Sunday 18 December 2016

గుడిమెట్ట నగరం – చాగివారు.(1)



రెండవ ప్రకరణం

    గుడిమెట్ట నగరం – చాగివారు.(1)
                

                          గుడిమెట్ట రాజ్యం ప్రాచీనాంధ్ర సామంత రాజ్యాల్లో ఒకటి. కులోత్తుంగ రాజేంద్రచోడుని యాదరణ కు పాత్రుడై , సామంత రాజ్యచిహ్నాలైన భేరీ ,భాక శంఖ , ఆనక ,కాహళమనే పంచ మహా శబ్దాలను, అరయతా పట్టకాన్ని ,బంగారు పల్లకిని ,పూర్ణేందు కిరణ శోభిత చామరాన్ని , హేమదండమును  పొందిన ముప్పభూపాలుడు చాగి వంశం  మూలపురుషుడు. కళింగ యుద్దానంతరం రాజేంద్ర చోడుని చే ప్రకటించబడిన సామంతరాజ్యాలలో ఈ గుడిమెట్ట ఒకటి. కులోత్తుంగునిచే మండలేశ్వరుడు గా గౌరవించబడిన ముప్పభూపాలడు నతవాడి సీమలో గుడిమెట్ట రాజ్యాన్ని స్ధాపించాడు.  దుర్జయ వంశీయులు గా చెప్పుకుంటున్న  చాగి వారు సూర్యవంశ క్షత్రియులమని ప్రకటించుకున్నారు.  వీరు గుడిమెట్ట , విజయవాటిక , ప్రధాన నగరాలు గా చేసుకొని రాజ్యపాలన కొనసాగించారు.
                 
                                  నేడు     గుడిమెట్ట మండల కేంద్రమైన నందిగామ కు పడమర గా 12 కిలోమాటర్ల దూరం లో  ఉన్న ఒక చిన్న గ్రామం. కృష్ణాజిల్లా లో చివరి గ్రామమిది.  కృష్ణానది దాటితే ఆవలి వైపు  గుంటూరు జిల్లాలోకి ప్రవేశిస్తాము. కృష్ణానది ఒడ్డున ఎత్తైన పర్వతసానువులచే ఆక్రమించబడి , నల్గొండ నుండి విజయవాడ వరకు  పరిఢవిల్లిన ప్రదేశం లో  కృష్ణానది ఉత్తరతీరం లో ఈ నగరం ఆనాడు నిర్మిత మైంది. ఇచ్చట రెండువైపుల ఒరుసుకొని నిలిచిన పర్వతాలు కృష్ణానది యొక్క లోతు ను పెంచాయి. మండు వేసవి లో కూడ ముఫై అడుగుల లోతు కు మించి ఉండే  నది లోతు నౌకాయానానికి , జలమార్గ రవాణాకు  మంచి సౌకర్యాన్ని కల్గించింది. కృష్ణ ఆవలివైపు కోట రాజుల మాండలిక రాజ్యం ధరణికోట రాజధానిగా విలసిల్లుతున్న సమయమది. కోట రాజులు  అమరావతి ని ,కోన హైహయులు పల్నాటిని , కొండపడమటి రాజులుకొన్నాతవాడి ని పాలిస్తున్న రోజుల్లో ముప్పభూపాలుడు కృష్ణ కు ఉత్తరం గా  ఈ గుడిమెట్ట లో సామంతరాజ్యానికి ముగ్గువేసి , నగర నిర్మాణం చేపట్టాడు.
                    
                                                   -12-
               

                        రాజకీయం గా పరిశీలిస్తే ఈ 12 వ శతాబ్దం మతవైషమ్యాలకు , శైవ వైష్ణవ విభేదాలకు  కారణభూతమైంది. అంతేకాకుండా  ప్రాంతం లో జైన ,బౌద్ధ మతాల  ప్రభావం ఇంకా పూర్తిగా మాసిపోలేదు. అడుగడుగునా యుద్దాలు , రక్తపాతాలు  ఆంధ్రావనిని అతలాకుతలం చేస్తున్నాయి. ఒకవైపు బసవేశ్వరుని వీరశైవం జాతిని జాగృతం చేస్తున్న సమయమిది. అమరేశ్వరుని గుడిగంటలు అహర్నిశలు శబ్దిస్తున్న తరుణ మది. ఇటువంటి సమయం లో కొండ మీద  రామలింగేశ్వరుని ప్రతిష్ఠించి ,గుడిమెట్ట నిర్మాణం ప్రారంభించాడు ముప్పభూపాలుడు. ఈతని యనంతరం దోరభూపతి 1 రాజ్యానికి వచ్చాడు. దేశం లో జరుగుతున్న యుద్ధాల్లో ప్రభువులైన పూర్వ చాళుక్యులకు సహాయం చేస్తూనే ,తన కోటను పటిష్టపరుచుకో యత్నించా డీయన. ఆంథ్రరాష్ర్టం లో కాకతీయులు నెమ్మది గా నిలదొక్కుకొని, తన అధికార హస్తాన్ని  ప్రసరింపజేయసాగారు. తిక్కన హరిహరాద్త్వైతం ప్రజల్లో కొత్త ఆలోచనలను  రేకెత్తించసాగింది.  ఈ కాలం లో రాజులు శైవమతానుయాయులైనప్పటికి హరి హరులను ఇరువురుని సమానంగా ఆదరించసాగారు .మొదటి పోతరాజు కాలంలోనే విశ్వేశ్వర దేవరకు ,చోడనారాయణునకు  గుడిమెట్ట లో ఆలయాలు కట్టించాడు.
                                           
                                                   శ్రీకృష్ణ వేణ్ణాతట భూమిభాగే
                                                శ్రీ పోతభూపో గుడిమెట్ట నామ్నీ
                                                 విశ్వేశ్వరాఖ్యం శివమాదిదేవం
                                                   సంస్ధాపయా మాస పురే  (Arc-300/1924 )
              
     --   అని శాసన సాక్ష్యము.
             

                                               



                      త్యాగి పోతరాజు  చాగి వంశం లో ప్రసిద్దుడు.    త్యాగి, చాగి, సాగి పదాలు సమానా ర్ధకాలు గా  కన్పిస్తున్నాయి. చాగి వంశీయులు తాము దుర్జయ వంశీయులమని
చెప్పు కున్నారు.  వీరు చతుర్థాన్వయులు. విప్పర్ల వంశజులైనట్లు శాసనాద్యాధారాలు కన్పిస్తు న్నాయి. ముక్త్యాల శాసనం లో వీరి మూలపురుషుడు దుర్జయుడు గా చెప్పబడ్డాడు. కాని ఈ సమయం లో రాజ్యాలనేలిన అనేకమంది రాజులు  తాము దుర్జయ వంశీకుల మనే ప్రకటిం చుకున్నారు. అంతేకాక సూర్య క్షత్రియులు గా ప్రస్తావించబడ్డారు. ఈ చాగి వంశం లోని వాడైన  - చాగి మన్మగణపతి దేవరాజు  అనుమంచిపల్లి శాసనం లో  క్షత్రియుడు గా ప్రకటించుకున్నాడు. (Arc -283/1924 )
                                            
                                                                     - 13 –
   
    “ ----- బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్ర విధయా వర్ణాశ్చతుర్ధా క్రమాత్,
                 తత్రాస్తి బాహుజ కులాభరణం తపోభిర్వప్పర్ల  వంశ  ఇతి – ”(Arc-527/1913) . 

అయితే చాగివారు విష్ణు పాద పద్మోద్భవులని వినుకొండ శాసనం చెపుతోంది.
          
                        శ్రీ లక్ష్మీ పతి పాద పద్మ జనితోవర్ణాశ్చతుర్ధా భవ
              తస్మిన్నేతన్మమమ నాయక: సమజని శ్రీ సాగి వంశోద్భవ: ”(Arc-527/1913).
                           
       క్రీ.శ 1088 నాటి నెల్లూరు జిల్లా  ఒంగోలు తాలూకా నన్నూరు సనం లో  చాగి వారు క్షత్రియులు గా ప్రకటించబడ్డారు. రామవిలాస కావ్యకర్త శ్రీ ఏనుగు లక్ష్మణ కవి చాగి వారు సూర్యాన్వయులని వర్ణించారు. మన్మగణపతి దేవరాజు వేయించిన అనుమంచిపల్లి శాసనం లో బాహుజకులాభరణుడి గా చెప్పబడినా , మిగతా చాగి వారి శాసనాలు వేటిలోను క్షత్రియ  ప్రశంస లేదు. దుర్జయ వంశీకులు గానే చెప్పుకున్నారు. పశ్చిమ చాళుక్యలతో పాటు తెలుగు దేశం లో ప్రవేశించిన పల్నాటి  హైహయులలో చాగి వారు కన్పిస్తున్నారు.
                 
              గురజాల త్రిమూర్త్యాలయం లో  చాగి బేతరాజు శాసనం ఒకటి కన్పిస్తోంది. అమరావతి శాసనం లో చాగి పోతరాజు తమ్ముడైన కల్లయ నాయకుడు బ్రహ్మపాదోద్భవమైన దుర్జయ వంశ సంజాతుడగు ముచ్చయ నాయకుని కుమార్తె యైన చెఱువమ్మ ను పరిణయమాడినట్లు చెప్పబడింది. దుర్జయ వంశజుడైన కల్లయ నాయకుడు  దుర్జయవంశజుడైన ముచ్చయ  కుమార్తె ను వివాహమాడటం గమనిస్తే దుర్జయాన్వమనునది ఒక వర్ణము కాని వంసము కాదని స్పష్టమవుతోంది.
                                             -14-
          అయితే చారిత్రక పురుషుడైన  దుర్జయుడొకడు కన్పిస్తున్నాడు. కళింగ ప్రాంతమైన శ్రీకాకుళం , విశాఖపట్టణం గంజాం ప్రాంతాలను ఇతను పాలించాడు.  ఇంపురు శిలాశాసనం ప్రకారం  మూడవ విష్ణుకుండిన మహారాజు  మాధవర్మ ( క్రీ.శ 540-611)  దుర్జయుని ఓడించినట్లు గా తెలుస్తోంది.( మనసంస్కృతి చరిత్ర  137 వ పేజి.) కాకతీయ గణపతిదేవుడు తన గవరపాడు శాసనం లో తమ కాకతీయ కుటుంబీకులకు దుర్జయుని కారమం గానే కీర్తి లభించిందని చెప్పుకున్నాడు. దీన్ని బట్టి చూస్తే దుర్జయ వంశమే ఒకటున్నట్లు అర్ధమౌతోంది.
                   
                      ఇదే సమయం లో మరొక్క విషయం కూడ గుర్తు చేసుకోవాలి. ఆచార్య యం.జి రంగా తన కాకతీయ నాయకులు అనే గ్రంథం లో ఇలా వ్రాశారు.  పురోహితులు ఎప్పటికప్పుడు అధికారం లోకి వచ్చిన కుటుంబాలకు క్షత్రియత్వాన్ని అంటగట్టేవారు. పురాణ కాలక్షేపాల ద్వారా వారికి పురాణనాయకుల గోత్రాలను అన్వయింపజేసేవారు. ఆ విధం గా రాష్ట్రకూట ,చాళుక్య, చోళ , కాకతీయ నాయకులు పురాణ క్షత్రియులు గా  పరిగణనలోకి వచ్చారు. తిక్కన సోమయాజి , విద్యారణ్యస్వామి  వంటి బ్రాహ్మణులు వారికి పవిత్ర క్షత్రియార్హత కల్గించారు. ఆ విధం గా ఆనాటి రాజులు పురాణ నాయకులైన రామ , శ్రీకృష్ణ  పాండవ వంశాలకు వారసులు గా చారిత్రక ఆధారాలను సృష్టించుకున్నారు అని ఇదంతా ఆస్ధాన కవుల , పురోహితుల పుణ్యమేనని ప్రకటించారు.
                            
              అయితే చాగి వారి వలే దుర్జయాన్వయులమని చెప్పుకున్నవారు అనేకమంది కన్పిస్తున్నారు. కొండ పడనటి సీమ వారు  దుర్జయులమనే చెప్పుకున్నారు. కాకతీయుల విషయం మనకు తెలిసిందే. వీరి వడ్డమాన శాసనం దుర్జయులనే ప్రకటిస్తోంది. కాని గణపతి దేవుని మోటుపల్లి , పాకాల, కాంచీపురం శాసనాల్లో కాకతీయులు సూర్య వంశీయులు గా స్తుతించబడటం మనం గమనించవచ్చు. కాని కాకతీయుల సామంతుల శాసనాల్ని , వారి సన్నిహిత బాంధవ్యాల్ని పరిశీలిస్తే వీరు చతుర్ధాన్వయులు గానే కన్పిస్తున్నారు. దుర్జయుడైన కాకతి గణపతి దేవ చక్రవర్తి చోళులను జయంచిన పిమ్మట క్షత్రియుడనని ప్రకటంచుకోగా , సమకాలికుడు,ఒకే వంశీయుడునైన మన్మచాగి గణపతి దేవరాజు కూడ తాను క్షత్రియుడనని ప్రకటించుకోవడం లో ఆశ్చర్యం లేదు. అంతేకాదు .ఈ రెండు శాసనాలు ఒకేకాలం లోనివి కావడం మనం గమనించాలి.
              -15 
           
                      చాగివారి అనుమంచిపల్లి  శాసనం క్రీ.శ.1260 (శా.శ.1182.) లోనిది కాగా , కాకతీయుల మల్కాపురం శాసనం క్రీ.శ.1261(శా.శ.1183 .) లోనిది. కాబట్టి వీరు ప్రకటించుకున్న క్షత్రియత్వమనునది ధాత్రీపతిత్వ సంజాతమే కాని జన్మత: చతుర్థాన్వయులేనని లభించిన  శాసనాద్యాధారాలతో అంగీకరించవలసిందే.
                     
        ప్రతాపరుద్రుని ఆస్ధానకవి శ్రీ విద్యానాధుడు ప్రతాపరుద్రచరిత్ర  వ్రాస్తూ అత్యర్కేందు కుల ప్రశస్తి మభిదద్యం కాకతీయాన్వయమ్  టూ సూర్య చంద్ర వంశాల ప్రతిష్ట తలదన్నే ప్రశస్తి కాకతీయకులాని దంటాడు. అంటే పరోక్షంగా కాకతీయులు చతుర్ధాన్వయులని స్పష్టం చేసినట్లే వుతుంది. అంతేకాదు.  తెలంగాణా లేని భూదపుర సాసనం లో కాకతీయుల ను గురించి వ్రాస్తూ  ఇంతక పూర్వం  నాలుగు వర్ణాలుండేవని  , అందులో నాల్గవది జగత్ప్రసిద్దమైన వర్ణమనియు , దానిలో కాకతీయులు  జన్మించిరని వ్రాయబడింది.
                                 
                                        చత్వారో జగతి ఖ్యాతిస్తతో వర్ణ స్సమంతత
                                   ----------------- తేషాం మహా మహీయం
                                   మవాతస్తురయో వర్ణశ్రియం ప్రసవభూమి ----
                                 --------- ప్రశస్తి మస్తి తత్రాపి  కాకతీయ కులం మహత్ 

                 దీన్ని బట్టి క్షత్రియత్వమనేది రాజ్యాధిపత్యం వచ్చేదనే విమర్శకుల వాదన సమంజసమే ననిపిస్తోంది. కాని స్పష్టమైన ఆధారాలు కాదనలేనివి కదా !
                  
            





    కాబట్టి చాగి వారు చతుర్ధాన్వయులు గానే కన్పిస్తున్నారు. కాని కొంతమంది విమర్శకు లు సాగి వారు క్షత్రియులలోను ,చతుర్ధాన్వయుల లోను గలరని వాదిస్తూ అందుకు కావలసిన ఉపపత్తుల్ని , వంశవృక్షాల్ని కూడ ప్రకటించారు. ( భారతి అంగీరస/కార్తిక). కాని
                                                    
                                                            -16-


                          వీరు ప్రకటించిన  వంశవృక్షం లో రెండవ పోతరాజు ,( నరసింహవర్ధన పోతరాజు )  , గణపయ రాజు ,మనుమచాగి గణపతి దేవరాజులు లేరు. కాబట్టి మళ్ళీ ఇక్కడ వేరే ఉపపత్తులు వెతుక్కోవాలి. అందువలన ఒకే ఇంటి పేరున్న వారు రెండు ,మూడు వర్ణాల్లో ఉండటం తెలుగు నేలకు కొత్తేమీ కాదు. రాజులైన వారందరు క్షత్రియులే నంటే వాదమే లేదు. ఈ చర్చ పూర్వ గ్రంథాల్లో ఉండటం వలన ఇక్కడ చేయవలసి వచ్చింది. భావి పరిశోధకులకు అవకాశం ప్పుడూ ఉంటుంది. సాగివారు ,చాగి వారు , త్యాగి వారే నని  , రాజ్యలక్ష్ని ని పొంది రాజులైనారని భావిస్తే  చరిత్ర లో ఆటంకాలు తగ్గుతాయేమో.
                   
                          ముక్త్యాల శాసనాన్ని అనుసరించి చాగి వారి వంశావళి ఈ క్రింది విధం గా ఉంది.
                                              

                                                దుర్జయుడు
                                                        ]
                                             ముప్ప భూపాలుడు
                                                         ] 
                                                   దోరభూపతి 
                                                         ]
                                           పోతరాజు - రాజాంబిక 
                                                        ]
                                               చాగి అను దొర
                                                         ] 
                                            పోతరాజు
           
                    ఇది రెండవ పోతరాజు వేయించిన శాసనము .(Arc-300/1924). ఇటువంటి శాసనమే విజయవాటిక శాసనాల్లో లభిస్తోంది.   దీనిలో కొద్దిగా తేడా కన్పిస్తోంది.
                                                  
                                                       -17-
                                                 
                                                  అరయడు
                                                          ]  
                                                       దోర రాజు 
                                                            ]  
                                                        పోత రాజు 
                                                            ] 
                                                          చాగి రాజు
                                                               ]
                                                  నరసింహవర్ధన పోతరాజు 
         
                దోర భూపతి ఇల్లాలు  చిమ్మాంబిక. వీరికి ఇద్దరు కుమారులు. వారు కల్లయ నాయకుడు. భీమ రాజు.   కల్లయ నాయకుడు దుర్జయ వంశోద్భవుడైన   ముచ్చయ కుమార్తెయైన చెఱువమ్మ ను  పరిణయ మాడాడు. ముచ్చయ ల్లాలు జక్కాంబిక. భీమరాజు కు దోరడు  దోరనికి పోతరాజు అనే కుమారులు కలిగారు. ముక్త్యాల ,(Arc-271/1897) అమరావతి(Arc-294/1892)   , బెజవాడ (Arc-300/1924) శాసనాల్ని సమన్వయం  చేసి కొని చూస్తే చాగి వారి వంశ వృక్షం  ఇలా ఉంటుంది.
                                        

                                    
                                                    -18-                               
                                                  దుర్జయుడు
                                                        |              
                                                 ముప్పరాజు
                                                        |      
                                    దోరభూపతి  -  చిమ్మాంబిక
                                                        |
                  -------------------------------------------
                                  |                                 |                                   |
                           పోతరాజు                      భీమరాజు              కల్లయనాయకుడు   
                                  |                                  |            
                                    

                         
   చాగి                    దోర భూపతి                                               దోర                                                                                                                                                                                             
                                 |                                |   
                  నరసింహవర్థన పోతరాజు           పోత

                     వేదాద్రి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్ధాన ప్రాంగణం లో కన్పించే మన్మగణపతి దేవరాజు శాసనాన్ని పరిశీలిస్తే -  దోరమహీపతి కి గణపతి యు, గణపతి కి చాగి మన్మ గణపతి యు కుమారులని తెలుస్తుంది. సౌందర్య నిలయ: త్యాగి మన్మ మహీపతి :” అని మన్మ గణపతి మహారాజు ను సౌందర్య నిలయుడ గా పేర్కొంటుంది ఈ శాసనం. (Arc-309/1924). సామంతరాజులు తమ బిడ్డలకు తమ ప్రభువుల పేర్లు పెట్టుకోవడం  ఈ యుగధర్మం గా కన్పిస్తోంది. కులోత్తుంగ చోడుని పై నున్న గౌరవం తో వెలనాటి గొంకయ తన కుమారునికి రాజేంద్ర చోడుడు అని పేరు పెట్టుకున్నాడు. రెండవ కులోత్తుంగ రాజేంద్ర చోడుడు  గొప్పవీరుడు గా ప్రసిద్దు డయ్యాడు. అలాగే తన కొడుకు కూడ ప్రభువు వలే ఎదగాలనే చిరుకోరిక ఆ తండ్రి గుండెల్లో ఉండి ఉంటుంది. అందుకే గణపతి దేవరాజు  , మనుమ గణపతి దేవరాజు పేర్లు కాకతీయుల ప్రభావం తో చాగి వంశం లో చోటుచేసుకున్నాయి. తమ ఇష్ట దైవాల పేర్లను , మహా నాయకుల పేర్లను తమ బిడ్డలకు పెట్టుకోవడం తెలుగు నాట ఇప్పటికీ కన్పిస్తూనే ఉంది.
                        
                                                            -19-
                   
                             అనుమంచిపల్లి శాసనం (Arc-283/1924) ఈ విషయాన్ని బలపరుస్తూ-పోతరాజు కు దోరభూపతి ,దోరయ కు ముప్పాంబిక వలన గణపయ రాజు , గణపతి కి పోతరాజు  జన్మించి నట్లు చెప్పబడింది. మునగానపల్లె శాసనం లో చాగిరాజునకు భీమరాజు ,భీమరాజు కు పార్వతీదేవి వలన మనుమచాగిరాజు కుమారులు గా జన్మించి నట్లు చెప్పబడింది. (Arc-259/1924). అలాగే పోతవరం ఫకీరు తక్వా వద్ద నున్న శాసనాన్ని పరిశీలిస్తే పోతరాజు కు ప్రోలమదేవి అను పేరు గల కుమార్తె ఉన్నట్లు, ఆమెను దుర్గరాజు కి ఇచ్చి వివాహం చేసినట్లు మనం గ్రహించవచ్చు. చాగి వారి శాసనాలు చాలభాగం ఛిద్రమైనాయి. అందు వలన ఎంతో విలువైన  సమాచారం జాతికి తెలియకుండానే భూ స్ధాపితం అయిపోయింది.
                                            
                       పైన చూసిన శాసనాద్యాధారాలను సమన్వయం చేస్తే చాగి  వారి వంశానుక్రమణిక ఇలా తయారౌతుంది.
                                                         దుర్జయుడు
                                                              ]
                                                    ముప్పభూపాలుడు
                                                               |
                                            దోరభూపతి -చిమ్మాంబిక
                                                              |       
                        ----------------------------------------     
                         |                                       |                               |
మొదటి పోతరాజు-రాజాంబిక                  భీమ            కల్లయ నాయకుడు-చెఱువమ్మ
                        |                                        |                                                                                                             
                        |                                     దోర
                        |                                       |                               
                        |                                       పోత 
              ---------- ----------------------   
                       |                                                      | 
 ప్రోలయదేవి దుర్గ రాజు                 దోరభూపతి ముప్పాంబిక
|
                                             ----------------------------------------                         
                                             |                                             |                                             |
 నరసింహవర్ధన పోతరాజు ముక్తాంబ      గణపయరాజు తిన్నాంబిక       భీమరాజు -   పార్వతీదేవి  
                                                                             |                                                    |            
                                                      మనుమచాగి గణపతి దేవ                              దోరపరాజు
                                                                           |                                                      |
                                                                  పోతరాజు                                          చాగిరాజు


                                            -20-
         
                     తేదీ లేని పెనుగంచిప్రోలు శాసనం లో భీమరాజు కొడుకు దోరపు రాజు విశ్వేశ్వర దేవరకు హవిర్బిల్వార్చనలకు చేసిన దాన ప్రసక్తిఉంది. అలాగే ముప్పాళ్ళ శాసనం లో శా.శ 1199. (క్రీ.శ.1147.) చాగి మనుమ పోతరాజు బృహత్కాంచీపురాన్ని పాలిస్తున్నట్లు గా చెప్పబడింది.
                       
                 క్రీ.శ1269 లో ( శా.శ 1190.) నాటి రుద్రమదేవి గుడిమెట్ట శాసనం లో రుద్రమదేవి కట్టసాహిణి దాడి గన్నమ నాయకులు గుడిమెట్ట లోని విశ్వేశ్వర దేవరకు బేతవోలు (జగ్గయ్య పేట ) గ్రామాన్ని  దానం చేసినట్లు వ్రాయబడింది.దీన్ని బట్టి గుడిమెట్ట రాజ్యం క్రీ.శ 1268 నాటికిఉచ్ఛస్థితి లో ఉన్నట్టే అంగీకరించాలి. కాకతి రుద్రమదేవి కాలమది. మన్మ చాగి గణపతిదేవరాజు గుడిమెట్ట నేలుతున్న రోజులవి.ఇదే సమయం లో మనమొక విషయం గుర్తుచేసుకోవాలి.
                     

                   కాకతీయుల శాసనాలు గా గుర్తించదగిన మరి రెండ శాసనాలు గుడిమెట్ట శిథిలాల్లో మనకు కన్పిస్తున్నాయి. అనమ్మకొండ” “ హన్మకొండ పురాధీశులు వంటి పదాలు తప్పితే శాసనం లోని మిగిలిన భాగ మంతా  చదవడానికి వీల్లేనంతగా  ముష్కరుల చేత ధ్వంసం చేయబడింది. ఇక్కడ లభించిన శిల్పాల్లో కాకతీయ సంప్రదాయం స్పష్టం గా కన్పిస్తోంది. కాకతీయుల సామంతులు గానే వీరు చాలకాలం కొనసాగారనడానికి  సాక్ష్యాలున్నాయి.రెండవ పోతరాజు కాలం లో గుడిమెట్ట కు రాజధానిగ విజయవాటిక కొనసాగింది. అదే సమయం లో దోర భూపతి రెండవకుమారుడు భీమరాజు పెనుగంచిప్రోలు కు ఏలిక గా ఉన్నాడు. పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యం లో కొంతభాగాన్ని సోదరుని అధీనం లో ఉంచినట్లు భావించవచ్చు. పెనుగంచి ప్రోలు లో లభించిన ఒక నాగస్ధంభం పై ఒకశాసనం లభించింది. (Arc-279/1924 ) . ఇది మున్న తరంగిణి సమీపం లోని పెనుగంచి ప్రోలు నందు ----------శ్వర మహాదేవరను ప్రతిష్ఠ చేసి భీమరాజు కొడుకు దోరప రాజు హవిర్బిల్వార్చనలకు కంభంపాటి చెఱువు తూర్పున ----------- ఇచ్చిన దానాన్ని  చెపుతోంది.అందువలన గుడిమెట్ట రాజ్యానికి సమాంతరంగా అదే పరిథి లో మరొక ఉపకేంద్రం గా బృహత్కాంచీపురం (పెనుగంచిప్రోలు )  లో చాగిమన్మ పోత ,చాగి మన్మ గణపతి పేర్లమీద శాసనాలు వేయించే అవకాశం ఏర్పడింది. రెండవపోతరాజు రాజ్యానికి రాగానే రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నం లో  విజయవాటిక ను రాజధాని గా కొనసాగిస్తూ సోదరుడైన భీమరాజు కు పెనుగంచి ప్రోలును అప్పగించి ఉంటాడు.
                                    

                                                    -21-
                 
                        కోసవీడు శాసనం లో చాగి పోతరాజు ,చాగి గణపతిదేవులు కురుకూరు సోమనాథ దేవరకు, కోసవీడు విశ్వనాథ దేవరకు చేసిన దానసాసనం ఈ వాదన కు బలమిస్తోంది.ఇది క్రీ.శ 1230 లోనిది. అదే సంవత్సరం శా.శ.1152 (క్రీ.శ.1230 ) లో కురుకూరు స్వయంభూదేవరకు తారమ నామ సంవత్సరం వైశాఖ పాడ్యమి నాడు చాగి పోతరాజు , చాగి గణపతిదేవులు దానం చేసిన భాగం కన్పిస్తోంది. ( Arc-275/1924 ). పరిపాలనా సౌలభ్యం కోసమే ఈ విభజన జరిగింది. నరసింహవర్ధనపోతరాజు కు సంతానం లేకపోవడం వలన  అతని యనంతరం భీమరాజు కుమారులే రాజ్యానికి వచ్చారు.
                                   
       



                             రెండవ పోతరాజు రాజు భార్య ముక్తాంబ యని, ఆమె పేరు మీదే ముక్త్యాల పట్టణ నిర్మాణం జరిగి ఉండవచ్చని , ముక్తేశ్వర దేవరకు  ముక్తాంబకు ఏమైనా సంబంధముందేమో యోచించాలని సందేహించారు కొందరు విమర్శకులు. (భారతి-ఫిబ్రవరి/1933-273 వ . పే ). దోరభూపతి ఇల్లాలు ముప్పాంబిక . ఈమె పేరు మీద ముప్పాళ్ళ గ్రామం నిర్మించబడి ఉండవచ్చు. ముప్పాళ్ళ లో లభించిన శాసనాలు బృహత్కాంచీపురాన్ని ప్రస్తావిస్తున్నాయి. మనుమ పోతరాజు బృహత్కాంచీపురాన్ని పాలిస్తుండగా  అతని మంత్రి, కొమ్మన కుమారుడునైన మాక చమూపతి ఉత్తరాయణ పుణ్యకాలం లో రామేశ్వరు నకు 25 ఆవులను దానం చేసినట్లు శాసనం ఒకటి ముప్పాళ్ల లో లభించింది. (Arc-257/1924).  దీనిలో తేదీ  పురావస్తుశాఖవారి  సేకరణ లో సందేహం గా ఉంది. శా.శ 1169 గా శాసనం ప్రచురించబడింది. ౧ ౧ ౯ ౯ (1199) ఉన్నదాన్ని ౧ ౧ ౬ ౯  (1169 ) గా భావించడం వలన ఈ ప్రమాదం జరిగి ఉండ వచ్చు. ఇది మూడవ పోతరాజు కాలం.


                                                                                 

                                                                                    
                                                                                      ------------     తఱువాయి భాగం త్వరలో





-----------------------------------------------------------------------------------------------