Tuesday 11 September 2012

రామాయణము --- రమణీయకధనాలు - 3 - సరమ


సరమ

                         
                    శ్రీ మద్రామాయణంలో వాల్మీకిమహర్షిచే నామమాత్రంగా ప్రస్తావించబడి తెఱచాటుకు తొలగిపోయిన అతి కొద్ది  అందమైన పాత్రల్లో ఊర్మిళ,మాండవి,శ్రుతకీర్తుల తరువాత గుర్తుకొచ్చే పాత్ర సరమ.
                       సరమ విభీషణుని ఇల్లాలు. విభీషణస్తు ధర్మాత్మా న తు రాక్షస చేష్టితః అని శూర్పణఖ విభీషణుని గూర్చి రామునికి పరిచయం చేస్తుంది.[వా.3-17-24] రావణుని తమ్ముడు విభీషణుడు ధర్మాత్ముడు.   

                  రామాయణకధకు కారకుడై   “పౌలస్త్యవధనామాంతర రామాయణంలో రావణుడు ప్రతినాయకుడు  కాగా, లంకలో పుట్టినా లంక లక్షణాలులేని ధర్మాత్ముడు విభీషణుడు. ఆయనకు తగిన థర్మపత్ని సరమ.
              
            సరమా నామ ధర్మజ్ఞాం లేభే భార్యాం విభీషణామ్  అని  [ ఉత్తరకాండ 12-2 ] .ధర్మాత్మా  ధర్మజ్ఞా  అనే విశేషణాలు  వాల్మీకి ప్రయుక్తాలే.   రాక్షసవంశంలో జన్మించినా విభీషణుడు ,సరమ కూడా ధర్మాత్ములే నని మహాకవి ఉవాచ. అందుకే  రామసేవాభాగ్యం లభించిన అదృష్టవంతులయ్యారు వారు. వీరి కుమార్తె  పేరు అనల.

 జ్యేష్టకన్యా2నలానామా...................విభీషణసుతా....అని వాల్మీకం [సుం-కాం 32-10-11,12.}                                                                                 
              
                 సీత అశోకవనంలో ఉండగా ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఆమెను ఆదుకున్న కుటుంబంగాను, సేవచేసి తరించిన వ్యక్తులుగాను మనకు రామాయణం లో కన్పిస్తారు. రాముని శరణు జొచ్చిరావణవధకు కారకుడైన విభీషణుడు సీతకు పరోక్షంగా సహాయం చేస్తే, రామ విభీషణుల సమాగమాన్ని,  రామదండు పురోగమనాన్ని, గగనమార్గంలోనుండి అదృశ్యగా వీక్షించి సమస్త సమాచారాన్ని, తుదకు రామచంద్రుని విజయాన్ని కూడ సీతకు చెప్పి, రామవియోగమనే గ్రీష్మతాపంతో బీడువారిన జానకి హృదయంలో తొలకరి జల్లులను చిలకరించి శాంతింపజేస్తుందీ సరమ. 
                
                       చంకదుడ్డు శరణార్థివలె వచ్చిన విభీషణుని సుగ్రీవాదులు శతృవుగా భావించి – నివారించినా తుదకు రాముడు వారలందరిని సమాధానపరచి , ఆనాడు శూర్పణఖ చెప్పిన మాటలను గుర్తుచేసుకొని, విభీషణునకు అభయమిచ్చాడు. ఈ సమయంలో పలురకాల ధర్మసూక్ష్మాలు రాముని గొంతుకలో ప్రచలితమౌతాయి.
    
  సకృదేవ ప్రసన్నాయ తవాస్మీతి చ యాచతే !
  అభయం సర్వభూతేభ్యో దదామే తద్ర్వతం మమ
  విభీషణోవా సుగ్రీవ యదివా రావణస్స్వయమ్ ||  యు.కాం.18-33-34

రామచంద్రుని శరణాగత వత్సలుడని, ఆర్తత్రాణపరాయణుడని ,జగత్ప్రభుడని లోకం జోతలందించడానికి పరమప్రమాణంగా నిలుస్తుందీ ఘట్టమే. శరణుజొచ్చినవాడు రావణుడైనా అంగీకరిస్తానన్న రఘునాధుని మహత్వం రామాయణానికి జీవగఱ్ఱ. శరణాగతితత్త్వం రామచంద్రుని జగత్ప్రభువుని చేస్తే గీతామృత బోధ శ్రీకృష్ణుని జగద్గురువుని చేసింది.అంటే రామచంద్రునిలోని శరణాగతి తత్త్వం  వెల్లివిరియడానికి ఈ ఘట్టమే ఆధారమైంది.

అశోకవనంలో రావణుడు ఇంద్రజాలప్రభావంతో నెత్తురోడుతున్న రాముని శిరస్సుని చూపి, వానరసైన్యమంతా నాశనమైందని ప్రకటించి సీతాహృదయంలో బడబాగ్నిజ్వాలలు రేపి, భయపెట్టి వెళ్లిపోగా—తనవల్లనే పుణ్యాత్ముడైన రామచంద్రుడు మరణించాడని భోరున విలపిస్తున్న సీతమ్మను ఓదార్చడానికి వస్తుంది సరమ.

సీతాం తు మోహితాం దృష్ట్వా----------ప్రియా ప్రణయనీం సఖీం  [ యు.కాం.  33-1 -2 -4 ]

ఆశ్వాసయామాస  తదా సరమా మృదుభాషిణీ-----సఖీస్నేహేన సువ్రతా  ||

                         అన్న  పల్కులు వాల్మీకివి. సఖీ స్నేహంతో కష్టాల్లో ఉన్న నెచ్చెలిని ఓదార్చడానికి మృదుభాషిణియైన సరమ వచ్చింది. మరణించాడనుకొన్న రాముని క్షేమం తెలపడమే కాకుండా రావణుని ఇంద్రజాలవిద్యను తేటపరచి ఆమె హృదయానికి ఆనందాన్ని కల్గిస్తుంది. రాముని సముద్రతరణాన్ని గర్వంగా ప్రకటించడమేకాకుండా యుద్దంజరగబోతోందని .శుభం నిన్ను వరిస్తుందని, నామాటలు  నిజమని నమ్మబలుకుతుంది. నిరాశా నిస్పృహలతో నిండి నావంటి పాపిష్టిదాన్ని చేసుకోబట్టే ఆపుణ్యాత్ముడు మరణించాడన్న”{ యు.కాం.32-28,29 ] ఆత్మన్యూనతాభావాన్ని పొందిన సీతకు ఆత్మస్థయిర్యాన్ని కల్గించడానికి ఈ పాత్ర ఎంతగానో తోడ్పడుతుంది.
    
  శోకస్తే  విగత స్సర్వః కళ్యాణం త్వా ముపస్థితమ్
   ధ్రువం త్వాం భజతే లక్ష్మీః ప్రియం ప్రీతికరం శృణు |            [యు.కాం.33-14  ]
   
 ఈ మాటలు సీతాదేవి హృదయంలో అమృతపుజల్లులను కురిపించాయి. మరణోన్ముఖురాలైన ఆమెకు తిరిగి నూత్నోత్సాహాన్ని కల్గించాయి.అంతేకాదు.ఎంతోకాలంగా చిక్కుపడి ఏకవేణిగా నున్న నీ శిరోజాలను శ్రీరాముడు చక్కదిద్దగలడు అంటుంది మృదుభాషిణి గా సఖీస్నేహంతో సరమ. బాధలో ఉన్న వారిని సముదాయించాలంటే ఆత్మీయుల ప్రస్తావన తీసుకురావాలని ఇక్కడ చెప్పకనే నిరూపించాడు మహాకవి.ఆ సందర్భంలో  శ్రీ రామచంద్రుల ప్రస్తావన    బరువెక్కిన సీతమ్మ హృదయాన్నే కాదు భారమైన ఆ సన్నివేశాన్ని  తేలిక పరచింది. ఇది మహాకవి శిల్పం. అందుకనే ఈ సందర్భంలోని ఈ శ్లోకం సీతమ్మ కష్టాలను చూచి కరిగిన వాల్మీకిమహామునే  సరమ తో ఇలా పలికించాడేమో ననిపిస్తుంది.
  
   అశ్రూణ్యానందజాని  త్వం వర్తయిష్యసి శోభనే
   సమాగమ్య పరిష్వజ్య తస్యోరసి మహోరస : |                         [యు-కాం.33-33

                            “రాముని కౌగిలించు కొని ఆయన బిగికౌగిలిలో  విశాలమైన అతని వక్షస్థలం మీద ఆనందాశ్రువులను రాల్చగలవు. ఇది సరమ చేస్తున్న ఆశ్వాసనం కాదు. వాల్మీకి గొప్ప మనసుతో  చేతులెత్తి సీతమ్మకు అందిస్తున్న చల్లని ఆశీర్వచనమే ననిపిస్తుంది. మధురమైన సరమ అనునయవాక్యాలకు    కోలుకున్న సీత సరమను స్నేహపూర్వకంగా దగ్గరకు తీసుకొంది. అప్పుడే రమా సహితయైన  ఆ  రాక్షసి { స –రమ ] సరమ యైంది.   రాముని కౌగిలి విభీషణునికి లభిస్తే సీతమ్మ కౌగిలి అతని బార్య సరమకు లభించింది.  వారి జన్మలు ధన్యమైనాయి. నమ్మిన వారినెప్పుడు రామచంద్రుడు విడిచిపెట్టడు. అభయం సర్వభూతేభ్యో…”
...అనిగదా  ఆయనవ్రతం. అందుకే బుధకౌశిక ఋషి–
                     
                          "ఆత్త సజ్య ధనుషావిషుస్పృశావక్షయాశుగ నిషజ్గసజ్గినౌ
                    రక్షణాయ మమ రామలక్ష్మణావగ్రత : పథి సదైవ గచ్ఛతామ్ ||

పరిపూర్ణవిశ్వాసంతో గర్వంగా ప్రకటిస్తాడు శ్రీ రామరక్షాస్తోత్రం లో. ఎక్కుపెట్టిన ధనుస్సుల్లోని బాణాలను స్పృశిస్తూ, అక్షయతూణీరములు కల్గిన రామలక్ష్మణులు నన్ను రక్షించడానికి నేను నడిచేమార్గంలో నాకన్న ముందు నడిచెదరు గాక ! ఇదీ-  శ్రీ రామచంద్రుని పై భక్తులకున్ననమ్మకం.
                     
   అయితే సరమకు ఆ పేరు రావడానికి మాత్రం అసలు కారణం రామాయణం ఉత్తరకాండ  లో ఇలా ఉంది.
                    ‘మానససరోవర తీరంలోఈ కుమార్తెను ప్రసవించిన ఈమె తల్లి వానల వలన పెరుగుతున్నసరస్సునీరు పసిబిడ్డ వద్దకు రావడం  చూచి సరో మా వర్ధయ అని పల్కిందని ,అదే ఆ శిశువు పేరుగా మారి స ర మ  అయ్యిందని ఉత్తర కాండ   చెపుతోంది.    [ ఉ.కాం.—12-24]  
                                     ఏమైనా కష్టసమయంలో సీతమ్మకు తోడుగా నిల్చిన ఒక స్త్రీమూర్తి గా రామాయణంలో తన పాత్రను సుస్ధిరం చేసుకున్న భాగ్యశాలి సరమ.
                      
**వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిమ్   **[******