Thursday 17 December 2015

శతకసౌరభాలు-7 శేషప్పకవి- నరసింహశతకము -5



        శతకసౌరభాలు-7
        
               శేషప్పకవి- నరసింహశతకము -5


ధర్మపురి  శ్రీ లక్ష్మీనరసింహస్వామి        



ఫణుల పుట్టల మీదఁ బవ్వళించిన యట్లు-పులుల గుంపుల జేర బోయినట్లు
మకరి వర్గంబున్న మడుగు జొచ్చిన యట్లు-గంగ దాపున నిండ్లు గట్టినట్లు
చెదల భూమిని జాప చేర బరచియట్లు- తోలు తిత్తిని బాలు పోసినట్లు
వెఱ్ఱి వానికి బహువిత్త మిచ్చిన యట్లు-కమ్మ గుడిసె మందుఁ గాల్చినట్లు
స్వామీ నీ భక్తవరులు దుర్జనుల తోడ-జెలిమిఁ జేసిన యటులైన జేటువచ్చు
భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!- దుష్టసంహార !నరసింహ! దురితదూర!. (80)
                      


                         ధర్మపురి లక్ష్మీనరసింహా! పాముల పుట్టల మీద పడుకున్నట్లు, పులుల గుంపులలో చేరినట్లు ,మొసళ్ల మడుగులో స్నానానికి దిగినట్లు , నది అంచున ఇళ్లు కట్టుకున్నట్లు ,చెదలున్న  చోట చాప వేసుకున్నట్లు, తోలు తిత్తి లో పాలు పోసినట్లు, వెఱ్ఱివానికి ఎక్కువగా ధనమిచ్చినట్లు , తాటి కమ్మలతో వేసిన గుడిసె లో మందు గుండు సామాను కాల్చినట్లు నీ భక్తులు చెడ్డవారితో   చేరి చెడిపోతున్నారు .వారిని కాపాడు స్వామీ!

                       అమరేంద్ర వినుత నిన్ననుసరించిన వారు-ముక్తి బొందిర వేగ ముదము తోడ
నీ పాదపద్మముల్ నెఱ నమ్మియున్నాను-నాకు మోక్షంబిమ్ము నళిన నేత్ర
కాచి రక్షించు నన్గడతేర్చు వేగమే- నీ సేవకుని జేయుశ్చయముగఁ
గాపాడినను నీకు గేంకర్యపరుఁడనే- చెలగి నీ పనులను జేయువాడ
ననుచుఁ బలుమారు వేఁడెద నబ్జనాభ- నాకు  బ్రత్యక్షమగు నిన్నె నమ్మినాను
భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!- దుష్టసంహార !నరసింహ! దురితదూర!. (81)
                   
                    ఇంద్రుని చే పొగడ బడెడి శ్రీ లక్ష్మీ నరసింహా! నిన్ను  సేవించినవారు ఆనందంతో మోక్షాన్ని పొందారు. ఓ పద్మముల వంటి నేత్రములు కలవాడా. నేను కూడ నీ పాదపద్మములను నమ్మి సేవించుచున్నానుకదా. నాకు కూడ త్వరగా మోక్షమిమ్ము స్వామీ.నన్ను రక్షించి, నీ సేవకుని గా చేసుకొని ,త్వరగా కడతేర్చు స్వామీ! నన్ను కాపాడినను నేను నిన్ను మర్చిపోను . నీ బంటు గా నీ  సేవలను చేసు కుంటూనే ఉంటాను. ఈ విధంగా నేను  ఎన్నో సార్లు నిన్ను వేడుకుంటూనే ఉంటున్నాను పద్మనాభ. నిన్నే నమ్మిన  నాకు నీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించు ప్రభూ!

వనరుహనాభ నీ వంకఁ జేరితి నేను- గట్టిగా ననుఁ గావు కావు మనుచు
వచ్చినందుకు వేగము వరము లీయక కాని-లేవబోయిన నిన్ను లేవనియ్య
గూర్చుండ బెట్టి నీ కొంగు గట్టిగఁ బట్టి-పుచ్చుకొందును జూడు భోగిశయన
యీ వేళ  నాకడ్డ మెవరు వచ్చినఁ గాని-వారికైనను లొంగి వణకబోను
కోపగాడను నీవు  నా గుణము దెలిసి-యిప్పుడే నన్ను రక్షించి యేలు కొమ్ము
భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!- దుష్టసంహార !నరసింహ! దురితదూర!. (84)
                                       

             శ్రీ పద్మనాభా! ధర్మపురి లక్ష్మీనృసింహా. నన్ను కాపాడమని , నను కాచే దైవం నీవేనని నీ చెంత చేరాను.నేను నీ దరి చేరినందుకు వేగంగా నాకు వరము లీయకుండా నీవు లేచి వెళ్లి పోదామనుకున్నా నిన్ను లేవనీయను. నిన్ను బలవంతంగా కూర్చోబెట్టి నీ కొంగు గట్టిగా నీవు కదలకుండా పట్టుకుంటాను.  ఈ రోజు ఎవరు అడ్డమొచ్చినా నేను అదరను. బెదరను. అసలే నేను కోపిష్టిని. కాబట్టి నా గుణము తెలుసుకొని  నన్ను ఇప్పుడే రక్షించి ,ఏలుకోవలసింది స్వామీ!

                          నేనెంత వేడిన నీకేల దయరాదు -పలుమాఱు పిలచిన బలుకవేమి
పలికిన నీకున్న పదవేమి పోవును-మోమైన బొడ చూపవేమి నాకు
శరణు జొచ్చిన వాని సవరించవలె గాక-పరిహరించుట నీకు బిరుదు గాదు
నీ దాసులను నీవు నిర్వహింపక యున్న-బరులెవ్వ రగుదురు పంకజాక్ష
దాత దైవంబు తల్లియు దండ్రి వీవె-నమ్మి యున్నాను నీ పాద నలినములను
భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!- దుష్టసంహార !నరసింహ! దురితదూర!. (85)
    
                                   స్వామీ ధర్మపురి నరసింహ !ప్రభూ! నేను ఎంతగా ప్రార్ధించినా నామీద నీకెందుకు దయ కలగడంలేదు. ఎన్నిసార్లు పిలిచినా పలుకవేమి తండ్రీ! పలికితే నీ గొప్పతనానికి భంగం ఏర్పడుతుందని భయమా! నీ ముఖారవిందాన్ని  నాకు చూపించకుండా పెడమరులుగా తిప్పుకుంటావేమిటి స్వామీ! నీకు శరణన్న వాడిని రక్షించాలి గాని నిర్లక్ష్యం చేయడం నీకు  గౌరవం కాదు. నీ సేవకులను నీవు కాపాడకపోతే ఇతరులెవ్వరు కాపాడతారు పంకజాక్షా! నాకు తల్లి,తండ్రి, దాత, దైవము  అన్నీ నీవే నని నీ పాదపద్మములను సేవించుచున్నాను స్వామీ ! నన్ను రక్షించు ప్రభూ!.
                

                     నా తండ్రి ! నా దాత! నా యిష్ట దైవమా!-నన్ను మన్నన సేయు నారసింహ!
దయయుంచు నామీద దప్పులన్ని క్షమించి- నిగమ గోచర నాకు నీవె దిక్కు,
 నే దురాత్ముడనంచు నీ మనంబున గోప-గింపబోకుము స్వామి కేవలముగ,
ముక్తిదాయక నీకు మ్రొక్కినందుకు నన్ను-గరుణించి రక్షించు కమలనయన
దండి దొర వంచు నీ వెంట దగిలినాను-నేడు ప్రత్యక్షమై నన్ను నిర్వహింపు
భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!- దుష్టసంహార !నరసింహ! దురితదూర!. (86)

                         
                    శ్రీ ధర్మపురి నరసింహా! నా దాత, నా తండ్రి నా యిష్టదైవము సర్వము నీవే ప్రభూ ! నన్ను మన్నించి కాపాడు నరసింహ దేవా!ఓ నిగమగోచరా నా తప్పులు మన్నించి నన్నేలు కోవయ్యా   నారసింహా !నేను దుర్మార్గుడనని నీ మనస్సు లో నాపై కోపముంచకు ప్రభూ.కేవలము నీకు మ్రొక్కినందుక మాత్రమే నాకు మోక్షమియ్య వయ్యా ప్రభూ  నీవు గొప్ప దైవానివని నమ్మి నిన్ను ఆశ్రయించి ,అర్ధిస్తున్నాను ప్రభూ !నాకు ప్రత్యక్షమై నన్ను కరుణించు ప్రభో నారసింహా!

                      
                             కూటి కోసరము నేఁ గొఱగాని జనులచే-బలు గద్దరింపులు పడగ వలసె
దార సుత భ్రమఁ దగిలి యుండగ గదా- దేశదేశము లెల్లఁదిరుగ వలసె
బెను దరిద్రత పైనిఁ బెనగి యుండగ గదా-చేరి నీచుల సేవఁ జేయవలసె
నభిమానములు మది నంటి యుండగ గదా-పరుల జూచిన భీతిఁ బడగ వలసె
నిటుల సంసారవారిధి నీదలేక- వేయి విధముల నిన్ను నే వేడుకొంటి
భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!- దుష్టసంహార !నరసింహ! దురితదూర!. (87)
                            

                  ప్రభూ!నరసింహదేవా ! పిడికెడు మెతుకుల కోసమే కదా పనికిమాలిన  వాళ్ల గద్దింపులు భరించవలసి వస్తోంది.  భార్య పుత్రులు అనే భ్రమలో చిక్కుకొనే గదా వారి పోషణ కై దేశదేశాలు తిరగవలసి వస్తోంది. దరిద్రం నెత్తిన కూర్చోబట్టే కదా  బతుకు తెరువు కోసం నీచులను సేవించవలసి వస్తోంది.ఇంకా అభిమానం అంతో ఇంతో మదిలో మిగిలి యుండబట్టే కదా నేను చేస్తున్న పనులు ఇతరులు  చూస్తున్నారేమో నని పరులను చూసి  భయపడవలసి వస్తోంది. ఇటువంటి సంసార సముద్రాన్ని ఈద లేకే స్వామీ నిన్ను వేయి విధాల వేడుకుంటున్నాను. నన్ను కాపాడి రక్షించు ప్రభూ!

                           తాపసార్చిత! నేను పాపకర్ముడనంచు- నాకు వంకలుఁ బెట్టబోకు సుమ్మి
నాటికి శిక్షలు నన్నుఁ జేయుటకంటె-నేడు సేయుము నీవు నేస్త మనక
అతి భయంకరులైన యమదూతలకు నన్ను-నొప్పగింపకు మయ్య యురగశయన
నీ దాసులను బట్టి నీవు దండింపంగ -వద్దు వద్దన రెంత పెద్దలైన
తండ్రివై నీవు పరపీడఁ దగులఁ జేయ-వాసిగల పేరు కపకీర్తి వచ్చునయ్య
భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!- దుష్టసంహార !నరసింహ! దురితదూర!. (88)
                           

              మునులచే పూజించబడే శ్రీ ధర్మపురి లక్ష్మీనరసింహా! పాపములు చేసితినని నాకు వంకలు పెట్టకు స్వామీ! నన్ను మన్నించి నాడు ఎప్పుడో విధించే శిక్షలు నాకు ఇప్పుడే విధించు. స్వామీ! నాగశయనా! అతి భయంకరమైన ఆ యమభటులకు నన్ను అప్పగించకు స్వామీ!నీ దాసులను నీవే దండించిన వద్దనే పెద్దలెవ్వరుంటారు. అంతే కాదు నీవంటి వాడు తండ్రియై ఉండగా  నీబిడ్డ  ఇతరులచే పీడించబడుట ప్రసిద్ధుడవైన  నీకు కూడ అపకీర్తి కదా ప్రభూ! అందుకే నేను చేసిన నేరాలకు నాకిక్కడే నీవే శిక్ష విధించు ప్రభూ!
                 
                            కాయమెంత భయానఁ గాపాడినం గాని- ధాత్రిలో నది చూడ దక్కబోదు,
ఏ వేళ నేరోగ మేమరించునొ-సత్వ మొందగఁ జేయు మే చందమునను,
 ఔషధంబులు మంచి వనుభవించినఁ గాని-కర్మ క్షీణంబైన గాని విడదు,
కోటి వైద్యుల గుంపు కూడి వచ్చినఁ గాని-మరణ మయ్యెడు వ్యాధి మాన్ప లేరు,
జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన-నిలుచునా  దేహమిందొక్క నిమిషమైన,
భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!- దుష్టసంహార !నరసింహ! దురితదూర!. (89)
                   
                         ప్రభూ! ఈ శరీరాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నా అది శాశ్వతం కాదు .ఏదో ఒక రోజున మట్టిలో కలిసిపోయేదే. ఏ రోజు ఏక్షణం లో  ఏ రోగమొస్తుందో  తెలియదు. కర్మబంధం తీరి పాపం నశించే వరకూ వచ్చిన ఆ రోగం ఎంత మంచి మంచి మందులు వాడినా  తగ్గదు. ప్రపంచం లోని వైద్యులు కోట్లమంది  కట్టకట్టుకు వచ్చి చికిత్స చేసినా మరణం ఖాయమైన వ్యాధిని మాన్పలేరు. ఈ జీవునికి ప్రయాణకాల మాసన్నమైన తరువాత ఒక్క నిమేషం కూడ ఈ శరీరం లో  నిలువడు కదా!.
                
                    పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే అన్నది ఆయుర్వేదోక్తి. పూర్వ జన్మలో చేసిన పాపమే ఈ జన్మలో వ్యాధి రూపం లో బాధిస్తుంది. వైద్యుడు ఆయుష్షు ఉన్నవాడికి చికిత్స చేయగలడు కాని ఆయుర్దాయం లేనివాడికి వైద్యుని మందు పనిచేయదు. వందల కొద్ది వైద్యులు వచ్చి చికిత్స చేసినా చావు వచ్చెడివాని వ్యాధిని మాన్పలేరు.ఈ జీవునికి ప్రయాణకాల మాసన్నమైనప్పుడు ఒక్కక్షణం కూడ ఇంకా ఈ దేహం లో నిలువడు కదా.

 అంత్య కాలము నందు నాయాసమున నిన్ను-దలతునొ తలపనో తలతు నిపుడె
నరసింహ!  నరసింహ!  నరసింహ! లక్ష్మీశ! దానవాంతక!  కోటి భానుతేజ!
గోవింద! గోవింద! గోవింద! సర్వేశ!-పన్నగాధిప శాయి! పద్మనాభ!
మధువైరి! మధువైరి!మధువైరి! లోకేశ!-నీలమేఘ! శరీర నిగమ వినుత!
                    ఈ విధంబున నీ నామ మిష్టము గను-భజన సేయుచు నుందు నా భావమందు
                    భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!- దుష్టసంహార !నరసింహ! దురితదూర!. (90)

                 
                             వివిధాభరణ భూషిత శరీరా ధర్మపురి నారసింహా ! మరణమాసన్నమైనపుడు ఆయాసము తో నిన్ను ప్రార్ధించగలనో లేదో నని ఇప్పుడే నిన్ను వేడుకొంటున్నాను.నరసింహ! నరసింహ!నరసింహ! లక్ష్మీనాథా !దానవాంతక! కోటి సూర్యప్రకాశా! గోవింద! గోవింద! గోవింద! సర్వేశ!  పన్నగ శయన! శ్రీ పద్మనాభ! !మధువైరి! మధువైరి! మధువైరి! లోకేశ! నీలమేఘ శరీర! వేద వినుత!   అంటూ నీ భజన చేస్తాను ప్రభూ!

                  ఈ పద్యం వ్రాసేటప్పుడు శేషప్ప కు  కంచర్ల గోపన్న దాశరథీ శతకం లోని  ముప్పున గాల కింకరులు ముంగిటకొచ్చిన వేళ అనే పద్యం చెంగటి కొచ్చి నిలిచే వుంటుంది.

     ముప్పున గాలకింకరులు ముంగిటకొచ్చినవేళ రోగముల్
            గొప్పరమైనచోఁ గఫము కుత్తుక నిండిన వేళ , బాంధవుల్
            గప్పినవేళ ,మీ స్మరణ గల్గునొ కల్గదొ నాటి కిప్పుడే
            తప్పక చేతు మీ భజన దాశరథీ ! కరుణాపయోనిథీ !

                                      
                                                                ------------   ఆరవ భాగం త్వరలో





****************************************************************

No comments: