Wednesday, 19 September 2012

రామాయణము --- రమణీయకధనాలు – 4 - ఊర్మిళ

                   


                   ఊ ర్మిళ               
          




  శ్రీ  మద్రామాయణ మహాకావ్యంలో ఊర్మిళ  రామానుజుని  ఇల్లాలు. లక్ష్మణుని అగ్నిసాక్షిగా వివాహమాడి అయోథ్యానగరం అంత:పురంలో అడుగుపెట్టిన దశరథుని కోడలు. జనకరాజర్షి ఔరసపుత్రిక. సీతాసాథ్వి ముద్దుల చెల్లెలు.వాల్మీకి మహర్షి చే అందమైన పేరు పెట్టించుకున్న ముగ్ధ.  ” సీతాయా: చరితం మహత్ అంటూ సీతాకథాగానం లో మునిగిన మహర్షి అంత: పురం చేరిన ఊర్మిళను మళ్లీ పల్కరించలేదు. జనకుని కుమార్తెగానే ఊర్మిళ వాల్మీకంలో ప్రస్తావించ బడింది.
                          
                       సీతాం రామాయ భద్రంతే ఊర్మిళాం లక్ష్మణాయ చ
                             వీర్యశుల్కాం మమసుతాం సీతాం సురసుతోపమాం
                        
      ద్వితీయామూర్మిళాం చైవ త్రిర్ధదామి న సంశయ : !! {బా-కాం. 71-21]
        
  అంటూ జనకమహర్షి తన రెండవ బిడ్డను విశ్వామిత్రాదులకు పరిచయం చేశాడు. అంతేకాదు.
                     
                       లక్ష్మణాగచ్ఛ భద్రంతే ఊర్మిళాముద్యతాం మయా
                          ప్రతీచ్ఛ పాణిం గృహ్ణీష్వ  మా భూత్కాలస్య పర్యయ:

అని అల్లుని చేతిలో బిడ్డ నుంచి తన బరువును దించుకున్నాడు రాజర్షి.  [బా.కాం. 73-304 ]
అయోథ్యానగరంలో గృహప్రవేశాది విథిపూర్వక క్రియాకలాపం పూర్తి చేసుకొని అత :పురంలో అడుగుపెట్టిన  ఊర్మిళ తిరిగి కనపడలేదు.ఆమెకై చూచి చూచి నిరాశచెందిన సాహితీప్రియులు, రామకథాగానతత్పరులైన జానపదులు ఊర్మిళను కావ్యనాయికను చేసి కావ్యాలు వ్రాయడానికి,  ప్రయత్నించారు.
            
     శ్రీ మైథిలీశరణ్ గుప్త వంటి ప్రసిద్ద హిందీకవులు సాకేత్, పంచవటి వంటి కావ్యల్లో ఊర్మిళ ను అపురూప క్వ్యనయికగా సృష్టించి ఉపేక్షితను అపేక్షితగా మార్చి ఆమెయే రామకథాగమనానికి ప్రధానపాత్ర అన్నంతగా ఆ పాత్రకు విశిష్టతను ఆపాదించారు.తెలుగు  నేలపై  విన్పించే ఊర్మిళాదేవి నిద్ర,”“లక్ష్మణదేవరనవ్వు వంటి జానపదగేయాలు తెలుగువారికి ఊర్మిళ పై  నున్న అభిమానాన్ని, ఆరాధనాభావాన్ని ప్రస్పుటం చేస్తున్నాయి. ఒకవైపు హిందీకవుల ప్రభావం మరొకవైపు జానపద గేయాల ప్రభావం తెలుగు కవులను ప్రేరేపించగా  తెలుగుసాహితీ జగత్తులో కూడ ఊర్మిళ కావ్యనాయికగా ఆవిర్భవించింది.
                        
   ఊర్మిళా శేష శక్తి  ర్హి జనకస్యౌ రసీసుతా అని ఊర్మిళాదేవి ఆది శేషుని శక్తిగా పురాణాలు ప్రస్తావిస్తున్నాయి.{రామా.సా.-బాల-12-39 ] .  వాల్మీకి , తులసీదాసాదులే కాదు.కరుణా రసైక మూర్తిభవభూతి సైతం ఉత్తర రామచరిత్రలో ఊర్మిళావృత్తాంతాన్ని మాటమాత్రంగా వదిలివేయడం ఊర్మిళా దురదృష్టమే.
                    
    మిథిలానగరంలో ఆ కళ్యాణ ముహూర్తబలం ఎట్టిదోగాని ఆ ఆక్కచెల్లెండ్రు నల్గురు కష్టాల కడలిని యీదవలసిన వారయ్యారు. వారిలోను జనకపుత్రికలకే  కష్టాలు ఎక్కువగా కన్పిస్తాయి. అందులోనూ ఊర్మిళా లక్ష్మణుల జీవనగమనంలో రాముని కైంకర్యసమయమే ఎక్కువ. సీతాసాథ్వి భర్తృవియోగాన్ని సహించలేక ఆయనతో పాటు అడవులకు అడుగులు వేయడానికి సాహసిస్తే  --అన్నను అనుసరించాడు లక్ష్మణుడు. ఆసమయంలో భర్త వెంట ఊర్మిళ కూడా వస్తానందో అసలు లక్ష్మణుడు తను అన్న వెంట వెడుతున్నట్లు ఊర్మిళతో చెప్పాడో లేదో కూడ వాల్మీకి లేఖిని వ్రాయలేదు.
.                           
     తనవెంట అడవులకు వస్తానన్న తమ్మునితో  శ్రీరాముడు  “పృచ్చస్వ సౌమిత్రే సర్వమేవ సుహృజ్జనం “[ వా.రా.అ.కాం. 31-26 }అని-అంటాడు. ఇచ్చట సర్వమేవఅన్న సముచ్చయంలోనే ఊర్మిళ కూడ ఉండి ఉండవచ్చు.
                     

                     సీతారాములతో లక్ష్మణుడు అడవులకుపోగా ఏకాంతంగా అంతపురంలో పదునాల్గు వసంతాల్ని గడపటం ఊర్మిళ వంతయ్యింది. మాండవీ శ్రుతకీర్తులకు కనీసం భర్తల సాహచర్య భాగ్యమన్నా లభించింది కానీ ఊర్మిళకు నాథుని నిరీక్షణలోనే నిండువేసవులు, గండు శీతులు నిండు గ్రీష్మాలు గానే మిగిలిపోయాయి. రాజపుత్రికగా సామాన్యమైన ఆలోచనలకు అతీతంగా ఆవిడ ఎలా ఉండగలిగిందన్న ఆలోచన  కవుల కలాలకు కొత్త ఊపిరినిచ్చింది. భాషాబేధం లేని  రీతిలో ఉత్తర, దక్షిణ భారతదేశ కవుల హృదయాలలో కొత్త కొత్త భావాలకు పరదాలు తీసిన ఊర్మిళ పాత్ర  ఉత్తమ కావ్యసృష్టికి కారణభూతమైంది.
                         
    శ్రీ మైథిలీ శరణ్ గుప్త పంచవటి కావ్యంలో పర్ణశాలకు వెలుపల శిలాతలంపై కూర్చొని దీర్ఘాలోచనల్లో మునిగిపోయిన లక్ష్మణుని ఊహల్లోకి ఊర్మిళను రప్పించారు. ప్రణయదేవత ఊర్మిళా మధుర స్మృతులు ఊహల్లో ఊరట కల్గిస్తుండగా శూర్పణఖాగమనం సంభవిస్తుంది. ఊర్మిళా మనోనాథుడు శూర్పణఖను చూసే సమయానికి అతని మనస్సులో ఊర్మిళయే నిండి ఉన్న సన్నివేశం ఔచితీ సంభరితం.
                       
  సాకేత్ కావ్యంలో రాముని తీసుకురావడానికి చిత్రకూటానికి బయలుదేరిన భరతుని వెంటవున్న అంత:పురజనంలో ఊర్మిళను కూడ పంపించి, అక్కడ పర్ణశాల లో ఒంటరిగా ఊర్మిళా లక్ష్మణులను కలిపి తృప్తిగా నవ్వుకొన్నారు  శ్రీ మైథిలీ శరణ్ గుప్త.
                 
     ఊర్మిళ సమాథి లోనే ఉండి ఆ నిద్ర లోనే పధ్నాలుగు సంవత్సరాలు గడపడం జానపదుల సృష్టి. కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది అనేది జనపదాల్లో వాడుకలో ఉంది. అందుకే ఆవిడ బాథ వీళ్ల భాధగా భావించి  ఊర్మిళను సమాథి లోకి పంపించారు జానపదులు. అదేమార్గంలో కొంతమంది తెలుగు కవులు కూడ తమకావ్యాల్లో ఊర్మిళను సమాథి లోకి పంపించి ,యోగ ప్రభావంతో ఆవిడ భర్తను ప్రత్యక్షంగా దర్శిస్తూ, సంభాషిస్తున్నట్లు ,తుదకు రామాదులు అయోథ్యకు తిరిగి రావడాన్ని కూడా తన యోగవిద్యాప్రభావం తో  తెలుసుకొని ఊర్మిళ యే ముందుగా అంత: పురంలో అందరికీ తెలియజేసినట్లుగా  కూడ వ్రాసేశారు.
                               
      పతంజలి యోగశాస్త్రం లో  సమాథిని గురించి    ఇదేవాత్మ మాత్మవిర్భాసం స్వరూప శూన్యమివ సమాథి: { ప.యో.శా.-3.2, 3.3]అని చెప్పబడింది.

తాను థ్యానించే వస్తువుని మాత్రమే భావించడం థ్యానమనబడుతుంటే, థ్యానం థ్యానించే వస్తువు        యొుక్క స్వరూపంగా పరిణమించి థ్యానిస్తున్నాననే   బాహ్యస్మృతి లేకపోవడమే సమాథి.
అటువంటి సమాథి స్థితిలోనే  ఊర్మిళ ఫధ్నాలుగు వసంతాలు గడిపిందని కొందరు కవులు యోగశాస్త్ర ప్రసక్తి ని కూడా తమ కావ్యాల్లోకి తీసుకొచ్చారు. ఊర్మిళ ను ఉత్తమ నాయికగా తీర్చి దిద్దారు.ా
                            
    ఊర్మి అంటే తరంగం. రామాయణ కథావేగాన్ని పెంచడానికి ఈ ఊర్మి ఉపయోగపడి,వేగంగా కథను గమ్యానికి చేర్చి, రామకథాబంథాన్ని ఏకసూత్రంగా  మలచిందని  చెప్పవచ్చు.రాముని వెంట లక్ష్మణుడు వెళ్లకపోతే రామకథకు పరిపూర్ణతే లేదు గదా! అందుకు పరోక్ష సహకారి ఊర్మిళ.
              
    భజ్యతే స్వయమేవ భంగ: అన్న నిర్వచనాన్ని అంగీకరిస్తే తనంత తాను నశించునది అనే అర్థంలో రాముని సేవకై పతిదేవుని పంపి పథ్నాలుగువసంతాలు నిద్రామూర్తిగా,నిశ్చైతన్యగా, యోగినిగా తన్నుతాను కృశింప చేసుకొని తపస్వినిగా రూపొందిన ఊర్మిళ కు వాల్మీకి చేసిన నామకరణం సార్థకమేననిపిస్తుంది.







-- వందే రామం దూర్వాదళశ్యామం సీతాపతిం సుందరం -


                        



                                  


                 





Monday, 17 September 2012

అశోకవని లో రాముడు


                                             


                     అశోకవని లో రాముడు
       
                             శ్రీ రామకధ  ప్రపంచంలోని ఎన్నో దేశాలలో ఎంతోమందిని మహాకవులుగా చేసింది. వాల్మీకి నాటికే లోకంలో శతాధిక రామాయణాలు ప్రచలితమౌతున్నట్లు  రామాయణమే చెపుతోంది.ఆధునిక పరిశోధనల్లో మూడువందలకు పైగా రామాయణాలున్నట్లు గుర్తించారు .
   “  As in many oral epics, multiple versions of the Ramayana survive. In particular, the Ramayana related in North India differs in important respects from that preserved in South India and the rest of South-East Asia. There is an extensive tradition of oral storytelling based on the Ramayana in Indonesia,Cambodia, Philippines, Thailand, Malaysia, Laos, Vietnam, and Maldives.[citation needed] Father Kamil Bulke, author of Ramakatha, has identified over 300 variants of Ramayana.[56]    “{ Wikipedia }
                                           
                                       రామకధలోని గుణశీలతలు అటువంటివి. అందుకే వ్రాసిన రామచంద్రు కధ వ్రాసితి నంచనిపించుకో వృధాయాసముగాక కట్టుకధ లైహికమా ? పరమా “? అన్నారు కవిసమ్రాట్ విశ్వనాధ రామాయణకల్పవృక్షంలో. హిందీకవి మైథిలీశరణ్ గుప్తా  -----
                              రామ్ తేరా వృత్త్ స్వయం హి కావ్య్ హై
                      కోయీ కవి బన్జాయా సహజ సంభావ్య్ హై  ||
               _____   రామా! నీకథే గొప్పకావ్యం.దాన్ని వ్రాయడానికి ప్రయత్నించిన ఎవరైనా కవి అవడంలో ఆశ్చర్యం లేదు గదా  “ –అంటాడు. రామకథ ను కొత్తకోణంలో దర్శించి నూతన ఆవిష్కరణ చేసిన ఆధునిక కవులెందరో ఉన్నారు.వారిలో బోయి భీమన్న ఒకరు.వీరి కావ్యమే అశోకవనిలో రాముడు.మన ఆత్మీయులు మనకు దూరంగా  కారణాంతరాలవల్ల నివసించినప్పుడు మనం ఆ ప్రదేశానికి వెళ్లడం సంభవిస్తే వారు అప్పుడు అక్కడ ఎలా, ఎటువంటి పరిసరాల్లో నివసించారో చూడాలనే ఉత్కంఠ కలగడం మానవసహజం. ఆత్మానం మానుషం మన్యే అని ప్రకటించుకున్న రామునిలో ఇటువంటి కుతూహలాన్నే దర్శించారు కవి.    
                              రామ రావణయుద్ధానంతరం రావణుని మరణం అనివార్యమైంది.లంకారాజ్యం విభీషణునికి అందించబడింది. అశోకవనంలోని సీత అలంకరణార్థం అంత :పురానికి తీసుకొనిపోబడింది. ఆ రాత్రి సమయంలో పదినెలలుగా సీత బంధించబడిన అశోకవనం ఎలా ఉందో చూడాలని---తన ఇల్లాలు ఇంతకాలం శోకించిన అశోకాన్ని చూడాలని శ్రీ రాముడు అశోకవనంలో  ప్రవేశించాడు.—అని కవి భావన. రాముడొక్కడే ఆ రాత్రి ఆ తోటలో  ఒంటరిగా తిరుగుతాడు.రకరకాల జ్ఞాపకాలతో భావాలతో బాధలతో సతమతమైనాడు. కన్నీరు కార్చాడు--------ఇది ఈకావ్యం.   అంటాడు  కవి.
                                       ఇది ఒక అధ్భుతమైన భావ ప్రధానకావ్యం. కవి  భావాలు రెక్కలు విదిల్చి విశాల విహాయసంలో స్వేచ్ఛగా విహరిస్తాయి. ముక్తకంగా సాగిన ఈ రచన ఏ పద్యానికి  ఆ పద్యమే బాగు అన్పిస్తుంది.  ఇది       అవాల్మీమని మనం ముందుగా గుర్తుచేసుకోవాలి.
    ఫ్రవిరళ భావవేగమున రాత్రికి రాత్రియె లేచివచ్చెనో ఎవరది?రాముడా వకుళవృక్షము క్రింద అశోకవాటికన్  “   అంటూ అశోకవనంలోని రాముని పాఠకులకు పరిచయం చేస్తాడు కవి.
                     ఒక్కడు, అర్ధరాత్రి, కనులుండియు లేని తమస్సు, చుట్టునున్
                     రక్కసి ప్రేతముల్ తమఉరమ్ముల నెత్తురు తామె త్రావుచున్  
                     క్రక్కుచు నుంట , కంట దశకంఠుని కాష్టము –ఔను రాముడే
                    ఒక్కడు  అర్ధరాత్రి ,  జ్వలితోహలతో  ఫలితాఖిలోహుడై  
                           జ్వలితోహలతో సంచరిస్తున్నాడు రాముడు. రావణుని మరణానికానందించి దేవతలు  చల్లిన పూలు చెట్ల కొమ్మల్లో చిక్కుకొని ఇప్పుడవి మరల రాముని పై రాలుతున్నాయి—ఆనాడు సీతమ్మ చల్లిన పూతలంబ్రాలను గుర్తు చేస్తూ. చిన్ననాడే శివధనుస్సును ఒక చేతితో ఆవలబెట్టిన అవనిజ లోని శక్తి ఏమైంది? రాముని కోసమని ఎదురు చూసిందే గాని ఒక్క మట్టిపెల్ల విసిరి లిప్తకొక లక్ష రావణులను చంపగల శక్తి సీత “   అన్నప్రతిపత్తి విశ్వాసం  జనకజ పై కవికుంది.
                     కంటిని బాలగా మిథిల, కంటి నయోథ్యాపురిన్ నవోఢగా  
                     కంటిని చిత్రకూటి సతిగా, ప్రియురాలుగ పర్ణశాలలో
                     కంటిని భద్రగా బగళగా భువనేశ్వరి గాగ లంకలో  
                     ఒంటరికాదు రామసతి ఉంటిమి మేము తత్పదాళిగా
              --అంటూ శిరసొగ్గుతాడు కవి.అశోకవనంలో  సీతమ్మను చూసిన ప్రతి తీగ ఇప్పుడు రాముని చూచి ఇద్దరిలో ఎవరు అందమైనవారో నిర్ణయించుకోవాలనే తపనతో తమలో తాము బాహుయుద్దాలకు తలపడుతున్నట్లు చిక్కువడి రాముని కడ్డుపడుతున్నాయి. హనుమంతునితో లంకను దాటించినవాడు, రావణుని సంహరించినవాడు నైన రాముడు మానవుడా ! అతనెంత ఒడ్డు పొడుగు ఉంటాడోనని రాక్షసాంగనలు తీగలు చాటుగా సంచరిస్తుంటే—రాముడు ఆలోచనలతో ముందుకు నడుస్తున్నాడు. ఒకచోట నిలువలేక అశోకవనమంతా కలియతిరుగుతున్నాడు. రావణుని మోహం సీతను బలాత్కరించలేదు గాని లేకపోతేయీ యశోకతరు వీరదళమ్ములు రామబాణపుం కథలనె మార్చి యుండెడివిగా సతి శోకపు థాటి చూపునన్  “  అంటున్న కవి భావన కడు రమణీయం. అశోకచెట్టు ఆకులు ఇరువైపులా వంకలు తిరిగి వాడిగా ఉంటాయి..అవి వీరదళాలై రావణుని హతమార్చి, రామబాణపు ఔన్నత్యాన్ని కూడ  త్రోసిరాజనేవన్నంత నమ్మకం కవికి సీతమ్మ మీద ఉంది. సీత లేని రాముడు శ్రీ  రాముడు కాలేడు గదా.
         ప్రమిదలో వెలిగే వత్తిని చూచి భాగుందని నెత్తిన పెట్టుకున్నట్లు, రామవిభుని ఇల్లాలిని తెచ్చుకున్నాడు రావణుడు.
                               శివధనుస్సు నెక్కిడుట , సేతువు కట్టుట, పంక్తికంథరా
                         ద్యవమతులన్ హరించుట మహాటవులన్ వ్యథలోర్చుటయ్యవి
                         య్యవియననేల రామచరితాద్భుత కాండములెల్ల సీతవే 
                          యవనిజ ఛుట్టు నల్లుకొని నట్టివి గాథలు వన్యవీథులన్.
            రాముని కృత్యాలన్నీ రామ ను అల్లుకొన్నవే. వాల్మీకి నిత్యనూతనుడైన ,నిత్యాధునికుడైన కవి. రాముడు సార్వకాలికుడైన విశ్వమానవుడు. ఇది కవి నమ్మకం.
                              ఆత్మరక్షణ చేసుకోలేని మానవుడికి – ఏజీవికి ప్రకృతి పురోగమన నిత్యసంరంభంలో స్థానంలేదు. ఆత్మరక్షణ ఫ్రధాన కర్తవ్యం.ఆత్మరక్షణ తర్వాత ఆత్మీయ రక్షణ. ఆ తర్వాతే శిష్టరక్షణ.అందువలనే కవికి రాముడంటే అభిమానం. రాముడు చేసిన ప్రతిపనిని కవి సమర్థించాడు. శూర్పణఖ నాసికాఖండనం నుండి వాలి వధ వరకు  అన్నీ రాముడు అనుసరించవలసిన మార్గాలే.  లోకంలోని శోకాన్నంతా తానే భరించి లోకానికి శోకోపశమనం కల్గించిన  పూర్ణస్త్రీ   సీత. సీత  చరిత్రే   లోకచరిత్ర. లోకచరిత్ర శోకచరిత్రే  కదా !” అన్న మాటలు కవి. ఇవన్నీ కలిసి కవిని ఈ కావ్యనిర్మాణానికి పురికొల్పాయి.
                 అశోకం  లో  స శోకుడై తిరుగుతున్న రాముణ్ణి  చూసి  ప్రకృతి విలపించింది.రాలుతున్న పూలు విరి కన్నెలకన్నీటి జాలు వలె కన్పిస్తోంది. అందుకే- కలగిన విశ్వమానసము కార్చెడి అశ్రువులవ్వి-అంటాడు కవి.సీతారాముల బాధల్ని చూసి కలగిన  విశ్వ మానసము కార్చే కన్నీరుగా  కవి భావించాడు. అందుకే ఏ2కోపి రస :కరుణ ఏవ “   అన్నాడు మహాకవి భవభూతి.
                            అర్ధరాత్రి అశోకవనంలో మెరిసే మిణుగురులు వనలక్ష్మి నిలువెల్ల కళ్ళుచేసుకొని రాముని చూస్తున్న కాంతిరేఖలా లేక సీతాదేవి చూపులా  అన్నట్లున్నాయట. ఈ లోకంలోకి  కరి-వేప, సీతాకోకచిలుకలు ఎలా వచ్చాయో ఈ సందర్భంలో కవి చక్కగా చమత్కరించారు . ఒకానొకరోజున వనభోజనాలవేళ పెద్దకోడలైన సీతమ్మ  స్వహస్త పాకాన్ని అందరికీ వడ్డించి సుగంధభరితమైన ఆ చేతిని సమీపమందలి ఓ చెట్టుకి ఆనించి నిలబడిందట. అది చల్లని వేపచెట్టు అయ్యుంటుంది.ఆమె చేతికున్న పరిమళము కొద్దిగ ఆ చెట్టుకు తగిలి సీత కరము తగిలిన ఆ వేప కరవేప > కరివేప అయ్యిందట. నిజమేనేమో మరి .    అలాగే   తెలతెలవారుతుండగానే  సీతమ్మ ఉషాకుమారిలా పూలతోటలో తిరిగేటప్పుడు సీతా సతి వల్కలాల వల్కములు చెట్ల కొమ్మల్లో చిక్కి సీత-కోక-చిల్క లై నాయని చెప్పడం కల్పనా మనోహరం.
                ఒకసతి ఒక్కమాట శరమొక్కటె ఇయ్యవి మూడొకట్లు,పొం
               దొకటియె చాలు మానవుని ఉన్నతు జేయగ ,మూడునొక్కటయై
                వికసనమందు మానవుడు విశ్వసమున్నతుడేల కాడు ---- అన్న విశ్వాసంతో సీతారాముల్ని ధ్యానించి రామాయణ ఔన్నత్యాన్ని  ప్రకటిస్తారు కవి.
               
              రామాయణ భారతాలవంటి మహాకావ్యాలు వ్రాయాలనే ఆరాటం ఉందిగాని ఆకలి,నిరుద్యోగం,తిండివేట , పనిరద్దీ పరమార్థంగా ఉన్న ఈ రోజుల్లో భక్తికి బ్రహ్మోపాసనకి టైమెక్కడిది  “ అంటూనే   భావ ప్రధానంగా  రామకధను ప్రస్తావించి రామాయణకవుల్లో చోటు దక్కించుకున్నారు.
                 ----     రఘునాధాయ నాథాయ సీతాయా : పతయే నమ :                                                                         

Tuesday, 11 September 2012

రామాయణము --- రమణీయకధనాలు - 3 - సరమ


సరమ

                         
                    శ్రీ మద్రామాయణంలో వాల్మీకిమహర్షిచే నామమాత్రంగా ప్రస్తావించబడి తెఱచాటుకు తొలగిపోయిన అతి కొద్ది  అందమైన పాత్రల్లో ఊర్మిళ,మాండవి,శ్రుతకీర్తుల తరువాత గుర్తుకొచ్చే పాత్ర సరమ.
                       సరమ విభీషణుని ఇల్లాలు. విభీషణస్తు ధర్మాత్మా న తు రాక్షస చేష్టితః అని శూర్పణఖ విభీషణుని గూర్చి రామునికి పరిచయం చేస్తుంది.[వా.3-17-24] రావణుని తమ్ముడు విభీషణుడు ధర్మాత్ముడు.   

                  రామాయణకధకు కారకుడై   “పౌలస్త్యవధనామాంతర రామాయణంలో రావణుడు ప్రతినాయకుడు  కాగా, లంకలో పుట్టినా లంక లక్షణాలులేని ధర్మాత్ముడు విభీషణుడు. ఆయనకు తగిన థర్మపత్ని సరమ.
              
            సరమా నామ ధర్మజ్ఞాం లేభే భార్యాం విభీషణామ్  అని  [ ఉత్తరకాండ 12-2 ] .ధర్మాత్మా  ధర్మజ్ఞా  అనే విశేషణాలు  వాల్మీకి ప్రయుక్తాలే.   రాక్షసవంశంలో జన్మించినా విభీషణుడు ,సరమ కూడా ధర్మాత్ములే నని మహాకవి ఉవాచ. అందుకే  రామసేవాభాగ్యం లభించిన అదృష్టవంతులయ్యారు వారు. వీరి కుమార్తె  పేరు అనల.

 జ్యేష్టకన్యా2నలానామా...................విభీషణసుతా....అని వాల్మీకం [సుం-కాం 32-10-11,12.}                                                                                 
              
                 సీత అశోకవనంలో ఉండగా ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఆమెను ఆదుకున్న కుటుంబంగాను, సేవచేసి తరించిన వ్యక్తులుగాను మనకు రామాయణం లో కన్పిస్తారు. రాముని శరణు జొచ్చిరావణవధకు కారకుడైన విభీషణుడు సీతకు పరోక్షంగా సహాయం చేస్తే, రామ విభీషణుల సమాగమాన్ని,  రామదండు పురోగమనాన్ని, గగనమార్గంలోనుండి అదృశ్యగా వీక్షించి సమస్త సమాచారాన్ని, తుదకు రామచంద్రుని విజయాన్ని కూడ సీతకు చెప్పి, రామవియోగమనే గ్రీష్మతాపంతో బీడువారిన జానకి హృదయంలో తొలకరి జల్లులను చిలకరించి శాంతింపజేస్తుందీ సరమ. 
                
                       చంకదుడ్డు శరణార్థివలె వచ్చిన విభీషణుని సుగ్రీవాదులు శతృవుగా భావించి – నివారించినా తుదకు రాముడు వారలందరిని సమాధానపరచి , ఆనాడు శూర్పణఖ చెప్పిన మాటలను గుర్తుచేసుకొని, విభీషణునకు అభయమిచ్చాడు. ఈ సమయంలో పలురకాల ధర్మసూక్ష్మాలు రాముని గొంతుకలో ప్రచలితమౌతాయి.
    
  సకృదేవ ప్రసన్నాయ తవాస్మీతి చ యాచతే !
  అభయం సర్వభూతేభ్యో దదామే తద్ర్వతం మమ
  విభీషణోవా సుగ్రీవ యదివా రావణస్స్వయమ్ ||  యు.కాం.18-33-34

రామచంద్రుని శరణాగత వత్సలుడని, ఆర్తత్రాణపరాయణుడని ,జగత్ప్రభుడని లోకం జోతలందించడానికి పరమప్రమాణంగా నిలుస్తుందీ ఘట్టమే. శరణుజొచ్చినవాడు రావణుడైనా అంగీకరిస్తానన్న రఘునాధుని మహత్వం రామాయణానికి జీవగఱ్ఱ. శరణాగతితత్త్వం రామచంద్రుని జగత్ప్రభువుని చేస్తే గీతామృత బోధ శ్రీకృష్ణుని జగద్గురువుని చేసింది.అంటే రామచంద్రునిలోని శరణాగతి తత్త్వం  వెల్లివిరియడానికి ఈ ఘట్టమే ఆధారమైంది.

అశోకవనంలో రావణుడు ఇంద్రజాలప్రభావంతో నెత్తురోడుతున్న రాముని శిరస్సుని చూపి, వానరసైన్యమంతా నాశనమైందని ప్రకటించి సీతాహృదయంలో బడబాగ్నిజ్వాలలు రేపి, భయపెట్టి వెళ్లిపోగా—తనవల్లనే పుణ్యాత్ముడైన రామచంద్రుడు మరణించాడని భోరున విలపిస్తున్న సీతమ్మను ఓదార్చడానికి వస్తుంది సరమ.

సీతాం తు మోహితాం దృష్ట్వా----------ప్రియా ప్రణయనీం సఖీం  [ యు.కాం.  33-1 -2 -4 ]

ఆశ్వాసయామాస  తదా సరమా మృదుభాషిణీ-----సఖీస్నేహేన సువ్రతా  ||

                         అన్న  పల్కులు వాల్మీకివి. సఖీ స్నేహంతో కష్టాల్లో ఉన్న నెచ్చెలిని ఓదార్చడానికి మృదుభాషిణియైన సరమ వచ్చింది. మరణించాడనుకొన్న రాముని క్షేమం తెలపడమే కాకుండా రావణుని ఇంద్రజాలవిద్యను తేటపరచి ఆమె హృదయానికి ఆనందాన్ని కల్గిస్తుంది. రాముని సముద్రతరణాన్ని గర్వంగా ప్రకటించడమేకాకుండా యుద్దంజరగబోతోందని .శుభం నిన్ను వరిస్తుందని, నామాటలు  నిజమని నమ్మబలుకుతుంది. నిరాశా నిస్పృహలతో నిండి నావంటి పాపిష్టిదాన్ని చేసుకోబట్టే ఆపుణ్యాత్ముడు మరణించాడన్న”{ యు.కాం.32-28,29 ] ఆత్మన్యూనతాభావాన్ని పొందిన సీతకు ఆత్మస్థయిర్యాన్ని కల్గించడానికి ఈ పాత్ర ఎంతగానో తోడ్పడుతుంది.
    
  శోకస్తే  విగత స్సర్వః కళ్యాణం త్వా ముపస్థితమ్
   ధ్రువం త్వాం భజతే లక్ష్మీః ప్రియం ప్రీతికరం శృణు |            [యు.కాం.33-14  ]
   
 ఈ మాటలు సీతాదేవి హృదయంలో అమృతపుజల్లులను కురిపించాయి. మరణోన్ముఖురాలైన ఆమెకు తిరిగి నూత్నోత్సాహాన్ని కల్గించాయి.అంతేకాదు.ఎంతోకాలంగా చిక్కుపడి ఏకవేణిగా నున్న నీ శిరోజాలను శ్రీరాముడు చక్కదిద్దగలడు అంటుంది మృదుభాషిణి గా సఖీస్నేహంతో సరమ. బాధలో ఉన్న వారిని సముదాయించాలంటే ఆత్మీయుల ప్రస్తావన తీసుకురావాలని ఇక్కడ చెప్పకనే నిరూపించాడు మహాకవి.ఆ సందర్భంలో  శ్రీ రామచంద్రుల ప్రస్తావన    బరువెక్కిన సీతమ్మ హృదయాన్నే కాదు భారమైన ఆ సన్నివేశాన్ని  తేలిక పరచింది. ఇది మహాకవి శిల్పం. అందుకనే ఈ సందర్భంలోని ఈ శ్లోకం సీతమ్మ కష్టాలను చూచి కరిగిన వాల్మీకిమహామునే  సరమ తో ఇలా పలికించాడేమో ననిపిస్తుంది.
  
   అశ్రూణ్యానందజాని  త్వం వర్తయిష్యసి శోభనే
   సమాగమ్య పరిష్వజ్య తస్యోరసి మహోరస : |                         [యు-కాం.33-33

                            “రాముని కౌగిలించు కొని ఆయన బిగికౌగిలిలో  విశాలమైన అతని వక్షస్థలం మీద ఆనందాశ్రువులను రాల్చగలవు. ఇది సరమ చేస్తున్న ఆశ్వాసనం కాదు. వాల్మీకి గొప్ప మనసుతో  చేతులెత్తి సీతమ్మకు అందిస్తున్న చల్లని ఆశీర్వచనమే ననిపిస్తుంది. మధురమైన సరమ అనునయవాక్యాలకు    కోలుకున్న సీత సరమను స్నేహపూర్వకంగా దగ్గరకు తీసుకొంది. అప్పుడే రమా సహితయైన  ఆ  రాక్షసి { స –రమ ] సరమ యైంది.   రాముని కౌగిలి విభీషణునికి లభిస్తే సీతమ్మ కౌగిలి అతని బార్య సరమకు లభించింది.  వారి జన్మలు ధన్యమైనాయి. నమ్మిన వారినెప్పుడు రామచంద్రుడు విడిచిపెట్టడు. అభయం సర్వభూతేభ్యో…”
...అనిగదా  ఆయనవ్రతం. అందుకే బుధకౌశిక ఋషి–
                     
                          "ఆత్త సజ్య ధనుషావిషుస్పృశావక్షయాశుగ నిషజ్గసజ్గినౌ
                    రక్షణాయ మమ రామలక్ష్మణావగ్రత : పథి సదైవ గచ్ఛతామ్ ||

పరిపూర్ణవిశ్వాసంతో గర్వంగా ప్రకటిస్తాడు శ్రీ రామరక్షాస్తోత్రం లో. ఎక్కుపెట్టిన ధనుస్సుల్లోని బాణాలను స్పృశిస్తూ, అక్షయతూణీరములు కల్గిన రామలక్ష్మణులు నన్ను రక్షించడానికి నేను నడిచేమార్గంలో నాకన్న ముందు నడిచెదరు గాక ! ఇదీ-  శ్రీ రామచంద్రుని పై భక్తులకున్ననమ్మకం.
                     
   అయితే సరమకు ఆ పేరు రావడానికి మాత్రం అసలు కారణం రామాయణం ఉత్తరకాండ  లో ఇలా ఉంది.
                    ‘మానససరోవర తీరంలోఈ కుమార్తెను ప్రసవించిన ఈమె తల్లి వానల వలన పెరుగుతున్నసరస్సునీరు పసిబిడ్డ వద్దకు రావడం  చూచి సరో మా వర్ధయ అని పల్కిందని ,అదే ఆ శిశువు పేరుగా మారి స ర మ  అయ్యిందని ఉత్తర కాండ   చెపుతోంది.    [ ఉ.కాం.—12-24]  
                                     ఏమైనా కష్టసమయంలో సీతమ్మకు తోడుగా నిల్చిన ఒక స్త్రీమూర్తి గా రామాయణంలో తన పాత్రను సుస్ధిరం చేసుకున్న భాగ్యశాలి సరమ.
                      
**వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిమ్   **[******                                                                      

Saturday, 8 September 2012

ఒకసందేహము– సమాధానము {రామచంద్రుని వంశవృక్షము}


              రామచంద్రుని వంశవృక్షము
                    అంతా రామమయం  {SEP-2-2011]  -చదివిన మిత్రులొకరు ప్రశ్నఒకటి పించారు. దానికి సమాధానం వ్యక్తిగతంగా కాకుండా సర్వేక్షణ గా అయితే మరో నలుగురికి చేరుతుందని ఈ  మార్గంలో అందిస్తున్నాను.
ప్రశ్న:-- dear sir can u give me the details of the sons of rama/lakshmana/bharatha/satrughna nd also the sons names of lava nd kusa in ramaayanaa...09884675329 

సమాధానం  :--   



        నేను వేరే మకాం లో ఉండటం వలన నా స్వంత గ్రంధాలయం అందుబాటులో లేదు.అందువలన అధికసమాచారాన్ని మరోమారు విశదంగా అందించడానికి ప్రయత్నిస్తాను.
                                            #
                               వందే వాల్మికి కోకిలమ్.
                                                     ***

Sunday, 2 September 2012

అంతా రామమయం

                         




                               అంతా రామమయం
                                     


                         శ్రీ రామ భక్తులకు లోకమంతా రామమయంగానే కన్పిస్తుందట.ఈ మధ్య  అటువంటి పరిస్ధితే నాకూ ఎదురైంది. రామాయణ సాహిత్యం మీద డాక్టరేట్ తీసుకున్నాననే విషయం తెలిసిన సన్నిహితులు, మిత్రులు వారికెక్కడ రామసంబంధమైన విషయం తెలిసినా నాతో పంచుకోవడం ఒక అలవాటైపోయింది.ఆ మథ్యన నా సహోద్యోగి ఒకరు ఒక బంగారు నాణాన్ని తీసుకొచ్చి నా ముందుంచాడు. దాన్ని చూసిన నాకు మాటలు కరువయ్యాయి. సుమారు పదిహేనుగ్రాముల బరువున్నబంగారునాణెమది.దానిపై ఒకవైపు శ్రీరామచంద్రుని పట్టాభిషేకదృశ్యము,రెండవవైపు విల్లంబులు థరించిన రామలక్ష్మణులు స్పష్టంగా ముద్రించబడున్నాయి. ఇదిగో  చిత్రం ఒకటిలో ఆ నాణెము ముందువెనుకలను మనం స్పష్టంగా దర్శించవచ్చు.
                              

                       విచిత్రమేమిటంటే అతను నాకు పూర్వవిద్యార్ధి కూడాను. తరువాత వేరే ఉద్యోగం రావడంతో ఈ తాత్కాలిక ఉద్యోగాన్ని వదిలేసి అతను వెళ్లిపోయాడు .ఇది జరిగి చాలాకాలమైంది. ఆనాడు ఆర్ట్ పేపరు మీద తీసిన ప్రింటు యిది. కాలగమనంలో మెరుపు తగ్గింది. తిరుపతి లో జరిగిన రామాయణ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో నా పేపర్ తో పాటు దీన్ని కూడా చర్చకు పెట్టడం జరిగింది.ఆ తరువాత కొంతకాలానికి కాన్ఫరెన్స నిర్వాహకులురామాయణ సమ్మేళనం ప్రత్యేక సంచికను ముద్రిస్తున్నామని,ఆప్రింటు ఒక దానిని పంపిస్తే ప్రత్యేక సంచికలో ముద్రిస్తామని   లేఖ వ్రాయడం దీని నకలు ఒక దానిని ఆరోజు నేను పంపించడం జరిగిపోయాయి . ఆనాడే యిదిఎంత విలువైన నాణెమో అర్ధమైంది.కాని  ఆ నాణాన్ని తను నాకు ఇవ్వడానికి కాదు గదా! అమ్మడానికి కూడ అతను సిద్దంగా లేడు. నా మీద ఉన్న అభిమానంతో అతను తీసుకొచ్చి చూపించాడే కానీ అమ్మే ఉద్దేశ్యం కూడా అతనికి లేదు. అది తన కుటుంబంలో తాతల నాటినుంచి వస్తోందని అతను చెప్పినప్పుడు నాకుఆశ్చర్యం వేసింది.ఎందుకంటే అతను కొంతకాలం  దుబాయ్ల్ లో పనిచేసి ఆరోగ్య కారణాల వలన వచ్చేశాడు.ఇప్పటికీ కుటుంబసభ్యులు కొందరు అక్కడే ఉన్నారని చెప్పినట్టు గుర్తు. వారి కుటుంబాల్లోనే ఇవి ఇంతగా భద్రపరచబడ్డాయంటే ఇంకా ఎంతమంది దగ్గర ఎన్ని రూపాల్లో చరిత్ర దాగి ఉందా !అనిపిస్తోంది. అందుకే ఈ చిన్నప్రయత్నంతో విజ్ఞుల ముందుకు దీన్ని పంపిస్తున్నాను.  


 

  
చిత్రము—1                   బంగారునాణెం



             వృత్తిరీత్యా,కుటుంబరీత్యా ఉన్నబాధ్యతలు,ఒత్తిడుల మూలంగా కొంతకాలం దీన్నిపక్కన పెట్టడం జరిగింది. కాని పులి మీద పుట్ర లాగా ఇంకొక నాణెం వచ్చి మీద పడింది. అదికూడ రాముడి పేరు చెప్పుకొనే వచ్చింది.దానికి కారణం నా పరిశోధనా వ్యాసమే నని చెప్పవచ్చు. నా పుస్తకం మీద ఉన్న రాముడి చిత్రాన్ని చూసిన మా కాలేజి అటెండరు రాముడికి నాకు ఉన్నసంబంధాన్ని గుర్తించాడేమో, ఒకరోజు సాయంత్రం డిపార్టుమెంటులో ఉన్న నన్ను బయటకు పిలిచి ఈ నాణాన్ని నా చేతిలో పెట్టాడు. ఈ నాణెం కూడ ఇంచుమించు పై నాణెమంత వెడల్పు లావు బరువు ఉన్నా ఇది వెండి నాణెం. రామలక్ష్మణుల వలే రంగులో భేదం తప్పపై నాణెం వలే ఒకే పోలికలున్నఆ నాణాన్ని చూడగానే నాకు ఆశ్చర్యం వేసింది. అతను చెప్పిన విషయం విని ఆశ్చర్యం పోవడం నా తోటివారి వంతయ్యింది. ఏది ఎవరికి దొరకాలో వారికే దొరుకుతుందనేది పెద్దలమాట .
                        
                 ఒక సెలవురోజున తను భద్రాద్రి వెళ్లాడట.గోదావరిలో స్నానంచేసి తడిబట్టను ఆరబట్టుకుంటూ ఇసుకలో అటు ఇటు తిరుగుతున్నాట్ట కాలితో ఇసుకను రేపు కుంటూ. ఇంతలో ఇసుకతోపాటు ఏదో లేచి అవతలపడింది. చూస్తే వెండినాణెం. దాని ప్రాచీనత, ప్రాధాన్యత అతనికి తెలియవు.వెండినాణెం అని మాత్రమే తెలుసు. తీసి జేబులో వేసుకున్నాడు. ఇదీ దాని చరిత్ర.
                           ఈవిధంగా ఆనాణెం  అతని దగ్గరికొచ్చి,తరువాత నాముందు ప్రత్యక్షమైంది. బంగారు నాణెంవలెనే ఇది కూడ సుమారు పదిహేను గ్రాముల బరువుంటుంది. ఒకవైపు సీతారామపట్టాభిషేకదృశ్యము ముద్రించబడివుంది.రెండోవైపు రామసేతు నిర్మాణ చేస్తున్న వానర సైన్యం కన్పిస్తుంది. వారి చేతుల్లో వివిధ ఆయుధాలు,పతాకలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. వారికి పై భాగంలో   శూన్యంలో   అంటే      ఆకాశంలో    राम सीतः అని స్పష్టంగా సంస్కృతంలో ముద్రించబడియుండటం మనం స్పష్టంగా గమనించవచ్చు. అంటే సేతునిర్మాణం చేస్తూ వానరసైన్యం సీతారాముల పేర్లను నినదిస్తున్నారని ముద్రాపకుల అభిప్రాయంగా మనం చెప్పకోవచ్చు. ఈనాడు మనకు మార్కెట్లోకి వచ్చిన పదిరూపాయల నాణానికన్నా ఒక్క వీసం పెద్దదిగా, పాతకాలపు మన వెండి రూపాయి అంత మందంగాను ఉందది.
                               బంగారు నాణెం లోని పట్టాభిషేక దృశ్యంలో సీతారాములతోపాటు ముగ్గురే కన్పిస్తుంటే వెండినాణెంలోని పట్టాభిషేకదృశ్యంలో నలుగురు కన్పిస్తున్నారు.



చిత్రం-2 లో దీన్ని చూడవచ్చు


                                   వెండినాణెం


           అయితే రెండు నాణాల్లోను హనుమంతుడు దాసాంజనేయుడై సింహాసనం చెంతనే దర్శనమిస్తున్నాడు.బంగారు నాణెంలో సింహాసనం చెంత కన్పించే ముగ్గురు కిరీటధారులుగా ఉండటం వలన లక్ష్మణభరతశతృఘ్నులుగా బావించవచ్చు. కాని వెండి నాణెంలో సింహాసనం వద్ద నలుగురు కన్పిస్తున్నారు.కొంచెం లోతుగా చూస్తే నాలుగోవ్యక్తికి తోక కన్పిస్తోంది.అంటే ఇక్కడ సుగ్రీవుడు కూడ సింహాసనం దగ్గర సోదరులతో సమానంగా గౌరవించబడ్డాడన్నమాట.
                    బంగారు నాణెం మీదున్న పట్టాభిషేకదృశ్యంలో సీతాదేవి రామునివలెనే సభకు అబిముఖంగా అభయహస్తధారిణియై ఉంటే వెండి నాణెం మీద మాత్రం రామచంద్రునివైపు తిరిగి ముకుళితహస్తాలతో నమస్కరిస్తున్నట్టు ముద్రించబడింది.
                               

 ఇక నాణాల రెండోవైపు పరిశీలిస్తే---చిత్రం---4 –గమనించవచ్చు.        

  


               బంగారు నాణెం వెనుకవైపు రామలక్ష్మణులు థనుర్బాణధారులై ఉండగా,వారి పైన గుండ్రంగా....ద్దమన జానక జవల హనుమతక.... ఇత్యాదిగా ప్రాకృతంలో(అనుకుంటా) వ్రాసిఉంది. వెండి నాణెంమీద రామసీతః అని సంస్కృతంలో వ్రాయబడింది. రెండింటిలోను సంవత్సరాలు 4 తోనే ప్రారంభమౌతున్నాయి.
            నాకున్న పరిమితజ్ఞానంతో,రామాయణం మీద,రాముని మీద ఉన్న భక్త్యభిమానాలతో ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఇంతకు ముందే ఇటువంటివి లభించి వుంటే,పరిశోధన జరిగివుంటే దయచేసి ఆ ఆకరువును తెలియజేయండి.జాతికి చరిత్రకు ఉపయోగపడే విషయంగా భావించి దీన్నిఅందిస్తున్నా.ఏ ఒక్కరికి ఇది ప్రయోజనం కల్గించినా నా ప్రయత్నం సఫలమైనట్లే భావిస్తాను.
                             
                        జయన్తి తే సుకృతినః రససిద్దాః కవీశ్వరాః  (9441056609)

****************************************************************