Sunday, 25 November 2012

శ్రీరామ కావ్యామృతం--2



                   
                  
                   శ్రీ రామ  కావ్యామృతం ----2


       
                              తెలుగు లో ఎందరో భక్త కవులు  రామకధను కావ్యాలుగా, తమకు నచ్చిన మెచ్చిన వచ్చిన రీతిలో  గానం చేసి, శ్రీరామ నామా మృత పానంతో ధన్యజీవుయ్యారు.   లఘు కావ్యాల లో అమృత గుళికల వంటి  కొన్నిపద్యాలను, వ్యాఖ్యానం ఆశించని వాటిని  రసజ్ఞులైన రామభక్తులతో  కలసి పంచు కోవడమే ఈ శీర్షిక ముఖ్యోద్దేశ్యం.
  
        రాముని కంటె నన్యము పరాత్పరు డొక్కడు లేడు ,సర్వశో
    భామయమైన ప్రాకృతిక భాగ్యమునుండి యనంత దైవిక
    శ్రీ మిళితంబునై రఘువరేణ్యుని మూర్తియు శక్తినొప్పు, న
    మ్మా! మఱి రామ నామ జపమంగళ గీతము  లాలపింపుమా!

          యోగులయందునన్ పరమయోగి, మహర్షులలో మహర్షియున్
            భోగుల యందునన్  బరమభోగి,యఖండతపస్వి. సర్వశా
          స్త్రాగమ వేద్యుడున్ ,రఘువరాన్వయ దివ్యమణి ప్రదీపమున్

రాముడె దిక్కు నీకు! రఘురాముడె నీకు విముక్తి నిచ్చు,శ్రీ
 రాముడె జన్మ కర్మల పరంపర లన్  దెమలించు,  జానకీ
 రాముడె సర్వధర్మ చయ రాజిత సాధుపవిత్ర మూర్తి

          రాముని దివ్యనీల రుచిరమ్ములె సుందరవారిదమ్ములై
           స్వామి సుమిత్ర సూతి తను సాంద్ర కళారుచులే తటిత్తులై
           ప్రేమను వారి భాషణము లే కలితమ్ములు మేఘగర్జలై
           ఆమని వర్షముల్ కురియు నట్లుగతోచె, -  నతండు రాముడే.

రాముని కంటి కోసల విరాజిలు కాంతులె శారదీయ పూ
ర్ణామల చంద్రికా నిభములై, యనుజన్ముని కంటి వెల్గులే
శ్రీమహితారుణారుణ మరీచి వితానములై, పవ్త్ర సం
          ధ్యా మధుమాధురీ శబలితమ్ములు తోచె – నతండు రాముడే.
        
          రాముని దివ్యమంగళ విరాజిత రూపము దగ్గఱింపగా
           నామెకు గుండెయెల్ల దడయై జడయై – ధృఢమై – నితాంత ని
             ష్కామనమై – శరీర మవశమ్మయి వ్రాలగ జేతులెత్తి శ్రీ
             రామ! నమో! నమో!  యనుచు వ్రాలె పదంబుల భక్తిమూర్తియై.
                         
                       “వాలి పోవు కనుఱెప్పలన్ పైకి తెరచి
                     చూపుతోడనె రఘుపతిం జుఱ్ఱునట్లు
                           తనివి  తీరని చూడ్కులన్ దడవి కొనుచు
                          నిలిచిపోయెను ముదుసలి – నిముసమట్లె.

    తండ్రి సగ భాగమైన సీతమ్మ లేని
       కడమ యర్ధమె యింతటి కాంతులీన
         రెండు నొకటిగ నున్న భరింపగలమె.
                     
                 చలన మెఱుగని భక్తియే చాలు గాని
                       తనువులెంతటి దూరమో మనసులంత
                        దగ్గరగ నుండి యొండొంటి తారసిలును. 

 కవి. పెమ్మరాజు వేణుగోపాలకృష్ణమూర్తి     కావ్యం. శబరి .                               తల్లిదండ్రులు  వరలక్ష్మమ్మ, సూర్యప్రకాశరావు.        జన్మస్ధలం. చిట్యాల,            జననతేది.       23.10 1912                  తిరువూరు తాలూకా




***************************శ్రీరామ జయమ్********************  
                       

Saturday, 17 November 2012

శ్రీరామ కావ్యామృతం- --1


                   
                      శ్రీ రామ  కావ్యామృతం  -1

         

            శ్రీ రామచంద్రుని కధే ఒక గొప్ప కావ్యం. అది వ్రాయడానికి ప్రయత్నించిన ప్రతి  కవి మహాకవి అయిపోవడం లో ఆశ్చర్య మేముంది! అంటాడు హిందీకవి మైథిలీ.
         
            తెలుగు లో ఎందరో రామనామ మర్మజ్ఞులైన భక్త కవులు ఎందరో రామకధను  మహాకావ్యాలుగా,లఘుకావ్యాలుగా ఖండకావ్యాలు గా తమకు నచ్చిన మెచ్చిన వచ్చిన రీతిలో  గానం చేసి, శ్రీరామ నామా మృత పానంతో ధన్యాత్ములయ్యారు.  వానిలో లఘుకావ్యాలలో అమృత గుళికల వంటి  కొన్నిపద్యాలను, వ్యాఖ్యానం ఆశించని వాటిని  రసజ్ఞులైన రామభక్తులతో  కలసి పంచు కోవడమే ఈ శీర్షిక లక్ష్యం .
  
        రారా! రాఘవరామా!
           రారా! సురవినుత నామ రాక్షసభీమా!
           రారా !రవికుల సోమా!
            రారా !  సాకేతధామ!  రారా! రామా!
                                                              
                                            రామా! రామా ! రామా!
                                                        రామా !శ్రీరామ రామ రామా రామా!
                                                          రామా! రామా! రామా!                                                                                                                    రామా! శ్రీరామ రామ రామా! యనుచున్.                                                                                  
          
               నల్లవాడ నాదు  యుల్లంబు లోనికి
              మెల్లగాను వచ్చి యెల్లకాల
             ముల్లసిల్లుమయ్య.కల్లగాదిది వేగఁ
              జల్లనైన కృపను జల్లుమయ్య.

                                 వచ్చుచున్నాను దేవరా! వచ్చుచుంటి
                                  నాదు వెంటనె నిన్వీడి నిముసమైన
                                  బ్రతకజాలను రాఘవా! బ్రతకజాల
                                   నన్ను నీలోన చేర్చుకో నల్లనయ్య.
    రామా! ఘననీరద వ
   త్శ్యామా!  రఘురామ ! భక్తసన్నుత ధామా !
   నీ మాయ తెలియవశమా!
   కామారి స్తుత్యనామ! ఘనతర ధామా !                             
                                 రామ నామంబు పేరిట రత్నమెపుడు
                                  చీర కొంగున ముడివైచి, చేరనీకు
                                  నెవరినింగాని ప్రక్కకు నెపుడు కూడ
                                   దాని జూపింపకమ్మ యందరకు  నీవు.
 మనము నిర్మలమయినంత మమతలుడుగు
 గలుగు నేకాగ్ర బుద్ధియు, గాంచెదీవు  ,జ్ఞానరత్నంబు.......
                          



               కావ్యము:--- శబరి.                          ముద్రణ:--          1956                            రచయిత్రి :---       శ్రీమతి భోగరాజు చిట్టెమ్మ                             తల్లిదండ్రులు :-         లక్ష్మీదేవి,లక్ష్మీనరసింహం                    జన్మస్ధలం:---               పూళ్ల . ప.గో జిల్లా  .             జననతేది :-           18.10.1919.               *****************.********************************

Thursday, 15 November 2012

శ్రీరామునకు శబరి ఎంగిలి విందు వాల్మీకమేనా?


             శ్రీరామునకు శబరి ఎంగిలి విందు వాల్మీకమేనా?


             

           



   శబరి మతంగమహర్షి శిష్యురాలు. సిద్ధయోగిని.శ్రీ రామచంద్రుడు లక్ష్మణునితో కలసి నీ ఆశ్రమానికి వస్తాడు అన్న గురువు ఆదేశాన్ని తలదాల్చి మతంగముని ఆశ్రమంలోనే    రాముని కోసం ఎదురు చూస్తూ ఉండి పోయిన రామ భక్తురాలు.ఎదురు చూస్తూనే వృద్ధురాలై పోయింది. రామచంద్రుడు వచ్చాడు .కుశల ప్రశ్నల అనంతరం అర్ఘ్య పాద్య ఆచమనీయాలు సమర్పించి, ఆయన కోసం ఎంతో కాలంనుంచి సేకరిస్తున్న పండ్లు ఫలాలను అందించింది.  రాముని అనుజ్ఞ తో ,యోగాగ్ని లో ప్రవేశించి, మహా యోగులు  పొందే సాయుజ్యాన్ని పొందింది శబరి.
              
                అయోధ్య రాముడు ఆంధ్రావని కి తరలివచ్చి భద్రగిరి పై కొలువు తీరి తెలుగువారి ఇలవేల్పు యైనట్లే వాల్మీకి సృష్టించిన శబరి తెలుగింటి ఆడపడుచు  వలె  తెలుగు  వారి గుండెలకు చేరువై  తెలుగునాట చిరస్ధాయిగా నిలిచి పోయింది.కిన్నెరసాని వలె శబరి కూడ కావ్యనాయికయై రసజ్ఞుల హృదయ కేదారాలనే కాదు  తెలుగు నాట వాగుగా మారి సస్య కేదారాల సైతం సారవంతం చేస్తున్నగోదావరిఉపనది. అందుకే శబరి  పాత్ర తెలుగు వారి సొంతమై పోయింది.  ఎందుకంటే – ఇక్కడొకసంగతి  చెప్పాలి. భక్త రామదాసు పుట్టినఊరు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి. అక్కడ పోలీసు శాఖ లో పనిచేసి రిటైరయిన ఒకమహాను భావుడు ప్రతి సంవత్సరం శ్రీరామదాసు ఆరాధనోత్సవాలు నిర్వహిస్తుండే వారు. ఒకసారి నన్నుఅతిథిగా పిలిస్తే వెళ్లాను.   బస్టాండు లో దిగి నేను వెళ్ల వలసిన ప్రదేశం వెతుక్కుంటూ ఉంటే  ఎదురుగా ఒకబోర్డు కన్పించింది. శబరి టీ స్టాల్ నాకు ఆశ్చర్యమేసింది. దేవుని పేర్లు, సినిమా వాళ్లపేర్లు చూశాము గాని శబరి పేరు తో  టీ స్టాల్. ఇంకొంచెం ముందుకు వెళ్లాను కోట బురుజు లాంటి  దేదో ఉంది.  దాని కెదురుగా కుడివైపున శబరి పాన్ షాపుఉంది.నాకు అనుమాన మొచ్చింది.  శబరి పుట్టినఊరు కూడ ఇదేనేమో నని. ఇది జరిగిచాలకాలమైంది  ఇప్పుడవి ఉన్నాయో లేవో తెలియదు.    శబరి తెలుగువాళ్ళకు ఎంత దగ్గరైందో చెప్పడమే నాఉద్దేశ్యం.              
                
                 తెలుగులో శబరి పేరుతో వచ్చిన కావ్యాలు కూడ ఎక్కువ భాగం గోదావరీ పరీవాహ ప్రాంతంనుంచే రావడం కూడ గమనించదగ్గ విషయం. రామభక్తులిద్దరొకచోట కలిస్తే సూర్యేదయ,సూర్యస్తమయాలు తెలియ వంటారు. శబరి మనల్ని అలాగే చేస్తున్నట్లుంది. విషయంలోకి వద్దాం. రండి.

                       రామలక్ష్మణులు వస్తున్నారని తెలిసిన శబరి వారికి ఎదురు వెళ్లి   సంప్రదాయ బద్దంగా అర్ఘ్యపాద్యాదు లందించి ,రామ లక్ష్మణులు సేద తీరిన తరువాత  మాగురువులు చెప్పినప్పటినుంచి నీ గురించి ఎదురు చూస్తున్నాను. ఇంత ఆలస్యం చేశావేమిటని చనువుగా ప్రశ్నిస్తుంది.రాముని కోసం  ఎంతో కాలం గా సంపాదించి. భద్ర పరచిన ఫల,మూలాదులను ఆయనకు అర్పించింది.

           మయాతు వివిధం వన్యం సంచితం పురుషర్షభే
            తవార్ధే పురుషవ్యాఘ్ర పంపాయాస్తీర సంభవమ్.   వా.3-74.17
             
               అని మాత్రమే వాల్మీకం. దీన్ని వ్యాఖ్యానిస్తూ  గోవిందరాజీయం లో  - వన్య శబ్దేన ఫలమూలాదికముచ్యతే. {వన్య శబ్దము వలన ఫలమూలాదికములు చెప్పబడు తున్నాయి} . సంచితమిత్యనేన రామస్య చిత్రకూటాగమనాత్ప్రభృతి సంపాదిత్వం, ఆదరేణ గుప్తత్వం చ, తత్తత్ఫల జాతీయ మాధుర్యం పరీక్ష్య స్ధాపితమితి సంప్రదాయ:”.{ సంచిత అనేమాటకు రాముడు చిత్రకూటానికి వచ్చాడని తెలిసి నప్పటినుండి సంపాదించి,దాచిపెట్టి ఆయా ఫలాల జాతిని పట్టి  తీపిని పరీక్షించి ఉంచి నట్లు గ్రహించాలి}. { చతుర్వ్యాఖ్య.  పు. 1276 .}

                        దశాబ్దాల తరబడి అదే ప్రాంతంలో జీవిస్తోంది కాబట్టి ఏజాతి పండు ఎలా ఉంటుందో, ఏచెట్టు పండు ఎటువంటిదో తెలుసుకోగల నైపుణ్యం శబరికుంది. అందుకనే మంచిపండ్లను పరీక్షించి రాముని కందించింది శబరి. ఇది వాల్మీకం. అంటే ఎంగిలి విందు ప్రస్తావన వాల్మీకం లో లేదు. కాని శబరి పేరు తో కావ్యాలు రచించిన వారందరు కూడ ఎంగిలి విందు  చేయించిన వారే కాని వాల్మీకిని అనుసరించిన వారు ఒక్కరు లేరు.
  
                 మరి ఈ ప్రస్తావన ఎక్కడనుంచి వచ్చింది.          పద్మపురాణం లో  మనకు ఈ ****  విందు ప్రస్తావన కన్పిస్తోంది.

           ప్రత్యుద్గమ్య ప్రణమ్యాథ నివేశ్య కుశవిష్టరే
            పాదప్రక్షాళనం కృత్వా తత్తోయం పాపనాశనం             
           ........................................................
         ఫలాని చ సుపక్వాని మూలాని మధురాని చ
         స్వయమాసాద్య మాధుర్యం పరీక్ష్య పరిభక్ష్య చ
          పశ్చాన్నివేదయామాస రాఘవాభ్యాం దృఢవ్రతా
            
                 పద్మపురాణ భాగంలో పరీక్ష్య, పరిభక్ష్య,పశ్చాన్నివేదయామాస అని ఉన్న భాగాన్ని  పరిశీలిస్తే శబరి కంద మూల ఫలాల మాధుర్యాన్ని పరీక్షించి భక్షించిన అనంతరమే రాఘవునికి సమర్పించిందనేది స్పష్టమౌతోంది. కాని వాసుదాసు గారు మందరం లో ఈ విషయాన్ని  గూర్చి చర్చిస్తూ,ప్రస్తుత  ముద్రిత పద్మ పురాణ ప్రతిలో ఈభాగం లేదని క్రొత్త పాఠాన్ని చూపించారు.కాని  చతుర్వాఖ్యలో మహేశ్వర తీర్ధులవారు సైతం  పై పాఠాన్నే  ఉటంకిచారు.అంటే పరీక్ష్య పరిభక్ష్య అనేదే ప్రసిద్ధపాఠం.

                      కాని దీనిలో కూడ శబరి తాను తిన్నపండునే రామున కిచ్చినట్లు ఎక్కడాలేదు. రాముడు చిత్రకూటానికి వచ్చినప్పటినుండి, రాముడు తన ఆశ్రమానికి వస్తాడనే గురువుల మాట మీద ప్రత్యయం తో అప్పటి నుండే కందమూలాలను, నిలవఉండే ఫలాలను, సంచితం-అంటే, ఏరి కోయించి సంపాదించి భద్ర పరచింది. ఇప్పుడు రాముడు వచ్చిన తరువాత వానిని బయటకు తీసి పరీక్షించి, జాతికొక దాన్ని తిని, చెడిపోలేదు అని నిర్ధారణ చేసుకొని రామునికి సమర్పించిందనేది లక్ష్యార్ధం.

                    భక్షించి అనుటకు ఠాకా వేసి కొంచెం గిల్లి  నోటవేసుకొన్నట్లు ఎంచవలయునేగాని వేరుకాదు. అంటారు మందరం లో శ్రీ వాసుదాసు.          

                     శ్రీరాముని శ్రియ:పతి గా నెరింగి ఆయన రాక కోసం ఎదురు చూస్తూ జీవితకాలాన్ని పొడిగించుకుంటున్న మహాతపస్విని శబరి. అట్టి మహానుభావునకు తాను అర్పించే విందులో మాధుర్యం కొఱవడితే  ఓర్వలేక, అపచార భయం చేత ,భక్త్యతి శయం చేత శబరి ప్రవర్తనలో మార్పు వచ్చి ఉండ వచ్చు.వృద్ధ, జ్ఞానవైరాగ్య సంపన్న,గురుశుశ్రూషా పరాయణ అయిన శబరి లో  పరమభక్తి పరాకాష్ఠకు చేరి , గోదాదేవి తాను ధరించిన మాలలను భగవంతునికి సమర్పించినట్లు, విదురుని విందు లో శ్రీ కృష్ణునకు అరటిపండు ఒలిచి పండు పారవేసి తొక్కుఅందించినట్లు, పండ్లను రుచి చూచి  స్వామికి సమర్పించిందని  భావించిన జానపదులు శబరి విందు’’ను మధురాతి మధురంగా గానం చేసుకుంటున్నారు. భక్తునికి ఇష్టమైన దాన్ని ఎంతకష్టమైనా భరించడానికి  భగవంతుడు సిద్ధంగా ఉంటాడన్నవిషయం బాణాసురుని ఇంటికి కాపలా కాయడం దగ్గరనుండి  మానవుడిగా జన్మించి బాధలు పడడం వరకు ఎన్నో విషయాల్లో ఋజువవు  తూనే ఉంది..

                            శబరి శ్రీ రామచంద్రునకే విందునందించిన పరమ భక్తురాలు. కాని శబరి వాగులోకి  పండి ఒరిగిన చెట్ల ఫలాలు శబరి నీటిచే స్పృశించబడుతున్నాయి . ఆ  పండ్లను రామలక్ష్మణులు స్వీకరించారు కాబట్టి శబరిఎంగిలి చేసిన పండ్లను రాముడుతిన్నాడని  జానపదకథలుగా పాడుకుంటున్నారని  కొందరి వాదన..

      శబరి పూర్వజన్మ వృత్తాంతం కంబరామాయణం లో కన్పిస్తోంది.
   
          శబరి పూర్వ జన్మ లో మాలిని అనే గంథర్వకన్య.గందర్వరాజైన చిత్రకవకుని ఏకైకపుత్రిక. వీతిహోత్రుని పరిణయమాడింది.భర్త యజ్ఞయాగాదులలో మునిగియుండగా మె కల్మాషుడనే బోయవానితో సంబధం పెట్టుకోగా కోపించిన వీతి హోత్రుడు మెను శబరవనిత గా జన్మించమని శపించాడు. రామచంద్రుని దర్శనానంతరం ఆ మహనీయుని ఆశీస్సులతో తిరిగి  మాలిని గా మారిపోయి  భర్తతో గంధర్వ లోకాన్ని చేరింది. అని కంబరామాయణం శబరి   పూర్వ చరిత్ర ను ప్రస్తావించింది.[puranic  encyclopedia –p.659]. తెలుగు కవులెవరూ ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. తులసీ ధాసు వాల్మీకి మార్గంలోనే పయనించాడు.


*******************శబరీ దత్త ఫలాశన రామ ***********************

Sunday, 11 November 2012

రామాయణము- రమణీయకథనాలు-13 శూర్పణఖ గంధర్వ స్త్రీ యా ?


                            శూర్పణఖ  గంధర్వ స్త్రీ యా  ?
                           

         





                      శ్రీమద్రామాయణ మహాకావ్యంలో  ప్రధాన శక్తులుగా   నిలిచి   శ్రీ రామచంద్రుని కీర్తి ప్రతిష్ఠ లు  ఇనుమడించే రీతిలో రామావతార ప్రయోజనాన్ని సాధింపజేయ నిర్మించిన   పాత్రలు మూడు. వానిలో ప్రధానపాత్ర కైకేయి కాగా, ఆవిడకు ప్రేరణ కల్గించిన మంథర ద్వితీయ.

                    మంథర ప్రేరణ కారణం గానే కైకేయి రామ పట్టాభిషేకాన్ని విఘ్నమొనర్చి,  శ్రీ రాముని అరణ్య వాసానికి ప్రయాణింపజేసి తన వంతు కర్తవ్యాన్ని పూర్తి చేసుకొంది. మూడో పాత్ర శూర్పణఖ.

                             పంచవటి లో పర్ణశాల లో తాపసవృత్తి  ని  స్వీకరించి  ఋషులతో  కలసి    వేద పురాణ శాస్త్ర సంబంధ సందేశ, సందేహ వివరణ సమాధానాల తో సత్కాలక్షేపం చేస్తూ  అనుజుడైన లక్ష్మణునితో కలసి  సంవత్సరాలను నడిపిస్తున్న శ్రీ రాముని కవ్వించి, రాక్షసవథకు ప్రేరేపించిన పాత్ర శూర్పణఖ.   దండ కారణ్య స్ధిత సమస్త రాక్షస సమూహాల చావుకు  , ఖరదూషణుల  మరణానికి కూడ కారణభూత ఈమె.  అనంతరం లంకకు  చేరి ఈ నిప్పును అక్కడ కూడ అంటించి, రావణుని లో సీతా వ్యామోహాన్ని రగిలింపజేసి, రావణుని   పంచవటికి రావింపజేసి,  సీతాపహరణాన్ని చేయించి, తుదకు పౌలస్త్యవథ కు  కూడ ఈమే కారణమైంది.
                
                   శూర్పణఖ అసలు పేరు మీనాక్షి.  ఈమె కైకసి విశ్రవసుల కుమార్తె.  ఈమెకు రావణ, కుంభకర్ణ, విభీషణులు, ఖర దూషణులు  సోదరు లౌతారు. మారీచ సుబాహులు ఈమెకు మామయ్యలు.అంటే తాటకి ఈమెకు అమ్మమ్మ. విద్యుజ్జిహ్వుడు అనే రాక్షసుణ్ణి   ఈమె వివాహం చేసుకుంది.  కొన్ని కారణాల వల్ల  తప్పని సరి  పరిస్థితుల్లో రావణాసురుడు  ఆ విద్యుజ్జిహ్వుని సంహరించవలసి వచ్చింది . అప్పటి నుండి ఒంటరియైన శూర్పణఖ  లంకానగరానికి, దండకారణ్యానికి మధ్య యధేచ్చగా తిరుగుతూ కాలం గడుపుతోంది.  ఇదంతా ఎందుకు చెప్పవలసివచ్చిందంటే – కొద్దిగా ఆలోచిస్తే -- రాముని గమనం - అంటే - రామ అయనం అంతా శూర్పణఖ   చుట్టూనే అల్లు కున్నట్టుగా మనకు కన్పిస్తుంది.

               రావణ సంహారమే రామాయణ మైతే,శ్రీ రాముడు రఘువీరుడైంది రాక్షససంహారం మూలంగానే అనుకుంటే ఆ రాక్షసులందరు శూర్పణఖ వంగడము లోనివారే అవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. తాటక , సుబాహు లు తప్పితే మిగిలిన అందరి మరణానికి ఈమే కారణంమైంది. అభివృద్దికి కూడ ఈమే కారణం. ఎందుకంటే  విభీషణస్తు ధర్మాత్మా అని మొట్టమొదటి సారి విభీషణుని పేరుని  రాముని వద్ద ప్రస్తావించి, విభీషణుని మీద రామచంద్రునికి సదభిప్రాయం  కల్గించింది కూడ శూర్పణఖే.

                దండకారణ్యం లో నరవాసన  తగిలి పరుగెత్తుకొచ్చిన ఈమె రామచంద్రుని దర్శనం తో  ఆకలిని మర్చిపోయి,కామవికార యై ఆ పుంసాం మోహనరూపుడైన  పురుషోత్తముని పరిణయాన్ని ఆశిస్తుంది.  అందుకోసం రాముని ఇల్లాలిని ఛంపడానికి కూడ సిద్ధపడుతుంది.
              

          







             శూర్పణఖ ను కామమోహిత ను చేసిన ఆ  సుందర రాముని                          సు మనోహర  రూపాన్ని వాల్మీకి వర్ణించిన  విధానం చూస్తే శూర్పణఖే కాదు. సమస్త లోకము మోహపాశబద్ధమై జగమంతా రామమయం గా మారిపోతుందనడం లో  అతిశయోక్తిలేదు . వాల్మీకి వర్ణనలోను  స్వభావోక్తే గాని అతిశయోక్తి కన్పించదు .

               దీప్తాస్యం చ మహాబాహుం పద్మపత్రాయతేక్షణమ్
                 గజవిక్రాన్త గమనం జటా మండలధారిణం
                 సుకుమారం మహాసత్త్వం పార్ధివ వ్యంజనాన్వితమ్
                 రామం ఇందీవరశ్యామం  కందర్ప సదృశప్రభమ్
                 బభూవ ఇంద్రోపమం దృష్ట్వా  రాక్షసీ కామమోహితా   3-17.7,8
        
                పరిపూర్ణ పురుషుని రూపం ఎలా ఉండాలో  మహర్షి వాల్మీకి  రామఛంద్రుని ధర్శించి మన కళ్ళముందు రూపు కట్టించాడు.  అవివాహిత లైన   ఆడపిల్లలు కలలుగనే   ఆత్మీయ పురుషుని అందమైన రూపమది. అందుకే  రామచంద్రుడు పుంసాం మోహనరూపు డయ్యాడు. రామాయణం మహాకావ్యమైంది.

         ప్రకాశవంతమైన మోము కలవాడు, ఆజానుబాహుడు,  పద్మపత్రవిశాలాక్షుడు, గజ గమనుడు, జటామండలశోభితుడు, సుకుమారుడు ,మహాబలుడు,రాజ లక్షణ లక్షితుడు, ఇందీవరశ్యాముడు, మన్మథ సదృశుడు, ఇంద్రుని తో సమానమైన వాడు నైన శ్రీ రామచంద్రుని చూచి ఆ రాక్షసి కామమోహితయైంది. ఇది పై శ్లోకానికి భావం. 

                      ఈసందర్భంలో  వాల్మీకి  రామ శూర్పణఖ లను  ఒకేశ్లోకంలో దర్శింప జేసిన తీరు కూడ కడు రమణీయంగా ఉంటుంది.

                  సుముఖం దుర్ముఖీ రామం వృత్తమథ్యం మహోదరి
                      విశాలాక్షం విరూపాక్షి సుకేశం తామ్రమూర్ధజా
                        ప్రీతిరూపం విరూపా సా సుస్వరం భైరవస్వనా
                         తరుణం దారుణా వృద్దా దక్షిణం వామభాషిణీ         3-17.9,10
                        
                 పై శ్లోకంలో ఆకుపచ్చవర్ణం శ్రీ రాముని  కి, అరుణ వర్ణం రాక్షసి కి విశేషణాలు గా   మనం గమనించవచ్చు.

            అందమైన ముఖము, సన్నని నడుము విశాలమైన నేత్రాలు, సుందరమైన కేశపాశము, ముచ్చటైన రూపము మృదువైన కంఠస్వరము,  సరళసంభాషణాచతురుడు తరుణవయస్కుడు అయిన వాడు రామఛంద్రుడు.     .                
                          కాగా – దుర్ముఖి, మహోదరి విరూపాక్షి,  ఎఱ్ఱని వెంట్రుకలు , భయంకర మైన రూపము, కఠినమైన కంఠస్వరము, వృద్దురాలై ,వక్ర సంభాషణ కలిగినది శూర్పణఖ.
             
            వాల్మీకి మహర్షి శూర్పణఖ ను అంద వికారిగాను రాక్షసరూపిణి గానే వర్ణించాడు. కాని కంబ రామాయణం లో శూర్పణఖ చాలా అందగత్తె గా కన్పిస్తుంది.
              
           ఈ ఘట్టం లో శూర్పణఖ తో రామలక్ష్మణుల  యొక్క సంభాషణావైఖరి, ఇరువురి మధ్యలో ఆమె ను అటు ఇటు పంపిస్తూ ఆటపట్టించి   అవమానించిన తీరు బాగుండలేదన్న విమర్శ ప్రాచ్య, పాశ్చాత్య విమర్శకులలో తరచు కన్పిస్తోంది.  కాని విషయవాంఛతో నున్న పశువు ను రెచ్చగొడితే ప్రాణం తీయడానికికూడ సిద్ధమౌతుంది.  అలాగే విషయస్పృహ తో నున్న ఒక ఆడదాని ని   కవ్వించి , అవమానించి పంపిస్తే , దండకారణ్యమే కదిలి వస్తుంది. ఆ తరువాత లంకలో పునాదులు కదులుతాయి. కథాగమనవేగాన్ని పెంచి , త్వరగా రామకార్యం పూర్తి కావాలంటే అంత మాత్రం అవసరమనుకున్నాడు ఆదికవి. అదే జరిగింది.
                   
               సీతను చంపఢానికి ఉద్యుక్తురాలౌతున్న శూర్పణఖను రామాజ్ఞ తో లక్ష్మణుడు ముక్కు చెవులు కోసి వదిలేశాడు. ఉద్ఖాత్య ఖడ్గం చిచ్ఛేద్య కర్ణనాసం మహాబల: 3-18.21    వాల్మీకిరామాయణంలో లక్ష్మణుడు శూర్పణఖ కు ముక్కు చెవులు  కోసినట్లు చెపితే అనంతర కాలికులు కొంతమంది స్తనాలు కూడ కోయించారు.  ఏమైతేనేం.?" చుప్పనాతి శూర్పణఖ" కు  శృంగభంగమైంది. కథ లంకకు చేర, చివరకు సుఖాంతమైంది.

              అయితే ఈశూర్పణఖ  వృత్తాంతానికి ఫూర్వ కర్మ వాసన ఏమైనా ఉందా అని యోచిస్తే ఆశ్చర్య రామాయణంలో కన్పించింది. తన పైకి దూసుకొస్తున్న  శూర్పణఖ ను  చూచి భయపడుతున్న సీతను సముదాయిస్తూ రాముడు ఆశ్చర్య రామాయణం లో పూర్వ కర్మానురూపం తు తస్మాదేవం ఫలం గతా అంటాడు. ఆ సందర్భంగా వ్యాఖ్యాతలు  శూర్పణఖ పూర్వజన్మ వృత్తాంతాన్ని ప్రస్తావించారు.

              ఈ శూర్పణఖ పూర్వమొక  గంధర్వాంగన. స్వర్గలోకంలో ఒకనాడు  శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో  శేష పాన్పు పై శయనించి యుండగా, ఈ గంధర్వాంగన  మహావిష్ణువు పైనున్న మక్కువతో ఆయనను చూడడానికి యత్నించింది.ఆది శేషుడు తన పడగలతో మహావిష్ణువు కన్పించకుండా మూసివేశాడు. కోపించిన గంధర్వకాంత శేషుని చెవులమీద, ముక్కుమీద పిడికళ్ళ తో పొడిచింది. అప్పుడు మహాలక్ష్మి శేషుని  సమర్ధిస్తూ మాట్లాడుచుండగా, ఇంతలో గంధర్వాంగన యొక్క భర్త వచ్చి లక్ష్మిదేవి తో వివాదించుచున్న తన భార్యను కోపించి భూమి యందు రాక్షసిగా జన్మింప శపించాడు. అప్పుడు క్రోధించిన గంధర్వాగన కాలాంతరమున నావలన నీభర్తతో నీకు వియోగము సంభవించగలదని శ్రీమహాలక్ష్మిని శపించెను. ఆ గంధర్వాంగనే ఈ శూర్పణఖ. ఆ శేషుడే ఈ లక్ష్మణుడు.”              { ఆశ్చర్య.రా.3-227.}
                
                 కొంతమందైతే  రావణుడు తన భర్తను చంపాడనే కోపాన్ని మనసులో పెట్టుకొని శూర్పణఖ కావాలనే  రాక్షసనాశనం చేయించిందని వ్రాశారు. అంటే భారతం లో శకుని కోపం  వంటిది ఈ శూర్పణఖ కోపమని వీరి ఉద్దేశ్యం.

                          ఈ విధంగా రామాయణంలో చిన్న పాత్ర గా కన్పించినా ప్రధానపాత్ర యై నిలిచింది శూర్పణఖ.






*******************************************************************