Tuesday 28 May 2013

శ్రీ రామ కావ్యామృతం -5 రామానుజుల వారి పర్ణశాల


 శ్రీరామ కావ్యామృతం  -5
                             

                   రామానుజుల  వారి  పర్ణశాల
                   

             శ్రీరామచంద్రుని   అనుమతి తో  రామానుజుడైన లక్ష్మణుడు పరవానస్మి కాకుత్థ్స  అంటూ పర్ణశాల ను నిర్మించాడు.    ఎక్కడెక్కడ శ్రీరామ నామ గానం  వినబడుతుందో అక్కడక్కడ  ఆంజనేయుడు భాష్పాకులిత నేత్రాలతో నత మస్తకాంజలుడై   నర్తిసాడని పెద్దలు  చెపుతుంటే  ఆ రోజుల్లో ఆశ్చర్యం వేసేది నాకు.
                               

                 కాని రామాయణం మీద పరిశోథన మొదలుపెట్టిన తరువాత అవన్నీ అనుభవం లోకి వచ్చేసరికి  మళ్లీ ఆశ్చర్యం వేసింది. శ్రీరామ చంద్రుని   నామ స్మరణ మాత్రాన పులకించిన శరీరం తో రామకథ ను  అనర్గళంగా ప్రస్తావించేవారు,  సీతమ్మతల్లి పడ్డ కష్టాలను తలచుకొని,తన ఒక్కగానొక్క బిడ్డకు కలిగిన  కష్టా ల్లాగ, కన్నీళ్లు పెట్టుకుంటూ,  వివరించే వాళ్లను  ఇప్పుడు  తలుచుకుంటే ఎందుకో అనిర్వచనీయ ఆనందం కలుగుతుంది. అటువంటి వారిలో శ్రీమాన్ గుదిమెళ్ల రామానుజాచార్యులు ఒకరు. వీరు శ్రీరామ నామామృత జీవి. వీరి కావ్యాలన్నీ రామకథాత్మకాలే. అటువంటి  కావ్యాలలో పర్ణశాల ఒకటి.
                              
             

   
                      ఖరదూషణ వథ పూర్తయ్యింది. విరూపియై  శూర్పణఖ లంకారాజ్యం చేరింది. పంచవటి లో శూర్పణఖా ప్రవేశం లేకపోతే రామాయణ గమనమే లేదు రామకథా విన్యాసం లో  శూర్పణఖా వృత్తం ప్రథానాథారం..
                     
                       కన్నులు పుండరీకముల కన్న  విశాలము లొక్కచూపుతో
                      నన్ను గదల్చినాడు,చిఱు నవ్వులు గుట్టలు పోసినాడు నే
                      విన్న  కొలంది వాని నుడి వీనుల విందుగ జేసినాడు, నా
                      కున్నది మన్న దెల్ల దన కోసముగా నెరవేసినానురా .

                          కంబరామాయణం  లో శూర్పణఖ మిక్కిలి అందగత్తె. సుముఖీ దుర్మఖీ ..... అన్న శ్లోకం లో వాల్మీకి శూర్పణఖ వికృత రూప గా రాముని చేరగా – కంబరామాయణం లో ఈమె పేరు కామవల్లి.  పేరుకు తగ్గట్టుగానే ఆమె నడక కూడ అందం గా వర్ణిస్తాడు కవి.
                
              
                 “ పల్లవమ్ము ఎర్రప్రత్తి సిగ్గుగొనగ
                  హంస యనగ,కేకియనగ,గరళ
                  మనగ, తీగయనగ, అడుగు దమ్ములు వైచి
                  ఆ పలుకల కొలికి యరుగుదెంచె         (రా. సర్వస్వము – 164.)

           కన్నడ రామాయణమైన రామచంద్రచరిత్ర పురాణం లో శూర్పణఖ పేరు చంద్రనఖ గా కన్పిస్తుంది.
               
                 తెల్లని  పూవులన్నియును దియ్యని శ్యామలమైన శోభతో
                 నల్లగ మారిపోయినవి నా కనుమానము గల్గె రావణా! 
                 చల్లని కల్వపూల సిరి జాలెడు వాడెవడో యొకండు, మా
                పల్లెకు వచ్చినాడనుచు బాటలు పట్టితి జాడతీయగన్.

                            అంటుంది రావణునితో రామానుజుల వారి శూర్పణఖ. రేపల్లె లో నల్లవానికై వెదకిన గోపికయై జాడలు తీసింది. కొండలు కోనలు  వెతుక్కుంటూ సాయంత్రానికి ఏటి దరికి  చేరింది .అక్కడ మహాత్ముని పాదముద్రలను  గమనించింది. కులిశాబ్జరేఖల ఎవరో మహానుభావుడని ఎఱుక తెచ్చుకుంది. దేముడే  యై ఉంటాడని  ఊహించింది గుదిమెళ్ళ వారి శూర్పణఖ. రామ పాదాలను సైకతాలలో దర్శించి  వెదకుతూ శూర్పణఖ బయలుదేరడం అవాల్మీకం.
                            
                      ఏకదా గౌతమీ తీరే పంచవట్యా సమీపత:
                     పద్మ వజ్రాజ్కుశాజ్కాని పదాని జగతీపతే:
                     దృష్ట్వా కామపరీతాత్మా పాదా  సౌన్దర్య మోహితా ( అ. రా .5 -1)
    
             అని అథ్యాత్మ రామాయణం. కామపరీతాత్మయైన  శూర్పణఖ సౌన్దర్య మోహిత యై పంచవటీ సమీపం లో  గోదావరీ తీరమంతా వెతికింది.
             
                    తత్త్ర్రవం  విచరంతీ సా కంజాంకుశ ముఖాంకితాన్
                    రామపాదాంస్తు పశ్యంతీ సైకతే హృద్యచింతయత్
                    అత్ర కశ్చిన్మహాంస్తి ష్టే త్పూరుషం స్తం వృణోమ్యహమ్  (ఆశ్చర్య. రా.అ.- 8.20)
              
                  అంటుంది ఆశ్చర్య రామాయణం.
           
                            హలికులిశాబ్జ రేఖలు తదంఘ్రుల ఛాయల యందు జక్కగా
                            గలకల లాడుచున్న కన్నులకద్దితి మంచి సౌరభ
                            మ్మొలుకుచు నుండెరా ............................
        
    “రామ సౌరభం చేత ఆకృష్ట మానసయైంది శూర్పణఖ. కావ్యం పేరు పర్ణశాల గాని కవి మాత్రం  శూర్పణఖ పాత్ర నాథారం చేసుకొని  రామ నామ ఔన్నత్యాన్ని, పరాత్పర తత్వ్తాన్ని  దర్శించారు కవి.  రాముని  చేత రాక్షస సంహారం చేయించి , రాముని కీర్తిరమాభిరాముని చేయడానికే  జనని కైక –  రామని అరణ్య వాసం కోరిందని కవి భావన. వీరి శూర్పణఖ ఆలోచన కూడ ఇదే.
                         
                   ఈతడతండటన్న కథ నిప్పుడెరింగితి వీడెరా ! పరం
                   జ్యోతి పరాత్పరుం డిచట చూపెను దానవి కా స్వరూపమున్
                   లోతుకు పోక వాని వలలో పడిపోతి, నన్ను గీరి నా
                   చేత సురారి జాతి హతి సేయగ వేసిన యెత్తు రావణా!

              రాక్షస సంహారానికి నాంది గా సూర్పణఖ నాసికాఖండన జరిగింది దండక లో.—రామచంద్రుడు తాను చేయబోయే దనుజ సంహరణానికి ఇక్కడ బీజం వేసుకున్నాడు.         నన్ను గీరి నాచేత సురారి జాతి హతి చేయగ అన్న శూర్పణఖ మాటల్లోని అంతరార్థ మిదే.
                         
                       శూర్పణఖ మాటలు విన్న రావణుడు ఘల్లున నవ్వాడట. ఎంతకాలానికి కోరికలు ఫలించాయి. సనత్కుమారుని పల్కులు నేటికి నిజమయ్యా యన్నాడు. శేషిదంపతుల సేవ ఇంతకాలానికి  లభించిందని సంబరపడ్డాడు వీరి రావణుడు. ఆ ఆనందం అతని మాటల్లో లా పెల్లుబుకుతోందో చూడండి.
               
                    రాముడు వచ్చెనా యటకు రాముని తోడ సుమిత్ర పట్టియున్
                   భూమిజ వచ్చెనా చెవికి బోసితివే యమృతమ్ము చెల్లెలా!
                   నామది వాని కోసమయి నాటికి నేటికి జూచుచుండగా
                   స్వామికి నేటిరోజునకు జ్ఞప్తికి వచ్చితి నేను గావలెన్.
          
                  ఈ మాటలు వాల్మీకి రావణునివి కావు. రామవిభుడు నాకొఱకై వచ్చాడా అన్న ఆర్తి పౌలస్త్యహృదయం లోని రావణునిది. వీరికి మార్గదర్శి అథ్యాత్మ రామాయణము.
                 
                       వథ్యోయది స్యాం పరమాత్మనా2హం
                         వైకుంఠరాజ్యం పరిపాలయే2హం
                         నో చేదిదం రాక్షస రాజ్యమేవ భోక్ష్యే
                         చిరం రామ మతో వ్రజామి        ( అ.రా.అరణ్య-6-40)

                     ఎంతోకాలంగా రాముని కొరకై వెతుకుతున్నాను. భగవంతుడైతే మరణించి వైకుంఠాన్ని పాలిస్తాను – కాకుంటే  రాక్షస రాజ్యమే ఉందన్న  రావణుడు వాల్మీకేతర రామాయణాల్లోనే కన్పిస్తాడు.
            
                         శూర్పణఖ మాటలు విన్న ఈ కావ్యం లోని రావణుడు పులకితస్వాంతుడౌతాడు.       “నా రాముని నవ్వును దర్శించగల నీ జన్మ థన్యమైందని చెల్లెలిని మెచ్చుకొని, కులాన్ని రక్షించడానికి విభీషణుడొక్కడు చాలు.! రాముని ప్రేమించి నీవు తరించావు.  అమ్మను అపహరించి, నాజీవితాన్ని బలిచేసి  నేను తరించాలి. రాముని చేతిలో చావడానికి ఎన్నో సాములు చేశాను. చివరికి అమ్మనే అపహరించవలసి వస్తోంది.  అంటూ వాపోతాడు రావణుడు.  
                         
                   ఎన్నడు వచ్చునాతడను చెన్నటి కెన్నటి కెన్నడింక నిం
                   కెన్నటి కెన్నడింక నికనెన్నటి కెన్నటి కెన్నడింక నిం
                   కెన్నటి కంచు చూచి విసుగెత్తి కడాపట వాని రాకకై
                   తన్నగ సాగితిన్ సురల దాపసులన్ సతుల్ ద్విజాదులన్.
   
                        తనకై బయలుదేరిన ప్రభువు మథ్యలో ఆగిపోయాడేమో ననే సందేహం  రావణునిలో బయలుదేరింది. అందుకే విశ్వామిత్రుని  యజ్ఞాన్ని నాశనం చేయించి శ్వామిని కదలించాను. దానితో  ధరాకుమారిని పెండ్లి చేసుకున్నాడు. అయినా దర్శనం కాలేదు. అందుకే కోపమొచ్చింది.
              .......................................................క్రోధమున్
           బూని నిశాచరాంశమున బుట్టిన పుండు భరించలేక శ్రీ
          జానకినే హరించుటకు సాహసమూనితి, సీత నెన్నియో
         నేననరాని మాటలను నేరము సేయగ నుంటి చెల్లెలా !
            
          అంటూ బాథపడతాడు రావణుడు. శ్రీరామచంద్రుని పరమాత్మ తత్త్వాన్ని  పదినోళ్ల పొగిడి, లక్ష్మణుని స్పర్శను పొందిన శూర్ఫణఖ అదృష్టాన్ని మరొక్కసారి కొనియాడి, పర్ణ శాలకు నమస్కరించి వెళ్లిపోతాడు.
                  
                                   విచిత్రమేమిటంటే --    ఈ కావ్యం పేరుకు పర్ణశాల కాని  దీనిలో సీతారామలక్ష్మణులు ముగ్గురు కన్పించరు. శ్రీరామ  కథాగానం చేత తరించాలన్న జీవితాశయాన్ని  సాథించిన పరమ భక్తులు శ్రీ ఆచార్యుల వారు.  అందుకే వీరి కావ్యం లోని రావణుడు శ్రీరాముని పరమాత్మ తత్వ్తాన్ని విశదీకరిస్తాడు. శూర్పణఖ శ్రీ రామచంద్రుని రూపవర్ణనలో  లీనమై,పరమ భక్తురాలిగా  రామనామ గానం చేస్తుంది.
               
                              ఇందులోని చాలా పద్యాలు శ్రీరామచంద్రుని దివ్యమంగళ రూపాన్ని  వర్ణించినవే  అవ్వడం శ్రీ రామభక్తులకు ఆనందాన్ని కల్గించే విషయం.



*****************************************************************************