Wednesday 30 July 2014

శతకసౌరభాలు -4 వేమనశతకము -1

శతక సౌరభాలు -4
                                                            
                                                                 వేమన శతకము -1
                                   

                                   తొలకరి వానలో తడవని వాడు , వేమన పద్యం చదువని వాడు తెలుగు వాడు కాదనేది తెలుగు నాట నానుడి. జీవితం తొలిరోజుల్లో భోగి వేమన గా విలాసాల్లో తేలియాడిన వేమారెడ్డి  తుదకు కామిగాని వాడు మోక్షగామి కాడని  జగతికి  తత్త్వగురువై, లోకసంచారం చేసి  , వేలాది ఆటవెలదులతో తెలుగుజాతి  ముంగిట్లో   విజ్ఞాన జ్యోతులను వెలిగించి , మూఢనమ్మకాల్ని నిరసించి , సంఘసంస్కర్త గా ప్రజల మన్ననల నంది , తుదకు కటారుపల్లె లో జీవసమాధి పొందాడు.  తెలుగు భాషకు ఎంతో సేవ చేసిన ఆంగ్లదొర సి.పి బ్రౌన్  ఆంధ్రదేశం నలుమూలల నుండి వేలాదిగా వేమన పద్యాలను సేకరించి , అచ్చొత్తించి , వేమన సాహిత్యాన్ని  రాబోయే తరాలకు పదిలంగా అందించాడు.
                  పదిహేడవ శతాబ్దానికి చెందిన వేమన వేలాది పద్యాలు వ్రాసినట్లుగా చెప్పబడుతున్నా ,3500  పై చిలుకు పద్యాలు మాత్రమే  వేమన పద్య రత్నాకరము పేరుతో ముద్రించబడి లభిస్తున్నాయి.  తెలుగు లోగిళ్ళ లో వేమన శతకం పఠనీయ గ్రంథమై పోయింది.  అందుకే వేమన పద్యం రాని వాడు తెలుగు నాట లేడు. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో ఉన్న ఈ శతకం లో ని మకుటానికి
అర్ధాలు మాత్రం రకరకాలు గా చెపుతున్నారు. అభిరామయ్య అనే కంసాలి  వేమనకు స్వర్ణ విద్య నేర్పాడని , ఆ విశ్వాసంతో అతనిపేరు వచ్చేటట్లుగా మకుటం ఉందని ఒక వాదన. విశ్వదుడైన వాడు  అభిరాముడు . అనగా
భగవంతుడైన వాడు ఆనందదాయకుడు అని, ఆయనను ఉద్దేశించి ఆత్మయోగి యై వేమన ఈ పద్యాలను చెప్పాడని మరో  వాదన.
                                 నిత్యాన్వేషణ శీలియై లోక సంచారం చేసి  మానవజీవితం లోని  సత్యాసత్యాలను వివేచించిన మహాయోగి మన వేమన. అందుకే  తెలుగునాట వేమన వాక్కు వేదవాక్కు అయ్యింది. వేమన యోగం అంతా అన్వేషణ గానే సాగిందని విమర్శకుల అభిప్రాయం. సామాన్యుల భాష లోనే శక్తివంతమైన ఉపమానాలను ప్రయోగించి తాను చెప్పదలచిన భావాన్ని సూటిగా పాఠకుని గుండెకు తాకేటట్లుగా చెప్పగలగడం వేమన యోగి ప్రత్యేకత.  
                  వేమన పద్యాలకు  టీకా , వ్యాఖ్యానం అవసరం లేదన్నంతగా అలతి అలతి పదాలతో అనల్పార్ధాల్ని అందించిన మహాకవి వేమన.అందుకే ప్రజల నాలుక పైనే నాట్యమాడుతూ , శతాబ్దాలు గడిచినా వేమన పద్యాలు తెలునాట వెలుగులను నింపుతూనే ఉన్నాయి.  ఇంతకు ముందు   అందించిన  మూడు శతకాలకు తేజస్వినీ పేరుతో  వ్యాఖ్యానం అందించాను.  ఇక్కడ కూడ వేమన వెంటే నడుస్తాను .   

      నా  ఈ blog  ని ఆదరిస్తున్న అశేష వీక్షకులకు ముఖ్యంగా   ఖండాంతర , దేశాంతరాలలో ఉండి కూడ మాతృభాషా మాధుర్యాన్ని  ఆస్వాదిస్తూ , తెలుగు భాషామతల్లిని అపురూపంగా  ఆదరిస్తున్న సహృదయ వీక్షకులకు (viewers)   నిండు మనస్సు తో కృతజ్ఞతా పూర్వక అభివందనాలను   అందిస్తున్నాను.

                    నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు  
                      తళ్కుబెళ్కురాళ్ళు తట్టెడేల
                     చాటుపద్య మిలను చాలదా యొకటైన
                      విశ్వదాభిరామ వినురవేమ !

                                              జాతి రత్నానికి ఉన్న విలువ  మెఱుగు రాళ్ళ కు రాదు.   వేలాది పద్యాలు ఉన్నా చాటు పద్యానికి ఉన్న విలువ మిగిలిన వాటికి ఉండదు కదా. వేమన పద్యాలు ఇంద్రనీలమణు లనుకుంటే  ఇతర పద్యాలు ఎన్నో రంగురాళ్ళ వంటివే కదా.

                              గంగిగోవుపాలు గంటెడైనను చాలు
                              కడివెడైన నేమి ఖరము పాలు
                             భక్తిగల్గు కూడు పట్టెడైనను చాలు
                             విశ్వదాభిరామ వినురవేమ !

                           మంచి ఆవుపాలు గరిటెడైన శ్రేష్టమే. గాడిదపాలు కడివేడైనను ప్రయోజనం లేదు. అదే విధంగా ప్రేమతో పెట్టెడి అన్నం పిడికెడైనా తృప్తినిస్తుంది.కాని అభిమానం లేని కూడు కుండెడు తిన్నా  తృప్తి లభించదు.

                  ప్రియములేని విందు పిండివంటల చేటు
                 భక్తిలేని పూజ పత్రి చేటు
                పాత్రమెఱుగని ఈవి బంగారు చేటురా
                విశ్వదాభిరామ వినురవేమ !

                      అపాత్ర దానం వలన  ధనవ్యయం తప్పితే ఫలిత ముండదు. ఏ విధంగా నంటే  దేవుని మీద విశ్వాసం లేని పూజ కు  పూలు దండగ.  మనసు లో ప్రేమ లేకుండా పెట్టిన విందు భోజనానికి వంటలు దండగ.యోగ్యుడు కాని వాడికి చేసిన దానం కూడ దండగే అవుతుంది.

                 మృగమదంబు చూడ మీద నల్లగ నుండు
                 పరిఢవిల్లు దాని పరిమళంబు
                గురువులైన వారి గుణము లీ లాగురా
                విశ్వదాభిరామ వినురవేమ !

                      కస్తూరి చూడటానికి నల్లగా ఉన్నా దాని పరిమళం సమ్మోహనాన్ని కల్గిస్తుంది. అలాగే మంచివారి గుణాలు  పైకి కన్పించకపోయినా గొప్పగా ఉండి ,లోకంలో మెప్పు పొందుతాయి.

                          మేడిపండు చూడ మేలిమై యుండును
                           పొట్ట విచ్చి చూడ పురుగు లుండు
                           పిరికి వాని మదిని బింక మీలాగురా
                           విశ్వదాభిరామ వినురవేమ !

                            మేడిపండు చూట్టానికి పైకి నిగనిగలాడుతూ కన్పించినా  దాన్ని ఒలిచి చూస్తే లోపలన్నీ పురుగు లుంటాయి. అదే విధంగా పిరికివాడు పైకి ధైర్యంగా డాంబికంగా కన్పించినా  వాని లోపల భయం ఉండనే ఉంటుంది.

                    కులములోన నొక్క గుణవంతుఁ డుండిన
                     కులము వెలయు వాని గుణము చేత
                    వెలయు వనములోన మలయజమున్నట్లు
                         విశ్వదాభిరామ వినురవేమ !  

                    వనములో  ఒక్క  మంచిగంధం చెట్టు ఉంటే  దాని  మూలంగా ఆ వనమంతా గంధపు పరిమళాలు  వ్యాపించి   ఆహ్లాదాన్ని కల్గిస్తాయి. అలాగే కులం లో ఒక్క మంచివాడు పుడితే అతని వలన ఆ వంశానికే ఎంతో పేరు ప్రతిష్టలు వస్తాయి.

                            పూజ కన్న నెంచ బుద్ధి నిదానంబు
                          మాటకన్న నెంచ మనసు దృఢము
                          కులము కన్న నెంచ గుణము ప్రధానంబు
                           విశ్వదాభిరామ వినురవేమ !

                                    దేవుని పూజలు చేసి నంత మాత్రాన బుద్ధి మంతుడు కాడు.  పూజ కన్న నిశ్చలమైన బుద్ధే ప్రధానము. మంచిమాటలు చెప్పిన దాని కంటే వానిని ఆచరించే దృఢమైన చిత్తశుద్ధి ఉండాలి.  అందుకే కులము కంటే కూడ గుణమే ప్రధానమని చెప్పబడుతోంది. 

                                 వేఱుపురుగు చేరి వృక్షంబుఁ జెఱచును
                                 చీడపురుఁగు చేరి చెట్టు  చెఱచుఁ
                                కుత్సితుండు చేరి గుణవంతుఁ జెఱచురా
                                 విశ్వదాభిరామ వినురవేమ !

                                   వేఱు పురుగు చేరి మహావృక్షాన్ని సైతం సర్వనాశనం చేస్తుంది. చీడ పట్టిన చెట్టు మొదలంటా  ఎండి పోయి  నాశనమై పోతుంది. అదే విధంగా చెడ్డవానితో  చేసే  సహవాసం గుణ వంతుని  సర్వనాశనం చేస్తుంది.

                                   అల్పబుద్ధి వాని కధికారమిచ్చిన
                                  దొడ్డవారి నెల్లఁ దొలగఁ ద్రోచు
                                 చెప్పుదినెడి కుక్క చెఱకు తీపెఱుగునా
                                  విశ్వదాభిరామ వినురవేమ !


                                              చెప్పు తినే కుక్కకి చెఱకు  తీపి తెలియనట్లుగా అల్పబుద్ధి యైన వానికి మంచితనమంటే ఏమిటో తెలియదు కాబట్టి  అల్పబుద్ధిగలవానికి  అధికారం ఇస్తే మంచివారి నందరిని  ఉద్యోగాల్లోంచి  తీసేస్తాడు. మంచితనం లోని తీయదనం  దుర్మార్గుడుకి తెలియదు కదా !

                                 విద్యలేనివాడు విద్యాధికుల చెంత
                                 నుండి నంతఁ బండితుండు కాడు
                                 కొలని హంసలఁ కడ కొక్కెర యున్నట్లు
                                 విశ్వదాభిరామ వినురవేమ !

               చదువురానివాడు పండితుల చెంత ఉన్నంత మాత్రం చేతనే పండితుడైపోడు.ఎందుకంటే  సరోవరంలో  హంసలతో కొంగలు ఉంటున్నాయి  కదా ! మరి ఏనాడైనా  ఒక్క కొంగ అయినా  హంసగా  మారిందా ? లేదు కదా !
 
                                      పాముకన్న లేదు పాపిష్టి జీవంబు
                                      అట్టి పాము జెప్పి నట్టె వినుము
                                     ఖలుని గుణము మాన్ప ఘనులెవ్వరును లేరు
                                     విశ్వదాభిరామ వినురవేమ !

                    పాము కంటే ప్రమాదకరమైన విష జంతువు మరొకటి లేదు కాని   ఆ పామును  కూడ మచ్చిక చేసుకొని చెప్పినట్టు చేయించవచ్చును. కాని దుర్మార్గుని గుణాలను  మార్చడమనేది ఎంత గొప్పవారికైనా సాధ్యంకాదు.


                                    వేము పాలు వోసి ప్రేమతోఁ బెంచిన
                                    చేదు విఱిగి తీపి చెంద బోదు
                                    ఓగు నోగేఁగాక యుచితజ్ఞుఁ డెటులౌను
                                     విశ్వదాభిరామ వినురవేమ !

                        వేపచెట్టు కి పాలుపోసి పెంచినా దాని సహజసిద్దమైన చేదు పోయి తీపిదనం రాదు. అదేవిధంగా చెడ్డవాడు చెడ్డవాడే కాని  ఎన్ని మంచి మాటలు చెప్పినా చెడ్డవాణ్ణి మంచి వానిగా మార్చలేము.

                                            పాలు పంచదార పాపరపండ్ల లో
                                            జాల బోసి వండఁ జవికిరాదు
                                           కుటిల మానవులకు గుణమేల కల్గురా
                                          విశ్వదాభిరామ వినురవేమ !

                               పాపర పండ్లు  కటికచేదుగా ఉండే పండ్లు. అటువంటి పండ్ల లోని చేదు పోవడానికి పాలు, పంచదార పెద్దమొత్తంలో గుమ్మరించి వంటచేసినా   చేదుపోనట్లే దుర్మార్గులకు మంచిబుద్ధులు చెప్పి ఎంతగా మార్చుదామనుకున్నా  ఫలితం ఉండదు. వారి లోని దుర్గుణాలు  ఎంతకు పోవు కదా. !

                           ముష్టి వేపచెట్టు మొదలంట ప్రజలకు
                           బరగ మూలికలకుఁ బనికి వచ్చు
                          నిర్దయాత్మకుండు నీచుఁ డెందులకౌను
                          విశ్వదాభిరామ వినురవేమ !

                                    వేపచెట్టు చేదు గల్గిన చెట్టయినా కూడ దాని అన్నిభాగాలు మూలికలుగా వైద్యానికి ఉపయోగపడతాయి. కాని నిలువెల్ల చెడును అంటే దుర్మార్గపు ఆలోచనలను నింపుకున్న నీచుడు ఎందుకూ ఉపయోగపడడు కదా. !

                               కాని వారి  తోడఁ గలసి మెలగుచున్నఁ
                               గాని వాని గానె కాంతు రవనిఁ
                               తాటి క్రిందఁ బాలు త్రాగిన చందమౌ
                                విశ్వదాభిరామ వినురవేమ !


                                 చెడ్డవారితో కలిసి తిరుగుతుంటే మనల్ని కూడ చెడ్డవారి గానే ఈ లోకం భావిస్తుంది. ఎందుకంటే తాటిచెట్టు క్రింద కూర్చొని పాలుతాగినా చూసేవారు కల్లు తాగుతున్నావనే అనుకుంటారు కదా !

                                      తామసించి చేయదగ దెట్టి కార్యంబు
                                      వేగిరింప నదియు విషమె యగును
                                       పచ్చికాయఁ దెచ్చి పండింప ఫలమౌనె
                                        విశ్వదాభిరామ వినురవేమ !

                                     ఆవేశంతో , కోపం తో  ఏ పని చేయకూడదు. తొందరపడి చేస్తే ఆ పని పాడైపోవచ్చు.  ఎందుకంటే  పచ్చికాయ ను తెచ్చి పండపెడితే మాత్రం అది ఫలమవ్వదు కదా ?

                             కోపమునను ఘనత కొంచెమై పోవును
                            గోపమునను మిగుల గోడు గలుగు
                             గోప మడచె నేని గోర్కెలు నీడేరు
                              విశ్వదాభిరామ వినురవేమ !
                          
                        మన లోని గొప్పతనం కోపం మూలం గా తగ్గిపోతుంది. కోపం వలన మిక్కిలి ఇబ్బందులు  కలుగుతాయి.  కోపాన్ని తగ్గించుకుంటే కోర్కెలను సాధించుకోవచ్చు.

                               నీళ్ళమీద నోడ నిగిడి తిన్నగ బ్రాకు
                                బైట మూరె డైన బాఱ లేదు
                                నెలవు తప్పుచోట నేర్పరి కొరగాడు
                                 విశ్వదాభిరామ వినురవేమ !    

                   నీటి మీద పడవ ఒడిదుడుకులు లేకుండా చక్కగా ప్రయాణం చేస్తుంది. నేలమీద  మూరెడైనా ముందుకు  వెళ్లలేదు. ఎందుకంటే తన చోటు కానిచోట ఎంతనేర్పరి యైన నెగ్గుకు రాలేడు కదా !


    **************   *************   రెండవభాగం  త్వరలో**********************************

  






Monday 7 July 2014

శతకసౌరభాలు -3 మారన భాస్కరశతకము - 4


శతక సౌరభాలు -3
                        
                                మారన        భాస్కరశతకము - 4




భ్రష్టున కర్ధవంతులగు బాంధవు లెందరు గల్గినన్ నిజా
దృష్టము లేదు గావున దరిద్రతఁ బాపగ లేరు, సత్కృపా
దృష్టిని నిల్పి లోకుల కతి స్ధిర సంపద లిచ్చు లక్ష్మి యా
జ్యేష్ట కదేటికిం గలుగఁ జేయదు తోడనె పుట్టి భాస్కరా !
       

                      భాస్కరా ! అదృష్టము లేని వానికి  భాగ్యవంతులైన బంధువులు ఎందరున్నను వానికి భాగ్యరేఖ లేనందువల్ల వాడి దరిద్రాన్ని ఎవరూ పోగొట్టలేరు. ఎందుకంటే  ప్రజలందరకు చల్లని చూపుతో శాశ్వతమైన సంపదలనిచ్చెడి లక్ష్మీదేవి తన తోడబుట్టిన జ్యేష్టాదేవి కి మాత్రం  ఏమీ  సహాయం చేయలేకపోయింది కదా !


మదిఁ దను నాసపడ్డ యెడ మంచి గుణోన్నతుఁ డెట్టి హీనునిన్
వదలడు మేలుపట్టున నవశ్యము మున్నుగ నాదరించుగా
త్రిదశ విమాన మధ్యమునఁ దెచ్చి కృపామతి సారమేయమున్
మొదల నిడండె ధర్మజుడు మూఁగి సురావళి చూడ భాస్కరా !


                              భాస్కరా ! గుణవంతుడైన వాడు తన్ను నమ్ముకున్నవాడు ఎంత పనికి మాలిన నీచుడైనా వాడిని విడిచిపెట్టడు. అవకాశమొచ్చినప్పుడు వాడిని  పైకి తీసుకొని ఆదరిస్తాడు. ఎలాగంటే ఆనాడు ధర్మరాజు  స్వర్గానికి వెళుతూ , తన్ను నమ్మి వెంట వస్తున్న కుక్కను ముందుగా దేవతా విమానం ఎక్కించి ,  దేవతలందర్నీ ఆశ్చర్యపరిచాడు కదా !


మాటల కోర్వజాల డభిమాన సమగ్రుడు  ప్రాణహానియౌ
చోటుల నైనఁ దాఁ నెదురు చూచుచు నుండుఁ  గొలంకు లోపల
న్నీటమునింగి నప్పుడతి నీచము లాడిన రాజరాజు పో
రాటమొనర్చి నేల బడ డాయెనె భీముని చేత భాస్కరా !

                      భాస్కరా ! అభిమానధనుడైన వాడు ప్రాణాలనైనా విడుస్తాడు కాని మాట పడడు. ఎలాగంటే కురుక్షేత్ర యుద్ధం చివరలో ప్రాణభయం తో మడుగున దాగిన దుర్యోధనుడు పాండవులు పలుకుతున్న అవమానకర మాటలను సహించలేక వెలుపలికి వచ్చి , భీముని చేతిలో మరణించాడు కదా !

మానవనాథుఁ డాత్మరిపు మర్మమెరింగిన వాని నేలినం
గాని జయింపలే డరుల గార్ముకదక్షుడు రామభద్రుఁడా
దానవ నాయకున్ గెలువఁ దానెటు లోపుఁ దదీయ నాభికా
స్ధాన సుధ న్విభీషణుడు తార్కొని చెప్పకయున్న భాస్కరా !

                         భాస్కరా ! రాజు శత్రువు యొక్క రహస్యాలు తెలుసుకుంటే గాని  త్వరగా విజయాన్ని సాధించలేడు. ఎందుకంటే  గొప్పధనుర్విద్యానైపుణ్యం కల్గినప్పటికీ శ్రీ రామచంద్రుడు రావణుని సంహరించడానికి విభీషణుని నుండి రావణుని  నాభి యందలి అమృతభాండ  రహస్యాన్ని తెలుసుకోవాల్సి వచ్చింది కదా !

మును పొనరించు పాతక మమోఘము జీవులకెల్ల బూని యా
వెనుకటి జన్మమం దనుభవింపక దీరదు , రాఘవుండు వా
లిని బడవేసి తామగుడ లీల యదూద్భవుడై కిరాతుచే
వినిశిత బాణపాతమున వీడ్కొనడే తన మేను భాస్కరా !

                          భాస్కరా !  ఎంతటి వారికైనా పూర్వజన్మ  సంచిత చేసిన పాపాన్ని  తర్వాత జన్మలో అనుభవింపక తప్పదు.  శ్రీ రామచంద్రుడు వాలిని  అన్యాయం గా చంపిన పాపానికి తరువాత  కృష్ణావతారం లో కిరాతుని బాణానికి  తనప్రాణాన్ని వదిలేశాడు గదా !

మానిని చెప్పు నట్లెఱుక మానిన వాఁడటు చేసినన్ మహా
హాని ఘటించు నే ఘనుని కైన నసంశయ ముర్విపైఁ గృపా
హీనతఁ బల్కినన్ దశరధేశ్వరుఁ డంగన మాటకై గుణాం
భోనిధి రాముఁబాసి చనిపోవఁడె శోకము తోడ భాస్కరా !

                              భాస్కరా ! ఎంత గొప్పవాడైనా  ఆడదాని చెప్పుడు  మాటలను విని నడుచుకుంటే ఆపదలను పొందుతాడు . దీనిలో సందేహమే లేదు. పూర్వము దశరథుడు కైకేయి మాట విని శ్రీరాముని అడవికి  పంపి  , ఆ దుఖం తోనే మరణించాడు కదా !

రాకొమరుల్ రసజ్ఞుని దిరంబుగ  మన్నన నుంచినట్లు భూ
లోకమునందు మూఢుఁ దమ లోపల నుంపరు ,నిక్కమే కదా !
చేకొని ముద్దుగాఁ జదువు చిల్కను బెంతురు గాక పెంతురే
కాకము నెవ్వరైన,  శుభకారణ సన్ముని సేవ్య భాస్కరా !

                     శుభములకు మూలకారణమైన వాడా  ! మునీశ్వరులచే పూజించబడు భాస్కరా !  మానవులు  ముద్దుగా మాటలు చెప్పే చిలుకను పెంచుకుంటారు కాని కాకిని పెంచరు కదా. అలాగే రాజులు కూడ  రసజ్ఞుడైన కవిని తన ఆస్థానం లో   మన్నించి ,గౌరవిస్తారు కాని మూఢుని చేర దీయలేరు కదా !

                                        లోకములోన దుర్జనుల లోతు నెఱుంగక చేరరాదు సు
శ్లోకుడు జేరినం గవయఁజూతురు చేయుదు రెక్కసక్కెముల్
కోకిలఁ గన్నచోట గుమిగూడి యసహ్యపు గూతలార్చుచున్
గాకులు తన్నవే తరిమి కాయము తల్లడమంద భాస్కరా !

                          భాస్కరా ! ఈ లోకంలో మంచివాడు  దుర్మార్గుల స్వభావాన్ని తెలసుకోకుండా వారి చెంతకు వెళ్ళరాదు. అలా వెళితే దుర్మార్గులు  మూకుమ్మడిగా  సజ్జనుని పై దాడి , గేలి చేస్తారు. కోకిలను చూచిన కాకులు  కారుకూతలు కూస్తూ  , ఆ కోకిలను కమ్ముకొని,  గోళ్ళతో రక్కుతూ గాయపరుస్తాయి కదా !    

వంచన  యింత లేక యెటువంటి మహాత్ముల నాశ్రయించినన్
గొంచెమె కాని మేలు సమ గూడ డదృష్టము లేనివారికిన్
సంచితబుద్ధి బ్రహ్మ ననిశంబును వీపున మోచునట్టి రా
యంచకుఁ దమ్మితూండ్లు దిననాయె గదా ఫలమేమి భాస్కరా !

                             భాస్కరా !  గొప్పవారిని ఆశ్రయించి మనం  మనస్ఫూర్తిగా   ఎంత సేవించినా, ప్రాప్తమున్నంతవరకే ఫలం లభిస్తుంది కాని  అంతకు మించి ఆవగింజంతైనా లభించదు. లోకాలను సృష్టించే ఆ బ్రహ్మదేవునకు వాహనమైన కూడ రాజహంసకు తామరతూండ్లే ఆహారమైనాయి కదా !

వలనుగఁ గానలందుఁ బ్రతివర్షమునం బులి నాలుగైదు పి
ల్లఁలగను దూడనొక్కటి నిలం గను ధేనువు రెండు మూడునే
డుల కటులైన బెబ్బులి కుటుంబము లల్పములాయె నాలమం
దలు గడువృద్ధిఁ జెందవె యధర్మము ధర్మము దెల్ప భాస్కరా !

                              భాస్కరా ! ఎప్పుడైనా అధర్మం మీద ధర్మమే గెలుస్తుంది .నిలుస్తుంది కూడ. ఎలాగంటే అడవిలో ఉండే పెద్దపులి ప్రతి సంవత్సరం నాలుగైదు పిల్లలను కంటూ ఉంటుంది.    మనదొడ్లో ఆవు  రెండు మూడు సంవత్సరాలకు ఒక దూడను పెడుతుంది . అయినా గో వంశమే వృద్ధి చెందుతోంది గాని బెబ్బులి వంశం వృద్ధి చెందటం లేదు కదా !

వానికి విద్య చేత సిరివచ్చె నటంచును విద్య నేర్వగాఁ
బూనిన బూనుఁ గాక తన పుణ్యము చాలక భాగ్యరేఖకుం
బూనగ నెవ్వఁడోపు  సరిపో చెవి పెంచునుగా కదృష్టతా
హీనుడు కర్ణభూషణము లెట్లు గడింపగ నోపు భాస్కరా !

                    భాస్కరా ! ఒకడు బాగా చదువుకోవడం మూలంగా  బాగా సంపాదిస్తున్నాడని వేరొకరు కూడ బాగా చదువుకోవచ్చుకాని వానికి అదృష్టం చాలకపోతే డబ్బును సంపాదించలేడు. లాగంటే చెవికి రంధ్రాన్ని పెద్దదిగా చేసుకోవచ్చుకాని  కర్ణ కుండలాలను సాధించుకోవడం కష్టం కదా !

వలవదు క్రూర సంగతి యవశ్యమొకప్పుడు సేయంబడ్డచో
గొలదియె కాని యెక్కువలు గూడవు , తమ్ములపాకు లోపలం
గలసిన సున్నమించుకయ కాక మఱించుక ఎక్కువైనచో
నలుగడఁ జుఱ్ఱుజుఱ్ఱు మని నాలుక పొక్కకయున్నె భాస్కరా !

                    భాస్కరా !  చెడ్డవానితో స్నేహము ఎప్పుడూ చేయకూడదు అంతగా చేయాల్సివచ్చినా పరిమితం గా చేయాలి లేకపోతే  అపాయమే. తమలపాకు లోకి సున్నం కొంచెం రాసుకుంటే నోరు పండుతుంది కాని ఎక్కువైతే నాలుక పొక్కుతుంది కదా !

సార వివేక వర్తనల సన్నుతి కెక్కిన వారి లోపలం
జేరిన యంత మూఢులకుఁ జేపడ దానడ యెట్టులన్నఁ గా
సారములోన హంసముల సంగతి నుండెడి కొంగపిట్ట కే
తీరున గల్గనేర్చును దదీయగతుల్ దలపోయ భాస్కరా !

                      భాస్కరా ! మూర్ఖుడు మంచివారితో కలిసి తిరిగినను వాడికి మంచిలక్షణాలు రావు.  సరస్సులో హంసలతో కలిసి కొంగలు సంచరించి నంత మాత్రాన హంసల నడకలు కొంగలకు రావు కదా !

సిరి గల వాని కెయ్యెడలఁ జేసిన మేలది నిష్భలంబగున్
నెఱి గుఱి కాదు పేదలకు నేర్పునఁ జేసిన సత్ఫలంబగున్
వఱపున వచ్చి మేఘుండొక వర్షము వాడిన చేలమీదటం
గురిసినఁ గాక యంబుధుల గుర్వగ నేమి ఫలంబు భాస్కరా !

                          భాస్కరా ! ధనవంతునికి మనం ఎంత సహాయం చేసినా అది  ప్రయోజన రహితమే అవుతుంది. అదే సహాయం పేదవానికి చేస్తే ప్రయోజనం ఉంటుంది. ఎలాగంటే మేఘుడు  వచ్చి  వాడిన చేల మీద వర్షాన్ని కురిపిస్తే ప్రయోజనం ఉంటుంది కాని సముద్రం లో వాన కురవడం వలన ప్రయోజనం లేదు కదా !

స్ధిరతర ధర్మవర్తన బ్రసిద్ధికి నెక్కిన వాని నొక్క ము
ష్కరుఁ డతి నీచవాక్యములఁ గాదని పల్కిన నమ్మహాత్ముడుం
గొఁఱత వహింపడయ్యెడ, నకుంఠిత పూర్ణ సుధాపయోధిలో
నరుగుచు  గాకి రెట్ట యిడి నందున నేమి కొఱంత భాస్కరా !

                     భాస్కరా ! ఒక మంచివానిని  నీచుడొకడు అతి హీనముగా నిందించినను      ఆ  మహనీయునకు ఎటువంటి అవమానం  ఉండదు . కాకి ఆకాశం లో ఎగురుతూ  సముద్రం లో రెట్ట వేసినంత మాత్రాన  సముద్రానికి వచ్చిన కొరత ఏముంటుంది.

  ఇంచుక నేర్పుచాలక విహీనతఁ జెందిన నాకవిత్వమున్
         మించు వహించె నీకతన మిక్కిలి యెట్లనఁ దోలుబొమ్మలున్
మంచి వివేకి వాని తెర మాటున నుండి ప్రశస్తరీతి నా
                డించిన నాడవే జనుల డెందము నింపవె ప్రీతి భాస్కరా !    (109 )

                       భాస్కరా ! నేర్పరి యైన వాడు తెరచాటు నుండి తోలు బొమ్మల నాడించి , ప్రజల మనస్సులను రంజిల్ల చేసినట్టు కవిత్వం వ్రాయడం లో ఏ మాత్రం నైపుణ్యం లేని   నాకవిత్వం  నీ కారణం చేతనే ప్రసిద్ధి పొందింది. అంటూ ముగించాడు మారన  తన భాస్కర శతకాన్ని.

                                                 ఇది భాస్కర శతకము. తేజస్వినీ వ్యాఖ్యా సహితము

                                                                       సంపూర్ణము.



*********************************************************************************