Wednesday 26 December 2012

శబరీ వృత్తాన్తం ఉపాఖ్యానమా?


              శబరీ  వృత్తాన్తం  ఉపాఖ్యానమా?
      
                 రామాయణ పాత్ర  ల్లో శబరి పాత్ర పొంది నంతటి ప్రాచుర్యాన్ని మరే  ఇతర పాత్ర పొంద లేదంటే అతిశయోక్తి కాదు.  శబరి పాత్ర గానే కాక ఒక నదీమతల్లి గా   సైతం తెలుగు వారికి దగ్గరైన పుణ్యశీల. ఆదికవి శబరి ని  మనకు అందించిన విధానమే ఆ పాత్ర పై ఒక ప్రత్యేక అబిమానం ఏర్పడటానికి కూడ కారణం అయ్యింది.ఎందుకంటే రామాయణం లోకానికి ఆదికావ్యమే అయినా  శబరి మాత్రం తెలుగువారి కే స్వంతం. ఇది తెలుగువారి ప్రత్యేకత.
                                రామకథ లో  శబరి పాత్ర లేకపోయినా రామాయణ  కథా గమనానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఫ్రతి పాత్ర కు పేరు పెట్టడం దగ్గర నుండి ఎంతో   నేర్పు తో, గొప్పగా కావ్యనిర్మాణం చేసిన మహాకవి వాల్మీకి శబరి పాత్ర ద్వారా మనకు అందించ దలచిన సందేశ మేమిటి. ఇదీ ప్రశ్న.?   
          మహాభారతం లో ఉపాఖ్యానాలున్నాయి కాని రామాయణం లో ఉపాఖ్యానమేమిటి.?    అంటే మరి శబరీ వృత్తాంతాన్ని ఏ విధంగా చూడాలి.? ఇదీ ప్రశ్నే.?
            
                                         శబరి రామచంద్రుని కొఱకు ఎదురు చూచి, ఎదురు చూచి  వృధ్దురాలైపోయింది.  శ్రీ రాముడు వస్తాడని గురుదేవులు చెప్పిన మాటలు విశ్వసించి, రాముని కోసం అడవి లోని  కందమూల ఫలాలను సేకరించి భద్రపరిచింది . రామ లక్ష్మణులు కనపడగానే వారికి ఎదురేగి పాదాభివందనం చేసి , అర్ఘ్య పాద్య ఆచమనీయాల నిచ్చి అతిథి  సత్కారం చేసింది.    ఇక్కడ శబరి ని  శ్రమణీ “   “ధర్మచారిణీ” అని వాల్మీకి పరిచయం చేస్తాడు. 
                 
                  తనకు అతిథి సేవలు చేసిన ఆ తపస్విని ని     కుశల ప్రశ్నల తో పల్కరించాడు శ్రీరామచంద్రుడు.  
               
               కశ్చిత్తే నిర్జితా విఘ్నా: కశ్చిత్తే వర్ధ తే తప:
                    కశ్చిత్తే నియత: కోప ఆహరశ్చ తపోధనే!!   (అ.74- 8)
                కశ్చిత్తే నియమా: ప్రాప్తా:  కశ్చిత్తే మనస: సుఖమ్
                  కశ్చిత్తే గురు శుశ్రూషా సఫలా చారుభాషిణీ !!          (అ.74-9) 

          “ తపోధనే,”” చారుభాషిణీ, ఇవి శబరిని గూర్చి శ్రీ రాముని సంబోధనలు.
          
     ఓ తపోధనురాలా! విఘ్నాలు లేకుండా తపస్సు కొన సాగుతోందా.? కోపం, అహంకారం అదుపు  ఉంటున్నాయా.? ఓ చారుభాషిణీ ! నియమ వ్రతాలు నిర్విఘ్నం గా  సాగుతున్నాయా.? మనశ్శాంతి లభిస్తోందా.? గురు సేవా ఫలాన్ని  పొందగలిగావా?    “  అని  పరామర్శించాడు శ్రీ రామచంద్రుడు.
           
                సిధ్ధురాలు , సిధ్దసమ్మత, అయిన ఆ తాపసి శ్రీరాముని తో  ఓ పురుషర్షభ ! నీ సందర్శనం వల్లనే నా తప: ఫలం , గురు శుశ్రూషా ఫలం కూడ దక్కాయని నీ అనుజ్ఞ అయితే  గురుదేవుని మార్గం లోనే అక్షయమైన లోకాని కి వెళ్లగలనని కోరింది.నీవు చిత్ర కూటానికి వచ్చినప్పటి నుంచి నీ రాకకు ఎదురు చూస్తూ నే ఈ పంపా తీరమందలి అడవి ఫలాలను మూలాలను సంపాదించి ఉంచానని , అంటూ,  అభిమానం గా కందమూలాలను సమర్పించింది .
       అవి స్వీకరించిన రఘురాముడు --------
              
                 ఏవముక్త : స ధర్మాత్మా శబర్యా శబరీమిదమ్
               రాఘవ: ప్రాహ విజ్ఞానే తాం నిత్యమబహిష్కృతామ్.!!”  (అ.74.19)


           అన్నాడు. పరమాత్మ జ్ఞానాన్ని పొందిన  ఈ శబరి  విజ్ఞానము చే    అబహిష్కృతురాలు. అని  ఆ శ్వాసించాడు.
            
               రాముని కోరిక మేరకు మతంగముని ఆశ్రమమంతా తిరిగి చూపించిన  శబరి  రామానుగ్రహాన్ని పొంది,యోగాగ్నిని  ప్రజ్వలింప జేసుకొని  అందులో ప్రవేశించి దివ్యాంబర ధారియై,  దివ్యాభరణాలు, దివ్యమాలావిభూషిత యై శబరి ఆమెకు అభీష్టమైన ,మహర్షులు నివసించే ఆనందమయ  లోకాలకు వెళ్లి పోయింది. తత్ పుణ్యం శబరీ స్థానం  జగామ ఆత్మసమాథినా. 

             ఇది వాల్మీకి చెప్పిన శబరీ వృత్తాంతము.
                    

                భక్తపాలన కళాసంరంభుడైన భగవంతుడు తన కోసం ఎదురు చూసే భక్తుల కోసం తానే నడిచి వస్తాడు. వారిని తరింప చేస్తాడు. అందుకే                రాముడు తారక రాముడయ్యాడు. అందుకే   కబంధుడు చెప్పాడని శ్రీ రాముడు శబరిని వెతుక్కుంటూ మతంగాశ్రమానికి వచ్చాడు.
         
              కబంధుడే  ఋష్యమూకాన్ని గూర్చి,సుగ్రీవుని సమాగమ ప్రయోజనాన్నిగూర్చి,ప్రస్తావించి అక్కడకు వెళ్లమని చెప్పాడు. అతడే మతంగాశ్రమ ఫ్రస్తావన తీసుకొచ్చి, శబరి ని చూచి వెళ్లమని  కూడ చెప్పాడు .
     
                 శబరీ ,రామచంద్రుల సమాగమ ,సంభాషణలు  పైన చదివాము వీనిలో ఎక్కడా కూడ  రామచంద్రుని కొచ్చిన  కష్టాన్నిగూర్చిగాని, జానకీ అపహరణ ను గూర్చి గాని ఎటువంటి ప్రస్తావనా రాలేదు. తననుగూర్చి,గురుదేవుల గూర్చి తుదకు తన ఊర్ద్య లోక ప్రయాణాన్ని  ప్రస్తావించి, రాముని అనుగ్రహం తో ఆనందమయ లోకానికి వెళ్లిపోయింది శబరి.  
                     
                       అంటే శబరి వృత్తాంతం  ద్వారా మనకు ఆదికవి అందించదలచిన సందేశం ఏదో ఉంది. అదేమిటి.?
                    
                 “తాపసీ, తపోధన, సిద్ధ, సిద్ధసమ్మత, శ్రమణీ ఇవి శబరిని గూర్చిన  సంబోధనలు. ఆడవారికి  ఆశ్రమాధికారం, సిద్ధసమ్మతత్వ్తం,  యోగాగ్ని ప్రజ్వల నాధికారం ఉందని, మహర్షులు పొందే పుణ్య లోకాన్నిపొందడానికి స్త్రీలకు  కూడ అర్హత ఉంటుందని , జ్ఞానసముపార్జనమే  బహిష్కృతులను, అబహిష్కృతులను ,ఉత్తములను నిర్ణయిస్తుందని   ఈ వృత్తాంతం స్పష్టం చేస్తోంది.
                 
                   భగవంతుడు తనను నమ్మిన వారి కోసం తాను వెతుకుతూ  వెడతాడని చెప్పడం మహర్షి ఉద్దేశ్యం.
    
                     గుర్వనుగ్రహ ప్రభావం, తన ప్రియశిష్యులను గురువు అనుగ్రహిస్తే ఆ గుర్వనుగ్రహబలం వలన శిష్యులు పొందే అపూర్వ శక్తులు, ప్రియశిష్యుల యెడ గురువుల వాత్సల్యానుగ్రహాలు ఎంత గొప్పగా ఉంటాయో చెప్పడానికి కూడ ఈ వృత్తాంతం ద్వారా మహర్షి ప్రయత్నించారా. అనిపిస్తోంది.
               
                                   వాల్మీకి సంకల్పించిన కోణం లో శబరి విశుద్ధచక్రం గాను,పంపాసరోవరానికి ఆవలి తీరం లో ఉన్న ఋష్యమూక పర్వతాన్నిచేరేందుకు మైలురాయి గాను భావించాలి.కబంధ సుగ్రీవులకు మధ్య ప్రధానమైన కొలికి మాత్రమే కాక రాముడు తన ప్రయాణాన్ని అర్ధవంతం చేసుకొనేదశ లో ఒక ప్రధాన స్ధానంగా శబరి రూపొందింది. కబంధము నుండి సుగ్రీవము వరకు మానవాత్మను పవిత్రం చేయడం లో ఆమె సేతువుగ ఉపయోగపడింది. అని వ్యాఖ్యనించారు శబరీ వృత్తాంతాన్ని గూర్చి   ప్రముఖ విమర్శకులు డా.ఇలపావులూరి పాండురంగారావుగారు.     
                            
                                        ఈ శబరీ వృత్తాంతం మనకు చెప్పాల్సింది ఇంకా ఏదో ఉందని నా అభిప్రాయం. అందుకే విజ్ఞులు, విమర్శకులు, సహృదయులు అయిన మీ ముందుకు ఈ వ్యాసాన్ని పంపుతున్నాను. ఇటువంటి పాత్ర రామాయణం లో ఇంకొకటుందా?





కాలోహ్యయం నిరవథీ విపులాచ పృథ్వీ-కాలమనంతము,భూమి విశాలము
  *******************   అన్నారొక మహాకవి ********************