుట , దానం, అభేదబుద్ధి తో నుండుట, ఉపవాసాదికం ,  అహింస.ఆత్మావలోకనం , అన్నోదకాలను పంచి ఇవ్వడం , అసభ్య వాంఛలు, అనర్ధకమైన క్రియలు  విడిచి పెట్టడం , దేవదేవుడైన ఆ శ్రీమన్నారాయణుని చరణాలను స్మరించడం, కీర్తించడం , కథాశ్రవణం ,సేవ , ఆరాధనం , నమస్కృతి , దాస్యం ,సఖ్యం , ఆత్మ సమర్పణం అనే ముప్పది గుణాలు అలవడాలి.                                        
            
                        ఆశ్రమాలు బ్రహ్మచర్య, గృహస్థ , వానప్రస్థ ,  సన్యాసమని నాలుగు రకాలు.  
                 

           
                          బ్రహ్మచారి అనే వాడు  మౌంజీ, కౌపీనం ,యజ్ఞోపవీతం, కృష్ణాజినం , పలాసదండం , కమండలం ,దర్భ లను ధరించి ఉండాలి. కేశ సంస్కారం చేసుకోకూడదు. మౌనం గా ఉండాలి. మూడు సంధ్యల లోను బ్రహ్మ గాయత్రిని జపించాలి. ప్రాతస్సంధ్యాకాలాలలో సూర్యోపాసన , అగ్ని ఆరాధన, గురపాజ , దేవతార్చన చేస్తుండాలి.గురువు గారి ఇంటి లోనే సేవకుని వలే భక్తి వినయ సౌమనస్యాలతో మెలుగుతూ, వేదాలను వల్లె వేయాలి. వేదాధ్యయనానికి ప్రారంభం లోను, ముగింపలోను గురువు గారి పాదాలకు నమస్కరించాలి. ఉదయం, సాయంత్రాలలో  ఉత్తమమైన గృహస్దుల నుంచి భిక్షాన్నం  స్వీకరించి , ఆ భిక్ష ను గురువులకు నివేదించి , వారి అనుమతి తో భుజించాలి. నియమిత దినాలలో ఉపవాసాలుండాలి. స్త్రీలతోను , స్త్రీ లోలుర తోను అనవసరం గా మాట్లాడకూడదు. బ్రహ్మచారి గురుపత్నులతోను , పరస్త్రీల తోను తల అంటించుకోవడం , తల దువ్వించుకోవడం , శరీరమర్దనం , సపర్యలు  చేయించుకోవడం , ఏకాంతం గా ఉండటం చేయకూడదు. ఎల్లప్పుడూ ఇంటిలో ఉండక , జితేంద్రియుడై , సత్యభాషణుడై సంచరించాలి.
           
                  బ్రహ్మచారి విద్యార్జనే ప్రథమ కర్తవ్యంగా భావించి , శ్రమించాలి. నియమ నిష్ఠలతో జీవితాన్ని మలచుకోవాలి. ఈ వయసు లో స్త్రీలతో  స్నేహం మంచిది కాదు. స్త్రీ దావాగ్ని వంటిది. పురుషుడు  నేతి పాత్ర వంటివాడు. సెగ తగలగానే పాత్ర లోని ఘృతం లా కరిగి పోతాడు. బ్రహ్మ అంతటి వాడే కూతురు పై వ్యామోహం తో ఆమెను భార్య గా గ్రహించక విడువలేదు. కాబట్టి బ్రహ్మచారి కి  పడతి సాన్నిహిత్యం పనికి రాదు.

పొలతి దావహ్ని పురుషుఁడాజ్య ఘటంబు , కరఁగ కుండరాదు కదిసెనేని,
బ్రహ్మయైనఁ గూతుఁ బట్టక మానఁడు, వడుగు కింతి పొత్తు వలదు వలదు. (7.ఉ. 422)

                            ఉత్తమ గృహస్థు అభ్యంగనాది స్నానాలు , చందనభూషణాదులు కలిగి, బుతుకాలం లో మాత్రమే భార్యను పొందాలి. ఇతర కాంతలపై మోహాన్ని పొందరాదు. చక్కని మనస్థైర్యం కలిగి ,మధు మాంసాలను  వర్ఝించాలి.  సత్ప్రవర్తన తో తన ధర్మాన్ని నిర్వర్తించిన వాడ్  సద్గృహస్థుడు. బ్రాహ్మణ గృహస్థుడు గురువువల్ల ఉపనిషత్తులు , శిక్ష , వ్యాకరణం  ఛందస్సు , నిరుక్తం , జ్యోతిషం కల్పం – అనే వేదాంగాలతో పాటు, ఋగ్యజుస్సామ వేదాలను అథ్యయనం చేయాలి. అర్థవిచారణ చేయాలి. యథాశక్తి గురుదక్షిణ  సమర్పించుకోవాలి. భవనం లో ఉన్నా, వనం లో ఉన్నా నిష్ఠాగరిష్ఠుడై ఉండాలి.తదితర ప్రాణులతో సహజీవనం చేస్తూ ముఖ్యం గా గురువులో, అగ్నిలో, ఆత్మలో, సర్వభూతాలలో అచ్యుతుణ్ణి దర్శించాలి. ఇంద్రియలోలత ను వదిలి , ఆత్మజ్ఞానం తో ప్రవర్తించిన గృహస్థుడు పరబ్రహ్మను చేరుకుంటాడు. 

                      వానప్రస్థాశ్రమం  స్వీకరించిన వాడు అరణ్యాలకు వెళ్లి మునివృత్తి ని స్వీకరించాలి.  ఋషీశ్వరులు చెప్పిన నియమాలను పాటించిన పుణ్యాత్ముడు మహర్లోకం చేరి సుఖిస్తాడు. గృహస్థాశ్రమ ధర్మాలు చక్కగా నిర్వహించిన తరువాత వానప్రస్థాన్ని స్వీకరించాలి. వనాలలో నివసించాలి. అక్కడ దున్నకుండా పండే  నీవారాది ధాన్యాలను ఉడక పెట్టినవి కాని, పచ్చివి కాని , సూర్యకాంతి  తో పండి ,ఎండిన ఫలాలను కాని తింటూ , ఈశ్వరుని భజిస్తూ ఉండాలి. నిన్నటి రోజున మిగిలిన పదార్థాలను వదిలి. కొత్తవి సంపాదించు కోవాలి. చలీ ,గాలీ, ఎండా ,వానా. అగ్నీ , అన్నింటినీ సహించాలి. గోళ్లు తీసుకోవడం , గడ్డం చేసుకోవడం , క్షౌరం చేయించుకోవడం , జుట్టుదువ్వుకోవడం చేయకూడదు.జటిలుడై ఉండాలి. దండం, కమండలం , జింకచర్మాలు, నారబట్టలు కట్టుకోవాలి.పన్నెండు లేదా ఎనిమిది లేదా నాలుగు  లేదా కనీసం ఒక్క సంవత్సర మైనా ఏకాగ్రచిత్తుడై తపస్సు చేయాలి.బుద్ధి చలించకుండా మునియై జీవించాలి. కర్మకాలి వృద్ధాప్యం వల్ల కాని, రోగం వల్ల కాని  వానప్రస్థుడు తన ధర్మాలను నెరవేర్చుకొనలేకపోతే నిరశన వ్రతం పూని ఆత్మ యందు అగ్నులను ఆరోపణ చేసి సన్యసించాలి.

           మానవుడు వానప్రస్థాశ్రమం స్వీకరించి, ఆ ధర్మాలను పాటిస్తూ , ముక్తసంగుడై సన్యాసాశ్రమం తీసుకోవచ్చు. సన్యసించి , దేహమాత్రావశిష్టుడై , సర్వభూతనిరపేక్షుడై , భిక్షుకుడై , నిరాశ్రయుడై , ఆత్మారాముడై , సర్వభూతసముండును, శాంతుడును, సమచిత్తుడును , నారాయణపరాయణుడు నై ప్రవర్తించాలి. సన్న్యాసి శరీరం పై కౌపీనం మాత్రమే ధరించాలి.దండ కమండలాలను విసర్జించాలి.ఆత్మపరము కాని శాస్తాలను వదిలి వేయాలి. కుతర్కాల జోలికి పోకుండా, ఆత్మచింతనతోనే  సమాధినిష్ఠ లో గడపాలి.ఒకే ఊరి లో పెక్కు దినములు ఉండక , ఒక ఊరిలో ఒక రాత్రి మాత్రమే గడపాలి. కార్యకారణాలకు అతీతమైన పరమాత్మ లో విశ్వాన్ని దర్శిస్తూ,జాగరణ, స్వప్న,సంధి సమయాలలో  ఆత్మనిరీక్షణ చేయాలి. ఆత్మ కు బంధమోక్షణాలు మాయామాత్రాలు కాని వస్తుప్రకారంబు న లేవని , ఈ దేహమునకు జీవితం ధ్రువం కాదని , మృత్యువు మాత్రమే ధ్రువమని తెలుసుకోవాలి. భూత దేహముల  యొక్క పుట్టుక, నాశనములకు కాలమే కారణమని తెలుసుకొని , అటువంటి కాలం కోసం నిరీక్షిస్తూ ఉండాలి. జ్యోతిషాది విద్యలను ప్రదర్శించడం , బహువిద్యలలో ఆసక్తి చూపడం సన్న్యాసి చేయకూడదు.

                       ఈ విధం గా  సన్న్యాసి జ్ఞానోత్పత్తి వరకు ప్రవర్తించి , ఆ తరువాత విజ్ఞాన విశేషం  సంభవించినట్లైతే పరమహంస యై దండాది చిహ్నాలు ధరించి కాని, ధరించక గాని  అంతరంగం లో ఆత్మను అనుసంధానం చేయగలిగి, విజ్ఞాని యై  , బాహ్యానుసంధానాలవల్ల ఇతరులకు ఉన్మత్తుని వలే, బాలుని వలే ,మూగవానివలే  కన్పించాలి.

                          ఇవి చతురాశ్రమ ధర్మాలు గా చెప్పబడుతున్నాయి.




************************ఇతి శమ్ ********************************    

Friday 10 January 2014

శ్రీ భాగవత కల్పద్రుమ ఫలాలు - 6 శ్రీ కృష్ణ (అష్టమహిషీ) కళ్యాణం


శ్రీ భాగవత  కల్పద్రుమ ఫలాలు -6
                        
          శ్రీ కృష్ణ (అష్ట మహిషీ) కళ్యాణం
                  
                       




                    

                  భక్త జనరక్షకుడు, ఆర్తజనబాంధవుడు, భాగవత కథానాయకుడు అయిన శ్రీకృష్ణుడు రుక్మిణీ మొదలైన ఎనిమిదిమందిని  పరిణయం చేసుకోవడమే కాకుండా నరకుని చెరలో ఉన్న పదహారువేలమందిని విడిపించి, వారిని పరిగ్రహించిన వృత్తాంతం మనకు దశమస్కంధం ఉత్తర భాగం లో కన్పిస్తుంది.  కమనీయ మైన శ్రీకృష్ణుని కళ్యాణ ఘట్టాన్ని చూడలేకపోయానని  ఆ కన్నయ్య కన్నతల్లి దేవకీదేవి యే బాధపడిందని చెపుతారు.కాని అటువంటి రమణీయ దృశ్యాల్ని మహాకవి పోతన మధుర మనోహరం గా తెలుగు వారి కందించాడు. సీతాకళ్యాణం, సీతారామ కళ్యాణం, శ్రీరామ కళ్యాణం,రుక్మిణీ కళ్యాణం,రాధాకళ్యాణం అనే మాటలు మనం వింటుంటాము కాని శ్రీకృష్ణ కళ్యాణం అనే పదం మనకు కొత్తగా వినిపిస్తుంది.కారణం నందనందనుడు షోడశ సహస్రాంగనా పరివృతుడు.   అష్టభార్యా సమేతుడు  కావడమేనేమో.!
                      
                             రుక్మిణీ కళ్యాణం మనం ఇంతకు ముందే దర్శించాము.కొంతకాలానికి రుక్మిణీదేవి కి  మగశిశువు జన్మించాడు.  పూర్వం పరమేశ్వరుని కంటిమంట లో భస్మమైన మన్మథుడు ఈశ్వరుని అనుగ్రహం తో రుక్మిణీకృష్ణులకు   కుమారుడు గా జన్మించాడు. అతనే ప్రద్యుమ్నుడు అనే పేరుతో ప్రసిద్దుడయ్యాడు. ప్రద్యుమ్నుడు సూతికాగృహం లో తల్లి పొత్తిళ్ల లో ఉండగానే శంబరాసురుడనే  రాక్షసుడు ప్రద్యుమ్నుని వలన తనకు హాని ఉందని తెలుసుకొని ప్రద్యుమ్నుని అపహరించి, తీసుకొని వెళ్లి సముద్రం లో పారవేశాడు. ఒక చేప ఆ పసివాని ని మింగేసింది. చేపలు పట్టే వారి వలలో మిగిలిన చేపలతో పాటు ఆ చేప కూడ దొరికి పోయి, శంబరుని వంటశాలకు చేరింది. వంటవారు చేప కడుపుని కోయగా చంద్రబింబం వంటి బిడ్డ  కన్పించాడు.  
                           
                                  ఇంతలో అక్కడకు వచ్చిన నారదుడు ఆ బాలుని వృత్తాంతాన్ని  మాయాదేవి  పేరుతో  శబరుని ఇంట ఉంటున్న  రతీదేవి కి చెప్పాడు. ఆతను తన భర్తయే నని  తెలుసుకున్న  రతీదేవి  పుత్రార్థిని వలే శంబరుని అనుమతి తో ఆ బిడ్డను తీసుకెళ్లి, పెంచసాగింది. అచిరకాలం లోనే అతను యౌవనవంతుడయ్యాడు. శంబరుని వృత్తాంతాన్ని సంపూర్ణం గా ప్రద్యుమ్నునికి చెప్పిన రతీదేవి అతనికి సర్వ శత్రు మాయావినాశిని యైన మహామాయ అనే విద్యను ఉపదేశించింది. దానితో ప్రద్యుమ్నుడు శంబరాసురుని యుద్ధం లో ఓడించి,  ఇల్లాలైన రతీదేవితో కలిసి ద్వారకానగరం  చేరుకున్నాడు.
                     

                          
                         ఇది ఇలా ఉండగా సత్రాజిత్తు సూర్యుని ఆరాథించి , రోజుకు ఎనిమిది బారువుల బంగారాన్ని ప్రసాదించే స్యమంతకమణిని పొందాడు. అటువంటి మణి మహారాజు ఉగ్రసేనుని వద్ద ఉండటం  శ్రేయస్కరమని, కావున దానిని  మహారాజు కివ్వమని చెప్పాడు శ్రీకృష్ణుడు . కాని సత్రాజిత్తు కృష్ణుని మాట వినలేదు ఒకరోజున సత్రాజిత్తుని తమ్ముడైన ప్రసేనుడు ఆ మణిని ధరించి అడవికి వేటకు వెళ్లాడు. అరణ్యం  లో ఒక సింహం ప్రసేనుని  చంపి, ఆ మణిని నోట కరచుకొని పోతుండగా, జాంబవంతుడు ఆ సింహాన్ని  సంహరించి, ఆ మణి ని  తీసుకొళ్లి తన కుమారునకు ఆటబంతి గా ఇచ్చాడు.

      కని జాంబవంతుఁ డా మణిఁ , గొనిపోయి సమీప శైలగుహఁ జొచ్చి ముదం
  బునఁ దనకూరిమి సుతునకు, ఘనకేళీ కందుకముగాఁ జేసె నృపా”!  (10.56)
    
                 ఇంతలో సత్రాజిత్తు తన సోదరుడు కనిపించక విలపిస్తూ, శ్రీకృష్ణుడే తన సోదరుని చంపి,  ఆ మణి ని అపహరించాడని దూషించసాగాడు. ఆ నీలాపనిందను  తొలగించుకోవడానికి తన వారితో కలిసి శ్రీకృష్ణుడు  అరణ్యానికి వెళ్లి ప్రసేనుని వెదకుచూ, జాంబవంతుని గుహను చేరుకొని తన వారినందరిని గుహ వెలుపలే ఉంచి, లోనికి ప్రవేశించాడు. అక్కడ బాలుడు ఆడుకుంటున్న స్యమంతకమణిని చూశాడు.  ఇంతలో దాది అరవడం , ఆ కేక విని వచ్చిన జాంబవంతుడు శ్రీకృష్ణుని తో తలపడటం జరిగిపోయాయి. ఆ యుద్ధం ఇరవై ఎనిమిది రోజులు జరిగింది. తుదకు జాంబవంతుడు రావణ సంహారం చేసినమహావీరుడే ఈ కారుణ్య మూర్తి యని తెలుసుకొని, చేసిన అపచారానికి క్షమాపణ వేడుకున్నాడు. స్యమంతక మణి తో పాటు తన కుమార్తె యైన జాంబవతీ దేవి
ని కూడ   శ్రీకృష్ణునకు కానుకగా సమర్పించాడు.

                        




                              జాంబవతీ దేవిని పరిగ్రహించిన శ్రీకృష్ణుడు ద్వారకానగరం చేరాడు. సత్రాజిత్తు ను రాజసభ కు పిలిపించి జరిగిన విషయాన్ని వివరించి, మణిని ఇచ్చి వేశాడు.  కాని  అనవసరం గా శ్రీహరి పైన నిందవేసి, బలవంతునితో విరోధం తెచ్చుకున్నందుకు సిగ్గుపడ్డాడు. భయ పడ్డాడు సత్రాజిత్తు.  తన కుమార్తెను సమర్పించి, శ్రీకృష్ణుని పై నిందవేసిన తన పాపాన్ని ప్రక్షాళన చేసుకోవాలని నిర్ణయించుకొన్నాడు .

పాపాత్ముల పాపములం , బాపం గా నోపునట్టి పద్మాక్షునిపైఁ
బాపము గలదని నొడివినఁ పాపాత్ముని పాపమునకుఁ బారము గలదే”! (10.ఉ.77)

       -అని కూడ భావించాడు. బాధపడ్డాడు . అందుకే-

మణిని గూతునిచ్చి మాధవుపదములు , పట్టుకొంటినేని బ్రదుకు కలదు
సంతసించు నతడు సదుపాయమగు నిది ,సత్య మితరవృత్తిఁ  జక్కబడదు. (10.ఉ.77)

               స్యమంతక మణి తోపాటు తన కుమార్తెయైన సత్యభామ ను కూడ సమర్పించుకొని  శ్రీకృష్ణుని సంతోషింప జేయ యత్నించాడు సత్రాజిత్తు.

 “తామరసాక్షుఁ డచ్యుతుఁ డుదార యశోనిధి బెండ్లియాడె నా
నా మనుజేంద్రనందిత గుణస్థితిలక్షణ సత్యభామ ను
ద్దామ పతివ్రతాత్వ నయ ధర్మవిచక్షణతా దయా యశ :
కామను సత్యభామను ముఖద్యుతి నిర్జిత సోమ నయ్యెడన్.(10- ఉ- 81)

                 అయితే శ్రీకృష్ణుడు  కన్యామణిని తీసుకొని, శ్యమంతకమణి ని  తిరిగి సత్రాజిత్తు కు ఇచ్చివేశాడు. అనంతరం దాన్ని శతధన్వుడు అపహరించడం,  సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు అతన్ని సంహరించడం ఇవన్నీ కథాంతరాలు.



                పాండవులను చూడటానికి కృష్ణుడు ఇంద్రప్రస్థానికి వచ్చి , కొన్ని నెలల పాటు అక్కడే ఉండిపోయాడు. ఒక రోజున కృష్ణార్జునులు అశ్వారూఢులై అరణ్యానికి వేటకు వెళ్లారు. కొంత సమయానికి వేట లో అలసిపోయి, యమునా తటాన సేదతీరుతున్న సమయం లో వారికి సూర్యుని కుమార్తె కాళింది కన్పించింది. శ్రీకృష్ణుడు పంపగా అర్జునుడు ఆమెను పల్కరించాడు. తన తండ్రి తనకోసం ప్రత్యేకం గా ఏర్పాటుచేసిన గృహం లో తాను శ్రీకృష్ణుని గూర్చి తపస్సు చేస్తున్నానని, వేటకు వచ్చిన శ్రికృష్ణుడు తనను వివాహమాడగలడని తండ్రి చెప్పాడని  పల్కింది కాళింది. సర్వజ్ఞుడైన శ్రీహరి ఆమెను రథ మెక్కించకొని ఇంద్రప్రస్థానికి, అనంతరం  ద్వారకకు చేరుకున్నాడు.బంధువులందరూ ఆనందిస్తుండగా ఒక శుభ ముహూర్తం  లో కాళింది ని వివాహం చేసుకున్నాడు.       

               అనంతరం - విందానువిందుల సోదరి మిత్రవింద .వీరితల్లి రాజాథిదేవి శ్రీకృష్ణునకు మేనత్త అవుతుంది. విందానువిందులు తమ సోదరి కి  స్వయంవరం ప్రకటించారు.  ఆ స్వయం వరానికి హాజరైన శ్రీకృష్ణుడు రాజలోకమంతా చూస్తుండగానే  తన పరాక్రమాన్ని ప్రదర్శించి మిత్రవింద ను  పరిణయం చేసుకున్నాడు.

భూరమణులు సూడగ హరి , వీరతఁ జేకొనియె మిత్రవిందను నిత్యా
పూరిత సుజనానందం ,జారు చికురకాంతి విజిత షట్పదబృందన్. (10. ఉ. 125)

                           కోసలదేశాన్ని నగ్నజిత్తు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతని కుమార్తె నాగ్నజితి. ఆ రాజు వద్ద మదించిన ఏడు ఆబోతులున్నాయి. ఏ వీరుడు ఆ ఆబోతులను తన బాహుబలం తో బంధించగలడో అతనే తన కుమార్తె కు భర్త అని  ప్రకటించాడు.  ఆ వార్త ను విన్న శ్రీకృష్ణుడు సేనాసమేతం గా కోసలరాజ్యానికి వచ్చాడు. కోసలరాజు కృష్ణుని గొప్పగా గౌరవించాడు.  మోహనరూపుడైన శ్రీకృష్ణుని చూచిన నాగ్నజితి  ఇలా అనుకొంది.

విష్ణుఁడవ్యయుండు విభుడు గావలె నని ,నోఁచినట్టి తొంటి నోము ఫలము
సిద్దమయ్యెనేనిఁ జేకొనుఁబో నన్ను,జక్రధరుడు  వైరిచక్రహరుడు.   (10.ఉ.130)

             నాగ్నజితిని తనకు ఇల్లాలిని చేయమని శ్రీకృష్ణుడు నగ్నజిత్తు ను అడిగాడు. ఆ కోసలరాజు అందుకు ఎంతగానో సంతోషించాడు కాని  ఆమె వివాహ విషయం లో తాను తీసుకున్న నిర్ణయాన్ని  పరిపూర్తి చేయమని  కోరాడు. శ్రీకృష్ణ భగవానుడు చిరునవ్వులు చిందిస్తూ ఆ వృషభాలను అవలోకించాడు.

చేలము చక్కఁగట్టుకొని చిత్రగతిన్ వడి నేడు మూర్తులై
బాలుఁడు దారురూపముల  బట్టెడు కైవడిఁ బట్టి వీర శా
ర్దూలుడు గ్రుద్ది నేలఁ బడఁద్రోచి మహోద్దతిఁ గట్టి యీడ్చె భూ
పాలకులెల్ల మెచ్చ వృషభంబులఁ బర్వత సన్నిభంబులన్.  (10 .ఉ.140)        

          అచ్చట చేరిన రాజ సమూహమంతా జయ జయ ధ్వానాలు చేస్తుండగానే  వృషభాసుర సంహారి 
యైన ఆ చిన్మయ రూపుడు శ్రీకృష్ణుడు  పై వస్త్రాన్ని నడుము కు బిగించి  విచిత్రమైన రీతిలో ఏడు రూపాలను ధరించి బాలకుడు కొయ్యబొమ్మలను పట్టుకున్నట్లు గా పర్వతాల వంటి ఆ ఆబోతులను పట్టుకొని గ్రుద్ది    నేలపై పడవేశాడు. నగ్నజిత్తు  నాగ్నజితి ని శ్రీకృష్ణునకిచ్చి వివాహం చేసి, అఖండమైన , అపురూపమైన కానుకలను  అరణంగా  శ్రీకృష్ణునకు సమర్పించి, సాగనంపాడు. ఆబోతుల నెదిరించలేక పరాజితులైన రాజులందరూ ఒక్కటై  మార్గమథ్యం లో శ్రీకృష్ణుని పై దాడి చేయగా,  అర్జునుడు తన గాండీవం తో సింహం కుందేళ్లను తరిమినట్టు. వెంటాడి సంహరించాడు. నాగ్నజితి తో కూడి ద్వారకా నగరం చేరుకున్నాడు శ్రీకృష్ణుడు.

                  
                 

                           అనంతరం కేకయరాజైన శ్రుతకీర్తి కుమార్తె, సందర్శనాదులకు సోదరి, మేనత్తకూతురు యైన భద్ర ను శత్రురాజులు భయపడుతుండగా  అతి వైభవం గా వివాహం చేసుకున్నాడు శ్రీకృష్ణుడు.
                   
జన వంద్యన్ శ్రుతకీర్తి నంద్యఁ దరుణిన్ సందర్శన క్షోణి పా
ద్యనుజన్ మేనమఱందలిన్ విమలలోలాపాంగఁ గైకేయి ని
ద్ద నయోన్నిద్రఁ బ్రపూర్ణసద్గుణసముద్రన్ భద్ర నక్షుద్ర నా
వనజాతాక్షుఁడు  పెండ్లియాడె నహితవ్రాతంబు భీతిల్లగన్. (10.ఉ. 145 )

                 ఆ  తరువాత  మదాంధులైన రాజులను జయించి, మద్రరాజ కుమార్తె యైన లక్షణా దేవి ని కూడ  పరిణయ మాడాడు శ్రీకృష్ణుడు.

కమలదళాయతాక్షుడు గైకొని తెచ్చెను మద్రకన్యకన్
సమదమృగేక్షణన్ నయవిచక్షణ లక్షణఁ బుణ్యలక్షణన్”. (10 ఉ. 147)

                   నరకాసుర వథానంతరం  అతని చెరలో ఉన్న రోహిణీ మొదలైన పదహారువేలమంది కన్యామణులను విడిపించి  ముందు గా ద్వారకకు పంపించాడు శ్రీకృష్ణుడు. అనంతరం దేవలోకం నుండి పారిజాత వృక్షాన్ని  సత్యభామ కోరిక మేరకు భూలోకానికి తెచ్చి సత్యాదేవి ఉద్యాన వనం లో నాటించిన తరువాత ఈ పదహారువేల మందికి వేరువేరు సౌథాలను ఏర్పాటు చేయించాడు యశోదానందనుడు.  ఒక శుభముహూర్తం లో ఈ పదహారువేల భవనాల్లో ఉన్న పదహారువేలమంది రాజ కన్యలను పదహారువేల రూపాలతో పదహారువేల రీతులతో శోభిస్తూ శాస్త్రోక్తం గా  వివాహమాడాడు. ఆ బాలామణులందరకు అన్ని విధాలుగా కన్పిస్తూ ఉత్తమ గృహస్థధర్మాన్ని పాటిస్తూ ఆనందిచాడట  నల్లనయ్య.ఇంత కమనీయమైన కళ్యాణ కథనాన్ని విన్న వారికి, చదివిన వారికి  సకలైశ్వర్య సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయనడం లో సందేహమేముంది. ఎందెందు వెతకి చూచిన అందందే కన్పించే లీలామానుష  విగ్రహుడు కదా ఆ మోహనరూపుడు. అందుకే ఎవరికివారు  ఆ నల్లనయ్య తనవాడే నని మురిసి పోతారట.

నన్నే పాయడు, రాత్రులన్ దివములన్ నన్నేకృపం జెందెడిన్
నన్నేదొడ్డగఁ జూచు వల్లభలలో , నాథుండు నా యింటనే
యున్నాడంచుఁ బదాఱువేలుఁ దమలో నూహించి సేవించి రా
యన్నుల్ గాఢ పతివ్రతాత్వ పరిచర్యా భక్తి యోగంబులన్ . “(10.ఉ224.)

                   ఈ విథం గా శ్రీకృష్ణునకు రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్షణ  అనువారు ఎనిమిది మంది భార్యలు గా కీర్తించబడుతున్నారు.

                                        రుక్మిణీ మొదలైన అష్ట మహిషులకు పుట్టిన వారిలో  పదునెనిమిదిమంది బాహుబల పరాక్రమ వైభవాలతో ప్రసిద్దులయ్యారు.  వారిపేర్లు ఇలా ఉన్నాయి. ప్రద్యుమ్నుడు, అనిరుద్దుడు,దీప్తిమంతుడు,బానుడు , సాంబుడు ,బృహద్భానుడు ,మధుడు , మిత్రవిందుడు,  వృకుడు , అరుణుడు ,పుష్కరుడు ,దేవబాహుడు , శ్రుతదేవుడు , సునందుడు ,చిత్రబాహువు , వరూధుడు , కవి, న్యగ్రోధుడు. అంతేకాక శ్రీకృష్ణునకు త్రివక్ర  యను స్త్రీ యందు  ఉపశ్లోకుడు నే వాడు జన్మించి, తండ్రియైన శ్రీకృష్ణుని  పాదపద్మాలను సేవిస్తూ , నారదుని శిష్యుడయ్యాడు. ఈయన వ్రాసిన గ్రంథము సాత్వ్తత తంత్ర మనే వైష్ణవ స్మృతి గ్రంథాన్ని రచించాడు.

                 శ్రీకృష్ణుని కుమారులందరినీ లెక్కపెట్టాలంటే పదివేల సంవత్సరాలు చాలవు. వారి గురువులే మూడుకోట్ల ఎనభై ఎనిమిది వేల నూరుమంది  ఉన్నారట. (10.ఉ.1331). రుక్మిణీ కుమారుడు ప్రద్యుమ్నుడు .  ఇతను రుక్మి కుమార్తె యైన శుభాంగి  ని వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడు అనిరుద్ధుడు. 









 ***********   వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలతో     *********              *****

Saturday 4 January 2014

శ్రీ భాగవత కల్పద్రుమ ఫలాలు - 5 శ్రీ పరశురాముని చరిత్రము

  
 శ్రీ   భాగవత కల్ప ద్రుమ ఫలాలు  -5
                                            

                                    శ్రీ  పరశు రాముని చరిత్రము

                                 
                      భృగువంశోద్భవుడు,  జమదగ్ని మహర్షి కుమారుడైన  భార్గవరాముడు  సహస్ర బాహుడైన కార్తవీర్యార్జునుని సంహరించిన మహావీరుడు.   తండ్రి ఆజ్ఞను పాటించి తల్లిని, సోదరులను సంహరించి,మరల తండ్రి  ఆశీస్సులతో పునరుజ్జీవితులు గా చేసుకున్న ధర్మ వీరుడు . భగవంతుడైన శ్రీహరియే భూ భారాన్ని తగ్గించడానికి పరశురాముడు గా జన్మించాడని భాగవతం చెపుతోంది. దశావతారాలలో భార్గవరాముడు ఆరవ అవతారం గా పూజలందుకుంటున్నాడు. ఈ వృత్తాంతం ఆంథ్ర మహా భాగవతం నవమస్కంధం లో మనకు  కన్పిస్తుంది.


                 
                      
                               భారతీయ భాషల్లో వెలసిన భాగవతాలన్నీ పోతన భాగవతం తరువాతవే నని విమర్శకుల అభిప్రాయం. కన్నడ భాగవత కాలం  క్రీ.శ 1530. కర్త విఠల నాథుడు. తమిళ భాగవత కర్త అరియప్ప పులవర్. కాలం క్రీ.శ 17 శతాబ్దము. మహారాష్ట్ర భాగవతాన్ని రచించిన ఏకనాథుడు 1580 ప్రాంతం వాడు. ఒరియాభాష లో భాగవతం వ్రాసిన జగన్నాథుడు 15 వ శతాబ్దం వాడు. మళయాళ భాగవతం రచించిన విజుతచ్చన్ కాలం 15 వ శతాబ్దం. వంగభాగవతం వ్రాసిన  మాలాధరదాసు 16 వ శతాబ్దం వాడు. అస్సాం లో భాగవతాన్ని నిర్మించిన శంకరదేవుడు క్రీ. శ 14 -15 శతాబ్దాల మథ్య కాలం వాడు. అంటే వీరందరిమీద కూడ పోతన భాగవత ప్రభావం పరోక్షం గానో, ప్రత్యక్షం గానో ఉందనేది చరిత్ర చెప్పిన సత్యం. అటువంటి మహాకవి తెలుగు వాడు కావడం తెలుగు జాతి అదృష్టం.
                         
                          హైహయవంశ రాజులలో కార్తవీర్యార్జునుడు మహావీరుడు .ఇతను శ్రీ దత్తాత్రేయుని ఆరాథించి ఆయన అనుగ్రహం తో శత్రువిజయాన్ని , సహస్రబాహువులను, అష్టసిద్ధులను , అఖండమైన ఇంద్రియ పటుత్వాన్ని పొందాడు. దానితో మదగర్వితుడై సంచరిస్తున్న ఆ రాజు ఒకనాడు రేవానదిలో తన భార్యలతో జలక్రీడలను ప్రారంభించాడు. ఆటలలో భాగం గా ఆ నదీజలాలను తన వేయి చేతులతో ఆపి ఆనందించ సాగాడు. కాని అదే సమయం లో  సంగ్రామాభిలాషియై శత్రువును  వెతుకుతూ  అక్కడకు వచ్చిన రావణుడు  ఎదురుతన్నిన ఆ నదీప్రవాహపు పోటుకు గురయ్యాడు. తనను ఎదిరించే వాడి కోసం వెతుకుతున్న రావణునికి మంచి అవకాశం దొరికింది.   పెల్లుబికిన కోపం తో, రణదాహం తో రావణుడు కార్తవీర్యార్జునుని పైకి యుద్ధానికి వెళ్లాడు.     
                        
                      కాని కార్తవీర్యార్జునుడు  రావణుని తన బాహుబలం తో ఓడించి, జుట్టు పట్టుకొని మోకాళ్ళ తో పొడిచి, కోతిని కట్టిపడేసినట్టు తన భటులచేత కట్టించి,చెఱసాల లో  పెట్టించి, అనంతరం దయ తలచి వదిలేశాడు.
          
                        అటువంటి మహావీరుడైన కార్తవీర్యుడు ఒకసారి వేటకోసం అడవికి వెళ్ళి,అలసి పోయి, బాగా ఆకలితో జమదగ్ని ఆశ్రమానికి వెళ్లాడు. అతిథి గా వచ్చిన రాజును ఆదరించిన మహర్షి తన హోమధేనువు రప్పించి, దాని అనుగ్రహం తో, రాజుకు , రాజపరివారానికి సుష్ఠు గా భోజనం పెట్టాడు. కడుపు నిండుగా తిన్న రాజుకు కామధేనువు పైన కోరిక కలిగింది. తిన్న ఇంటి వాసాలనే  లెక్కపెట్టి నట్లు, తన భటులను పిలిచి ఆ ధేనువు ను తోలించుకొని  మాహిష్మతీ పురానికి వెళ్ళిపోయాడు కార్తవీర్యుడు.
                      
                     ఆ తరువాత ఆశ్రమానికి చేరిన పరశురామునికి విషయం తెలిసి ఆగ్రహోదగ్రుడయ్యాడు. అన్నం పెట్టిన చేతినే నరికినట్లు, కామధేనువు పెట్టిన అన్నాన్నే తిని దాన్నే బంథించి తీసుకెళ్లిన కార్తవీర్యుని అకృత్యాన్ని సహించలేకపోయాడు పరశురాముడు.

  అద్దిరయ్య యింట నశనంబుఁ గుడిచి మా యయ్య వలదనంగ నాక్రమించి
   కోరిమొదవు రాజు గొనిపోయినాఁ డట, యేను రాముడౌట యెఱుగఁ డొక్కొ. !” (9.442)
             
               అంటూ పరశువు.కోదండ విల్లంబులను దాల్చి, కవచావృత శరీరుడై, ప్రళయాగ్ని వలే ప్రజ్వరిల్లుతూ, ఏనుగు వెంట పడే సింహం లాగ పరశురాముడు  కార్తవీర్యర్జునుని వెంబడించాడు.   

కనియెన్ ముందటఁ గార్తవీర్యుడు సమిత్కాముం, బ్రకాముం, శరా
సన తూణీర కుఠారభీము, నతిరోష ప్రోచ్చల ద్భ్రూయుగా
నన నేత్రాంచల సీము ,నైణపట నానామాలికోద్దాము నూ
తన సంరంభ నరేంద్రదాన శుభసూత్రక్షామునిన్ రామునిన్.(9.446)

               మాహిష్మతీ పురం చేరిన కార్తవీర్యునకు  చలించే కనుబొమలతో, గండ్రగొడ్డలిని ధరించి ,మిడిసిపడే రాజుల మంగళ సూత్రాల్ని తొలగించేవాడైన పరశు రాముడు ఎదురుగా  వచ్చి కన్పించాడు.ఒక బ్రాహ్మణ బాలకుడు తనకు ఎదురుగా వచ్చి కయ్యానికి కాలుదువ్వడం అవమానం గా భావించిన అర్జునుడు ఈ బ్రాహ్మణుని పట్టి కొట్టి చంపుడని సేనాపతులను ఆజ్ఞాపించాడు.

                  పదిహేడు అక్షౌహిణుల సైన్యం తో దండనాయకులు కదలి పరశురాముని ఎదిరించారు. కాని తొలకరి వేళలో చేలోని దుబ్బులను పెళ్ళగించే  కృషీవలుని వలే పరశురాముడు ఆ సైన్యాన్నంతటిని తెగనరికి కార్తవీర్యార్జునుని వైపు మళ్లాడు. అప్పుడు జరిగిన ఘోరయుద్ధం లో పరశురాముడు పరశువుతో కార్తవీర్యుని చేతులను, శిరస్సును ఖండించి, నేలపడగొట్టాడు. భయంతో అతని పదివేల మంది కుమారులు ప్రాణ భయం తో పారిపోగా, దూడతో కూడిన ఆవును మరల ఆశ్రమానికి తోలుకొచ్చాడు. తన కుమారుని పరాక్రమాన్ని విన్న జమదగ్ని విష్ణ్వంశ కలిగిన రాజును సంహరించడాన్ని సమర్థించలేకపాయాడు.

      


          తాలిమి మనకును ధర్మము , తాలిమి మూలంబు ధర్మతత్త్వంబునకున్
          దాలిమి గలదని యీశుం, డేలించును బ్రహ్మపదము నెల్లన్ మనలన్ .”(9.462)
         
   క్షమ కలిగి ఉండటం వలనే  ఈశ్వరుడు మనలను బ్రహ్మ పదం లో కలిపాడు.మనకు క్షమ యే ధర్మము 
అన్నాడు .

           క్షమ కలిగిన సిరి గలుగును క్షమ గలిగిన వాణి గలుగు సౌఖ్యములెల్లన్
          క్షమ గలుగఁదోన కలుగును , క్షమ కలిగిన మెచ్చుశౌరి సదయుఁడు తండ్రీ.!” (9.463)

               రాజును చంపిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఒక సంవత్సర కాలం  పుణ్యతీర్థాలు  సేవించి రమ్మని ఆజ్ఞాపించాడు జమదగ్ని. తండ్రి ఆజ్ఞను శిరసావహించి , ఏడాది పాటు తీర్థ యాత్రలు చేసి వచ్చాడు పరశురాముడు.
                       
              ఒకరోజున జమదగ్ని ఇల్లాలు రేణుక గంగానదికి నీటికోసమై వెళ్ళింది. అదే సమయం లో  నీటిమధ్యలో అప్సరసలతో జలకాలాడుతున్న చిత్రరథుడనే గంధర్వుని చూస్తూ  ఉండిపోయి కాలయాపన చేసింది.  హోమానికి సమయం దాటిపోయింది. ఆలస్యం గా వచ్చి, తడబడుతూ నిలబడిన   ఇల్లాలిని చూసి, దివ్యదృష్టి తో  సర్వం తెలుసుకొన్నాడు మహర్షి.  మత్తం దీనిం జావగ మొత్తుండని జమదగ్ని తన కుమారులను ఆదేశించాడు.తండ్రి ఆజ్ఞను విన్న కుమారులు దుఖిస్తూ ఉండిపోయారే కాని తల్లి ని చంపలేకపోయారు.  దానితో కడపటి వాడైన పరశురాముని ఆజ్ఞాపించాడు మహర్షి.

కడుకొని పెండ్లముఁ జంపని , కొడుకులఁ బెండ్లాముఁ జంపఁ గురు డానతి యీ
నడుగులకు నెఱగిఁ రాముం ,డడుగిడకుండగఁ ద్రుంచె నన్నలఁ దల్లిన్. (9.471)
           
       తండ్రి మాటను వినకపోతే కోపం తో శపిస్తాడు. ఆజ్ఞ ను పాటిస్తే తపోధనుడైన తన తండ్రి అన్నలను తల్లిని  బ్రతికిస్తాడని  భావించిన పరశురాముడు తండ్రి ఆజ్ఞ ను శిరసావహించి, అన్నలను, తల్లిని ఖండించాడు. తన చిన్నకొడుకు తన యాజ్ఞ పాలించినందుకు  ఎద నిండుగా ఆనందించాడు జమదగ్ని.

మెచ్చిన తండ్రినిఁ గనుగొని, చెచ్చెర నీ పడిన వారి జీవంబులు నీ
విచ్చితి ననుమని మ్రొక్కిన , నిచ్చెన్ వారలును లేచి రెప్పటి భంగిన్.(9.475)

                   ఆ సమయం చూసి ఈ మరణించిన వారిని మరల బ్రతికించమని ప్రార్థించాడు రాముడు. ముని  అనుగ్రహించాడు. వారు ఎప్పటిలాగే  లేచి కూర్చున్నారు. అందుకే -

పడిన వారల మరల బ్రతికింపనోపును, జనకుఁ డనుచుఁ జంపె జామదగ్నుఁ
డతడు సంపె ననుచు నన్నలఁ దల్లిని జనకునాజ్ఞ నైనఁ జంపదగదు.( 9.476)

    పరశురాముడు చంపాడు కదా  అని తండ్రి చెప్పినా కూడ  లోకంలో ఎవరూ అన్నలను, తల్లిని చంపకూడదు. ఎందుకంటే చనిపోయిన వాళ్ల ను తన తండ్రి తపోబలం తో మరల బ్రతికించగలడని తెలుసు కాబట్టే  పరశురాముడు ఆ విధం గా ప్రవర్తించాడని మనం తెలుసుకోవాలి. 

                  ఆనాడు పరశురాముని కి భయపడి పారిపోయిన కార్తవీర్యార్జునుని కుమారులు పదివేలమంది పరశురాముని పై కక్ష కట్టి  అదనుకోసం ఎదురుచూస్తున్నారు. ఒకరోజు యజ్ఞశాలలో ధ్యానవృత్తి లో నున్న జమదగ్నిని  కదలనీయకుండా పొదివి పట్టుకొని, రేణుక అడ్డంపడినా  లెక్కచేయక జమదగ్ని తలను నరికి వెళ్లి పోయారు.

 “జనకుం జంపిన వైర మేమఱక రాజన్యాత్మజుల్ నేఁడు మీ
జనకుం జంపిరి రామ! రామ! రిపులన్ శాసింతు రమ్మంచు న
మ్ముని పై వ్రాలి లతాంగి మోఁది కొనియెన్ ముయ్యేడు మారుల్ రయం
బున రాముం డరుదెంచి యెన్నికొన నాపూర్ణాపదాక్రాంతయై.  ( 9.480)

                   రామా! నీతండ్రిని చంపిన పగను మనసులో పెట్టుకొని అర్జునుని కొడుకులు నీ తండ్రిని చంపారు. శత్రువులను శిక్షించడానికి వేగం గా రావలసిందని తల్లి రేణుక రాముడు లెక్కపెట్టుకొనేటట్లు గా  భర్త  మీద పడి ఇరువది ఒక్కసార్లు ఆక్రోశిస్తూ గుండెలు బాదుకున్నది.

               సమిథలు,కట్టెలకోసం సమీపారణ్యానికి వెళ్లిన జమదగ్ని కుమారులు పరుగు పరుగున ఆశ్రమానికి చేరారు.కొడుకులు తోడు లేకుండా గుమ్మం కూడ దాటని నీవు ఒంటరిగా స్వర్గానికి  వెళ్లడానికి కాళ్లు ఎలా వచ్చాయని తండ్రిని పట్టుకొని  దు:ఖిస్తున్న అన్నలను  చూచి క్రోధోద్విగ్నుడయ్యాడు పరశురాముడు. అన్నలారా ! దు:ఖించకండి. తండ్రి కళేబరాన్ని జాగ్రత్తగా  రక్షిస్తూ ఉండండి. పగ తీరుస్తానుఅంటూ  రాముడు పరశువు ను ధరించి   మాహిష్మతీ పురానికి వెళ్లి, బ్రహ్మహత్యాపాతకులైన కార్తవీర్యుని కుమారులను పదివేలమందిని వెంటపడి  రక్తపుటేరులు ప్రవహించేటట్లు గా చిద్రుప చిద్రుపలుగా నరికి పోగులుపెట్టాడు.

            అంతటితో ఆగకుండా పరశురాముడు తండ్రి పగను తీర్చుకోవడం కోసం భూమి పైన క్షత్రియ శబ్దం  వినబడనీయకుండా ఇరవై ఒక్క  మార్లు భూమంతా తిరిగి  రాజులను గాలించి సంహరించాడు. తండ్రి పగ తీర్చలేని కొడుకు కూడా ఒక కొడుకేనా “ ? అంటాడు మహాకవి.

అయ్య పగకు రాముఁ డలయక రాజుల , నిరువదొక్కమాఱు లరసి చంపె
జగతి మీఁద రాజశబ్దంబు లేకుండ సూడు దీర్పలేని సుతుడు సుతుడే”? ( 9.487 )

               పరశురాముడు శమంతక పంచకం లో  రాజుల రక్తం తో తొమ్మిది మడుగులను చేసి తండ్రి తలను తెచ్చి శరీరం తో చేర్చి సర్వదేవమయుడైన తానే దేవుడు కాబట్టి తన్నుఉద్దేశించి తానే యాగం చేశాడు.  సమస్త దిక్కులను  హోతకు ,బ్రహ్మ కు, అధ్వర్యునకు , ఉద్గాతకు మొదలైన వారందరికి దానం చేసి, సరస్వతీ నది లో అవబృథ స్నానం చేసి  సర్వపాపాలను పోగొట్టుకొని మబ్బు విడిచిన సూర్యుని వలే ప్రకాశించాడు.


                                                   గుడిమల్లం లోని అతి ప్రాచీన  పరశురామేశ్వర లింగం

  ( చూ.  divyakshetralu.blogspot.com  లో గుడిమల్లం శ్రీ పరశురామేశ్వరాలయం)
                           

                        వంశోద్దారకుడైన కుమారుని వలన జమదగ్ని సంకల్ప శరీరం పొంది తన తపోబలం తో సప్తర్షిమండలం లో ఏడవవాడై వెలుగుతున్నాడు. రాబోయే మన్వంతరం లో పరశురాముడు సప్తర్షులలో ఒకడు గా ప్రకాశిస్తాడు. అప్పటివరకూ గంధర్వులు , సిద్ధులు తన పవిత్ర చరిత్రను గానం చేస్తుండగా పరశురాముడు ఐహిక బంధ విముక్తుడై, ప్రశాంతచిత్తం తో మహేంద్రగిరి మీద  తపోనిష్టలో ఈ నాటికీ ప్రవర్తిల్లు తుంటాడు. అసలు ఇదంతా ఎందుకు జరిగిందంటే

భగవంతుడు హరి యీ క్రియ ,భృగుకులమునఁ బుట్టి యెల్ల పృథివీ పతులన్
జగతీభారము వాయగ ,బగఁగొని పలుమాఱు చంపె బవరమున నృపా .!”(9.492)
              
              అంటుంది భాగవతం. భగవంతుడైన శ్రీహరి భూభారం తొలగించడానికి భృగుకులం లో పుట్టి, క్షత్రియులను పలుమార్లు యుద్ధం లో పరిమార్చాడట.




*****************************************************