Tuesday 6 November 2012

రామాయణము-రమణీయకథనాలు -12 గుహుడు


                              


                                  గుహుడు



                  

                 సంసారజలథిని తరింపజేయగల తారకబ్రహ్మ యైన శ్రీ రామచంద్రున కు గంగానది దాటడానికి సహాయపడిన నిషాదరాజు గుహుడు. పితృవాక్యపరిపాలకుడై సతీ, సోదర సమేతంగా అరణ్యవాసానికి బయలుదేరాడు రామచంద్రుడు. నిషాదాధిపతియైన గుహుడు  శ్రీరాముడు తన దేశంలోకి రావడం విని కులవృద్ధులు, మంత్రులతో ఎదురేగి రామచంద్రుని కౌగిలించు కొని, కుశలప్రశ్నలతో సంభాషిస్తాడు. ఈ గుహుడు రామునకు  ప్రియస్నేహితుని గా ఆదికవి పరిచయం చేశాడు.

                          తతో రాజా గుహో నామ రామస్యా 2త్మ సమస్సఖా

         వనవాసానికి బయలుదేరిన  రఘువీరుని చూచి మిక్కిలి పరితాపం పొందుతాడు గుహుడు. భార్యా సమేతుడై నేలపై పరుండిన రాజకుమారుడైన  శ్రీరామునకు కాపలా కాస్తూ ,    తెల్లవారేవరకు  లక్ష్మణునకు తోడుగా  ఉండిపోతాడు. లక్ష్మణుడు చెప్పిన  రామగాథను విని మిక్కిలిగా దుఖించాడు.

    నరేన్ద్ర పుత్రే గురు సౌహృదా ద్గుహ: ముమోద బాష్పం వ్యసనాబి పీడితో:” 2.51.27
        
        రాముని పై నున్నభక్తి గౌరవాలు గుహుని లోని దుఖాన్ని అతిశయింప జేశాయి.  రాత్రంతా నిద్రా ముద్రితు లైన  ఆ ఆదర్శదంపతులు  సీతారాములకు కాపలా కాస్తున్నాననే భ్రాంతి లో వారి దర్శనం చేసుకుంటూ ఉండిపోయాడు లక్ష్మణునితో పాటు గుహుడు కూడ.   
                 
            రామచంద్రుని  కోరిక మేరకు తపోజన సామాన్యమైన జటాధారణ కొరకు మఱ్ఱిపాలను తెప్పించి గుహుడే స్వయంగా రాముని కందించాడు. రామలక్ష్మణులు ఇరువురు మాత్రమే జటాధారణం చేశారు. వాల్మీకి రామాయణం లో ఇలా  ఉంది.
         
             లక్ష్మణస్యా2 త్మనశ్చైవ రామస్యే నా2కరో జ్జటా;”      వా. 2.51-69
     
           గుహుడు     సుమంత్రుని తో కలసి ఈవలి ఒడ్డునే ఉండి రాముడెక్కిన పడవను నడపవలసిందిగా  బంధువులను ఆజ్ఞాపించాడు. ఆత్మసఖుడైన గుహుడు రాముని ఆవలి ఒడ్డుకు చేర్చలేదు.  సహకరించాడు  అంతే. తతో నిషాదాధిపతి ర్గుహోజ్ఞాతీ నచోదయత్  {2.51.80 }  పడవ నడపవలసిందిగా జ్ఞాతులను  గుహుడు ఆదేశించాడు. బందువర్గము , పరివారంతో ఉన్న  గుహుని,   సుమంత్రులను   వీడ్కొని  సతీ సోదరులతో రాముడు  నౌక నధిరోహించాడు.

                       కాని లోకంలో గుహుని పాత్ర ప్రస్తావనకు రాగానే గుర్తొచ్చేవి గుహుడు పడవ నడపడం, కాళ్లు కడగటం, అనేవి

                     రాముడు గుహుని స్నేహితుని గా  భావిస్తే గుహుడు రాముని స్వామి గా సేవించాడు. ప్రేమించి, పూజించాడు. నిషధదేశంలో, శృంగిబేరపురంలే హింసాత్మక జీవనం గడుపుతున్న గుహుడు రామచంద్రుని  కౌగిలిని పొందిన భాగ్యశాలి.

                           భుజాభ్యాం సాధు పీనాభ్యాం పీడయన్   అన్నపల్కులు వాల్మీకి వి. ఆత్మీయులను దగ్గరకు తీసుకున్నట్లు   రాముడు గుహుడ్ని  భుజాలు ఒత్తుతూ దగ్గరకు తీసుకొని గాఢంగా కౌగిలించు కున్నాడట. సీతా మనోనాధుని గాఢపరిష్వంగాన్ని మించిన కానుక  ఏముంటుంది.? అంతటి అదృష్టవంతుడు గుహుడు.

                అంతేకాదు. వాల్మీకి వాడిన ఆత్మసమస్సఖా అన్న పద బంధాన్ని ఆదారం చేసుకొని రామునకు గుహునకు ఇంతకు పూర్వమే పరిచయం ఉన్నట్లు ఇతర               రామాయణాలు  చెపు తున్నాయి. రామలక్ష్మణులు విశ్వామిత్రుని తో కలిసి  మిథిలా నగరానికి వెళుతూ గంగాతరణం చేసినప్పుడు నదిని ధాటించిన గుహుడు ఇతడేనని, ఇతనికి అహల్యా వృత్తాంతాదిగాథలు తెలుసునని – అందువలననే" రామస్యాత్మ సమస్సఖా" అని వాల్మీకి వ్రాశాడని వీరి వాదన.                     {  ఆశ్చర్య.రా.2.34.}

                       మొల్ల రామాయణం లో కన్పించే సుడిగొని రామపాదము ను .......... వంటి పద్యాల్లో కన్పించే రాతిని నాతిని చేసిన కథ, అధ్యాత్మ రామాయణం లో కన్పించే మానుషీకరణ చూర్ణమస్తి వంటి సందర్భాలను పరిశీలిస్తే – అధ్యాత్మ రామాయణం లో విశ్వామిత్రుని వెంటనున్న బాలరాముని ఛూచి ఒక నావికుడన్న పల్కులుగా మనం గుర్తించవచ్చు. ఆమాటలే మొల్ల ఉల్లానికెక్కి గుహుని పల్కులుగా పేర్కొంది.

               


                అసలు గుహ శబ్దమే బోయవారికి పర్యాయపదంగా వాడబడుతోంది. గుహ శబ్దానికి వ్యాకరణ రీత్యా గుహతీ వంచయతీ పరస్వమితి వ్యుత్పత్యా వంచకత్వేన జాతితో వృత్తితో గుణతశ్చ హీనస్య ఇత్యాదిగా పూర్వపక్షం చేసి గుహుని హీన జాతీయుని గాను , నీచుని గాను నిరూపింప యత్నిస్తే  - గుహ రక్షణే ఇత్యస్మాద్దాతో గుహతీ గోపాయతీతి గుహ భగవత్కైంకర్య  జన్యాత్మ విజ్ఞానేన ఆత్మానం రక్షతీతి అనే అర్ధాలతో గుహుని యొక్కఉన్నతత్త్వాన్ని సిద్ధాంతీకరించారు పండితులు.    ఆశ్చర్య.రా.2.34

          తులసీరామాయణం లో సైతం  నావికుని మాటల్లోనే మానుషీకరణచూర్ణ “  ప్రస్తావన కన్పిస్తుంటే తెలుగు కవులు మాత్రం  గుహునికే శ్రీరాముని పాద ప్రక్షాళనా భాగ్యాన్నికల్గించారు.
                         
          
                                                                                                     ఆలుబిడ్డలయాకలికాదరువుగ                                                                                 
                    నడుపుకొనుచుంటి  రాముని నమ్మి పడవ
                    పున్నెముండును బాబు నామొఱ వినండి
                      కాళ్లు గబగబ గడుగంగ గదుమ కండి
                
                అంటాడు  బృందావనం రంగాచార్యుల వారి గుహుడు అనే తెలుగు కావ్యంలో గుహుడు. దాశరథీ ధ్యాన వివేకమే గుహునికి రామ సాన్నిథ్యాన్ని ప్రాప్తింపజేసింది.

           నాయమాత్మా ప్రవచనేన లభ్యో న మేధయా న బహునా శ్రుతేన , యమై వైష్ణ వృణుతే  తేనలభ్య స్త స్యైష ఆత్మా వివృణుతే తనూంస్వామ్. అని ముండకోపనిషత్తు.
భగవానుడెవ్వని ప్రేమిస్తున్నాడో అతడే ఆ భగవానుని చేరుటకు అర్హుడగుచున్నాడు కాని మహామేథాశక్తి కలిగి చక్కగా వేదశాస్త్రాథ్యయనం చేస్తూ కూర్చుండేవారు కాదని చెపు    తున్నాయి పై ఉపనిషద్వాక్యాలు.

                  విభీషణ శంణాగతి సమయంలో రాముడు సుగ్రీవుని తో చెప్పిన మిత్రభావేన సంప్రాప్తం అన్న వాల్మీకి పల్కులే ఆత్మసమస్సఖా అనడంలో గుహునికి కూడతోడ్పడ్డాయి.  శృంగిబేర పురం లో   నిషాదుడై జీవించినా రామనామ ప్రభావం , రామపాద సేవ అతన్ని జీవన్ముక్తుణ్ణి చేసింది.      

                             ముముక్షూణాం విరక్తానాం తథా చాశ్రమ వాసినాం
                                         రామమన్ర్తార్థ విజ్ఞాని  జీవన్ముక్తో న సంశయ:  
అని రామానందలహరి చెపుతోంది. రామనామ మంత్రమే మోక్షప్రాప్తికి ఆలంబనం.  రామ పాద సేవా నిరతుడై గుహుడు ధన్యుడైనాడు.భరతునితో సమానంగా శ్రీ రామచంద్రుడు అభిమానించి, ఆదరించి ,  అక్కున చేర్చుకున్న  అదృష్టవంతుడు గుహుడు.



****************************************************************